సాహిత్యం లో హిందూత్వ భావజాలం


pc: manatelangana.com

సాహిత్యం లో  హిందూత్వ భావజాలం
 
సాంప్రదాయ భారతీయ సాహిత్యానికి ప్రస్తుతం చలామణిలో ఉన్న సంఘపరివార్ భావజాలానికి మధ్య ఉన్న అవినాభావ సంబంధమేమిటి? సాహిత్యరంగంమీద మత, రాజకీయ రంగాల్లో సంభవించే పరిణామాల ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి? మొదలైన ప్రశ్నలకు సమాధానాలను అన్వేషించాలంటే మార్క్సిస్టు దృక్పథం తప్ప మరో దృక్పథమేదీ పనికిరాదు.

       మొదట, భారతీయ సాహిత్యం అంటే ఏమిటో అర్ధమైతే సగం ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. మొహంజదారో, హరప్పా నాగరికతల కాలంనాటి మట్టిపలకలపై రాసివున్న సాహిత్యం దగ్గరనుండి ముస్లిం మైనారిటీ సాహిత్యం దాకా 'భారత భూమి' అని వ్యవహరించిన భూభాగంపై వెలసిన సాహిత్యాన్నంతా భారతీయ సాహిత్యంగానే గుర్తించాలి. వేదాలు, త్రిపీటికాలు, చార్వాక సాహిత్యం, వీరశైవ సాహిత్యం , సూఫీ సాహిత్యం, రాజులను రంజింపచేసిన శృంగార సాహిత్యం, ఆకాశపు దారులంట హడావిడిగా వెళ్ళిపోయే సాహిత్యరథాన్ని భూమార్గం పట్టించిన అభ్యుదయ సాహిత్యం వ్యవస్థలోని కుళ్ళును బట్టబయలు చేసిన దిగంబరసాహిత్యం , సమసమాజ నిర్మాణం కోసం జరిగే విప్లవోద్యమాలకు మద్దతుగా నిలుస్తున్న విప్లవసాహిత్యం, జనాభాలో సగభాగం ఉన్న స్త్రీల ఆకాంక్షల్నీ, ఆవేదనల్నీ ఎత్తిపట్టిన స్త్రీవాదసాహిత్యం , తరతరాలుగా దోపిడీకి అత్యాచారాలకు గురైన దళితులు సృష్టించిన సాహిత్యం, ప్రపంచీకరణ కు వ్యతిరేకంగా వచ్చిన సాహిత్యం ఇలా భిన్న చారిత్రక సందర్భాల్లో భారతదేశంగా వ్యవహరించిన భూమిపై అక్షరరూపం దాల్చిన సాహిత్యమంతా భారతీయ
సాహిత్యంగానే గుర్తించాలి. అప్పుడే శతాబ్ది భారతీయ సాహిత్యాన్ని గాని, తెలుగు సాహిత్యాన్నిగాని సరైన అవగాహనతో అర్థం చేసుకోగలం. భారతీయ సాహిత్యరంగంలో కనిపించే ధోరణులు కేవలం ఏ ఒక్క మతానికో, తాత్విక భావధారకో సంబంధించినవి కావు. దాదాపు మూడువేలయేళ్ళుగా ప్రవహిస్తూ వస్తున్న భారతీయ సాహితీ స్రవంతిలో ఎన్నోరకాల ప్రవాహాలు కలుస్తూ, విడిపోతూ, రూపం మార్చుకుంటూ సాహిత్య చరిత్రలో తమతమ ప్రాధాన్యతలను నిలుపుకుంటున్నాయి.               గత భారతీయ సాహిత్యమంతా భిన్న ప్రజాసమూహాల మధ్యగల పరస్పర మితృత్వ, శత్రుత్వాలకు సృజనాత్మక ప్రతిఫలనంగా గుర్తించాలి. చారిత్రక క్రమంలో ఉత్పత్తి శక్తులను తమ ఆధీనంలో వుంచుకున్న వారికి అనుకూలంగా వెలువడిన సాహిత్యమే పైచేయిగా ఉంటూ వచ్చిందన్నది ఒక వాస్తవం. భారతీయ జీవన చిత్రంలో చాతుర్వర్ణ ధర్మానికి ఎనలేని ప్రాధాన్యత ఉంది. బ్రాహ్మణ క్షత్రియ కులాల ఆధీనంలో బందీలైన ఉత్పత్తి సాధనాలు సాహిత్య చలనాలను గాఢంగా ప్రభావితం చేశాయి. వేదప్రమాణాలను అంగీకరించిన రచయితలు సృష్టించిన సాహిత్య మొకవైపు, వేదాలను నిరసించిన రచయితల సాహిత్యమింకొకవైపు నిలబడుతూ వచ్చాయి. వర్ణాశ్రమ ధర్మాలే ప్రధాన భూమికగా నిల్చిన నేలలో కులాలకతీతంగా సాహిత్య సృజన జరగదు. సమాజంలోని ఆస్తులన్నీ కేవలం కొద్దిమంది వ్యక్తుల చేతుల్లోనే ఉన్నప్పుడు ఆ కొద్దిమంది ప్రయోజనాలకు అనుకూలంగా వచ్చిందే మొత్తం సమాజసాహిత్యమని చెప్పడానికి  వీల్లేదు.       
         భిన్నవర్గాల సంఘర్షణ ఫలితంగా వెలువడిన, వెలువడుతున్న సాహిత్యాన్ని సమగ్రంగా విశ్లేషించాలంటే చరిత్ర నిర్మాణ క్రమం, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో వస్తున్న మార్పులు, సాహిత్యసృష్టికర్తలైన వివిధ వర్గాల్లోని మేధోజీవుల తాత్విక ధోరణులు.. ఇవన్నీ బాగా తెలిసి వుండాలి. ఈ నేపధ్యంలోంచి చూస్తే 'భారతీయ సాహిత్యానిది రసదృష్టి, రాసలీల' అనే నిర్వచనం కేవలం రసపైత్యం తప్ప మరొకటి కాదని స్పష్టమవుతుంది.

'రసం' గురించి మార్కిస్టు అవగాహన చెప్పేదేమంటే; మనిషి భౌతిక వస్తువుల ద్వారానే మనుగడ సాగించగలడు. మనిషిలోని ఉద్రేకాలకు, ఉత్సాహాలకూ కారణం అతని చుట్టూ ఉన్న ఉత్పత్తి సంబంధాలూ, వాటి ద్వారా వ్యక్తమయ్యే భిన్న సామాజిక స్థితిగతులు. 'రసం', 'ధ్వని', 'ఆస్వాదన', 'అలౌకికం', 'అనుభూతి' మొదలైన భావనలన్నీ మనిషికి గల ఆర్థిక, సామాజిక నేపథ్యాన్ని పూర్తిగా విస్మరించిన రచయితల ఊహాస్వర్గాలు తప్ప మరేమీ కావు.

ఇట్లాంటి అంశాలవల్ల తేలేదేమిటంటే సాహిత్యమనేది ఏదో ఒక వర్గప్రయోజనాన్ని ఆశించి ఉద్భవిస్తుంది తప్ప దానికి శాశ్వత మూలాలతో ఎటువంటి సంబంధమూ ఉండనే ఉండదని. సాహిత్యం మనిషిలో చైతన్యోద్దీపన కల్గిస్తూ తన భవిష్యత్తును మరింత సుఖవంతం చేసుకోవడానికి ఉపయోగపడాలి. 'మనిషి' ఏ సామాజిక స్థితిలో ఉన్నాడనేదే మార్క్సిజానికి అతిముఖ్యమైనది. మనిషి ఏకరూపత కలిగిన వాడు కాదు. ఆస్తిలో
అంతస్తులో, రూపంలో, ఆరోగ్యంలో, అజ్ఞానంలో, చైతన్యంలో మనుషుల మధ్య సవాలక్ష తేడాలుంటాయి. వీటన్నింటికి మూలకారణమైన ఉత్పత్తి సంబంధాలను గురించి విశ్లేషిస్తూ మానవులంలో ఎటువంటి అసమానతలూ లేకుండా జీవించడానికి చేపట్టాల్సిన కార్యాచరణ గురించి మార్క్సిజం నొక్కి చెపుతుంది. 

శతాబ్ది సాహిత్యాన్ని సమీక్షించేటప్పుడు మత ప్రాధాన్యంగా చెప్పితే అది మతసాహిత్య చర్చ అవుతుందే తప్ప సృజనాత్మక సాహిత్య చర్చ కాదు. “మతములన్నియు మమత పంచగ/ జ్ఞానదీపము వెలుగవలెనోయ్” అంటూ ముదిగొండ లాంటి సంప్రదాయ వాదులు మతాలు శాశ్వతంగా నిలిచిపోవాలని కోరుకుంటారు.
             “మతములన్నియు మాసిపోవగ' మానవులంతా కలిసి సోదరభావంతో బతకాలని ఆశించిన గురజాడను గత శతాబ్ది ప్రారంభంలో బయల్దేరిన రియాక్షనరి కవి అని కూడా తిడతారు. సంపన్నవర్గాల మనుగడకోసం, అది సృష్టించిన సాహిత్యంగురించి పూర్తిగా తెలుసుకుని ఉంటే మతాలు కలకాలం నిలవాలని ఎవరూ కోరుకోరు. ఈ దేశంలో వివిధ మతాల ప్రాతినిధ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే చాలా బలంగా వేళ్ళూనుకొనిపోయిన హిందూమత భావజాలమే సమస్త సామాజిక రంగాలను విస్తృతంగా ప్రభావితం చేయగల శక్తి గలదిగా అర్థమవుతుంది. 
   'హిందూ' అనే పదం పుట్టుక దగ్గర్నుంచి దాని తాత్విక ధోరణుల తుదిగమ్యం వరకు ప్రతి అంశమూ వివాదాస్పదమైనదే.   ఆర్ష సాహిత్యం, దైవీ రాష్ట్రవాదం, సర్వాంగీణ ఏకత్మతావాదం, జాతీయ ప్రబోధం తదితర భావనలన్నీ మతశక్తుల గుత్తపదజాలం.ఇదంతా 'భారతీయ సాహిత్యమ'ని, 'ఆర్ష సాహిత్యమ'ని చెప్పడం అర్థరహితం.

             రాజ్యాధికారాన్ని కైవసం చేసుకున్న హిందూమత శక్తులు వివిధ సామాజిక రంగాలపై తమ ప్రభావాన్ని చూపుతున్నాయి. పాఠ్యపుస్తకాల సిలబస్ లో మార్పులు, నగరాల పేర్లను మార్చడం, మతమార్పిడులకు వ్యతిరేకంగా చట్టాల్ని తేవడం, జ్యోతిష్యాన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెట్టడం, ముస్లిం సమాజాలను ఉగ్రవాదముఠాలుగా ప్రచారం చేయడం, హిందూరాష్ట్ర భావనే భారతదేశానికి సరైన గమ్యం చూపగలదని, ఇతర మతాల ప్రజలు హిందూత్వశక్తుల ఆధిపత్యం కిందనే బతకాలని ఆజ్ఞలు జారీ చేయడం ఇవన్నీ హిందూత్వ శక్తుల ఆధిపత్య ధోరణులను బహిర్గతం చేస్తున్నాయి. సరిగ్గా ఈ నేపథ్యంతోనే సాహిత్యరంగంలో కూడా హిందూమత మద్దతుదారులు భారతీయ సాహిత్యం, భారతీయ తాత్విక దృక్పథం, ఆర్ష సాహిత్యం మొదలైన పేర్లతో తమ ఆధిపత్యాన్ని చెలాయించడానికి ప్రయత్నిస్తున్నారు. అమెరికా నేతృత్వంలో సాగుతున్న ముస్లిం వ్యతిరేక ప్రచారం హిందుత్వ శక్తులకు బాగా ఉపయోగపడుతోంది. ఆర్థిక అసమానతలు, అంటరానితనం లైంగిక వివక్ష, నిరుద్యోగం, కరువు మొదలైన తీవ్ర సమస్యలనుండి దృష్టిని మళ్ళించడానికి మతాన్ని ప్రధాన చర్చాంశంగా ముందుకు తీసుకురావడానికి హిందూమతతత్వ శక్తుల అధీనంలోని రాజ్యం ప్రయత్నిస్తోంది. సాహిత్యరంగంలో కూడా సామాన్యుని కష్టాలను, కన్నీళ్ళను పట్టించుకోకుండా దైవభావనను, ఈశ్వర భావనను ప్రచారం చేయడానికి ఇతర మతాలపై విషం కక్కడానికి, సమసమాజ నిర్మాణ సిద్ధాంతాలను తిట్టిపోయడానికి కొంతమంది రచయితలు పూనుకోవడం చాలా  ప్రమాదకరం.

సాహిత్యరంగంలో ఇలాంటి సాహిత్య కారులు బలం పుంజుకోవడం చూస్తుంటే వీరిని ఎదుర్కోవడానికి ప్రజాసాహిత్యకారులంతా నిర్మాణాత్మక కృషి మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది.

 'అభ్యుదయ కవిత్వం, దిగంబర కనిత్వం, స్త్రీవాద,  ధోరణులు చూస్తుండగానే కనుమరుగవు తున్నాయనడం  చారిత్రక సామాజిక పరిస్థితులుంటాయని గుర్తించక పోవడమే. తెలుగు సాహిత్యంలో వచ్చిన భిన్న సాహిత్య ధోరణుల పుట్టుకకూ, కొనసాగింపుకు, ముగింపుకు సమాజంలో వస్తున్న మార్పులతో అవినాభావ సంబంధముంది. భిన్న సాహిత్య ధోరణులు కనుమరుగవు. అవి మెల్లగా సాహిత్యం లో ఇమిడి పోయాయి. 

     ఎవడి స్వీయ ప్రమాణం వాడికి గొప్ప కావచ్చునేమో కాని పీడిత ప్రజల అకాంక్షల్ని,  చారిత్రక, ఆర్థిక, సామాజిక, సాహిత్య సత్యాలను ఎవరు కాదనగలరు?.

పి.మోహన్
(సాహిత్య ధోరణులు-విప్లవ దృక్పథం 2002 నుండి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు