తెలుగు కథానిక - వికాసం


తెలుగు కథానిక - వికాసం


ప్రాచీన కావ్యాలన్ని కథతో ముడిపడి వున్నాయి. ఇప్పుడైతే కవిత్వం, కథ వేరు వేరుగా ఉన్నాయి గాని అప్పటివన్ని కథాకావ్యాలే. వచనంలో రాయడాన్ని గద్యం అన్నారు. కవిత్వాన్ని పద్యం అన్నారు. పద్యం, గద్యం, పద్యగద్యం ఇలా మూడు రూపాల్లో
కథా కావ్యాలు వచ్చాయి. పద్యగద్య కావ్యాన్ని 'చంపూ' కావ్యం అంటారు.
రుగ్వేదంలో, ఉపనిషత్తుల్లో, పురాణాల్లో, భారతంలో, రామాయణంలో ఉన్న కథలన్నీ కవిత్వంలో ఉన్నాయి గాని, అవన్నీకథలే. తెలుగులో అనగా అనగా అని మొదలుపెడితే ఆంగ్లంలో లాంగ్ లాంగ్ అగో, ఒన్స్ అపాన్ ఎ టైమ్ అంటూ మొదలు పెడతారు.
మహాభారతంలో వచ్చే నలదమయంతి కథ, సతీ సావిత్రి కథ లాంటి వాటిని ఉపాఖ్యానాలు అన్నారు.
కథలను కూడా విభజించారు. నీతి చెప్పే కథలను “నిదర్శనం' అన్నారు. ప్రారంభంలో రహస్యం (సస్పెన్స్) బట్టబయలు
చేయకుండా చివరలో చెప్పే కథను “ మణికుల్య' అన్నారు.
అగ్ని పురాణంలో(క్రీ.పూ. 7 శతాబ్దం) కథల్లో ఆఖ్యాయిక, కథ, ఖండకథ, పరికథ, కథానిక వంటి రకాలున్నాయని పేర్కొన్నట్లు జయంతిపాపారావు తన 'వెయ్యేళ్ల కథా ప్రస్థానం'లో చెప్పినారు.
(1) ఆఖ్యాయిక : ఇది గద్యరూపంలో ఉంటుంది. దీనిలో 'ఉచ్వాసాలు' పేరుతో అధ్యాయాలు ఉంటాయి. కథను కథానాయకుడు
చెపుతుంటాడు. ఇందులో కవితలు (శ్లోకాలు), వ్యక్త, అవ్యక్త,చంధస్సులో ఉంటాయి. బాణుడు హర్షచరిత్రను ఆఖ్యాయికలో
రాసినాడన్నారు.
(2) కథ : కథలో రచయిత తన వంశం గురించి మొదట చెప్పుకోవాలి. దీనిని నాయకుడు కాకుండా ఇతరులు చెవుతారు.
కథను 'లంబకాలు' అనే అధ్యాయాలుగా విభజిస్తారు. గుణాడ్యుడు రాసిన 'బృహత్కత' దీనికుదాహరణ. ఇది రాజుల గురించి
రాసింది. బాణుడు రాసిన 'కాదంబరి' కథను కూడా ఇందుకుదాహరణగా భావించారు విశ్లేషకులు.
(3) ఖండ కథ : పెద్ద కథ నుంచి చిన్న వృత్తాంతం తీసుకొని చెప్పే కథను ఖండ కథ అన్నారు. బాణుడు రాసిన ' ఇందుమతి కథ"ఇందు కుదాహరణ. ఇందులో మొదట్లోనే అనురాగమో, శృంగారమో,కరుణో, ఎడబాటో వుంటాయి.
(4) పరికథ :కథల సముదాయాన్ని పరికథ' గా నిర్వచించాడు భోజుడు (1వ శతాబ్దం), అభినవగువుడు. ఇది పూర్తిగా సంస్కృత
ప్రభావ గద్యం. ఇందులో నాయకుడు మంత్రిగాని, వ్యాపారిగాని, బ్రాహ్మణుడుగాని అయి వుండాలన్నారు. ఇది సంపూర్ణ కథగా ఉంటుంది.
(5) కథానిక : ఇందులో కరుణ, భయానక, అద్భుత రసాలు వుంటాయి. ఇది సున్నితమైన విషయానికి సంబంధించినదై 
ఉంటుంది.ఆంగ్లంలో ఉన్న 'షార్ట్ స్టోరీ' తో కథానిక పోలి వుంది. అయితే ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి సూచన మేరకు 'షార్ట్ స్టోరీ'ని
తెలుగులో కథ అనడానికి బదులుగా 'కథానిక' అనడం సరైనదని సాహిత్యకారులు భావించారు. వాడుకలో మాత్రం 'కథ' అనే పదం విరివిగా ఉంది.
కథ, కథానిక పదాలు మన ప్రాచీన సాహిత్యంలో కనిపించినా నేడు మనం కథా లక్షణాలుగా పేర్కొంటున్న
వాటికనుగుణంగా ఒక కథ కూడా ఆనాటి సాహిత్యంలో కనిపించలేదు. అందువల్ల ఆంగ్లేయుల సాహిత్య ప్రభావంతో తెలుగులో
గురజాడ 1910లో రాసిన 'దిద్దుబాటు' కథనే ప్రథమ కథగా గుర్తించారు విమర్శకులు. తరువాత పరిశోధనలవల్ల గురజాడ
కన్నా ముందే 1879లోనే చాలా మంది కథలు రాశారని తెలుసుకున్నారు. మరిన్ని పరిశోధనల వల్ల రాయలసీమలోనూ
1882 లోనే కథలు వచ్చాయని పరిశోధకులు గుర్తించారు. ఆధునిక కథానిక కొత్త సోయగాలతో రూపొందింది. దీనికి ఒక వస్తువు, శిల్పం ప్రధానం. కథ ముడి వజ్రమైతే కథానిక సానబెట్టిన వజ్రమని పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి తన ' తెలుగు
కథానిక'లో పేర్కొన్నారు. కథ ప్రారంభంలో అనేక వర్ణనలు చెప్పి పాత్ర స్వభావాలు మొదలుపెట్టి పాత్రలతో క్లుప్తంగా మాట్లాడిస్తూ
కథలో బిగువు సడలకుండా చివరకు కథను మలుపుతిప్పే ఒక మెరుపుతో ముగించిన కథ 'దిద్దుబాటు' కథ. ఈ ఒరవడిలో అనేక కథలు నేడు వస్తున్నాయి. దీనికన్నా ముందే చాలా కథలు వచ్చినప్పటికీ కథానిక లక్షణాలన్నీ ఇందులో ఉన్నాయి కాబట్టి, విమర్శకులు
ఈ కథనే కథానికకున్న లక్షణాలతో వచ్చిన మొదటి కథగా పరిగణిస్తున్నారు.
ఒక సన్నివేశం, ఒక పాత్ర, ఒక మన:స్థితి - ఈ మూడింటిలో ఒకదాన్ని గాని, రెండింటినిగాని లేదా మూడోదాన్ని తీసుకొని
రాసే ఇతివృత్తాంతమే కథ అని నిర్వచించాడు చినవీరభద్రుడు. ఆసక్తితో చదివించి పాఠకుడిలో మరికాస్త సంస్కారాన్ని పెంచి పదికాలాల పాటు అతనికి జ్ఞాపకం వుండిపోయేదే మంచి కథ" గా నిర్వచించాడు పోలా ప్రగడ సత్యనారాయణ మూర్తి.
మంచికథకు నాలుగు లక్షణాలున్నాయని వల్లంపాటి వెంకటసుబ్బయ్య తన
'కథాశిల్పం'లో పేర్కొన్నారు. అవి (1) క్లుప్తత
(brevity) (2) అనుభూతి ఐక్యత (Unity of impression) (3) సంఘర్షణ (Contradication) (4) నిర్మాణ సాష్టవం (Prot) ,
జీవితమంటే తినటం, తాగడం, బతకడం, చావడం కాదు. జీవితం సక్రమంగా నడవడానికి కొన్ని ధర్మాల మీద ఆధార
పడతాం. బుద్ధుని జాతక కథలు, యూదుల ధర్మగ్రంథాలు, ఖురాను మొదలైనవన్ని మానవ దుఖ సంబంధ కథలతో ఉన్నాయి. ఆ
కథలలో మానవ ధర్మాలన్నీ నిండి ఉన్నాయి. ధర్మ ప్రవర్తకులు తమ సందేశాలను, కథలు చెప్పడం ద్వారా ప్రజల్లో హృదయ స్పందనను
రేకెత్తించి వారి మనస్సును మార్చగలమని భావించారు ప్రముఖ హిందీ నవలా రచయిత' ప్రేమ్ చంద్'. మానవుడు సహజంగా
దైవంతో సమానమైన లక్షణాలు కలిగి వుంటాడు. కాని కాలప్రభావానికి చెడు పరిస్థితులకు వశీభూతుడై తన దైవత్వాన్నిపోగొట్టుకుంటాడు. సాహిత్యం ఈ దైవత్వాన్ని యధాస్థానంలో ప్రతిష్టింపజేయడానికి కృషి చేస్తుందని ప్రేమ్ చంద్ పేర్కొన్నారు.
బి.ఎస్.రాములు ప్రకారం కథలో సంభాషణలు సంఘటనలు, పాత్రలు, కరుణ, శృంగారం వంటి రసాలుంటాయి.
అంతేగాక కథలో మానవ స్వభావాలు, వారి మధ్య వైవిధ్యం, వైరుధ్యం ఉంటాయి. ప్రకృతి చిత్రణ , మనస్తత్వ చిత్రణ ఉంటుంది.
కథలో శైలీ శిల్పంతో పాటు రచయిత దృక్పథం కూడా ఉంటుందన్నారు.
కథకు సంబంధించిన ఇతివృత్తాన్ని దానికనుగుణంగా కళాత్మకంగా చెప్పే విధానాన్ని శిల్పం అంటారు. దీనినే రచయితశైలి అని కూడా అంటారు. పాఠకుని మనసుపై బలమైన ముద్ర వేయగలిగే విధంగా కథను చెప్పితే అదే శిల్పం.
జీవితంలోని పలు సామాజిక, రాజకీయ, మానసిక కోణాల్ని, మానవ సంబంధాల విశ్లేషణలను పాఠకుని హృదయానికి
హత్తుకునే విధంగా చెప్పటమే శిల్పమని బి.ఎస్. రాములు చెపుతారు. 'రచయిత తాను చెప్పదలచుకున్న విషయాన్ని అది తనసొంత సంకట పరిస్థితి (Predicament) లేదా సంక్షుభిత మనఃస్థితిని, తాను దర్శించిన ఒకానొక జీవిత సత్యాన్ని,ఒక
సామాజిక దురన్యాయం పట్ల తన నిరసనను, స్వీయ జీవన సారంలోంచి గ్రహించిన తాత్విక, నైతిక సారాన్ని , పఠితకు అందిస్తూ, మేధోపరంగా, భావోద్వేగపరంగా (Intelecutually and exmotionally) కదిలించే వ్యూహాత్మక కథా కథన పద్ధతే శిల్పం'అని చెపుతాడు ఆదేవు లక్ష్మీపతి. దీనిని ఆంగ్లంలో 'టెక్నిక్' అంటారు.
కథలో శిల్పం ముఖ్యం. శిల్పానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి కథా సంవిధానం (Plot), పాత్రలు , నేపథ్యం (Setting) ,
దృష్టికోణం (Point of view), కథనం (Mode of Narration) కథలో శిల్పం బాగా ఉండాలంటే ఎలా రాయాలో చాలా మంది
కథకులు చెప్పినారు. అవి
1. కథ ప్రారంభం నుంచి చివరి వరకు చెప్పే కథకు అనుగుణంగా చెప్పాలి.
2. ఎంత వరకు చెప్పాడో అంత వరకే చెప్పాలి. చెహోవ్ ప్రకారం ప్రతి రచయిత తాను రాసిన కథలో ప్రారంభంలో వున్న పేరాను,చివరలో వున్న పేరాను తీసివేయాలి. అదే కథ అవుతుంది. చెప్పనక్కర్లేని దాన్ని సూచించి వదిలేయ వచ్చు.
3. పాత్రోచితమైన మాటలను వాడాలి. పాత్ర ప్రాంతాన్ని బట్టి మాండలికాలు ఉపయో గించాలి.
4. కథలో ఉన్న రెండు సంఘటనల మధ్య కార్యాకారణ సంబంధం చెప్పాలి.
5. కథకు ఉపయోగపడే విధంగా పాత్రకు గల లక్షణాలను చెప్పాలి.
6. పాత్రను గురించి కథా రచయితే అన్నీ చెప్పరాదు. పాత్ర స్వభావాన్ని అతని మాటల ద్వారా తెలియజేయాలి.
7. నిత్య జీవితానికి పాత్ర ఎంత దగ్గరగా వుంటే అంత బాగా కథ కుదురుకుంటుంది. మానవులు సాధారణంగా ఎలా ప్రవర్తిస్తారో
అలా పాత్ర ప్రవర్తిస్తే ఆ పాత్ర మీద పాఠకునికి నమ్మకం కుదురుతుంది,
8. కథకు స్థలకాలాదులు వుంటాయి. వీటి చిత్రణే నేపథ్య చిత్రణ. స్థల సూచనకు పాత్ర మాట్లాడే భాష ఉపయోగ పడుతుంది.కాలాన్ని నైపుణ్యంగా చెప్పగలగాలి.
9. పాఠకునిలో ఎలాంటి స్పందన కలుగ జేయాలనుకున్నాడో రచయిత నిర్ణయించుకోవాలి. దానికనుగుణంగా ఎలా చెప్పాలోరచయిత నిర్ణయించుకోవాలి.
10. కథనానికి మధ్యలో రచయిత వ్యాఖ్యానం చేయకుండా పాత్ర చేత చెప్పించాలి.
11. 'అంతరాంతర జ్యోతిస్సీ మల్ని బహిర్గతం చేయాలి. విస్తరించాలి చైతన్య పరిథి' అంటూ తిలక్ కవిత్వాన్ని నిర్వచించినా అది కథకూ
వర్తిస్తుంది.
12. కథానికలో ఏ వాక్యాన్ని తీసేసినా మొత్తం కథంతా దెబ్బతింటుందేమోనన్నట్లుండాలంటాడు 'ఎడ్గార్ ఎలెన్ పో.'
సాహిత్యంలో సమాజం ప్రతిఫలిస్తుంది. అలాగే సాహిత్యం సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. అయినా సాహిత్యంసమాజానికి ఎంత వరకు ఉపయోగపడు తుందోనన్న సందేహం చాలా మందిలో ఉంది. దీన్ని పటాపంచలు చేస్తూ ప్రేమ్ చంద్ ఒక సంఘటనను చెప్పాడు.అదేమంటే నెపోలియన్ జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఒక ఇంగ్లీషు దేశనావికుడు చిన్న బోటుమీద సముద్రం
దాటి వెళ్తూ ఉండటం చూశాడు నెపోలియన్. వెంటనే అతన్ని తన దగ్గరకు రప్పించాడు. అతనితో ' బోటులో ఎందుకు
పారిపోతున్నావు? " అని అడిగాడు. ' నా ముసలి తల్లి ఇంటి దగ్గర ఒంటరిగా వుంది
 ఒకసారి చూసి రావాలని ఉంది' అనిజవాబిచ్చాడతను. నెపోలియన్ కళ్లల్లో నుంచి అశ్రువులు బలజలరాలాయట. అతనిలో ఏ మూలో దాగివున్న మానవత్వంపురివిప్పింది. వెంటనే నావికుడిని ఫ్రెంచి నౌక మీద ఇంగ్లండు పంపిస్తాడు. అందువల్లనే ఒక కథ మనిషిని మార్చే అవకాశం ఉంది.అలాగే
మా వూరికి సారా వద్దు అనే కథ దూబగుంట గ్రామ మహిళల్ని చైతన్యం చేయడం,అది మన రాష్ట్రంలో సారావ్యతిరేక ఉద్యమాన్ని తీసుకురావడం అందరికీ తెలిసిందే.అందువల్లనే కథాసాహిత్యం మనిషిలో సంస్కారం పెంచుతుందని గురజాడ భావించారు. బాలగోపాల్ కథాసాహిత్యం చైతన్యాన్ని
పెంపొందిస్తుందని పేర్కొన్నారు. కథాసాహిత్యం భావాల్ని ప్రచారం చేస్తుందని ఆప్టన్ సింక్లెయిర్ భావించారు. అందువల్లనే మనం సాహిత్యం ద్వారా ఎలాంటి భావాలను అందిస్తున్నామన్నదే ప్రధానం.
జీవితంలో సంక్లిష్టత పెరిగిన కొద్ది కథా వస్తువులో వైవిధ్యం పెరుగుతుంది. జీవితానికి అద్దం పట్టడమే కథానిక లక్ష్యం,
లక్షణం. కథకుడు సమాజంలో జరిగిన సంఘటనలను యధాతథంగా చిత్రీకరించరాదు. కళాత్మకత జోడించడం ద్వారా కథ
పాఠకుల హృదయాల్లోకి తీసుకెళ్లాలి. సమాజాన్ని సహేతుకంగా నిజాయితీగా కళాత్మకంగా సందేశాత్మకంగా తీర్చిదిద్దాలి.రచయిత తాను తీసుకున్న అంశాన్ని ఉంచాల్సిన చోటలో వుంచి, తగిన భాష ఉపయోగిస్తూ నిజాయితీగా సరైన దృష్టిలోస్థలకాలాదుల్లో పాత్రలను పోషించినప్పుడు కథకు విశ్వసనీయత వస్తుంది. అయితే ఎలా రాశాడు అదే దానికన్నా, ఏం రాశాడు
అన్నదే విమర్శకులు పరిశీలిస్తారు. రచయిత రాసిన కథల సంపుటిని, ఒక్కసారిగా చదివితే, ఆ రచయితపై ఒక అభిప్రాయానికి
వస్తారు పాఠకులు, విమర్శకులు. పది కాలాలు నిలబడగలిగిన కథలే తెలుగు సాహిత్యంలో స్థానం సంపాదించాయి.
జీవితంలోని ఒక శకలాన్ని కథ చూపుతుంది. జీవితం పట్ల అవగాహన, సాంఘిక దృక్పథం, వ్యక్తుల ప్రవర్తనలు.
అనుభవాలు, సామాజిక ఉద్యమాలు మొదలగునవి కథా వస్తువులుగా గుర్తించబడతాయి. జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే
మార్క్సిజాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ప్రతి కథకుడూ, ప్రతి సమకాలీన సాహితీవేత్త, మార్క్సిజాన్ని తెలుసుకోవడం అత్యంత
అవసరమని కొడవటిగంటి కుటుంబరావు పేర్కొన్నారు.
జీవితాన్ని అర్థం చేసుకుని దాన్ని తన రచనలోకి తీసుకొచ్చినా కొన్ని మాత్రమే ఉద్యమ రచనలుగా రాణిస్తాయి. అయితే
ఏఉత్తమ రచనకైనా జీవిత దర్శనం, అనుభవం ముఖ్యం. అనుభవం వల్లనే కథకు విశ్వసనీయత వస్తుంది. స్వచ్ఛమైన అనుభవాలను
కళాత్మకంగా చదువరితో సున్నితంగా పంచుకోవడంలోనే కథకుని నేర్పు బయటపడు తుందంటారు వేదగిరి రాంబాబు.రచయితకు సామాజిక స్పృహ ఉంటే కథ పాఠకుని సంస్కార పరిధిని పెంచుతుంది. సామాజిక స్పృహ ఉండాలంటే సమాజస్థితి గతుల పట్ల అవగాహన, వాటికి గల మూలకారణాలవల్ల తార్కిక జ్ఞానం ఉండాలని, ఇవి వుంటే కథ పాఠకునిలో అనుభూతిని విస్తృతం చేసి బుద్ధికి వదును పెడుతుందంటారు వేదగిరి రాంబాబు.రచయితకు నిబద్ధత ఉండాల్సిన అవసరం ఉంది. నిబద్ధత ఉండటం అతని క్రమశిక్షణలో భాగం. నిబద్ధత అంటే తానుచెప్పే సిద్ధాంతానికి కట్టుబడి ఉండటం. అయితే ప్రతి రచయితా ఆ విధమైన కట్టుబాటుకు లొంగి ఉండటం లేదు. ఏది ఏమైనారచయిత అభ్యుదయ దృక్పథం కలిగి ఉండటం అవసరమని సాహితీ విమర్శకులందరూ భావించారు.తెలుగు కథా పరిణామ క్రమం వికాసాన్ని అధ్యయనం చేసిన ప్రోలా ప్రగడ సత్యనారాయణ మూర్తి స్థూలంగా కొన్నిదశలుగా విభజించారు. 1910-40 వరకు తొలి దశగా, 1940-52 వరకు మహోన్నత దశగా, 1952-65 ఉజ్వల దశగా,1965-92 వరకు మిశ్రమ దశగా ఆయన పేర్కొన్నారు.
తొలిదశలో కథల నిడివి వంద పేజీల కన్నా ఎక్కువగా ఉండేది. వడ్లగింజలు కథ నూరు పేజీలు నిండి పోయింది. కథల్లో రచయిత ప్రవేశించేవాడు. గ్రాంథిక భాషతో కృతకంగా ఉండేవి. గురజాడ, శ్రీపాద, చింతా మొదలగు వారి కథలను మినహాయిస్తే
శిల్పం మాత్రం ప్రాథమిక దశలో ఉండేది.40వ దశకం నాటికి సమకాలీన సమస్యలను కథా వస్తువుగా తీసుకోవడం మొదలైంది. దానితో కథ కున్న సామాజిక ప్రయోజనం గుర్తింపబడింది. సామాజిక సంస్కరణల కోసం, దేశభక్తి కోసం, తెలంగాణ సాయుధ పోరాటం కోసం,సామాజిక శ్రేయస్సు కోసం కథలు రాశారు.
తెలుగు కథా రచయిత రచన కథను ఒక సామాజిక అనుభవంగా మలచు కున్నాడు. ఇది ఏ ఇతర భాషా సాహిత్యాలలోకనిపించదు. దీనికి కారణం ఎప్పట్నించో ప్రజల్లో ఉన్న మర్యాదరామన్న కథలు, కాశీమజిలీ కథలు, స్థల పురాణాలు, జానపద
కథలు, పొడుపు కథలు మొదలైన వాటిల్లో ఉన్న కథన రీతులు కథకులకు దోహదపడినాయి. మన కథ పై ఇంగ్లీషు వారి కథా రచన ప్రభావం ఉంది. మొదట్లో ఎక్కువగా వారిని అనుసరించారు. తరువాత జానపద కథన రీతుల్ని ఆధునిక కథల్లో మేళవించి
చెప్పడం మొదలుపెట్టారు. ఎంతో మంది రచయితలు తెలుగు కథా వికాసానికి దోహదం చేశారు. వారి ప్రయోగాలు, విభిన్న
శైలులు, కథా వికాసానికి నారు నీరుపోసినాయి. చాసో, చలం, శారద, వట్టికోట, ఆళ్వారు స్వామి, గోపీచంద్,
బుచ్చిబాబు,కొ.కు. ,శ్రీశ్రీ, పాలగుమ్మి,ధనికొండ హనుమంతరావు, మునిమాణిక్యం, బలివాడ కాంతారావు, కా.రా. ,రావిశాస్త్రి, ఇల్లిందల సరస్వతీదేవి, పురాణం సుబ్రహ్మణ్య శర్మ, దాశరథి, రంగాచార్య మొదలైన వారెందరో 40వ దశకంలో సామాజిక వికాసానికి,
ఉద్యమాలకు కథను ఆలంబనగా చేసుకున్నారు. ఈ కాలాన్ని కథకు స్వర్గధామంగా చెప్పవచ్చు.1952లో న్యూయార్క్ ట్రిబ్యూన్ నిర్వహించిన ప్రపంచ కథల పోటీల్లో పాలగుమ్మి పద్మరాజు రాసిన 'గాలివాన' ద్వితీయ
బహుమతి సాధించడం ద్వారా తెలుగు కథ ప్రపంచ స్థాయిలో నిలబడింది.
అరవైయ్యోవ దశకం కొత్త కథకులు పెద్ద సంఖ్యలో సాహిత్యంలో ప్రవేశించారు. జాతీయ ఆర్థిక రాజకీయాలలో
వికేంద్రీకరణ జరుగుతున్న తరుణమది. ఈ కాలంలోనే రచయిత్రుల ప్రవేశం కూడా జరిగింది. పి. శ్రీదేవి, ఎ.ఎస్.మణి, ఇల్లిందల
సరస్వతీదేవి మొదలైన వారొచ్చారు. కారా రాసిన యజ్ఞం వచ్చింది ఈ కాలంలోనే. రావిశాస్త్రి కథన రీతుల్లో మార్పుకూడా ఈ కాలంలోనే
వచ్చింది. ఆయన రాసిన పిపీలకం శ్రామిక దృక్పథంతో రాసిన కథ వచ్చింది. బుచ్చిబాబు, గోపీచంద్, ముళ్ళపూడి వెంకటరమణ,
భమిడిపాటి రామగోపాలం, భమిడిపాటి జగన్నాథరావు వంటి వారు కథలు ఈ కాలంలోనే రాసినారు.
ఎనభైల్లో వచ్చిన స్త్రీవాద ధోరణితో కథా రచయిత్రులు సాహిత్యంలోకి ఎక్కువ మంది ప్రవేశించారు. వీరి కథా సాహిత్యం పురుషాధిక్యతపై యుద్ధం ప్రకటించింది. సమాజంలో అంతకుముందు నుంచి పాతుకుపోయివున్న పితృస్వామ్యం, పురుషాధిక్యత,
లింగ వివక్ష, పునరుత్పత్తి, కుటుంబ స్వభావం, వివాహ వ్యవస్థ మొదలైన విషయాలపై వీరి కథలు అనేక చర్చలకు తెరలేపాయి.స్త్రీల అంతరంగాలను బయటకు వ్యక్తీకరించడానికి వీలుకాని భావజాలాన్ని తమ కథలలో రచయిత్రులు వ్యక్తీకరించడం
ప్రారంభించారు. పురుషుడి సంస్కార స్థాయిని పెంచటానికి స్త్రీలలో చైతన్యాన్ని జ్వలింపజేయడానికి భాషలోనూ, భావ
వ్యక్తీకరణలోనూ, నిర్మాణంలో, శిల్పంలో కొత్త కొత్త జీవన సందర్భాలను రచయిత్రులు ఉపయోగించుకొన్నారని సింగమనేనినారాయణ పేర్కొన్నారు.
ఓల్గా రాసిన 'ప్రయోగం' సి. సుజాత రాసిన ' చట్ ట్రాక్", కుప్పిలి పద్మ రాసిన 
'మంచుపూల వాన', కవనశర్మ 'ఆమెఇల్లు' సత్యవతి రాసిన ' వసుంధర", చంద్రలత " అవర్గా', సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన " కొమ్ములు' ,సోమరాజు సుశీల రాసిన 'మరచెంబులో మందారపూలు' మొదలైన కథలన్నీ స్త్రీ వాద సంబంధ కథలుగా వచ్చాయి. అయితేప్రస్తుతం స్త్రీవాద ధోరణలుతగ్గి కుటుంబ వ్యవస్థకు ముప్పు వాటిల్లుతున్న తరుణంలో వృద్ధాప్య సమస్యలు ప్రధాన సమస్యగా రావడంతో కథల ధోరణి కూడా
మారిపోయింది. అదే సందర్భంలో ఇతర కథలలో జెండర్ గురించి జాగ్రత్తగా పట్టించుకుంటున్నారు.
తొంభై దశకం వచ్చే సరికి కథా శిల్పం పరిణామంలో చాలా మార్పులు వచ్చాయి. కథకుడు తాను చెప్పదలచుకున్న
దాన్ని అద్వితీయంగా చెప్పాలన్న బలమైన ఒత్తిడి వచ్చింది. కొత్త రచయితలు ప్రవేశించారు. ప్రపంచీకరణ షిండేప్రారంభమైంది ఈకాలంలోనే. సాంకేతిక విప్లవం, సమాచార విప్లవం రావడంతో సమాజంలో పెను మార్పులు వచ్చాయి. ఇప్పుడదంతా వచ్చి ముప్పైఏళ్లు పూర్తి కావస్తోంది. దీని ప్రభావంతో సమాజం అనేక కుదుపులకు గురైంది. వ్యవసాయ ప్రాంతాలు కనుమరుగై రియల్ ఎస్టేట్ గా
మారి నయా సంపన్న వర్గం వచ్చింది. బయోటెక్నాలజీ, ఐ.టీ. పార్కులు రావడంతో ఎగువ, మధ్యతరగతి వర్గం పుట్టుకొచ్చింది.
పల్లెల్లో వృత్తులు ధ్వంసమవుతున్నాయి. తెలుగుభాష ప్రాధాన్యత కోల్పో యి ఆంగ్ల విద్యకు ఆదరణ పెరిగింది. చాలా మంది దిగువ
తరగతులవారు కూడా అమెరికా లాంటి విదేశాలకు పోవడం మొదలైంది. సమాజంలో ఆర్థికవరంగానే కాక కొత్త సంస్కృతులు
మన దేశంలోకి దిగుమత య్యాయి. వాలంటైన్స్ డే, ఫ్రెండ్ షిప్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే లాంటివి వచ్చాయి. ఇవి కాకుండా ప్రాంతీయ
కుల, మత అస్తిత్వ వాదాలు పెరిగాయి. కన్ఫూజ్యామరిజమ్ పెరిగింది. వీటన్నింటి మూలంగా కథలలో మాండలికాలుప్రవేశించాయి. కుల పీడన చర్చలోకి వచ్చింది. బహుజన కథలు, దళిత కథలు వచ్చాయి. తెలంగాణా విబజన ఉద్యమానికి వారి
సంస్కృతి పట్ల అవగాహన కలగడానికి కధా సాహిత్యం వారి సాంస్కృతికోద్యమం బహుముఖంగా ఉపయోగపడింది.
మహమ్మద్ ఖదీర్ బాబు రాసిన “ పెండెం సోడా సెంటర్' పెద్దింటి అశోక్ కుమార్ రాసిన ' కాగుబొత్త' తోలేటి
జగన్మోహనరావు ' లక్ష్మీకటాక్షం' మొదలైన కథలు ప్రపంచీకరణ వర్యవసానాలలోంచి వచ్చినవే. సాహితీ స్రవంతి విశాఖ జిల్లా
వారు ప్రచురించిన మాటు కథా సంకలనాలలో చోటు చేసుకున్న ఇచ్ఛాపురం రామచంద్రం రాసిన గుడి - గుడి కథ మతోన్మాదంపై మూగ మనోవేదనకు అద్దం పడితే, అప్పలనాయుడు రాసిన 'మాటు' కథ ప్రపంచీకరణ పేరిట మాటు వేసినీత్తులపై నిరసనాస్త్రంగా
మనం చూడవచ్చు. మల్లిపురం జగదీష్ రాసిన " కలలు కాలుతున్న వాసన' కథలో వెర్రితలలు వేస్తున్న వస్తువ్యామోహం జీవితాలను
ఎలా బలితీసుకుంటుందో చూదగలం. ఇలా కార్పొరేటు చదువులపైన వ్యవసాయరంగ సంక్షోభం పైన అనేక కథలు వస్తూనే వున్నాయి. మానవ సంబంధాలు డబ్బు సంబంధాలుగా మారుతున్న సందర్భాన్ని నేటి తరం కథలో బహుముఖంగా వ్యక్తం
చేస్తున్నారు. నల్లూరి రుక్మిణి రాసిన 'దూరపు కొండలు', పోగులు తెగిన అల్లిక, మిడిసిపాటు, ఆరి సీతారాములు రాసిన 
'అపచారం'కథ మొదలైన వాటిల్లో ఇలాంటి వస్తువును ఇతివృత్తంగా తీసుకున్నారు.ప్రపంచీకరణను 
'తెల్లదెయ్యం'గా చూపిస్తూ అది రైతు జీవితంలో తెస్తున్న సంక్షోభాన్ని గురించి హెచ్చరిస్తూ బండి
నారాయణ స్వామి రాసిన కథ తెల్లదయ్యం', అప్పల్నాయుడు రాసిన 'క్షతగాత్ర గానం', ఉత్తరాంధ్రలో వ్యవసాయరంగం వ్యాపారరంగంగా మారటం వలన దెబ్బతిన్న మానవ జీవితాలను చూపించింది. కాత్యాయని విద్మహే పేర్కొన్నారు. కుప్పిలి పద్మ రాసిన'కుబుసం, సాలభంజక కథలు, సుజాతరెడ్డి రాసిన ' నిశ్శబ్దం, పి. సత్యవతి రాసిన
 'మంత్రనగరి' కథలు సరళీకృత ఆర్థిక విధానాల
వలన బహుళజాతి కంపెనీలు దేశంలోకి ప్రవేశించి దేశీయ పరిశ్రమలు దెబ్బతీస్తున్న పరిస్థితిని వివరిస్తాయి. వ్యాపారలావాదేవీలలో 
స్త్రీ శరీర సౌందర్య వినిమయం కూడా ఒక ఉద్యోగంగా స్థిరపడుతున్న పరిస్థితిని కూడా ఈ కథలు వివరిస్తాయని
రాచపాళం చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.

చాలా మంది కథకులు రాసిన కథల సమాహారం 1917 నుంచి కధాసంకలనాలు వచ్చాయి. కొంత మంది రచయితలు
తమ కథలను సంపుటిలుగా కూడా తీసుకొచ్చారు. పానుగంటి కథా వల్లరి (1917), మాడపాటి హనుమంత రావుమల్లికా గుచ్ఛము
(1915), శ్రీ పాద ' పూలజడ' మొదలైన సంపుటిలు వెలుగు చూశాయి. కొన్ని సాహిత్య సంస్థలు కూడా కథా సంకలనాలు
తీసుకొచ్చాయి. వాటిల్లో జనసాహితి ' తెలంగాణ పోరాట కథలు' (1982), ప్రజా ప్రచుణాలయం 'ప్రజాశక్తి కథలు' (1945),
అరుణ సాహితీ 'జనం' (1970), విరసం (నెల్లూరు) 'నేలతల్లి విముక్తి కోసం' (1990), సాహితీ స్రవంతి' మాటు' మొదలైన కథా సంకలనాలనుప్రచురించాయి. ప్రతి సంవత్సరం కథా సాహితి వారు వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ సంపాదకృతులో కథా సంకలనాలను
ప్రచురిస్తున్నారు. అలాగే మధురాంతకం రాజారాం సాహితీ సంస్థ వారు కథా వార్షిక పేరుతో కథా సంకునాలను తీసుకొస్తున్నారు.
సాహిత్య ప్రస్థానం, ప్రజాసాహితి, విశాలాక్షి మొదలైన మాసపత్రికలు కథలకు ప్రాధాన్యతనిచ్చి ప్రచురిస్తున్నారు.
రాయలసీమలో అనేక మంది కథా రచయితలు తెలుగు సాహిత్యంలో చెరగని ముద్ర వేస్తున్నారు. కేతు విశ్వనాథరెడ్డి,వేంపల్లి గంగాధర్, కీ.శే. శశిశ్రీ, వేంపల్లి షరీఫ్, పాలగిరి విశ్వప్రసాద్, ఉమామహే శ్వరరావు, రాసాని, మధురాంతకం నరేంద్ర
నాయని కృష్ణమూర్తి, బండి నారాయణస్వామి, నిర్మలాదేవి, సింగమనేని నారాయణ, శాంతి నారాయణ, కీ.శే. చిలుకూరి దేవపుత్ర,దేవకి, శశికళ, ప్రగతి, పెళ్లి కుమారస్వామి, చిలుకూరి దీవెన, ఆకుపచ్చ వెంకటేశ్వర్లు, సడ్లపల్లి చిందబరరెడ్డి, జయరాం తదితరులు
కథా సాహిత్యాన్ని ముందుకు తీసుకెళుతున్నారు.
కథకులు చాలా మంది కథలు రాస్తున్నారు. ఇది తెలుగు భాషా వికాసానికి దోహదం చేస్తోంది. అదే సందర్భంలో బాలసాహిత్యం కూడా పెరిగి బాలవికాస కథకు రాయడం, రాయించడం చేస్తున్నారు. ఇందంతా కథా వికాసానికి, భాషా వికాసానికి దోహదం చేస్తుందనడంలో సందేహం లేదు. కాకపోతే పాఠకుల సంఖ్య తగ్గిపోతోంది. అందువల్లనే చాలా మంది యూట్యూబ్ ఛానల్లో తమ కథల్ని వినిపిస్తున్నారు. ఇందు రమణ ఇటీవల కథల కోసం యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేశారు. వేంపల్లి షరీఫ్
కూడా ఇలాంటిదే మరోకటి ప్రారంభించారు. హరికిషన్ బాల సాహిత్యాన్ని యూట్యూబ్ లో ప్రచారం చేస్తున్నారు. బాలల కోసం
కథలు విరివిగా రాసి బాలలకు కథల పట్ల ఆసక్తిని కలిగించాలి. అప్పుడే తెలుగు భాష పరిఢవిల్లుతుంది.ఇటీవల కాలంలో వస్తున్న కథకులు తమ కథల్లో తమ ప్రాంత మాండలికాలను, పలుకుబడుల్ని, నుడికారాన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇది ప్రజలందరిని భాషవరంగా ఏకం చేయడానికి ఉపయోగ పడుతోంది. ఇండన్ మార్టిన్ రాసిపోకటికపూలు"
గుంటూరు జిల్లా దళితుల మాండలికాన్ని వెలుగులోకి తెస్తే, ఎండవల్లి భారతి రాసిన 'ఎదారిబతుకులు' చిత్తూరు  మాండలికాన్నిపరిచయం చేసింది. ఇదేకాక ముస్లిం మైనారిటీ కథకులు అనేక ఉర్దూ పదాలను తను తెలుగు కథలలో ప్రవేశపెట్టారు. మొత్తం మీద కథనంతా మాండలికంలో కాకుండా పాత్రోచితంగా మాట్లాడించడం వలన కథనం రక్తికడుతుంది. భాషా సుసంపన్నమై ఒక
ప్రామాణిక భాష తెలుగు నేలపై వరచుకోవడానికి దోహదం చేస్తుంది. ఇలా కథల్లో కొత్త పదాలు వచ్చి చేరడం వలన తెలుగు భాషావికాసానికి కథ చేస్తున్న మేలు మాటల్లో చెప్పలేం.కథానికల ద్వారా సామాజిక చరిత్ర కూడా రూపొందుతుంది. మారుతున్న సామాజిక ఆర్థిక చారిత్రక సంఘటల్ని రికార్డు
చేయడమే గాక సామాజిక విలువల్ని ప్రతిపాదిస్తుంది. గురజాడ చెప్పినట్లు కథా సాహిత్యం పాఠకునిలో సంస్కారం పెంచినా,
బాలగోపాల్ ప్రకారం అది పాఠకునిలో చైతన్యం కలిగించిన సామాజిక విలువల్ని పెంపొందించడానికి ఉపయోగ పడుతుందని
చెప్పవచ్చు. అదే సందర్భంలో అది భాషా సాంస్కృతిక పునరుజ్జీవనానికి కూడా దోహదం చేస్తుంది.

(ఈ వ్యాసరచనకు ఉపయోగపడిన గ్రంథాలు - (1) కథాశిల్పం (2) తెలుగు కథానిక (పోలాప్రగడ). (3)తెలుగు కథానిక (వేదగిరి
రాంబాబు) (4) కథావరణం (5) వెయ్యేళ్ల కథా ప్రస్థానం (6) కథలబడి (7) వందేళ్ల తెలుగు కథ.)
(ప్రపంచ తెలుగు రచయితల మహాసభల సావనీర్ లో ప్రచురించారు)

పిళ్లా కుమారస్వామి, సెల్:  9490122229

కామెంట్‌లు

  1. చాలా చక్కని వివరణ. ప్రొచీన కాలం నుండి నేటి వరకు కథల యొక్క మారుతున్న స్వరూప స్వభావాలను
    ఎంతో సునిశితంగా, సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు. తెలియని విషయాలెన్నో తెలియ చేశారు.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు