కవిత్వం____అరిస్టాటిల్
కవిత్వం మానవ ప్రవృత్తి లో భాగంగా సృజింపబడుతుంది మానవ ప్రవృత్తిలో అనుకరించడం ఉంది. అనుకరణ చూసి ఆనందించడం ఉంది. అనుకరణ ద్వారానే మనిషి ఎన్నో విషయాలు నేర్చుకుంటాడు. అనుకరణవల్ల సృజింపబడిన వస్తువులు చూసి మనిషి ఆనందిస్తాడు. చిత్రకారుడు ప్రకృతి దృశ్యాలను చిత్రీకరిస్తాడు. కవి మానవ స్వభావాన్ని ప్రతిబింబిస్తాడు. అతడు సాధించిన విజయాలను గానం చేస్తాడు. అనుకరణ లాగానే మాధుర్యం, లయ కూడా మానవునికి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ కారణాల వల్ల కవిత్వం సృజింపబడుతుంది. కవి వ్యక్తిగత దృక్పథం వలన కవిత్వం రెండు భాగాలుగా విడిపోయింది 1 గొప్ప వ్యక్తులు సాధించిన ఘన విజయాలను చిత్రించడం 2 సామాన్య వ్యక్తులను అల్ప కార్యాలను చిత్రించడం.మొదటి రకం కావ్యాలను ఇతిహాసాలు అంటారు .రెండో రకం కావ్యాలు నాటకాలు గా ప్రసిద్ధి చెందాయి. ఇవివిషాదాంతాలూ, సుఖాంతాలూ ఉన్నాయి. సుఖాంతాలు కన్నా విషాదాంతాలు చాలా విలువైనవి. విషాదాంత రచనలకు కొన్ని లక్షణాలు ఉంటాయి అవి 1. ఇతివృత్తం 2.పాత్రచిత్రణ 3 భావం 4 వ్యక్తీకరణ 5 దృశ్యం 6 గానం(సంగీతం)
ఇతివృత్తం రచనకు ప్రాణ ప్రదమైనది . ఇతివృత్తం చిన్నదిగా ను లేదా పెద్దదిగాను ఉండరాదు. మధ్యేమార్గం అవలంభించడం మంచిది. పలుచోట్ల జరిగిన సంఘటనలై ఉండరాదు. ఏం జరిగిందో చెప్పడం కన్నా ఈనాటి సందర్భాన్నిబట్టి ముందు ఏమి జరగనుందో కవి చెప్పగలగాలి. కవికి చరిత్రకారులకు ఇక్కడే తేడా కనిపిస్తుంది . కవిత్వంలో విశ్వజనీనత దర్శించగలం. చరిత్ర కొన్ని సంఘటనలు సంబంధించినది మాత్రమే. చరిత్ర కన్నా కవిత్వంలో తాత్వికాంశాలు ఎక్కువై ఆకర్షణీయమూ ఆరాధనీయమూ అవుతుంది. రెండవది పాత్ర చిత్రణ విషాదాంత పాత్రలు మానవుడి సహజమైన చర్యలను ప్రతిబింబిస్తాయి. సుఖాంతాలు మానవుని ప్రతిబింబ చేయవా అన్న ప్రశ్న రావచ్చు.కానీ మనిషి ఆవేదనను అంతరంగాన్ని నిజంగా ఆవిష్కరించేవి విషాదాంతాలే. మూడవది భావం .సంభాషణల ద్వారా భావాన్ని తెలియజేయాలి. కొన్ని జీవిత సత్యాలు కూడా సంభాషణల్లో తెలియజేయాలి. నాలుగవది వ్యక్తీకరణ భావాలకు తగిన పదాలను పొందికగా అమర్చగలగాలి. పద్యమైనా గద్యమైనా పదాలు శక్తివంతంగా ఉండాలి. మిగిలినవి దృశ్యం ,సంగీతం. వీటిల్లో సంగీతం ముఖ్యమైనది.
విషాదాంతాలు ప్రేక్షకులలో జాలి భయాన్ని కలిగించే రీతిలో ఉండాలి మంచి వ్యక్తులు ఐశ్వర్యం కోల్పోయి దరిద్రుడు అయినట్లు హెడ్ వ్యక్తులు దరిద్రం నుండి ఐశ్వర్యానికి ఎదిగినట్లు చూపించరాదు. దాని వల్ల జుగుప్స మాత్రమే కలుగుతుంది పాఠకునికి. దేనికీ పనికి రాని వ్యక్తులు ఉచ్చ స్థితి నుండి నీచ స్థితికి పతనం అయినట్లు చూపించడం వలన కూడా ప్రయోజనం లేదు. అందువలన ప్రేక్షకుల్లో మానవత్వాన్ని స్పందింప చేయగలుగుతాం గాని భయం, జాలి కలిగించలేం. సామాన్య వ్యక్తులు వ్యసనం వలన దిగజారుడుతనం వలన కాక జీవితంలో చేసిన కొన్ని పొరపాట్లు వలన దీనస్థితి కి దిగజారినట్లు చిత్రిస్తే చూసే వారిలో భయం జాలి కలుగుతాయి .భయం ,జాలి మనిషిలో కలిగేటట్లు చేయాల్సిన అవసరం ఎందుకు ఉందంటే అవి మనసులో ఉన్న కల్మషాలను పక్షాళన చేస్తాయి. దానివల్ల మనిషిలో అంతర్గతం గా మార్పు సంభవిస్తుంది.
__అరిస్టాటిల్ (పోయటిక్స్) (క్రీ.పూ 384_ 447)
(సేకరణ: పిళ్లా కుమారస్వామి)
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి