మట్టిపూల జీవన తాత్వికత వెల్లివిరిసిన కథలు





''కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరిపగ్గం, సాలెలమగ్గం/ శరీర కష్టం స్ఫురింపజేసే/ గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి/ సహస్రవృత్తుల సమస్త చిహ్నాలు'' అని శ్రీశ్రీ తన ప్రతిజ్ఞా గీతంలో చెపుతాడు. ఇలా వివిధ వృత్తుల వారి జీవన తాత్వికతను, శ్రమజీవన పోరాటాన్ని కథలుగా మలిచి వృత్తిదారుల కథా సంపుటాలను వెలువరిస్తున్నారు మూరిశెట్టి గోవిందు. ఆయన ఇదివరకే మంగలి కతలు, చాకిరేవు కతలు తీసుకొచ్చారు. ఇప్పుడు కుమ్మరి కథలు రాశారు.
        కుమ్మరి చక్రం ఆగిపోతున్నా, కాలచక్రం గిర్రున తిరుగుతోంది. తొంభై దశకంలో మొదలైన ప్రపంచీకరణతో పల్లె సామాజిక జీవన చిత్రం పెను కుదుపులకు గురైంది. సాంకేతికత అన్ని రంగాల్లోకి ప్రవేశించింది. ఫలితంగా చేతివృత్తులు ధ్వంసం అయ్యాయి. దాంతో 'పల్లె కన్నీరు పెడుతోందో కనిపించని కుట్రల' అంటూ గోరటి వెంకన్న పాట రాశాడు. కొలిమి ఆరిపోయింది. కుమ్మరి చక్రం, నాగలి విరిగిపోయాయి. సాలెల మగ్గం పోగు తెగిపడింది. వాటి స్థానంలో స్టీలు గిన్నెలు వచ్చాయి. ఇనుప మడకల ట్రాక్టరు వచ్చింది. వృత్తిదారులు తమ వృత్తులను వదిలేసి పట్టణాలకు వలసెల్లిపోయారు. ఇంకా పాతవాటిని వదులుకోలేక మార్పుకు మానసికంగా సిద్ధపడని వాళ్ళు పల్లెల్లోనే తమ బ్రతుకులను వెళ్ళదీస్తున్నారు.
ఈ నేపథ్యంలో మూరిశెట్టి గోవిందు తాను ఈ సామాజిక వర్గానికి చెందకపోయినా వారితో సహజీవనం చేసిన వాడవడం వల్ల వారిపట్ల సహానుభూతితో ఛిద్రమవుతున్న
కుమ్మరుల జీవనచిత్రాన్ని  కథగా చెప్పడానికి 16 కథలు రాశాడు. ఈ కథల్ని చదివితే వారి జీవితాల్లో వస్తున్న సంక్షోభాలు, అప్పుడప్పుడు వస్తున్న
సంతోషాలు, మారుతున్న కాలంలో  వారి ఆచార వ్యవహారాల్లో వస్తున్న మార్పులు తెలుస్తాయి. వారితో రచయితకున్న అనుబంధం వల్ల ఇలాంటి విషయాలను తనవిగా చేసుకుని రాయలసీమ మాండలికంలో కథల్ని తీర్చిదిద్దాడు గోవిందు.
కుమ్మరి జీవితం గురించి మాట్లాడాలంటే వారి జీవన విధానంలోకి తొంగి చూడక తప్పదు. మెత్తని మట్టి ని తెచ్చి దాన్ని బాగా పిసకడంతో మొదలవుతుంది కుమ్మరి సామాజిక జీవితం. మట్టి కుండలు, మట్టి బొమ్మలు వాడకం మనిషి ఆహారాన్ని వండుకోవడం తెలిసినప్పటి నుంచి మొదలైంది. చక్రం కనుక్కోవడంతో మొదలైన మానవాభివృద్ధి కుమ్మరిచక్రంతో మరో మలుపు తిరిగింది. మనిషి కళాత్మక హృదయం మట్టిబొమ్మలలో వ్యక్తమైంది.ప్రాచీనకాలం నాటి మట్టి బొమ్మలను టెర్రకొట్ట బొమ్మలన్నారు 
మనదేశంలో టెర్రకోట బొమ్మలు, కుండలు, ఇటుకలు సింధు నాగరికతా కాలం నుండే ప్రారంభమైంది. ఇది వృత్తిగా ప్రారంభంలో లేకపోయినా తరువాత మధ్యయుగాలలో వృత్తిగా మారి అది క్రమేణా కులవృత్తిగా మారిపోయింది. వర్ణవ్యవస్థలో భాగంగా ఇది శూద్రకులంలో ఒకటిగా, వృత్తి రంగాలలో కుమ్మరి కులంగా స్థిరపడిపోయారు. అయితే చారిత్రకంగా చూస్తే శాలివాహనులు కుమ్మరి వృత్తిలో ఆరితేరిన వారు. వీరే తరువాతి కాలంలో యోధులుగా, పాలితులుగా మారారు. ఈ శాలివాహనులే శాతవాహనులని చరిత్రకారులు భావిస్తున్నారు. వీరు శాలివాహన శకాన్ని కూడా ప్రారంభించారు.
సత్తుగిన్నెలు, స్టీలుగిన్నెలు రాకముందు మట్టి పాత్రలే వాడేవారు. మట్టి కుండలను 'సట్టి' అనేవారు. నీళ్ళు కాంచడానికి పొంత, కాగు, బాన వాడేవారు. ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి వాడ,గాజ  మొదలైన వాటిని వాడేవారు. వీటన్నింటిని మట్టితో చేసేవారు.
అంతేగాక పెళ్ళిళ్ళలో రంగులు, అలంకరణ చేసి అందంగా ఉండే విధంగా కుండలు చేసేవారు. వాటిని అరిమేణి కుండలు అనేవారు.  లోహ పాత్రలు వచ్చాక, మట్టిపాత్రలు ఓల్డ్‌ ఫ్యాషనుగా మారిపోయాక
 ఇవన్నీ  కనుమరుగయ్యాయి. దీంతో కుమ్మరిబ్రతుకులు చతికిల పడ్డం మొదలైంది.దీన్నే ప్రముఖ కవి  టి.రాజారామ్‌ ఇలా చెపుతాడు  " ప్లాస్టిక్‌, జర్మన్‌ సిల్వర్‌, ఫ్రిజ్‌, కూలర్‌/ ఇవన్నీ అతని బతుకును/ భళ్ళున పగిలిన బానను చేశాయి"
      సాంకేతికత పెరిగాక ఇబ్బడి ముబ్బడిగా స్టీలు పాత్రలు అందరికీ  తక్కువ ధరలతో అందుబాటులోకి వచ్చాయి. ఇవి ఎక్కువ కాలం మన్నుతాయి కూడా. మట్టిపాత్రలు తొందరగా పగిలిపోవడం, వంట చేయడానికి ఎక్కువ సమయం పట్టడం మొదలైనవాటి కారణంగా మట్టిపాత్రలకు గిరాకీ విపరీతంగా పడిపోయింది. ఇప్పుడు ఎవరైనా చనిపోతే కర్మకాండలకు మాత్రమే కుండల్ని వాడుతున్నారు. ఇలాంటి విషయాలను మూరిశెట్టి గోవిందు వివిధ కథల్లో వివిధ పాత్రల ద్వారా ఎంతో ఆర్థ్రతతో వ్యక్తీకరింప జేశారు.
     ఇప్పుడు నీళ్ళ కూజాలు, దీపావళి ప్రమిదలు,  వివిధాకృతులతో మట్టిబొమ్మలు,
మట్టితో చేసిన ఫ్లవర్‌వాజ్‌లు మాత్రమే
  ప్రజలు ఉపయోగిస్తున్నారు. పర్యావరణ స్పృహ పెరిగితే మళ్లీ ప్రజలు మట్టి పాత్రలను వాడే అవకాశం వుంది.
     చాలామంది వృత్తిదారులు పై చదువులు చదవడం ద్వారా ఉన్నత పదవుల్లోకి వెళ్తున్నారు. ఈ కథల సంపుటిలో మట్టిలో మాణిక్యం కథలో కుమ్మరి కొడుకు జిల్లా కలెక్టరుగా వచ్చి కుమ్మరి వృత్తిదార్లకు అనేక కొత్త పథకాలు ప్రవేశపెట్టి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాడు. కుమ్మరి వృత్తిదారుడు పేదరికంలోనే కొట్టుమిట్టాడాల్సిన అవసరం లేదు. అలాగే ఉన్నత చదువులు చదివి తన వృత్తినే చేయాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఉద్యోగాలు రానప్పుడు కరోనాలాంటి విపరీత వ్యాధులు వచ్చినప్పుడు నిరుద్యోగులు ఈ వృత్తిలోకి వచ్చి వినూత్న పద్ధతిలో మట్టి పాత్రలను మార్కెట్‌ చేసి ఆదాయాన్ని పొందవచ్చు.
రైతుకు ఉన్న మట్టితో ఎలాంటి బంధం ఉందో అలాగే కుమ్మరి వృత్తిదారులకు కూడా మట్టితో అలాంటి పేగుబంధం ఉంది. ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఎక్కువ ధరలకు మట్టి కుండల్ని అమ్మడాన్ని కుమ్మరి వ్యతిరేకంచడాన్ని పాపం పిచ్చి పీనుగ కథలో
చూపిస్తాడు. ఇలా మట్టి బంధాన్ని కథల ద్వారా తెలియజేస్తూ అందరూ మరచిపోతున్న కుమ్మరి జీవన తాత్వికతను పదహారు కథల్లో అందించిన మూరిశెట్టి గోవిందుగారిని అభినందిస్తున్నాను.
పాఠకులు ఈ కథలను ఆదరించాలని కోరుతున్నాను.
- పిళ్లా కుమారస్వామి
సాహితీస్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు
కదిరి
20-11-2021

 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు