భారతీయ సంస్కృతి
ఒక సమాజం చేసిన, వాడిన పరికరాలు, నిర్మించిన కట్టడాలు, వారి సంగీతం, కళ, ఆహారం, శిల్పం, చిత్రం, నాటకం, నాట్యం, సినిమా - ఇలా సమాజపు జీవన విధానం ఆ సమాజపు సంస్కృతి అంటాం. ఒక సమాజంలో ఉన్న వస్తు వినియోగం, సంపన్నత, జానపద వ్యవహారాలు కూడా సంస్కృతిగా భావింపబడుతాయి.వస్తువుల వినియోగమే కాకుండా ఆనాటి ఉత్పత్తి విధానం, వాటిని గురించిన దృక్పధం, సమాజంలో ఆ వస్తువులతోపాటు పెనవేసుకొని పోయిన సంబంధాలు, ఆచారాలు కూడా సంస్కృతిలోనివే . కనుక కళలు, విజ్ఞానం, నైతికత కూడా సంస్కృతి కిందకు వస్తాయి.
సంస్కృతి అంటే జీవనవిధానం అయితే అది పరిణామశీలం. అదొక ప్రవాహం లాంటిది.అది నిత్యం నూతనమైనది. అంతకు ముందున్న ప్రాచీన రూపాల నుంచి సారాన్ని గ్రహించి పరిణామం చెందుతుంది. కనిపించని ప్రభావాలకు అది లోనవుతుంది.జ్ఞానం, మతం, నీతి, కళ, చట్టం, ఆచార వ్యవహారాలూ అన్నీ సంస్కృతిలో భాగాలే. ప్రపంచీకరణ లో భారతీయ సంస్కృతి శరవేగంగా మార్పులు చెందుతోంది.
ఏ జాతి సంస్కృతి అయినా విశిష్టమైనదే. దేని విశిష్టతదానిదే. కాని కొందరు విద్యావంతులు తమకు నచ్చిన కొన్ని అంశాలను ప్రమాణంగా పెట్టుకొని ఒక సంస్కృతికంటే మరొక సంస్కృతి గొప్పదని తీర్మానిస్తుంటారు. ఇది సరైన దృక్పథం కాదు. కవి బాలగంగాధర తిలక్ పలికినట్లు
"యుగయుగానికి స్వభావం మారుతుంది.
అగుపించని ప్రభావాలకు లొంగుతుంది.
ఏ దేశ సంస్కృతి అయినా ఏనాడూ కాదొక
స్థిరబిందువు
నైక నదీనదాలు అదృశ్యంగా కలిసిన అంతస్సింధువు".
ఏ దేశ సంస్కృతినైనా స్వచ్ఛమైనదిగా, పవిత్రమైనదిగా, ఉన్నతమైనదిగా తలచటం పొరపాటు అభిప్రాయం.
ఉత్పత్తిక్రమం, ఉత్పత్తి సంబంధాలు సమాజ స్వరూపాన్ని నిర్ణయిస్తాయని మార్క్సిస్టులు భావిస్తారు. సమాజంలో ఉత్పత్తిదారుల అవసరాలకు సరిపడా సంపద మిగిలితే అది సంస్కృతి నిర్మాణానికి, పెంపుదలకూ మూలమవుతుంది. ఆయా కాలాల్లో అలాంటి మిగులు ఉత్పత్తి ఉండబట్టే చైనాగోడ, ఈజిప్టు పిరమిడ్లూ నిర్మించటం సాధ్యమైంది.మిగులు ఉత్పత్తిని చేజిక్కించుకున్న పాలకుల సంస్కృతే పాలితుల సంస్కృతిగా ప్రచారంలోకి రావటం చరిత్రలో చాలాసార్లు జరిగింది.
చరిత్రలో భాగమే సంస్కృతి. చరిత్ర వెంట సంస్కృతి నీడలా వెన్నంటి వుంటుంది.సంస్కృతికి సామ్రాజ్యవాదానికి గల గాఢమైన సంబంధాన్ని ఎడ్వర్డ్ డబ్ల్యు సెయిర్ కల్చర్ అండ్ ఇంపీరియలిజం అనే పుస్తకంలో విపులంగా చర్చించారు. సెయిర్ కొలంబియా విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషు తులనాత్మక సాహిత్యాలను బోధించే ప్రొఫెసర్.
సంస్కృతిలో రెండు అంశాలు ప్రాధాన్యం వహిస్తాయని సెయిద్ తలుస్తారు. కళలు, రాజకీయ, ఆర్థిక, సామాజిక విభాగాలలో సమాజం సాధించిన అభివృద్ధి మొదటి అంశమైతే, రెండవది మానవుల అభిరుచి సున్నితమైన విషయాలలో పెంపొందటం.
కక్షలు కార్పణ్యాలతో నిండిపోయిన సమాజంలో సుఖశాంతుల్ని నెలకొల్పటం, సరైన సామాజిక అభిరుచుల్ని పెంపొందించటమే సంస్కృతి గా మేథ్యూ ఆర్నాల్డ్ భావించాడు.
భారతీయ సంస్కృతిని అభిమానించిన విలియం జోన్స్, ఎడ్మండ్ బర్క్లు ఎన్నో ప్రశంసలు కురిపించారు. కాని కిప్లింగ్ మాత్రం భారత సంస్కృతిని చిన్నచూపు చూశాడు. East is East and West is West, the twain shall never meet అంటూ పశ్చిమదేశాల సంస్కృతికి మొగ్గు చూపాడు. వలస దేశాలను సంస్కరించటం 'వైట్మేన్స్ బర్డన్'గా భావించాడు. ఇవి భారతీయులపట్ల కిప్లింగ్ కున్న అభిప్రాయాలు.
ఇ.యం.ఫార్ స్టర్ రాసిన ఏ ప్యాస్సేజ్ టు ఇండియా (1924), ఎడ్వర్డ్ థాంప్సన్ రాసిన ది అదర్సైడ్ ఆఫ్ ది మెడల్ (1926) సాహిత్య విమర్శ ప్రమాణాలతో చూచినప్పుడు విశిష్ట రచనలే. కానివాళ్ల రచనల్లో భారత చరిత్రను అటవికమైనదిగా,అనాగరికమైనదిగా చిత్రించారు.
జాతీయతకు కొనసాగింపే సామ్రాజ్యవాదమని జె.ఏ. హాబ్సన్ అభిప్రాయపడ్డాడు. జాతీయ వాదులు తమ జాతిని పొగుడుకోవటంతో ఆగక “లేదురా మనజాతి వంటిది ఇంకెందు; లేదురా మనవంటి పౌరులింకెందు" అని బీరాలు పలుకుతారు.
సామ్రాజ్యవాద సంస్కృతే అసలు సిసలు సంస్కృతిగా భ్రమింపజేస్తున్నది. 'సబాల్టరన్ స్టడీస్'ను ప్రోత్సహించటం పేరిట వివిధ జాతులు తమ మూలాలను అన్వేషించి, తెలుసుకొని, తమ జాతుల ఐడెంటిటిని నిలబెట్టుకోవాలని ప్రచారం చేస్తున్నది; ఆ దిక్కుగా ప్రపంచాన్ని చీలదీసే ప్రయత్నంలో అపారమైన నిధుల్ని కుమ్మరిస్తున్నది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో నిధులు యువతరాన్ని ఎక్కువగానే ఆకట్టుకుంటున్నాయి.దీని వల్లే నేడు అనేక అస్థిత్వ వాదాలు పుట్టుకొచ్చాయి.
నూరేళ్ల సామ్రాజ్యవాదం తన సంక్షోభాన్నుండి బయటపడటానికి ప్రపంచీకరణ ప్రక్రియను ప్రారంభిస్తే అది ఢిల్లీ నుండి పల్లె వరకు పేద, మధ్యతరగతి ప్రజానీకాన్నేకాక, భౌతిక విలాసాల్లో బతికేస్తున్న సంపన్న వర్గాల్లో కూడా మనశ్శాంతి లేని సాంస్కృతిక సంక్షోభాన్ని సృష్టించింది. టి.వి. సీరియళ్లనిండా కోటీశ్వరుల కుటుంబాలే దర్శనమిస్తాయి. అవి ఎప్పుడూ పగతో, ప్రతీకారంతో, పోటీ, ఈర్ష్యాసూయలతో, పచ్చిస్వార్థంతో రగిలిపోతూ వుంటాయి. మౌఢ్యాలతో మునిగితేలుతుంటాయి. భయంకరమైన కుళ్లు సంస్కృతిని దేశమంతా వెదజల్లుతుంటాయి. కాకుంటే దాని ప్రభావం నుండి బయటపడాలంటే ''ప్రపంచీకరణ' విలువలను తిరస్కరించే ప్రత్యామ్నాయ సంస్కృతికే సాధ్యపడుతుంది. ఒక కవి ప్రస్తుత పరిస్థితుల్ని ఇలా చెపుతాడు.
"వేల మైళ్ల దూరంలో మనిషికి మనిషికీ మధ్య ఇంటర్నెట్
ఒకే గదిలో మనసుకూ మనసుకూ మధ్య వేల మైళ్లు"
ఇదీ నేటి వర్తమాన సంస్కృతి. గ్రామాలలో, పట్టణాలలో పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలలో ప్రపంచీకరణ సంస్కృతి వెలుగులు నింపిందా, చీకట్లు పంచిందా చర్చించుకుంటేగానీ మనమెక్కడ ఉన్నామో అర్థం కాదు. మానవీయ విలువలైన కరుణ, దయ, జాలి, సాటి మానవులపట్ల సానుభూతి సంఘీభావం పెరిగాయా తరిగాయా ఆలోచించాలి. కుటుంబజీవితంలో భార్యభర్తల మధ్య, అత్తాకోడళ్ళ మధ్య, తల్లితండ్రులు బిడ్డల మధ్య సంబంధాల్ని ఏ విలువలు నడిపిస్తున్నాయో అవి కుటుంబ సౌఖ్యాన్ని పెంపొందిస్తున్నాయో లేదో పరిశీలించాలి. ప్రపంచీకరణ ప్రభావపు జీవన విలువలు వ్యక్తులను, కుటుంబాలను ఎటువైపుకి నడిపిస్తున్నాయి? బాల్యాల్ని కోల్పోయి చేయని నేరాలకు శిక్షననుభవిస్తున్న రెసిడెన్షియల్ విద్యా విధానపు సంస్కృతి పిల్లల మనోఫలకంపై, జీవితంపై కలిగించే ప్రభావం ఎలాంటిది? మానవ సంబంధాలపట్ల ఏ విలువలనది నేర్పుతోంది? రెసిడెన్షియల్ స్కూళ్లు పుట్టినచోట వృద్ధాశ్రమా లెందుకు వెలుస్తున్నాయి? ఇవన్నీ సాంస్కృతిక వెలుగుబాటకు దారులు వేస్తున్నాయా? ఇవన్నీ ఇవాళ మన సంస్కృతి లో ఎలా భాగమయ్యాయో చర్చించుకోవాలి.
పడమటి గాలితో వచ్చిన సంస్కృతి వ్యక్తి స్వేచ్ఛా ప్రధానమైనది. అది బీభత్సమైన, స్త్రీని అతి హీనంగా చూసే పాశ్చాత్య సంస్కృతి.దీన్ని పాలకవర్గాలు దిగుమతి చేసుకుని మనకందించాయి. భారతీయులకు విషాదాన్నే మిగిలిస్తోంది. కవి కరీముల్లా ఇలా అంటాడు.
'నాదేహం ఒకప్పుడు బ్రిటిష్ కాలనీ
అప్పుడునగ్నంగా
ఇప్పుడు అమెరికన్ కాలనీ
నాపై స్వదేశీ వస్త్రం
ఐ.టి. పాడెక్కించి, కంప్యూటర్ కాష్టం రాజేసి డబ్ల్యు.టి.ఓ.తో సహగమనం చేయించాక
ప్రతి అంగం వాషింగ్టన్ వాసనై వీర్యం కోల్పోయిన పేటెంట్ హక్కయ్యాక ఇక చేసేదేముంది?
పాయికానై వాళ్ళపొట్టపురుగుల్ని దాచుకోవడం తప్ప'
భాష అనేది సంస్కృతిలో ఒక ముఖ్యమైన అంశం. భాష వ్యక్తీకరణకు అది ప్రధానసాధనం. తమ తమ భావోద్వేగాలనూ, ఆప్యాయతలనూ, ద్వేషాన్ని, కసినీ మొదలైన వాటిని ప్రజలు తమ మాతృభాషలోనే మనస్ఫూర్తిగా ఇతరులకు తెలియ చేయగలుగుతారు. వీటిని పరాయి భాషలో అంత శక్తివంతంగా వ్యక్తీకరించలేరు.
కెన్యా రచయిత గూగీవా థియాంగో చెప్పినట్లు తుపాకీ శరీరాన్ని వశపరుచు కుంటుంది. భాష ఆత్మను వశపరచుకుంటుంది.ఇది మనభాషా సంస్కృతుల పరాయీకరణ గురించి తెలుపు తుంది. ఉదాహరణకు మమ్మీ, డాడీ, ఆంటీ, అంకుల్ అనే పదాలు పరాయి భాషాపదాలు. అమ్మా, నాన్న అనే పదాలకున్న శక్తి మమ్మీ, డాడీలలో ఉండదు. ఆ ఆప్యాయత అనురాగం మాయమౌతాయి.అవి కేవలం పిలుపులు గా ఉంటాయి. అలాగే పెద్దమ్మ, చిన్నమ్మ, పిన్ని, బుల్లెమ్మ, అత్త, మేనత్త అన్న రకరకాల బంధుత్వాలకు తెలుగులో విడివిడిగా పదాలుండగా ఇంగ్లీషులో 'ఆంటీ' అనే పదం ఒక్కటే ఉంది. అలాగే పెదనాన్న, బాబాయి. చిన్నాన్న, మామ, మేనమామలకు బదులుగా ఇంగ్లీషులో అంకుల్ అనే పదం ఒక్కటే ఉంది. ఫలితంగా ఆ ఇంగ్లీషు పదాలువాడుతున్న సందర్భంలో భావం ఖచ్చితంగా వ్యక్తీకరింపబడదు. పైన పేర్కొన్న ఆంటీ, అంకుళ్ళ సంతానమంతా ఇంగ్లీషులో 'కజిన్స్' అవుతారు. అదే మనకు తెలుగులో అయితే అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, వదిన, మరదలు, భావ, బావమరిది ఇలా బహుముఖంగా ఉంటాయి. ఇది బంధు సంబంధాలో ఎక్కువ ఖచ్చితత్వాన్ని తెలుపుతుంది. 'ఆంటీ', 'అంకుల్' పిలుపుల్లో ఈ ఖచ్చితత్వం లేక, మన బంధుత్వ సంబంధాలు పరాయీకరణ చెందుతాయి.
అభ్యుదయవాదులు సమాజ ప్రయోజనం కోసం కళారూపాల్ని సాహిత్యాన్ని ఉపయోగించా లని అన్నప్పుడు సంప్రదాయవాదులు దాన్ని ప్రచారం కోసం చేస్తున్న కళలుగా చిత్రిస్తుంటారు.వందల సంవత్సరాలుగా కుప్పలు తెప్పలుగా వచ్చిన భక్తి సాహిత్యం కూడా భక్తి ప్రచారమే. మన వాగ్గేయకారులు అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్యల " నుండి రామదాసు వరకు సృష్టించిన అపూర్వ - సంగీత-సాహిత్యమంతా భక్తి ప్రచారం కోసమే. భాగవతం వైష్ణవ మత ప్రచారం కోసమైతే, బసవ పురాణం శైవమత ప్రచారం కోసం రాశారు. బైబిలు క్రైస్తవ మత ప్రచారం కోసమైతే, ఖురాన్ ఇస్లాం మతం ప్రచారం కోసం రాశారు. ఇలా స్వమత ప్రచారం కోసం అసంఖ్యాక సాహిత్య గ్రంథాలు ప్రపంచవ్యాప్తంగా వెలువడిన విషయం మనకు తెలిసిందే. అందువల్ల క్షీణ సంస్కృతి బదులు అభ్యుదయకరమైన మానవీయ సంస్కృతి నుంచి పెంపొందించే సాహిత్యాన్ని ప్రచారసాహిత్యమని కొట్టి పారేయడం సరైంది కాదు.
సాహిత్యంలో, సినిమాల్లో అశ్లీల , భయానక అద్భుత ఘటనలు చొప్పించి ధనార్జన చేయడంతో పాటు వాటిని అపురూప కళాసృష్టిగా చలామణీ చేయడం నిత్యమూ గమనిస్తున్నాం. అలాంటప్పుడు సమాజశ్రేయస్సు కోసం,ఒక ఉన్నతమైన సమసమాజం కోసం సాహిత్య సృష్టి, కళా ప్రదర్శనలు దోహదపడితే వాటిని ప్రచార కళలుగా కొట్టిపారేయడం ఎంతవరకు సమంజసం? ఇదంతా వ్యాపార సాధనాలుగా మారుతున్న కళల్ని గురించి నిద్ర నటిస్తున్న యధాతథవాదుల పని. వారికి మరో ప్రపంచమంటే భయం.
పెట్టుబడిదారీ సమాజంలో కళల్ని 'మార్కెట్' సంస్కృతిలోకి లాగేస్తున్నారు. సినీరంగ ప్రముఖులంతా కళాకారులే. కానీ వారు తమ రంగాన్ని "వ్యాపారం"గా, "పరిశ్రమ"గా గర్వంగా చెప్పుకుంటున్నారు. చివరకి ఆటలు కూడా (ఉదా. క్రికెట్, టెన్నిస్) వ్యాపారంగానే మారిపోయాయి. అవి వ్యాపారసంస్థలకు ప్రచార సాధనాలుగా మారిపోయాయి. క్రికెట్ దిగ్గజాలు తామే మాత్రం వాడిని వస్తువుల్ని టి.విల్లో అవి వాడి అంత వారమయ్యామని వాటి మార్కెట్ కోసం ప్రచారం చేస్తున్నారు.సినీ ప్రముఖులు అంతే.చివరికి పెద్ద పెద్ద కంపెనీలు అతివల సౌందర్యాన్ని కూడా వస్తువుల అమ్మకానికి వినియోగించు కుంటున్నాయి. వారి అర్ధనగ్న చిత్రాల ద్వారా పత్రికలు అమ్మకాలను పెంచుకుంటున్న సంస్కృతి పెరిగింది. అందాల పోటీల నిర్వహణ వెనుక వున్నది కూడా ఈ వ్యాపార సంస్కృతే. కాబట్టి ఏ పదజాలం వెనుక ఎలాంటి భావజాలం దాగుందో గ్రహించాలి. ప్రచారకళల పేరుతో ప్రజాకళల్ని తక్కువ చేసే సంస్కృతి ని వ్యతిరేకించాలి. అదే సందర్భంలో శిల్పనైపుణ్యాన్ని పెంపొందించు కోవడం ద్వారా ప్రజాకళలను పదును పెట్టుకోవాలి.
ఫ్రెంచ్ సామాజిక శాస్త్రవేత్త పియర్ బోర్డియుప్ర కారం "విద్య ఆధిపత్య తరగతి సంస్కృతిని శాశ్వతం చేస్తుంది'. దీన్నే అతను "సాంస్కృతిక పునరుత్పత్తి" అన్నాడు. అదే విధంగా పాలోఫెయిరీ పరిశీలనలో బోధన ప్రక్రియ, బోధనా పద్ధతి, భాషలు అణిచేవారిగా, అణిచివేయబడేవారుగా భేదాలు సృష్టిస్తాయని గుర్తించాడు.
మన సమాజంలో ఆధిపత్య వర్గాల సంస్కృతి , లింగ అసమానత, ఇతర సామాజిక సంస్కృతి లక్షణాలు యువతరాలనికి బదిలీ చేయబడుతుంటాయి.దీన్ని గుర్తించి సరైన ప్రజా సంస్కృతి వ్యాప్తికి కృషి చేయాలి.
___ పిళ్లా కుమారస్వామి,9490122229
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి