కదిలే ప్రపంచం.. కదిలించే కవిత్వం...



కదిలే ప్రపంచం.. కదిలించే కవిత్వం...

____జ్వాలాముఖి:

ప్రతి పది సంవత్సరాలలో సాహిత్యంలో మార్పులు వస్తాయి. నన్నయ్య అక్షర రమ్యత, తరువాత పోతన కవిత్వం, శ్రీనాథుని చాటువులు, శతక వాజ్మయం వచ్చింది. వేమన సుమతి, ధూర్జటి లేకపోతే లౌకిక చింతన, నిజమైన సంస్కారం వచ్చేది కాదు.

నన్నయ్య అక్షర రమ్యతలో సంస్కృతి, తెలుగు పదాలు, తత్సమాలు సరైన పొందికలో వుండటం, కథనశైలి, అక్షర రమ్యత పొందిక కుదిరింది. 11వ శతాబ్ధపు నన్నయ్య తరువాత చీము, నెత్తురు ఉన్నట్లు పాత్రలు ముందుకు వచ్చాయి. 13వ శతాబ్ధపు తిక్కన దగ్గర ఇది ప్రారంభమైంది.

ప్రజల్లో వున్న జాను తెలుగును సంస్కృతాన్ని కలిపి రాశాడు తిక్కన. తెలుగులో వీరేశలింగం 30 పద్యాల సరస్వతీ, నారద సంవాదం రాశాడు. శతక కవులు వచ్చారు.

చంధస్సు, భావాలకు కవిత్వం పరిమితమా ? చందోబద్ధంగానే కవిత్వం ఉండాలా ? ఇవన్నీ నేటి ప్రశ్నలు కావు. పొలరైజేషన్ కవిత్వంలో జరిగింది. ఉ రి, శిరస్సు చెప్పిన బాధలు, బాధల భావాలు చెప్పిన వేశ్య, కదిలే జీవితం, కదిలించే కవిత్వం - మనిషిని కదిలిస్తుంది.

ఈసురోమని మనుషులుంటే 'దేశమేగతి బాగుపడువోయ్' అని అన్నాడు గురజాడ. దీన్ని మార్చెందుకే సాహిత్యం మారుతూ వుంటుంది. నానీలు, వచనం, సీసం... ఇవన్నీ ప్రక్రియలే. కవి తన జీవితం గురించి రాసుకోకూడదా? రాసుకొని ప్రయోజనమేమి ? భావానికి, కవిత్వానికి జన్మస్థానం, గమ్యస్థానం - సమాజం.

ఏమీ పట్టని వాడు మృత్యువును ప్రేమిస్తాడు. సమాజాన్ని పట్టించు కునేవాడు జీవితాన్ని ప్రేమిస్తాడు. అందుకే టాల్స్టాయ్ జీవితాన్ని చూస్తాడు. నవల మూలాల్ని వెతుక్కుంటుంది. జీవితాన్ని సాక్షాత్కరింప చేసుకుం టుంది. అంపశయ్య నవీన్ రాసిన కాలరేఖలు, జీవితం ఎలా చైతన్యం అయిందో, మావన సంబంధాలు ఎలా మారోయో చెబుతాయి. పాశ్చాత్య భావజాలం ప్రభావం దాటి, పరిమితిని దాటి సాహిత్యం బయటకు వచ్చింది. నేటి సాహిత్యం ప్రజాస్వామిక సాహిత్యం. విస్తృత ప్రజల సాహిత్యం అయింది. ప్రపంచీకరణ ప్రభావంలో భాష కొట్టుకుపోతోంది. ఎఫ్ డిఐ వస్తోంది. వారి వస్తువులు వస్తున్నాయి. కార్పొరేట్ వ్యవసాయం వస్తోంది. 
     జీవితాన్ని కాపాడేది నవల. జీవితం లోని పొలెమిక్స్ అర్థం కావాలంటే వచనం కావాలి. ఆవేశంతో, ఆవేదనతో రాసేది కవిత్వం. దృశ్య, శ్రవణ మాధ్యమాల్లో సాహిత్యం మారుతోంది. పసిఫిక్ మహాసముద్రంలో అమెరికా అణుబాంబు విస్ఫోటనమే సునామికి కారణమని కొన్ని పత్రికలు రాశాయి. ఇలాంటి విషయాల్ని సాహిత్యంలోకి చొప్పించాలి. సందర్భాన్ని చిత్రించే టప్పుడు కవి బాధ్యత ఎక్కువగా వుంది. “నలుగురు కూర్చొని నవ్వేవేళ నాపేరొకసారి తలవండి" పూర్ణమ్మ కవితలో మానవ సంబంధాల్ని ఉన్నతీకరించాడు గురజాడ. కదిలే ప్రపంచం కదిలించే కవిత్వం.. అన్నాడు శ్రీశ్రీ. కదిలే జీవితం వున్నట్లే కదిలించే కవిత్వం వుండాలి. కవిత్వంలో అది తొణకిసలాడాలి. నాట్లు వేయంగా, కాలువ తీయంగా, పంట కోయంగా.. ఇలా కదిలే కవిత్వంలో వుంటుంది. కవిత్వంలో కదిలే జీవితం వుంటుంది. అలాగే ప్రేమ జీవితం కవిత్వంలో వచ్చింది.

కదిలేది, కదిలించేది, పాడేది... పాడించేది... ఇవన్నీ కవిత్వంలోకి ఎలా వచ్చాయి? పెనునిద్దుర వదిలించేది మును ముందుకు సాగించేది పరి పూర్ణత సాధించేది ఇలాంటి కవిత్వం మనకు కావాలి. ప్రజాస్వామ్యంలో కవిత్వం ఎలా వుండాలి? ప్రజలకర్థమయ్యే విధంగా ఉండే గేయంగా, పాడేదిగా, పాటగా, వచనంగా కవిత్వం వచ్చింది.

ఎగిరేది, సాగేది, ముందుకు సాగేది, నిలిచేది కవిత్వం. దీన్ని రాయటం చాలా కష్టం. అలాగే కవిత్వంలో వ్యర్థ పదాలు రాయరాదు. నిప్పులు చిమ్ము కుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరే నిప్పులు కక్కుకుంటూ నేలకు నేరాలిపోతే నిర్ధాక్షిణ్యంగా వీరే.. అంటాడు శ్రీశ్రీ.

తక్కువ మాటల్లో ఎక్కువ విషయాల్ని చెప్పాలి. సానుభూతితో చెప్పే మాటలు వుంటాయి. తన సుఖం కోసం రాసే మాటలు వుంటాయి. చుట్టూ వున్న సమాజాన్ని గురించే రాసేటప్పుడు కొన్ని రాజకీయ పరిమితులు వుంటాయి. 
మేడిపండు
మన స్వాతంత్ర్యం
మన దారిద్య్రం.

రాచపుండు.. అంటాడు ఆరుద్ర

సునామీ వచ్చింది. కరుణరసంతో రాయవచ్చు. కరుణరసం వీరరసానికి పోక పోతే “అయ్యో అయ్యో”గా మారుతుంది. నదులకు రోగాలు తెచ్చి పెట్టేవాడు. భూమికి బొరియలు పెట్టేవాడు సునామీలుతేరా? ఆదర్శాన్ని ప్రమాణం చేసు కోవాలి. అది సంస్కారం నేర్పుతుంది. నువ్వు కథ రాయవచ్చు. పద్యం రాయవచ్చు. పాట రాయవచ్చు. వస్తువుకు శిల్పానికి సమన్వయం తేవాలి.

స్పెయిన్లో ప్రజా తిరుగుబాటు వచ్చింది. పికాసో కుయెర్నికా చిత్రం గీశారు ఆ తిరుగుబాటును చిత్రీకరిస్తూ. అది నేడు ప్రసిద్ధ చిత్రం. ఉన్న చిత్రాన్ని యథాతథంగా చెప్పకుండానే చమత్కరించవచ్చు. కవి తాను గొప్పవాడు కావాలా? కవిత్వాన్ని గొప్పదిగా చేయాలా? ఎలా రాయాలి? స్వరూపం స్వలాభం మధ్య సమన్వయం కావాలి. కవిత్వం ఇప్పుడు పొలిటికల్ ఎకానమి లాగా వుంటుంది. ఒక్కొక్క అంశాన్ని గురించి చెప్పడమా? అన్నీ కలిపి చెప్పడమా? టీవిలో వచ్చే భావజాలం కొన్ని పరిమితులు ఏర్పరుస్తున్నది. మధ్యతరగతి రాగద్వేషాలకు పోతోంది. బతకాలనే ఆకాంక్ష వుంటుంది. జైలులోని నేరస్థుల గురించి శ్రీశ్రీ ఇలా అంటాడు. 
నేరాలు చేశారు నిజమే
అందుకు అలక్ష్యంగా చూడకే! అంటూ శ్రీశ్రీ చంద్రునితో చెప్తాడు. ఇదీ మానవీయత.

పెట్టుబడిదారీ దేశాల్లో కవిత్వం మూలకు నెట్టబడుతోంది. యూరప్ నాటకం బతికి వుంది. మన దేశంలో కథ బతికి వుంది. కవిత్వం అలిసిపోయి వుంది. నవల వుండి వుండనట్లు వుంది.

ఎవరికి ఎలా ఏ సందర్భంలో ఎవరిని వుద్దేశించి రాస్తున్నావు? వాడిన పదాలు మళ్ళీ మళ్ళీ రాకుండా కొత్త పదాలు రాయాలి. ప్రతి పది సంవత్సరాలకు పున:ప్రకియగా మారింది కవిత్వం. ఈ కవిత్వం, ఆత్మీయంగా వుందా, ధైర్యాన్ని ఇస్తుందా? ఇవన్నీ గమనించాలి. కవిత్వం పూపిరినివ్వాలి. ధైర్యాన్నివ్వాలి. కవిత పునరుత్పత్తి కాకుండా కొత్తదనం తేవాలి.
___ పిళ్లా కుమారస్వామి,9490122229

(2005 మార్చిలో విజయవాడలో జరిగిన సాహిత్యశాలలో
కవిత్వంపై జరిగిన గోష్ఠి, ప్రసంగాల పై రాసిన నోట్స్)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు