నవలా సాహిత్యం

నవలా సాహిత్యం

ఆధునిక సాహిత్యం మొదట నవలా సాహిత్యంతో ప్రారంభమైంది. ప్రపంచంలో వెయ్యేళ్ళ క్రితం రాసిన 'గెంజీ కథ' మొట్టమొదటి నవల. ఇది జపాన్‌ దేశపు ఇతిహాసం. ఆ తరువాత ఆంగ్ల సాహిత్యంలో మొట్టమొదట డేనియల్‌ డెఫో రాసిన 'రాబిన్‌సన్‌ క్రూసో' నవల 1719లో వచ్చింది. ఇది రాబిన్‌సన్‌ సాహసవంతమైన వీరోచిత జీవితాన్ని వర్ణిస్తుంది.
ఆంగ్లంలో 'నావల్‌' అనే పదం ఉంది. దీని ఆధారంగా తెలుగులో 'నవల' అనే పేరు వచ్చింది. నవల జీవిత వాస్తవికతను, జీవితంలో ఉన్న వైవిధ్యాన్ని, సంక్లిష్టతను, వైరుధ్యాలను చిత్రిస్తుంది. ఇదొక సృజనాత్మక ప్రక్రియ.
'నవీన విశేషాలు కలిగిన గద్య ప్రక్రియ నవల' అని మొట్టమొదట కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి 'నవల' ను నిర్వచించాడు. 'రచనా కాలం వచ్చిన వాస్తవాలను, ఆచారాలను చిత్రించేది నవల' అని బోదపాటి కుటుంబరావు 'ఆంధ్రనవల - పరిణామం' అన్న గ్రంథంలో పేర్కొన్నాడు.

       నవలకు ఉండాల్సిన ముఖ్య విషయాలు నాలుగున్నాయి.
1. కథ 2. కథావస్తువు 3. పాత్రలు 4. నేపథ్యం. నవలను గద్య కావ్యమని పులువురు పేర్కొన్నారు.
బ్రిటీషు వారి రాకతో మనదేశంలో ఆంగ్ల విద్యా ప్రభావంతో ఆంగ్ల నవలలను అనుకరిస్తూ కొంతమంది, అనువదిస్తూ మరికొంతమంది తెలుగు నవలలను రాశారు. అలా తెలుగు సాహిత్యంలో మొట్టమొదట రాయలసీమ నుండి 1872లో నరహరి గోపాలకృష్ణమశెట్టి 'రంగరాజ చరిత్ర' నవలను రాశాడు.నరహరి గోపాలకృష్ణమశెట్టి కర్నూలులో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తుండేవారు. 1872లో లార్డు మేయో బెంగాలు గెజిట్‌లో బెంగాల్‌ దేశస్తుల ఆచార వ్యవహారాలు తెలియజేసే నవల రాసిన వారికి బహుమానం ఇస్తామని ప్రకటించారు. దానిని ప్రేరణగా తీసుకుని నరహరి 'రంగరాజ చరిత్ర' ను రాశాడు. నవలకు ముందుమాటలో దీనిని 'నవల' (నావెల్‌) అని ఆయన పేర్కొన్నాడు.
       తెలుగు నవలపై పరిశోధన చేసిన వాళ్ళు ఏది మొదటి తెలుగు నవల అన్నదానిపై భిన్నా భిప్రాయాలు వ్యక్తం చేశారు. 'సమగ్ర ఆంధ్ర సాహిత్యం' రాసిన ఆరుద్ర, నరహరి గోపాలకృష్ణ రాసిన 'రంగరాజ చరిత్ర'నే మొదటి నవలగా పేర్కొన్నారు. దీనికి 'సోనాబాయి పరిణయం' అనే మరో పేరు కూడా ఉంది. 'ఆంధ్ర నవలా పరిచయం' రాసిన మొదటి నాగభూషణ శర్మ కూడా దీనిని మొదటి నవలగా పేర్కొన్నారు. ఈ నవలను 15వ శతాబ్దంలో జరిగిన కథను కథాంశంగా తీసుకుని రాశాడు. అందులో ఒక గిరిజన యువతిని రాజు చూసి ఆమెను ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. ఆ యువతి పుట్టుకరీత్యా గిరిజన యువతి కాదు. ఆ రాజు మేనత్త కూతురు తప్పిపోయి గిరిజనుల ఇళ్ళలో పెరిగి ఉంటుంది. ఇందులో సామాజిక అభ్యుదయం ఉన్నట్లుగా పలువురు భావించారు.
       కందుకూరి వీరేశలింగం రాసిన 'రాజశేఖర చరిత్ర' (1878) ను విమర్శిస్తూ కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి తొలిసారిగా 'నవల' అనే పదాన్ని వాడినారు. చాలామంది విమర్శకులు 'రాజశేఖర చరిత్ర' ను ప్రథమ నవలగా భావించారు. దీనికి 'వివేకచంద్రిక' అనే మరోపేరు ఉంది.అయితే ఆలివర్‌ గోల్డ్‌స్మిత్‌ రాసిన 'వికార్‌ ఆఫ్‌ ది వేక్‌ఫీల్డ్‌' అనే ఆంగ్ల నవలకు అనుసరణ అని స్వంత రచన కాదని పలువురు విమర్శించారు. అయితే ఇందులో తెలుగువారి జీవన విధానం పుష్కలంగా ఉందని, ఆధునిక సంస్కరణ భావాలున్నాయని వారు పేర్కొన్నారు. ఈ నవల తరువాత వచ్చిన నవలలకు పునాదులు వేసింది. ఏది ఏమైనా స్వతంత్ర రచనగా అభ్యుదయ భావాలతో ఉన్న 'రంగరాజ చరిత్ర' మొదటి నవలగా ప్రముఖ సాహితీ విమర్శకులు కొలకలూరి ఇనాక్‌ గారు పేర్కొన్నారు. దీనికి 'సోనాబాయి పరిణయం'అనే మరో పేరు కూడా ఉంది.
       'శ్రీ రంగరాజ చరిత్ర' పూర్తిగా స్వతంత్ర రచన. ఇతివృత్తం చారిత్రకంగా ఉన్నట్టు కనిపిస్తుంది గాని కథ పూర్తిగా కల్పితమని రచయిత స్వయంగా పేర్కొన్నాడు. సంఘంలో కట్టుబాట్లు, నమ్మకాలు పాత్రల కనుగుణంగా రచయిత వ్యక్తం చేశాడు.భూస్వామిక భావాలు పతనమవుతూ, ప్రజాస్వామిక భావాలు విస్తరిస్తున్న సందర్భంలో ఈ నవల వచ్చింది. తెలుగు నవలా రచనకు ఇదొక తొలిప్రయత్నంగా అక్కిరాజు రమాపతిరావు వర్ణించాడు. ఈ నవలను వీరేశలింగం చదివాడు. ఈ నవల ఆయన రాసిన 'రాజశేఖర చరిత్ర' పై ప్రభావం చూపింది అనటానికి నిదర్శనం ఆయన తన నవలకు 'రాజశేఖరచరిత్ర'  అని పేరు పెట్టడం, సమకాలీన ఆచారాలను, మూఢ విశ్వాసాలను విమర్శించడమని అక్కిరాజు రమాపతిరావు తన 'తెలుగు నవల' గ్రంథంలో పేర్కొన్నారు.
వీరేశలింగం రాసిన రాజశేఖర చరిత్ర ఆంగ్ల, తమిళ, కన్నడ భాషలలోకి అనువదింపబడింది. ఆంగ్లంలో దీనిని 'ఫార్చూన్‌ వీల్‌' (అదృష్ట చక్రం) గా అనువదించారు. 1887లో లండన్‌ టైమ్స్‌ పత్రిక ఈ నవలను గొప్ప నవలగా పేర్కొంది.  వీరేశలింగం ఈ నవల తరువాత మరో రెండు నవలలు రాశాడు. సత్యవతి వ్రతం ఆయన రాసిన సాంఘిక నవల. 'సత్యరాజా పూర్వదేశయాత్ర' అనే మరో నవలను కూడా రాశాడు. దీనిని జోనాథన్‌ స్విఫ్ట్ రాసిన 'గలివర్‌ ట్రావెల్స్‌' నవల ఆధారంగా రాశాడు.
         వీరేశలింగం తీర్చిదిద్దిన ఒరవడితోనే   తెలుగు నవలా వికాసం ప్రారంభమైంది. న్యాపతి సుబ్బారావు 'చింతామణి' అనే పత్రిక నడిపేవాడు. ఈ పత్రిక ఆధ్వర్యంలో నవలా పోటీలు నిర్వహించారు. న్యాయనిర్ణేతలుగా వీరేశలింగం, న్యాపతి సుబ్బారావు, ఆచంట సుందరరామయ్య గార్లు వ్యవహరించారు. ప్రథమ బహుమతిని ఖండవల్లి రామచంద్రుడు రాసిన 'ధర్మవతీ విలాసం' కు ఇచ్చారు. ద్వితీయ బహుమతిని తల్లాప్రగడ సూర్యనారాయణరావు రాసిన 'సంజీవ రాయచరిత్ర' కు ఇచ్చారు. తరువాత కాలంలో చిలకమర్తి లక్ష్మీనరసింహం నవలా రచయితగా ఆవిర్భవించాడు.
1800 నుండి 1929 వరకు అనేక బెంగాల్‌, ఇంగ్లీష్‌ నవలల అనువాదాలు చాలా వచ్చాయి. శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి 'వీరపూజ', 'విష భుజంగం' మొదలైన నవలలు రాశారు. చిలకమర్తి రాజారత్నం, గణపతి నవలలను వెలువరించాడు. రవీంద్రనాథ్‌ ఠాగూరు రాసిన 'గోరా' ను వెంకట పార్వతీశ్వర కవులు తెలుగులోకి అనువదించారు.
      జాతీయోద్యమ ప్రభావంతో 1921లో సత్యాగ్రహం ఉద్యమంలో పాల్గొని జైలుకి వెళ్ళిన ఉన్నవ లక్ష్మీనారాయణ జైలులోనే 'మాలపల్లి' నవల రచించారు. తెలుగు సాహిత్యంలో వచ్చిన నవలన్నింటిలో ఉత్కృష్టమైందిగా ప్రసిద్ధి పొందిన నవల ఇదే. ఈ నవలకు 'సంగమ విజయం' అనే మరోపేరు కూడా ఉంది. నవలలోని స్థలం గుంటూరు జిల్లాకు సంబంధించినది. ఇందులో సమకాలీన సమాజాన్ని, ప్రభుత్వ విధానాలను ఉన్నది ఉన్నట్లు వివరిస్తాడు. సమాజంలోని ఎగుడు దిగుళ్ళను సరిచేయాలన్న సందేశం ఇందులో వుంది. కాశీనాథుని నాగేశ్వరరావు దీనికి ముందుమాట రాశారు. ఆనాటి బ్రిటిషు ప్రభుత్వం ఈ నవలను నిషేధించింది కూడా (1946లో ....)

1920-47 మధ్య తెలుగు నవల కొత్త పోకడలు పోయింది. వ్యావహారిక భాషావాదం, జాతీయోద్యమం నవలను ప్రభావితం చేశాయి. భాషా విప్లవం తీసుకురావాలన్న గాఢమైన తపన ఈ రచయితలలో కనిపిస్తుంది. చలం, విశ్వనాథ, అడవి బాపిరాజు ఈ కోవలోకి వస్తారు. స్త్రీ స్వేచ్ఛ, స్వేచ్ఛా ప్రణయాలను  ప్రతిపాదించిన చలం మైదానం, సమాజం పటిష్టం కావాలంటే నీతి నియమాలు, కట్టుబాట్లుండే  పాత సంప్రదాయాలు రావాలని  భావించిన విశ్వనాథ వేయిపడగలు, బాపిరాజు నారాయణరావు నవలలు రచించారు.అడవి బాపిరాజు హిమబిందు, గోనగన్నారెడ్డి,అడవి శాంతిశ్రీ ఆంధ్రుల విజయాలను సాంస్కృతిక వైభవాన్ని చిత్రించాయి.

ఇదేకాలంలో   మొక్కపాటి నరసింహశాస్త్రి, మునిమాణిక్యం నరసింహారావు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి తెలుగు నవలా వికాసానికి తోడ్పడిన గొప్ప రచయితలు. మొక్కపాటి వారిహాస్య నవల బారిష్టరు పార్వతీశం(1925),  మునిమాణిక్యం "కాంతం" నవలలు ప్రసిద్ధి చెందాయి.  

1950 దశకం నుంచి పాత పద్ధతులను వదిలి పెట్టి ఆధునిక భావాలతో, అభ్యుదయ భావాలతో నవలలను  చలం, కొడవటిగంటి కుటుంబరావు, గోపిచంద్, బుచ్చిబాబు, వాసిరెడ్డి సీతాదేవి మొదలైన వాళ్ళు రాశారు.కథాకథన పద్ధతి దృష్ట్యా నవలల్ని ఐదు రకాలుగా విభజించారు. 1. రచయితే కథ చెప్పే పద్ధతి 2. రచయితే కాకుండా నవలలోని యేదైనా ఒక పాత్రచేత కథ చెప్పించే పద్ధతి,( ఉత్తమ పురుష పద్దతి)3. లేఖాపద్దతిలో నడిచే నవలలు
4. డైరీ రూపంలో నడిచే నవలలుచెప్పొచ్చు
5. చైతన్య స్రవంతి పద్ధతిలో నడిచే నవలలు 

      తెలుగు నవలపుట్టి 1972 నాటికి సరిగ్గా 100 సంవత్సరాలయింది. యీ వంద సంవత్సరాల్లో యించుమించు ఇరవై వేల నవలలు వెలువడ్డాయని ఒక అంచనా. ఈ వంద సంవత్సరాల కాలంలో తెలుగు నవల కేవలం రాశిలోనే కాకుండా గుణంలో కూడా అభివృద్ధిని సాధించిందన్నారు అంపశయ్య నవీన్.

 తెలుగు నవలా సాహిత్యంలో  కనిపించే  ముఖ్యమైన ధోరణిఏమిటంటే స్త్రీలు విరివిగా నవలలు వ్రాయటం. స్త్రీలే విరివిగా నవలల్ని చదవటం. స్వాతంత్య్రం తర్వాత దేశంలో విద్యావ్యాప్తి బాగా జరిగింది. మధ్య తరగతి కుటుంబాల్లో చాలా మంది  వుద్యోగాల్లోకి వచ్చారు.వీరు నవలలు చదవడం పెరగడంతో నవలలు చదివే స్త్రీల సంఖ్య బాగా పెరిగింది. 
అయితే మహిళా రచయిత్రులు చాలా వరకు సమస్యలజోలికి  పోకుండా ఫార్ములా నవలలే రాశారు. ఇవన్నీ కాలక్షేప నవలలు.
కొంతమంది మాత్రం సాంఘిక సమస్యలను ప్రతిబింబించే నవలలు రాశారు. రంగనాయకమ్మ రాసిన బలిపీఠం నవల, వాసిరెడ్డి సీతాదేవి రాసిన మట్టి మనుషులు, బీనాదేవి రాసిన హేండ్ మీ క్విక్ మొదలైనవి ఇలాంటి కోవలోకి వస్తాయి.
యన్ ఆర్ నంది రాసిన నైమిశారణ్యం,రావి శాస్త్రి రాజుమహిషి, దాశరథి రంగాచార్య చిల్లర దేవుళ్ళు, మోదుగుపూలు,నవీన్ అంపశయ్య,డా!! కేశవరెడ్డి అతడు అడవిని జయించాడు, చిలుకూరి దేవపుత్ర పంచమం,కల్యాణ రావు అంటరాని వసంతం అల్లం రాజయ్య రాసిన కొలిమంటుకొంటున్నది, స్వామి గద్దలాడతాండాయి,నామిని మునికన్నడి సేద్యం,ఎస్ వెంకట్రామిరెడ్డి కాడి, జొన్నవిత్తుల శ్రీరామ చంద్రమూర్తి వలసదేవర  మొదలైన నవలలు నవలా సాహిత్యంలో ప్రసిద్ధి పొందాయి.

        1984 నుండే ప్రారంభమైన టెలివిజన్ ప్రభావం ఇప్పుడు సమాజంలో ఒక బలమైన సాంస్కృతిక సాధనంగా మారిపోయింది.   టీ.వి.లు ప్రతి ఇంటికి విస్తరించడం వల్ల సినిమా హాలు కెళ్లి చూసే వాళ్ళు తగ్గినట్లు, నవలలు చదివే వారు కూడా తగ్గి పోయారు.
       ఫలితంగా 2000 తరువాత వచ్చిన నవలలు  గణనీయంగా తగ్గిపోయాయి.

పిళ్లా కుమారస్వామి 9490122229
 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు