నవలా సాహిత్యం
ఆధునిక సాహిత్యం మొదట నవలా సాహిత్యంతో ప్రారంభమైంది. ప్రపంచంలో వెయ్యేళ్ళ క్రితం రాసిన 'గెంజీ కథ' మొట్టమొదటి నవల. ఇది జపాన్ దేశపు ఇతిహాసం. ఆ తరువాత ఆంగ్ల సాహిత్యంలో మొట్టమొదట డేనియల్ డెఫో రాసిన 'రాబిన్సన్ క్రూసో' నవల 1719లో వచ్చింది. ఇది రాబిన్సన్ సాహసవంతమైన వీరోచిత జీవితాన్ని వర్ణిస్తుంది.
ఆంగ్లంలో 'నావల్' అనే పదం ఉంది. దీని ఆధారంగా తెలుగులో 'నవల' అనే పేరు వచ్చింది. నవల జీవిత వాస్తవికతను, జీవితంలో ఉన్న వైవిధ్యాన్ని, సంక్లిష్టతను, వైరుధ్యాలను చిత్రిస్తుంది. ఇదొక సృజనాత్మక ప్రక్రియ.
'నవీన విశేషాలు కలిగిన గద్య ప్రక్రియ నవల' అని మొట్టమొదట కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి 'నవల' ను నిర్వచించాడు. 'రచనా కాలం వచ్చిన వాస్తవాలను, ఆచారాలను చిత్రించేది నవల' అని బోదపాటి కుటుంబరావు 'ఆంధ్రనవల - పరిణామం' అన్న గ్రంథంలో పేర్కొన్నాడు.
బ్రిటీషు వారి రాకతో మనదేశంలో ఆంగ్ల విద్యా ప్రభావంతో ఆంగ్ల నవలలను అనుకరిస్తూ కొంతమంది, అనువదిస్తూ మరికొంతమంది తెలుగు నవలలను రాశారు. అలా తెలుగు సాహిత్యంలో మొట్టమొదట రాయలసీమ నుండి 1872లో నరహరి గోపాలకృష్ణమశెట్టి 'రంగరాజ చరిత్ర' నవలను రాశాడు.నరహరి గోపాలకృష్ణమశెట్టి కర్నూలులో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తుండేవారు. 1872లో లార్డు మేయో బెంగాలు గెజిట్లో బెంగాల్ దేశస్తుల ఆచార వ్యవహారాలు తెలియజేసే నవల రాసిన వారికి బహుమానం ఇస్తామని ప్రకటించారు. దానిని ప్రేరణగా తీసుకుని నరహరి 'రంగరాజ చరిత్ర' ను రాశాడు. నవలకు ముందుమాటలో దీనిని 'నవల' (నావెల్) అని ఆయన పేర్కొన్నాడు.
తెలుగు నవలపై పరిశోధన చేసిన వాళ్ళు ఏది మొదటి తెలుగు నవల అన్నదానిపై భిన్నా భిప్రాయాలు వ్యక్తం చేశారు. 'సమగ్ర ఆంధ్ర సాహిత్యం' రాసిన ఆరుద్ర, నరహరి గోపాలకృష్ణ రాసిన 'రంగరాజ చరిత్ర'నే మొదటి నవలగా పేర్కొన్నారు. దీనికి 'సోనాబాయి పరిణయం' అనే మరో పేరు కూడా ఉంది. 'ఆంధ్ర నవలా పరిచయం' రాసిన మొదటి నాగభూషణ శర్మ కూడా దీనిని మొదటి నవలగా పేర్కొన్నారు. ఈ నవలను 15వ శతాబ్దంలో జరిగిన కథను కథాంశంగా తీసుకుని రాశాడు. అందులో ఒక గిరిజన యువతిని రాజు చూసి ఆమెను ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. ఆ యువతి పుట్టుకరీత్యా గిరిజన యువతి కాదు. ఆ రాజు మేనత్త కూతురు తప్పిపోయి గిరిజనుల ఇళ్ళలో పెరిగి ఉంటుంది. ఇందులో సామాజిక అభ్యుదయం ఉన్నట్లుగా పలువురు భావించారు.
కందుకూరి వీరేశలింగం రాసిన 'రాజశేఖర చరిత్ర' (1878) ను విమర్శిస్తూ కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి తొలిసారిగా 'నవల' అనే పదాన్ని వాడినారు. చాలామంది విమర్శకులు 'రాజశేఖర చరిత్ర' ను ప్రథమ నవలగా భావించారు. దీనికి 'వివేకచంద్రిక' అనే మరోపేరు ఉంది.అయితే ఆలివర్ గోల్డ్స్మిత్ రాసిన 'వికార్ ఆఫ్ ది వేక్ఫీల్డ్' అనే ఆంగ్ల నవలకు అనుసరణ అని స్వంత రచన కాదని పలువురు విమర్శించారు. అయితే ఇందులో తెలుగువారి జీవన విధానం పుష్కలంగా ఉందని, ఆధునిక సంస్కరణ భావాలున్నాయని వారు పేర్కొన్నారు. ఈ నవల తరువాత వచ్చిన నవలలకు పునాదులు వేసింది. ఏది ఏమైనా స్వతంత్ర రచనగా అభ్యుదయ భావాలతో ఉన్న 'రంగరాజ చరిత్ర' మొదటి నవలగా ప్రముఖ సాహితీ విమర్శకులు కొలకలూరి ఇనాక్ గారు పేర్కొన్నారు. దీనికి 'సోనాబాయి పరిణయం'అనే మరో పేరు కూడా ఉంది.
వీరేశలింగం తీర్చిదిద్దిన ఒరవడితోనే తెలుగు నవలా వికాసం ప్రారంభమైంది. న్యాపతి సుబ్బారావు 'చింతామణి' అనే పత్రిక నడిపేవాడు. ఈ పత్రిక ఆధ్వర్యంలో నవలా పోటీలు నిర్వహించారు. న్యాయనిర్ణేతలుగా వీరేశలింగం, న్యాపతి సుబ్బారావు, ఆచంట సుందరరామయ్య గార్లు వ్యవహరించారు. ప్రథమ బహుమతిని ఖండవల్లి రామచంద్రుడు రాసిన 'ధర్మవతీ విలాసం' కు ఇచ్చారు. ద్వితీయ బహుమతిని తల్లాప్రగడ సూర్యనారాయణరావు రాసిన 'సంజీవ రాయచరిత్ర' కు ఇచ్చారు. తరువాత కాలంలో చిలకమర్తి లక్ష్మీనరసింహం నవలా రచయితగా ఆవిర్భవించాడు.
1800 నుండి 1929 వరకు అనేక బెంగాల్, ఇంగ్లీష్ నవలల అనువాదాలు చాలా వచ్చాయి. శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి 'వీరపూజ', 'విష భుజంగం' మొదలైన నవలలు రాశారు. చిలకమర్తి రాజారత్నం, గణపతి నవలలను వెలువరించాడు. రవీంద్రనాథ్ ఠాగూరు రాసిన 'గోరా' ను వెంకట పార్వతీశ్వర కవులు తెలుగులోకి అనువదించారు.
జాతీయోద్యమ ప్రభావంతో 1921లో సత్యాగ్రహం ఉద్యమంలో పాల్గొని జైలుకి వెళ్ళిన ఉన్నవ లక్ష్మీనారాయణ జైలులోనే 'మాలపల్లి' నవల రచించారు. తెలుగు సాహిత్యంలో వచ్చిన నవలన్నింటిలో ఉత్కృష్టమైందిగా ప్రసిద్ధి పొందిన నవల ఇదే. ఈ నవలకు 'సంగమ విజయం' అనే మరోపేరు కూడా ఉంది. నవలలోని స్థలం గుంటూరు జిల్లాకు సంబంధించినది. ఇందులో సమకాలీన సమాజాన్ని, ప్రభుత్వ విధానాలను ఉన్నది ఉన్నట్లు వివరిస్తాడు. సమాజంలోని ఎగుడు దిగుళ్ళను సరిచేయాలన్న సందేశం ఇందులో వుంది. కాశీనాథుని నాగేశ్వరరావు దీనికి ముందుమాట రాశారు. ఆనాటి బ్రిటిషు ప్రభుత్వం ఈ నవలను నిషేధించింది కూడా (1946లో ....)
1920-47 మధ్య తెలుగు నవల కొత్త పోకడలు పోయింది. వ్యావహారిక భాషావాదం, జాతీయోద్యమం నవలను ప్రభావితం చేశాయి. భాషా విప్లవం తీసుకురావాలన్న గాఢమైన తపన ఈ రచయితలలో కనిపిస్తుంది. చలం, విశ్వనాథ, అడవి బాపిరాజు ఈ కోవలోకి వస్తారు. స్త్రీ స్వేచ్ఛ, స్వేచ్ఛా ప్రణయాలను ప్రతిపాదించిన చలం మైదానం, సమాజం పటిష్టం కావాలంటే నీతి నియమాలు, కట్టుబాట్లుండే పాత సంప్రదాయాలు రావాలని భావించిన విశ్వనాథ వేయిపడగలు, బాపిరాజు నారాయణరావు నవలలు రచించారు.అడవి బాపిరాజు హిమబిందు, గోనగన్నారెడ్డి,అడవి శాంతిశ్రీ ఆంధ్రుల విజయాలను సాంస్కృతిక వైభవాన్ని చిత్రించాయి.
ఇదేకాలంలో మొక్కపాటి నరసింహశాస్త్రి, మునిమాణిక్యం నరసింహారావు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి తెలుగు నవలా వికాసానికి తోడ్పడిన గొప్ప రచయితలు. మొక్కపాటి వారిహాస్య నవల బారిష్టరు పార్వతీశం(1925), మునిమాణిక్యం "కాంతం" నవలలు ప్రసిద్ధి చెందాయి.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి