జాతీయోద్యమం లో స్త్రీల భాగస్వామ్యం
స్వాతంత్రోద్యమం_ సంస్కరణ ఉద్యమాలు _ స్త్రీల భాగస్వామ్యం
సమాజంలో లో స్త్రీలు సగభాగం అయినప్పటికీ స్వాతంత్రోద్యమంలో మహిళల పాత్ర తక్కువగా ఉండేది.
మహిళలను భాగస్వామ్యం చేయకుండా స్వాతంత్రం సాధించలేమని నాయకులు గుర్తించారు. సమాజంలో ఉన్న దురాచారాలు కట్టుబాట్లే నని దీనికి ఆటంకంగా ఉన్నాయని
అర్థం చేసుకున్న నాయకులు సమాజంలో సంస్కరణలకు కట్టారు. ఆర్య సమాజం ,బ్రహ్మ సమాజం మొదలైన సామాజిక సంస్థలు హిందూ ముస్లిం మతాలలో వున్న మూఢాచారాలను ,కట్టుబాట్లను ఎదిరించాలని అనేక సామాజిక ఉద్యమాలు చేపట్టాయి.హరిజనుల పట్ల వున్న అంటరానితనాన్ని పోగొట్టాలని ప్రచారం చేశారు. స్త్రీ పురుషులు సమానం అన్నారు. దయానంద ఈశ్వరచంద్ర విద్యాసాగర్ రామకృష్ణ పరమహంస వివేకానంద రాజారామమోహన్ రాయ్ కందుకూరి రఘుపతి వెంకటరత్నం గురజాడ వంటి సంస్కర్తలు స్త్రీ విద్య, బాల్యవివాహాల నిషేధం, సతీసహగమనం, స్త్రీల పునర్వివాహం ,కన్యాశుల్కం రద్దు, వరకట్న నిషేధం వంటి దురాచారాలపై ఉద్యమాన్ని నిర్మించారు .ఈ విషయంలో ఆంగ్లేయుల విద్యా విధానం కూడా తోడ్పడింది.ఈ ఉద్యమాల మూలంగా స్వాతంత్ర్యోద్యమంలో కి చాలామంది యువతీయువకులు అడుగు పెట్టారు. జాతీయ నాయకుల ప్రోత్సాహంతో చాలామంది స్త్రీలు నాయకత్వంలోకి వచ్చారు. అనిబిసెంట్ ,సరోజినీ నాయుడు వంటి మహిళలు కాంగ్రెస్ నాయకులుగా ఎదిగారు. కమ్యూనిస్టు ఉద్యమంలో కూడా చాలా మంది స్త్రీలు ముందుకొచ్చారు.
అరుణా అసఫ్ అలీ, కల్పనా రాయ్, కెప్టెన్ లక్ష్మీ సెహగల్ మొదలైనవారు కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ , మల్లు స్వరాజ్యం లాంటి మహిళలు తుపాకులు వడిసెలు చేతబట్టి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారు.
స్వాతంత్య్ర సంగ్రామంలో ముస్లిం స్త్రీలు చురుకైన భాగస్వామ్యం వహించారు.మునీరా మజ్రుల్ హఖ్, అమీనాతయ్యబ్జీ, మజీదా హసీనా బేగం మొదలైనవారు జాతీయోద్యమంలో ప్రత్యక్షంగా భాగస్వాములు. కాగా రజియాఖాతూన్ మొదలైనవారు పరోక్షంగా ఉద్యమానికి తోడ్పడ్డారు.అక్బరీ బేగం, అమినా తయ్యాబ్జీ, షంషున్నిసా అన్సారీ, సుఫయాసోం, అంజాదీ బేగం మొదలైనవారు ఉద్యమ నాయకత్వస్థానంలో వుండి ఉద్యమాన్నిసమర్దవంతంగా నిర్వహించారు. కాగా కార్యకర్తలుగా కూడ ముస్లిం స్రీలు పోరాటాలలో ముందుండి లాఠీ దెబ్బలు తిని, అరెస్టయి, జైలుశిక్షలను అనుభవించినారు. స్త్రీలను సమీకరించడంలో కీలక పాత్రను పోషించారు. బ్రిీటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా బ్రెజిల్లో జరిగిన అంతర్జాతీయ సమావేశానికి 'హజరా ఆపా' భారత దేశ ప్రతినిధిగా హజరయ్యారు. అక్బరీ బేగం, మహాబూబ్ ఫాతిమా, అంజాది బేగం, సుగరా ఖాతూన్, సాదాత్ బానో కిచ్లూ తదితరులు ఉత్తేజపూరిత ప్రసంగాలతో ప్రజలను ఉద్యమోన్ముఖులను చేయటంలో కృతకృత్యులయ్యారని సయ్యద్ నశీర్ అహమ్మద్ తన భారత స్వాతంత్య్రోద్యమం- ముస్లిం మహిళలు గ్రంథంలో పేర్కొన్నారు.
స్వాతంత్రం సాధించాక మన దేశ నాయకుల ఆధ్వర్యంలో పార్లమెంటును రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశారు . పార్లమెంటుకు ఎక్కువ భాగం భూస్వాములు పెట్టుబడిదారులు ఎన్నికయ్యారు .వారు తీసుకున్న విధానాల ఫలితంగా స్త్రీలకు అట్టడుగు వర్గాలకు న్యాయం జరగలేదు. అసమానతలు పెరిగాయి. కొద్దిమంది కోటీశ్వరుల చేతుల్లోకి కోట్లాదిఆస్తులు భూస్వాముల చేతుల్లోకి వేల ఎకరాలభూములు వచ్చాయి. అందరికీ అవసరమైన విద్య, వైద్యం , తిండి, వసతి చాలామందికి అందని మావిపండుగా మారాయి. మహిళలకు వైద్య సదుపాయాలు అందక ప్రసూతి మరణాలు బాగా పెరిగాయి. చాలామంది మహిళలకు చదువు దూరమైంది. చదువుకున్న స్త్రీలకు ఉపాధి కరువైంది. మగవాడికి ఇచ్చే కూలి కన్నా స్త్రీలకు ఇచ్చేది తక్కువ. తరతరాల నుంచి వస్తున్న పురుషాధిక్యత కొనసాగుతోంది. వరకట్న సమస్య తో అమ్మాయి అభిరుచులకు కోరికలకు ఆస్కారం లేకుండా పోయింది. చాలామంది మహిళలు వరకట్న సమస్య కు బలవుతున్నారు. చాలా మంది ముస్లిం స్త్రీలు భర్తల ద్వారా దగా పడుతున్నారు. ఆడపిల్ల పుడితే శాపం,మగ బిడ్డ పుడితే వరం అనే విధంగా తయారయింది . పున్నామ నరకం నుండి తమను కొడుకు రక్షిస్తాడనే అనే మూఢనమ్మకం ఇంకా సమాజంలో ఉంది. అందుకే అబ్బాయి పుట్టాలని ఇంకా కోరుకుంటున్నారు. హరిజన గిరిజన మహిళలను పూచికపుల్లతో సమానంగా చూస్తున్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి