పద్యం × వచనకవిత
పద్యం × వచనకవిత
__ వి.చెంచయ్య
పద్యాన్ని సాంప్రదాయికుల్లో వ్యతిరేకించేవారు లేరు.ఆధునికుల్లో వ్యతిరేకించే వాళ్లూ ఉన్నారు. సమర్థించేవాళ్లూ ఉన్నారు. వ్యతిరేకించే వాళ్లందరూ ఒక రకం కాదు. గుడ్డిగా వ్యతిరేకించేవాళ్లు కొందరుంటే ఉండవచ్చుగానీ, ఎక్కువ మంది సకారణంగా వ్యతిరేకించేవాళ్లే. నిజానికి పద్యాభిమానులు వచన కవితను సకారణంగా కాక, గుడ్డిగా ద్వేషించినట్టు కనబడుతుంది. పద్యం, వచన కవిత - రెండూ సహజీవనం చేస్తున్న కాలంలో పద్యాభిమానులైన ఆధునిక కవులు వచన కవితను గుడ్డిగా వ్యతిరేకించారు. దువ్వూరి రామిరెడ్డి వచన కవితను 'జ్యామెట్రీ కవిత' అన్నాడు. జాషువా 'తోకపీకుడు కవిత్వ' మన్నాడు. ఇంకా చాలామంది పెట్టుబడి లేని కవిత్వం అన్నారు. వీరందరూ కూడా వచన కవిత పట్ల ఈ అభిప్రాయాల్ని సకారణంగా నిరూపించలేదు. వారి పద్యాభిమానమే వచన కవితా వ్యతిరేకతకు కారణమైంది. కానీ పద్యాన్ని వ్యతిరేకించే వాళ్లలో చాలా మంది తమ తమ కారణాల్ని చూపుతున్నారు. చివరికి పద్యాన్ని వ్యతిరేకిస్తూ తిట్టు కవిత్వం రాసిన వాళ్లు కూడా అందరూ ఊరికే తిట్టలేదు. "రాముని పాదం మోసీ.... మోసీ.../ పద్యం రాముని వాసన గొస్తోంది | మట్టి వాసన లేదు / మనిషి వాసన లేదు / మబ్బు వాసన లేదు / చెమట వాసన లేదు / చేను వాసన లేదు / ఉందల్లా కృష్ణుని వాసనే / సగం కాలిన ఆకాశం వాసన / అక్షరమై పద్యంలో ఇమిడిందెప్పుడు / సగం కరిగిన భూమివాసన / పద్యపాదాలుగా నడిచిందెపుడు" (వడ్డెబోయిన శ్రీనివాస్ : 19.1.94). ఇలా సాగుతుంది పై కవిత. ఇందులో కేవలం పద్యవ్యతిరేకత మాత్రమే లేదు. ఎందుకు వ్యతిరేకించాలో కూడా వుంది. పద్యాన్ని వ్యతిరేకిస్తూ రాసిన అన్ని కవితలూ ఇలా ఉన్నాయని కాదుగాని, కనీసం కొన్నైనా ఒక అవగాహనను కలిగించేలా ఉన్నాయనడంలో సందేహం లేదు. ఈ కవితలో కవి పద్య సాహిత్యంలో ఉన్న వస్తువు (content) ను పట్టించుకున్నాడు. జ్యామెట్రీ కవిత, తోకపీకుడు కవిత అన్నప్పుడు దువ్వూరి, జాషువా లాంటి గొప్ప గొప్ప కవులు కూడా కేవలం వచన కవిత రూపాన్ని (form) మాత్రమే తమ విమర్శకు ఆధారం చేసుకున్నారు. పద్యానుకూలురకూ, పద్య వ్యతిరేకులకూ ఉన్న ఈ తేడాను గమనించాలి.
(సాహిత్య దృక్పథం నుండి)
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి