సాంస్కృతిక రంగంలో వర్గపోరాటం
*సాంస్కృతిక రంగంలో వర్గపోరాటం*
కళలు, భాష, సాహిత్యం, క్రీడలు, సంగీతం- ఇవన్నీ దైవసృష్టని చెపుతుంది బూర్జువా వర్గం. ఉదా: సాహిత్యం సరస్వతీదేవి వల్ల, నాట్యం ఈశ్వరుని వల్ల, సంగీతం - నారదుని వల్ల వచ్చిందని చెపుతారు. కాళిదాసుకి కవిత్వం చెప్పే శక్తి కాళికాదేవి దయవల్ల వచ్చింది. ఇలా...
కళలు, భాష, సాహిత్యం. క్రీడలు, సంగీతం ఇవన్నీ ప్రజలు తమ జీవనం కోసం ఉత్పత్తి చేసే క్రమం నుండే పుట్టాయి.ఈ ఉత్పత్తి సామాజికంగా జరిగేది. మానవులు ఒకరితో ఒకరు సహకరించుకుంటేనే ఉత్పత్తి జరిగేది. అందుకు ఒకరిభావాలు ఒకరికి వ్యక్తం కావడం అవసరం. అందుకుగాను మొదట్లో సంజ్ఞలద్వారా తెలియజేసుకొనేవారు. ఇదే క్రమంగా అభినయంగా మారింది. గొంతుతో రకరకాల శబ్దాలు చేసేవారు. ఇదే క్రమంగా మాట్లాడేభాష అయింది.పాట పుట్టింది. శ్రమ నుంచే భాష,అభినయం, నృత్యం,పాట పుట్టాయి.
బొమ్మలు గీసి వాటిద్వారా భావాలు తెలియజేసేవారు. కాలక్రమేణా దానినుండే లిపి వచ్చింది. చిత్రలేఖనం వచ్చింది.
శ్రమలో కష్టాన్ని మర్చిపోవడం కోసం జానపదగేయాలు వచ్చాయి.
యుద్ధాలు చేసేటప్పుడు, వేటాడేటప్పుడు అవసరమైన నైపుణ్యాన్ని సాధించడం కోసం, తమ నైపుణ్యాన్ని ఇతరులకు నేర్పేందుకోసం వీరంగాలు, నృత్యాలు, యుద్ధక్రీడలు వచ్చియి.
కాలక్రమేణా ఇవి ఉత్పత్తితో నేరుగా సంబంధంలేకుండా మనిషికి ఆనందాన్ని కలిగించేందుకు క్రీడలుగా, నృత్యాలుగా పరిణితి చెందాయి.అందువల్ల మానవుల శ్రమే సంస్కృతికి మూలం తప్ప, కళ పుట్టింది, పెరిగింది. కొద్దిమంది దేవుళ్లవల్లాగాదు, కేవలం కళాకారుల గొప్పతనం వల్లా కాదు.
ఎంత గొప్ప వీణా విద్వాంసుడైనా సరైన వీణను తయారుచేసి ఇవ్వకపోతే వీణవాయించలేడు. శిల్పి పదునైన ఉలి లేకుండా సుత్తిలేకుండా శిల్పాలు చెక్కలేడు. గ్రంథాలు అచ్చువేసే యంత్రం లేకుండా గొప్ప రచయిత కాలేరు. అచ్చువేసే యంత్రం రాకపూర్వం కాలంలో కూడా ప్రజానీకంలోకి ప్రజలద్వారా ప్రాచుర్యం పొందకుండా ఎవరూ గొప్ప కవికాలేదు. అందువల్ల శ్రామికప్రజలే సంస్కృతి సృష్టికర్తలు. వారే దానిని అభివృద్ధి చేయడంలో కూడా పాత్ర నిర్వహించారు. కళాకారుల వ్యక్తిగత పాత్ర దానిని మెరుగులు దిద్దడంలో వుంది.
అందువల్లే కొన్ని రకాల కళలు, సాహిత్యం ప్రజలతో నిమిత్తం లేకుండా గతంలో రాజుల అంతఃపురాలలోను, నేడు పెట్టుబడిదారుల భవంతులలోను వుండి పోతున్నాయి. సామాన్యప్రజలతో సంబంధంలేని ఈ కళలు అంతరించిపోక తప్పదు. అదేసమయంలో శ్రామిక ప్రజలకు అందుబాటులో వుంటున్న కళలు, వారికోసమే ప్రదర్శించబడుతున్న కళలు ఇంకా సజీవంగా నిలిచివున్నాయి. పాలకవర్గాల ప్రోత్సాహం లేకున్నా అవి నిలిచివున్నాయి. ఉదా : జానపదగేయాలు, నృత్యాలు, బుర్రకథ, ఒగ్గుకథ, కోలాటం మొదలైనవి. నిజమైన కళ అంటే ప్రజాకళేనని అర్ధం చేసుకోవాలి. ఎందుకంటే వారే దానిని సృష్టించేదీ, పోషించేదీ. అందుకే కళ కళకోసం కాదు, కళ ప్రజలకోసం అని అంటాం మనం. కాని బూర్జువా వర్గం కళకళకోసమే అంటుంది. కళను కూడా వ్యాపారంగా మార్చివేస్తుంది. ఎందుకు?
కళారంగం ప్రజలకు వినోదాన్ని, ఉల్లాసాన్ని కలిగించడం మాత్రమేకాదు. ప్రజల మనుసులకు హత్తుకునేలా విషయాలు చెప్పగలశక్తి కళకు ఉంది. కళద్వారా ప్రజల చైతన్యాన్ని ప్రభావితం చేయవచ్చు.
ఉదా : గోర్కి, చెహోవ్, శ్రీశ్రీ సాహిత్యం, కన్యాశుల్కం, మాభూమి నాటకాలు, చార్లీచాప్లిన్ సినిమాలు. పాల్ రాబ్సన్ సంగీతం, పికాసోచిత్రాలు, కార్టూన్
శ్రామిక ప్రజల చైతన్యాన్ని కళారూపాలద్వారా విప్లవమార్గంవైపు పెంపొందించ వచ్చు. ఈ కళారూపాలే ప్రజల్ని ఆలోచింపచేయగలవు. కనుక బూర్జువా వర్గం కళారంగాన్ని కూడా తన వర్గ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభావితం చేస్తుంది. దోపిడీని సమర్థించే కళారూపాలు సృష్టిస్తుంది. వ్యక్తి ప్రాధాన్యతను, సమాజంతో, వాస్తవికతతో సంబంధంలేని కళారూపాలను సృష్టిస్తుంది. తప్పుడు సిద్ధాంతాల్ని ప్రబోధిస్తుంది. దిగజారుడు ఆలోచనలను,కుళ్లు సంస్కృతిని ప్రచారం చేస్తుంది.
ఉదా : క్షుద్రసాహిత్యం, బూతు సినిమాలు, హింసను ప్రేరేపించే సినిమాలు, వ్యక్తిగత హీరోయిజమ్, పేద యువతిని ధనిక యువకుడు ప్రేమించినట్టు చూపే కథలు, సినిమాలు, మొదలైనవి.
అలాగే శరీర దారుఢ్యాన్ని పెంచే క్రీడల స్థానే జూదాన్ని ప్రోత్సహిస్తాయి. పేకాట, రేసులు, స్కిల్ గేమ్స్, అమ్యూజ్మెంట్ పార్కుల వంటివి.
ఈ రకంగా శ్రామిక ప్రజల చైతన్యాన్ని మొద్దుబరిచి, వారి ఆలోచనా క్రమాన్ని వాస్తవానికతీతంగా వుండేలా ప్రభావితం చేయడం, ఈ కళా రూపాల ద్వారా విప్లవ వ్యతిరేక సిద్ధాంతాలు ప్రచారం చేయడం దోపిడీ వర్గాలు సాగిస్తాయి. తద్వారా తమ దోపిడీని రక్షించుకొనడానికి ప్రయత్నిస్తాయి.
అదే సమయంలో సాంస్కృతిక రంగాన్ని వ్యాపారంగా మార్చివేస్తాయి. కళాకారుడి ప్రతిభ ఈ దోపిడీ సమాజంలో అమ్ముడుపోయే వస్తువు అవుతుంది. పెట్టుబడిదారీ సమాజంలో ప్రతిదీ వ్యాపార వస్తువుగా మారిపోవడమే దీనికి కారణం.లాభం కోసం జరిగే వ్యాపారంలో సంక్షోభం తప్పదు. కొన్ని పరిశ్రమలు దివాళా తప్పదు.
అలాగే కళ కూడా వ్యాపారం గా మార్చి వేశారు. దాంతో కళా రంగంలోనూ సంక్షోభం, కొన్ని కళారూపాల అంతం తప్పవు. కళాత్మక విలువలు తరిగిపోవడం, ఉత్తమ సాహిత్యం సృష్టికాకపోవడం, మనం చూస్తూనే వున్నాం. ఈ విధంగా దోపిడీ వర్గాలు ఒక పక్క కళా రంగాన్ని దోపిడీకి వినియోగించుకుంటూనే రెండో పక్కదానినే క్రమంగా నాశనం చేయడానికి పూనుకుంటాయి.
అందువల్ల (1) కళాకారులు కళలను రక్షించుకోవడానికి దోపిడీని వ్యతిరేకించి పోరాడాలి.
(2) శ్రామికవర్గం కళారంగాన్ని ఉపయోగించి దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలి. పెట్టుబడిదారీ విష సంస్కృతిని ఎదిరించాలి. ప్రజలలోకి ఉత్తేజకర, సందేశాత్మక కళా రూపాలను ఉన్నత విలువలతో కూర్చి తీసుకుపోవాలి. ఇదే సాంస్కృతిక రంగంలో వర్గ పోరాటం.
(రాజకీయ తరగతులు)
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి