మట్టిపూల జీవన తాత్వికత వెల్లివిరిసిన కథలు
''కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరిపగ్గం, సాలెలమగ్గం/ శరీర కష్టం స్ఫురింపజేసే/ గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి/ సహస్రవృత్తుల సమస్త చిహ్నాలు'' అని శ్రీశ్రీ తన ప్రతిజ్ఞా గీతంలో చెపుతాడు. ఇలా వివిధ వృత్తుల వారి జీవన తాత్వికతను, శ్రమజీవన పోరాటాన్ని కథలుగా మలిచి వృత్తిదారుల కథా సంపుటాలను వెలువరిస్తున్నారు మూరిశెట్టి గోవిందు. ఆయన ఇదివరకే మంగలి కతలు, చాకిరేవు కతలు తీసుకొచ్చారు. ఇప్పుడు కుమ్మరి కథలు రాశారు. కుమ్మరి చక్రం ఆగిపోతున్నా, కాలచక్రం గిర్రున తిరుగుతోంది. తొంభై దశకంలో మొదలైన ప్రపంచీకరణతో పల్లె సామాజిక జీవన చిత్రం పెను కుదుపులకు గురైంది. సాంకేతికత అన్ని రంగాల్లోకి ప్రవేశించింది. ఫలితంగా చేతివృత్తులు ధ్వంసం అయ్యాయి. దాంతో 'పల్లె కన్నీరు పెడుతోందో కనిపించని కుట్రల' అంటూ గోరటి వెంకన్న పాట రాశాడు. కొలిమి ఆరిపోయింది. కుమ్మరి చక్రం, నాగలి విరిగిపోయాయి. సాలెల మగ్గం పోగు తెగిపడింది. వాటి స్థానంలో స్టీలు గిన్నెలు వచ్చాయి. ఇనుప మడకల ట్రాక్టరు వచ్చింది. వృత్తిదారులు తమ వృత్తులను వదిలేసి పట్టణాలకు వలసెల్లిపోయారు. ఇంకా పాతవాటిని వదులుకోలేక మార్పుకు మానసికంగా సిద్ధపడని ...