సాహిత్యంలో మార్క్సిస్టు ఆలోచనావిధానం
ప్రకృతి నిరంతరం మారుతూ ఉంటుంది. ప్రకృతిలో ప్రతి పదార్థంలోనూ చలనం ఉంటుంది. అది మార్పు చెందుతూ ఉంటుంది. అలాగే ప్రకృతిలో ఏది స్వతంత్రంగా ఉండలేదు. అది ఇంకొక దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రకృతిలో ప్రతిదీ పరస్పర ఆధారితం. పైగా రెండు వస్తువుల మధ్య ఆకర్షణ వికర్షణ సమానబలాలతో ఉంటుంది. దీనినే వైరుధ్యాలు అన్నారు. అలాగే పాతవి నశిస్తూ కొత్తవి వస్తుంటాయి.ఇవన్నీ ప్రకృతి సూత్రాలు.
ప్రకృతి లోని పదార్థంలో మార్పు జరుగుతూ ఉంటుంది.దాన్ని పరిశీలించడానికి తోడ్పడే వాటి ని చలనసూత్రాలు అంటారు.
ప్రతి పదార్థానికి స్థలం, కాలం ముఖ్యమైనవి. ఒక విషయాన్ని చెప్పడానికి దాని కాలాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి చెప్పాలి .దాన్ని అర్థం చేసుకోవాలన్నా దాని స్థల కాలాదుల్లోనే అర్థం చేసుకోవాలి. అంటే చారిత్రక సందర్భంలో దాన్ని చెప్పాలని అర్థం.
ఇంతవరకు చర్చించిన విషయాలను చలన సూత్రాలను సమాజానికి వర్తింప చేస్తే దాన్ని మార్క్సిజం అన్నారు. ఇదే విధమైన పరిశీలనను తెలుగు సాహిత్యం పై చేస్తే అది మార్క్సిస్టు ధోరణి అవుతుంది.ఈ ఆలోచనా విధానాన్ని క్రిస్టఫర్ కాడ్వెల్, జార్జి థాంప్సన్, జార్జ్ లూకాస్, ఎర్నెస్ట్ ఫిషర్ ,రేమండ్ విలియమ్స్ మొదలైన వాళ్లు అభివృద్ధి చేశారు. తెలుగు సాహిత్యంలో మార్క్సిస్ట్ దృక్పధాన్ని ప్రవేశపెట్టిన వారిలో రా రా ,మద్దుకూరి చంద్రశేఖరరావు ,కొ.కొ., శ్రీ శ్రీ., కె.వి రమణ రెడ్డి ,త్రిపురనేని మధుసూదనరావు ,చేకూరి రామారావు, రాచపాళెం, కాత్యాయని విద్మహే, తెలకపల్లి రవి, రంగనాయకమ్మ మొదలైనవారు ప్రసిద్ధులు.
సాహిత్యం సమాజానికి దర్పణం వంటిది. సాహిత్యం ఒక సామాజిక ఉత్పత్తి. సమాజం లేందే సాహిత్యం లేదు .సాహిత్యానికి స్వతంత్రంగా ఉండే లక్షణం లేదు. సమాజంలో అది ఒక భాగం .
సమాజంలో పీడిత వర్గం, పీడించే వర్గం ఉన్నాయి.
వారి మధ్య ఘర్షణ , ఐక్యత ఉంటుంది. ఈ సమాజం నుంచి వచ్చిన సాహిత్యకారుడు కూడా అనివార్యంగా ఏదో ఒకవర్గం వైపు మొగ్గు చూపుతాడు.అందువల్ల సాహిత్యకారులకు ఉన్న వర్గ దృక్పథం బట్టే సాహిత్యం పుడుతుంది.
సమాజానికి ఆర్థికం పునాది వంటిది. సమాజంలో మానవుని అవసరాల రీత్యా సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా ఉంటాయి. దీని అభివృద్ధిని బట్టే సాహిత్యం కళలు ,ఉత్పత్తి అవుతాయి. సమాజంలో ఉన్న రెండు వర్గాల మధ్య ఉన్న వైరుధ్యాలు సాహిత్యాన్ని ప్రభావితం చేస్తుంటాయి. మనదేశంలో కులాల మధ్య ఉన్న వైరుధ్యాలు, మతాల మధ్య వైరుధ్యాలు, దోపిడీ వర్గం పీడితవర్గం మధ్యనున్న వైరుధ్యాలు సాహిత్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి..
సాహిత్యకారుడు తన రచన కోసం, తనకున్న కుల దృక్పథంతోనూ, వర్గ దృక్పథంతో నో,మత దృక్పథంతోనో,ఆరోజుల్లో సమాజంలో నెలకొన్న ఆర్థిక రాజకీయ సామాజిక పరిస్థితులను బట్టి , ఒక వస్తువును స్వీకరిస్తాడు. తనకున్న ప్రత్యేకమైన శైలితో ఆ రచనను పూర్తి చేస్తాడు. ఆ రచనను అధ్యయనం చేసేటప్పుడు పైన చెప్పిన విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని అధ్యయనం చేయడాన్ని మార్క్సిస్టు దృక్పథం అంటారు.
మహాభారతాన్ని పరిశీలించినప్పుడు వ్యాసుడు అందులో బ్రాహ్మణ క్షత్రియ వర్గాలను సమర్థించడం మనం చూస్తాం.ఇది రచయిత ఎవరి వైపున్నాడో తెలియజేస్తుంది.
రాజరాజ నరేంద్రుడు మహాభారతాన్ని, వేమారెడ్డి హరివంశాన్ని,మామిడి సింగన్న శృంగార నైషధాన్ని ,రాయలు మనుచరిత్రను కవులతో రాయించడం వెనుక వారి వర్గ ప్రయోజనాలు ఉన్నాయి.అందువల్లనే ఆయా రచనలు వచ్చాయి.
పీడితవర్గం వైపు నిలబడిన చెరబండరాజు ప్రపంచ పురోగతి మొత్తం శ్రమజీవి నెత్తుటి బొట్టులో ఇమిడి ఉందని చెబితే, మహాకవి శ్రీశ్రీ తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరని ప్రశ్నిస్తాడు.వీరిద్దరూ శ్రామిక వర్గం వైపు నిలబడిన రచయితలు.
ఇలా సాహిత్యకారుడు ఏదో ఒక వర్గం ఉండాలంటే అతనికి సామాజికచైతన్యం ఉండాలి.సమాజిక జీవితం ఉండాలి. మానవ చైతన్యం భౌతిక ప్రపంచాన్ని ప్రతిబింబించడమే కాదు దానిని సృష్టిస్తుంది కూడా అని లెనిన్ అన్నాడు. అంటే రచయిత తన సమాజాన్ని అధ్యయనం చేసి సరికొత్త సమాజ ఆవిష్కరణ కోసం తన కల్పనతో రచనలను చేస్తాడు.
సమాజంలోని వైరుధ్యాలను గుర్తించడానికి మార్క్సిస్టు ఆలోచనా విధానం దోహదపడుతుంది. రచయిత చైతన్యం అతను తీసుకున్న వస్తువును బట్టి తెలిసిపోతుంది ఆ రచయితకున్న అవగాహన నుకూడా తెలియజేస్తుంది.
రచయితకు చైతన్యం ఎలా వస్తుంది అన్న ప్రశ్నకు సమాధానంగా రచయిత ప్రాపంచి దృక్పథం,అతను నమ్మిన విలువలు, అతని నిబద్ధత ఇవన్నీ అతని చైతన్యాన్ని పెంపొందిస్తాయని రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి చెపుతారు. చైతన్యాన్ని బయట నుంచి అందించాలని లెనిన్ చెప్పినారు. రచయితకు కూడా సామాజిక సంబంధాలను గురించి,అందులోని వైరుధ్యాల గురించి పరిష్కారాల గురించి ఎవరో ఒకరు చెప్పాల్సి ఉంటుంది. ఇందుకు రచయిత స్వానుభవం కొంత తోడ్పడుతుంది. అంతేగాక గురజాడ, జాషువా, శ్రీశ్రీ, రంగనాయకమ్మ మొదలైన వారి రచనలు కూడా రచయిత సమాజాన్ని అర్థం చేసుకోవడానికి కావలసినంత చైతన్యాన్ని అందిస్తాయి.
రచయిత సామాజిక చైతన్యం పెంపొందించుకునే క్రమంలో అభివృద్ధికరమైన ఆలోచనలు చేస్తాడు .వాటిని సమాజ పురోగతి కోసం ప్రజా ప్రయోజనాల కోసం తన రచనలో వ్యక్తీకరిస్తాడు. ఈ వ్యక్తీకరణ కళాత్మకంగా ఉండాలి. సామాజిక వాస్తవికతను చెప్పడమేగాక భవిష్యత్ పరిణామాన్ని గుర్తించగలిగే శక్తి మార్క్సిస్టు దృక్పథం తోనే సాధ్యం అవుతుంది దీనినే సామ్యవాద వాస్తవికత అని కూడా అంటారు.
రచయిత తన రచనలో నవ్యత,గాఢత,క్లుప్తత తీసుకురావాలని తెలకపల్లి రవి చెపుతారు. పూర్వం చెప్పని విషయాలను ఆధునిక భావాలను రచనలో ప్రవేశపెట్టాలన్నారు.
పాఠకుని హృదయాన్ని కదిలించి, మనసును స్పందించిన జేసి భావప్రక్షాళన చేసేదే ఉత్తమ రచనగా అరిస్టాటిల్ పేర్కొన్నారు. దీన్నే శిల్పం అని కూడా అంటారు. కళాత్మక రచన అని కూడా అంటారు. రచయిత తన రచనకు తీసుకునే వస్తువును తన చుట్టూ ఉన్న సామాజిక పరిస్థితులే నిర్ణయిస్తాయి.
రచయిత శిల్పం కోసం తపన చెందినప్పుడు వస్తువుని పక్కన పెట్టేస్తాడు. దాంతో రూపం ముందుకొస్తుంది. రూపమంటే అది పద్యమో,గద్యమో, వ్యాసమో,కథో,కవితో కావచ్చు. వస్తువు,రూపం లో రూపం ప్రధానమనే భ్రాంతి లో పడి పోతాడు రచయిత. పద్యంలో చెప్తేనే బాగుంటుందని ,వచనం సరైంది కాదని , నానీలు మంచివని ఇలా రూపాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు. రచనలో సామాజిక స్వభావం లేనప్పుడు రూప వాదం మొదలవుతుందని ఫ్లెఖనోవ్ అంటారు.
జీవిత సంక్షోభాలను గుర్తించి పరిశీలించి పరిష్కారం సూచించి మనిషిని మరింత చైతన్యవంతుల్ని చేసేదే గొప్ప సాహిత్యం అవుతుందంటారు పాపినేని శివశంకర్.
సాహిత్యం మనిషిని సంస్కారవంతుని చేస్తుందని గురజాడ అన్నారు.సాహిత్యం చేసే పని భావ ప్రచారమేనని అమెరికా రచయిత ఆప్టన్ సింక్లెయిర్ అంటారు. సాహిత్యం ఒకవైపు భావ ప్రచారం చేస్తూనే మానవ సంస్కారం లోనూ ,ఆలోచనా ప్రవాహంలోనూ మార్పు తీసుకువస్తుందని బాలగోపాల్ అన్నారు. ఇది ఒక రకంగా బయటనుంచి చైతన్యం అందించే ఒక విధానం.
సాహిత్యకారులు చాలామంది మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్లే. మధ్యతరగతి బుద్ధిజీవులలో ఎక్కువ భాగం ద్వంద్వ స్వభావం ఉంటుంది . దీని వల్ల వారిలో మానసిక సంఘర్షణ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది . ఈ సంఘర్షణలో ఏది పైచేయి సాధిస్తే అటు వైపు మొగ్గు చూపుతారు మధ్యతరగతి బుద్ధిజీవులు. ఇలాంటి సంక్లిష్ట సామాజిక జీవితం నుంచి వచ్చిన కవులు రచయితలు తమ రచనలకు సమాజం నుంచి వస్తువులను తీసుకుంటూ ఉంటారు. ప్రస్తుత ప్రపంచీకరణ ప్రపంచంలో సామాజిక జీవితం సంక్షోభంలో ఉంది దీనికి సరైన పరిష్కారాన్ని గుర్తించి అందించాల్సిన బాధ్యత సాహిత్య కారులదే. నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ ఉన్న ఈ సమాజంలో అసమానతలు,పేదరికం, మూఢనమ్మకాలు, దోపిడీ, అజ్ఞానం కొన్ని వర్గాలు నిరంతరం వాటినే ప్రచారం చేస్తున్నారు. వాటిని పోగొట్టడానికి, రూపుమాపడానికి సాహిత్యకారులకు మార్క్సిస్టు ఆలోచనా విధానమే సరైన సాధనం.
__ కుమారస్వామి,9490122229
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి