కటారుపల్లిలో వేమన సమాధి


2000 వేలకు పైగా సరళ తెలుగులో పద్యాలు రాసి, మూఢనమ్మకాలను, అంధవిశ్వాసాలను ఎలుగెత్తి ప్రశ్నించిన వేమన ప్రజాకవి.


వేమన పుట్టిన ఊరు ఏదన్న విషయంలో పరిశోధకుల మధ్య అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే వేమనది కడప జిల్లా అన్నది అత్యధికుల మాట. వేమన పేరుతో కడప జిల్లాలో యోగి వేమన విశ్వవిద్యాలయం కూడా నెలకొల్పారు. మరి వేమన కడప జిల్లాకు చెందినవాడు అనడానికి రుజువులు ఏమిటి ?


వేమన పద్యాలను సేకరించి వెలుగులోకి తెచ్చిన బ్రౌను వేమన పుట్టుపూర్వోత్తరాల గురించి చెపుతూ 

వేమన కాపు కులస్థుడని కర్నూలు ప్రాంతానికి  చెందినవాడని, కాదు గుంటూరు ప్రాంతానికి చెందినవాడని, అది కూడా కాదు కడప జిల్లాలోని   చిట్వేలి గ్రామంలో పుట్టడని కొన్ని వాదనలు ఉన్నాయని అయితే ఖచ్చితంగా ఇదీ వేమన జన్మస్థలం అని నిర్ధారించే సమాచారం ఏదీ దొరకలేదని అంటాడు. 


(వేమన పద్యాలు -The Verses of Vemana - Moral, Relivious and Spiritual - Translated by Charles Philip Brown )


1875లో విడుదల అయిన కడప మాన్యువల్ (The Manual of The District of Cuddapah In the Presidency of Madras ) వేమన గురించి ప్రస్తావిస్తూ కదిరి ప్రాంతంలో (అప్పటికి అనంతపురం జిల్లా ఏర్పడలేదు, కదిరి కడప జిల్లాలో భాగంగా ఉండేది) వేమన అనే గురువు / ఆధ్యాత్మిక వేత్త ప్రభావం ఉందని, అతనికి అనేకమంది అనుచరులు ఉన్నారని, కటారుపల్లిలో వేమన సమాధి ఉందని పేర్కొన్నారు. 


అయితే వేమన కడప జిల్లాలోని చిట్వేలిలో జన్మించాడు అనడానికి జానుమద్ది హనుమచ్ఛాశాస్త్రి గారు కీ. శే. శ్రీ వేదము వెంకట కృష్ణశర్మ గారు కోడూరు ప్రాంతంలో సేకరించి భద్రపరచుకున్న కొన్ని పద్యాలను ఉదహరిస్తారు (రాయలసీమ వైభవం పుస్తకం )


చిట్టివేలి సీమ చెలిగి పుట్టుకనిచ్చే

కొండవీటి చెరుగ గోర్కె తీర్చె

మూగ చింతపల్లె ముక్తి మార్గము చూపె

విశ్వదాభిరామ వినురవేమ.


చిట్టివేలి చెన్ను జేరి కొల్చెను తల్లి

పుట్టుకిచ్చి తాను ముక్తికాగా

కొండగుట్ట చేర గోర్కెలు మెండాయె

విశ్వదాభిరామ వినురవేమ


పై రెండు పద్యములు వేమన  కడప జిల్లా చిట్వేలి వాసి అని తెలియజేస్తున్నాయి.


#సీమరత్నాలు #సీమకవులు #వేమన #కడప #Kadapa


వేమనను కేవలం శతక కర్తగానే చూపించి ఆయన స్థాయిని తగ్గించారు.


ఇదే వేమన వేరే దేశంలో ఉండిఉంటే గొప్ప తత్వవేత్తగా గుర్తింపు పొందేవాడు. లేదా బ్రాహ్మణ కులంలో జన్మించి ఉంటే గొప్ప సంస్కర్తగా కొనియాడబడేవాడు..


1. మతాలు మంచే చెబుతుండవచ్చు  కానీ మతబోధకులు దొంగలంటాడు వేమన.


 ఆరు మతములందు నధికమైన మతంబు

లింగమతము కన్న లేదు భువిని

లింగదార్ల కన్నా దొంగలు లేరయా

విశ్వదాభిరామ వినుర వేమ.


మతము వేషధార్లు మహిమీద పదివేలు.

మూఢజనుల గలప మూగుచుండ్రు 

కొంగలు గుమికూడి కొరకవా బోదెలు 

విశ్వదాభిరామ వినుర వేమ. 


2.  ఆత్మశుద్ది ముఖ్యం కానీ పూజలు ముఖ్యం కాదంటాడు...


ఆత్మశుద్ది లేని ఆచార మదియేల 

భాండ శుద్దిలేని పాకమేల 

చిత్తశుద్ధి లేని శివపూజలేరా 

విశ్వదాభిరామ వినుర వేమ 


3.  పిండములను పెట్టడం గురించి....


పిండములను జేసి పితరుల తలబోసి 

కాకులకు పెట్టు గాడ్దెలారా 

పియ్యి తినెడు కాకి పితరుడెట్లాయెరా 

విశ్వదాభిరామ వినుర వేమ. 


4. జీవులను చంపి మనిషి అనే జీవి తింటే ఒళ్ళు వస్తుంది కానీ మోక్షం ఎలా వస్తుంది అంటాడు మరో పద్యంలో..


జీవి జీవి చంపి జీవికి వేయగా 

జీవితాన బలిసి చెలగుచుండు 

జీవ హింసలకు చిక్కునా మోక్షంబు 

విశ్వదాభిరామ వినుర వేమ. 


5. శకునముల గురించి...


బల్లి పలుకులు విని ప్రజ తమ పనులెల్ల 

సఫల మగునని సంతసించి 

కాని పనులకు తమ ఖర్మ మటందురు 

విశ్వదాభిరామ వినుర వేమ. 


పాలపిట్ట శకున ఫలమిచ్చు నందురు 

పాలపిట్ట కేమి ఫలము తెలుసు 

తనకు కాని మంచి తనలోన యుండంగ 

విశ్వదాభిరామ వినుర వేమ. 


 గూబ గృహమున జేరగు నిసి పాడు బెట్టి 

వెళ్ళి పోయెదరెంత వెర్రి వారో 

గూబ గృహమున లేమి గూర్చురా ఖర్మంబు 

విశ్వదాభిరామ వినుర వేమ. 


6. వేద విద్య గురించి...


వేద విద్యలెల్ల వేశ్యల వంటివి 

భ్రమల బెట్టి తేట పడగనీవు 

గుప్త విద్య యొకటె కులకాంత వంటిది  

విశ్వదాభిరామ వినుర వేమ..


7. విగ్రహారాధకుల మీద.


శిలను ప్రతిమ జేసి చీకటింటను బెట్టి  

మొక్కవలదు వెర్రి మూఢులారా 

ఉల్ల మందు బ్రహ్మంముండుట తెలియరు 

విశ్వదాభిరామ వినుర వేమ. 

 

నీళ్ళ మునగనేల నిధులు మెట్టగనేల 

మొనసి వేల్పునకు మొక్కగనేల

కపటకల్మషములు కడుపులో నుండగా 

విశ్వదాభిరామ వినుర వేమ. 


ఒక్కపొద్దులుండి యొగినీళ్లలో మునిగి 

కూడు వండి వేల్పు గుడువు మనుచు 

దాని నోరు గొట్టి తాము తిందురు కదా 

విశ్వదాభిరామ వినుర వేమ. 


పలుగు రాళ్ళ దెచ్చి పరగగుట్టలుగ గట్టి  

చెలగి శిలల సేవ చేయనేల 

శిలల సేవ చేయు ఫలమేమి గలుగురా 

విశ్వదాభిరామ వినుర వేమ.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు