తెలుగు సాహిత్యంలో ఆరుద్ర
తెలుగు సాహిత్యంలో ఆరుద్ర
ఆరుద్ర అనగానే శ్రీశ్రీ ఊసులు రావడం సహజం.
శ్రీశ్రీకి ఆరుద్ర వేలు విడిచిన మేనల్లుడు. అతని మొదటి పేరు భాగవతుల శంకరశాస్త్రి.
'రాముడికి సీత ఏమవుతుంది' మొదలుగా గల వ్యాసాలు ఆరుద్ర రాశారు. అవి వెలువడింది 1978 లో.
శ్రీశ్రీ, ఆరుద్ర కలిసి కావ్యాలు రాయలేదు. కొన్ని ఖండికలు రాశారు 'రుక్కుటేశ్వర శతకం', 'ఇదీ దారి', 'సాహిత్య ఉపనిషత్తు', 'మేమే' వగైరా. శ్రీశ్రీ, ఆరుద్రల సాహిత్యం అంతా అచ్చులో లభ్యమవుతుంది.
రవి అదేమిదేమని ఏకంగా మార్క్స్, ఎంగెల్స్, బెట్రాండ్ రస్సెల్, బెర్నార్డ్ షా, నోమ్మ్ స్కీల సరసన ఆరుద్రకి కూడా పీట వేశాడు. నిజానికి మార్క్స్, ఆ ఎంగెల్స్ ఒక కోవ. రస్సెల్ ఒక కోవ, ఆ మాటకొస్తే హెచ్.జి. వెల్స్, సిడ్సీ వెబ్, బెర్నార్డ్ షాలతో పోల్చదగిన మేధావి తెలుగులో కొడవటిగంటి కుటుంబరావు ఒక్కరే. ప్రధానంగా ఆయన కథకుడు. గురజాడ నుంచీ లెక్కవేస్తే ప్రథమశ్రేణి కథకుల్లో ఆయన ఖాయంగా నిలుస్తారు. ఒక్క కవిత్వం తప్ప, సాహిత్యంలో అన్ని ప్రక్రియలూ చేపట్టారు. సాహిత్యంతో పాటు సంగీతం, సైన్సు, చరిత్ర, సంస్కృతి, సినిమా ఆర్థికశాస్త్రం. రాజకీయాలు, తత్వశాస్త్రం ఆయనకీ కరతలా మలకం.
ఆరుద్ర ప్రధానంగా కవి. గురజాడ నుంచి లెక్కేస్తే ఆరుద్ర ప్రథమశ్రేణి కవుల్లోకి రారు. వివిధ సామాజిక శాస్త్రాల గురించి ఆయన పాండిత్యం స్థూలమైందే గాని సూక్ష్మమైంది కాదు. అయితే తెలుగు సాహిత్యంలో ఆరుద్ర అర్థ శతాబ్దంపై నుంచి కృషి చేశారు. ఆయన సాహిత్య జీవితంలో కొన్ని ముఖ్యమైన దశలున్నాయి.
తొలిదశలో ఆరుద్ర కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు. ఈ దశలోనే ఆయన 'త్వమేవాహం' రాశారు. సంవిధానం లోని విలక్షణత్వం, వ్యక్తీకరణలోని వింత పోకడల వల్ల ఇది ఎక్కువమందికి కొరుకుడు పడని మాట నిజం. 'అయితే వస్తువు (తెలంగాణా పోరాటం) లోని బలం వల్లనే ఈ కావ్యం నిలిచింద'ని తుమ్మల వెంకట రామయ్య అన్నారు. దీని మూడో ముద్రణ విశాలాంధ్ర ప్రచురణగా వెలువడింది. తొలి జనరల్ ఎన్నికల (1952) లో ఆరుద్ర ఆంధ్ర కమ్యూనిస్టుల విజయాన్ని కాంక్షించారు. హర్షించారు. ఆహ్వానిం చారు. హరీంద్రనాథ ఛటోపాధ్యాయకి ఓటెయ్యమని ఒక దీర్ఘ కవిత రాశారు. అది ఇలా మొదలవుతుంది.
విజయవాడ పౌరులారా! విజ్ఞానవంతులారా! విజ్ఞాపన చేస్తున్నా! ఇది కొంచెం వినండి! మీ నియోజక వర్గంలో ఉదయిస్తున్నాడు
హరీంద్రనాథుడు
మీ నియోజక వర్గంలో నిలబడుతున్నాడు.
ఎన్నికలలో కాంగ్రెసు పరాజయాన్ని చూసి
ఏవి తల్లీ నిరుడు మండిన
ఎండు తాటాకుల్ ?
అని ఒక పారడీ రాశారు.
ప్రపంచ కమ్యూనిస్టు నాయకుడు స్టాలిన్ మరణశయ్య (1953, మార్చి)
మాదదయ వుంచి జీవించు
ధర మూలస్తంభమా!
అంటూ ఆవేదనతో, ఆర్తితో కవిత రాశారు.
"1952 ఎన్నికల్లో నన్ను ఉత్తేజ పరిచిన వాతావరణం 1955 లో నాకు కనిపించలేదు' అని ఆరుద్ర స్వయంగా అన్నారు. 1953 లోనే 'ఉద్యమ నాయకా చదుకో:' అంటూ శ్రీశ్రీని ఈసడిస్తూ ఒక కవిత రాశారు. ఈ కవితలోని బోలుతనాన్నీ, ఆరుద్రలో వచ్చిన మార్పుని అభ్యుదయ రచయిత అట్లూరి పిచ్చేశ్వరరావు అప్పుడే విశ్లేషించారు. ఆరుద్రలోని మార్పు '55 నాటికి కరడు గట్టింది. అందుకనే ఆయన ఎన్నికలలో కమ్యూనిస్టుకి వత్తాసుగా నిలబడలేదు. కమ్యూనిస్టు వ్యతిరేక రచయితల ముసాయిదా మీద సంతకం పెట్టారు. ఆ తరువాత నాలిక కరుచుకున్నారు. అది వేరే కథ. అంతేగాదు. అప్పుడు, 'పెట్టుబడికి కట్టుకథకి పుట్టిన విష పత్రికలు (ఆంధ్రపత్రిక, ప్రభ) పనిగట్టుకుని శ్రీశ్రీ మీద నీచమైన నిందా ప్రచారానికి పూనుకున్నప్పుడు కూడా ఆరుద్ర నోరు విప్పలేదు. శ్రీశ్రీని ఆసుపత్రిలో చేర్పించింది. ఆయనకి పరిచర్యలు చేసిందీ. శ్రీశ్రీని రక్షించుకుంది ఆరుద్ర మాత్రం కాదు.
1955 ఎన్నికలలో కమ్యూనిస్టుల ఓటమి తర్వాత మన సాహితీ సాంస్కృతిక రంగాలు గుంటపూలు పూదాయి. ఆ దశలో ఆరుద్ర రాసిన కొన్ని డిటెక్టివ్ నవలల పేర్లు "ఆణాకొక బేడ స్టాంపు', 'అహింసా రౌడీ', 'ఆడదాని భార్య' వగైరా. వీటి గురించి వివరణ, వ్యాఖ్యానం అనవసరం.
ఇంతలో రష్యన్ కమ్యూనిస్టు పార్టీ 20 వ కాంగ్రెసు (1956) జరిగింది. "యువకుల లోనూ ఒక రకమైన రివిజనిజం ప్రారంభ మైంది. తిలక్ 'పులి చంపిన లేడినెత్తురు' ను పులుముకోలేనన్నాడు. కుందుర్తి 'ప్రజాస్వామ్యమే నిజమైన నందనం అన్నాడు. నాకు 'గంటస్థంభం చూపెట్టే కాలం తప్ప నిపించింది."బహుశా అప్పటి నుంచే మార్క్సిస్టుపార్టీకి చేరువయ్యారు ఆరుద్ర.
సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్ర 13 సంపుటాలు ప్రజాశక్తి ప్రచురణాలయం వారు సరస్వతీదేవి ముఖ చిత్రంతో అచ్చు వేశారు. 'మార్క్సిస్ట్ విమర్శకుడు రాజవంశాల క్రమణిక ప్రకారం సాహిత్య చరిత్ర రాయవచ్చా' అని చిన్నపరెడ్డి (జస్టిస్) ప్రశ్నించారు. 'మార్క్సిస్ట్ ప్రచురణాలయం సరస్వతి ముఖ చిత్రంతో సాహిత్య చరిత్ర వేయవచ్చా ?' ఇది ఎవరైనా వేసుకునే ప్రశ్న.
ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్ర నోట్సులాగా వుంది గాని చరిత్ర స్థాయికి రాదు. అది కవుల చరిత్ర గాని సాహిత్య చరిత్ర కాదు. అయితే సాహిత్యం గురించి మంచి సమాచార సేకరణ వున్నమాట నిజం. ఆనాటి సామాజిక వ్యవస్థల గురించి విశ్లేషించకుండా కేవలం సాహిత్యం గురించి రాస్తే న్యాయం జరగదు.
'టెక్నిక్ లేని కవిత్వాన్ని ఊహించలేన'న్నారు కాని టెక్నిక్ నే కవిత్వం చేసుకున్నారనిపిస్తుంది. మొక్కకి ఆకులు కూడా వుండాలి. అన్నీ పూలే అయితే అందంగా వుండదు. అదే ప్లాస్టిక్ మొక్క అయితే అన్నీ వూలే అమర్చవచ్చు. టెక్నిక్ని సర్వస్వం అనుకోవడం కూడా ఈ కోవలోదే. కవితా వస్తువు పట్ల ఆరుద్రకి బలమైన అభిప్రాయాలు లేవు. తాను రాసే విషయం పట్ల గాఢమైన అభినివేశం లేకపోతే ఎవరూ గొప్ప కవులు, రచయితలు కాలేరు. ఆరుద్ర కవిత్వంలో చమత్కారం, సంవిధాన చాతుర్యం, టెక్నిక్, అన్నింటిని మించి అంత్యప్రాస పుష్కలంగా వున్నాయి. ఈ మాటలే అతని వచనరచనలకీ వర్తిస్తాయి. ఉదాహరణకి 'నే చెప్పానుగా!' 'ఊరు ఊరుకుంది' అనే రెండు కథల సంపుటాలు 1958 లో వెలువడ్డాయి. మచ్చుకి వాటిలో మాటలు కొన్ని: 'ఉత్సాహాన్నే ఊపిరి పీలుస్తూ, ఉద్రేకాన్ని మూడు పూటలా భోంచేస్తూ, కండ్లలో కవిత్వం, కరాలలో కరెంటు, పెచ్చు పెరిగిన ఆవేశాన్నే ఖర్చు పెట్టుకుంటూ కాలేజీల్లో చదువుకునే రోజుల్లో......
'జీవితం వెలిసిన కాగితం ! పాలిపోయిన ఫోటోగ్రాఫ్! కాలిపోయిన ఎలక్ట్రిక్ బల్బు ! ఆశ మొద్దుబారిన రేజర్డు.
సమాజాన్ని వదిలేసి సంవిధానం మీదనే దృష్టి పెట్టడం ఆరుద్రలోని పెద్ద లోటు. అందుకే 'ప్రజలను దృష్టిలో నిడుకొని కవి రచించాడు' అన్నారేమో !
ఆరుద్ర సాహిత్య దృక్పథంలో వున్న లోపమే అతన్ని మొదటి శ్రేణి విమర్శకుడు కాకుండా అడ్డుపడింది.
కేశవరావు (నగ్నముని) 'ఉదయించని ఉదయాలు' ఖండకావ్య సంపుటికి ఆరుద్ర ముందు మాట రాశారు - 'ఒప్పో తప్పో - ఇది నా మెప్పు' అంటూ (-1961)
'........ అభ్యుదయ కవుల ధర్మమా అని
వర్గచైతన్యం గురించి పాడితేనే తప్ప
మిగతాది కవిత్వం కాదేమోనన్న అపోహ ఆంధ్రదేశంలో
అనవసరంగా ఊపిరి పీలుస్తోంది.' అంటూ ఆ పుస్తకానికి కితాబు ఇచ్చారు ఆరుద్ర.
కవిత్వం పట్ల, జీవితం పట్ల ఇలాంటి దృష్టి వున్న వ్యక్తి అటు తర్వాత మళ్లీ 'మార్క్సిజం నా కరదీపిక' అని ఉద్ఘాటిస్తే ఏది సత్యం ? ఏదసత్యం ? ఓ మహాత్మా ! ఓ మహర్షీ ! అనుకోవాలి.
ఏది ఏమైనా,
ఆరో రుద్రుడి స్వప్నం
త్వమేవాహ మహంబ్రహ్మ
ఎన్జీవో సూర్యుడి కథ
పలుకుతుంది కలం జిహ్వ
అన్నాడు శ్రీశ్రీ.
చిట్టచివరి వరకూ సాహిత్య
వ్యాసంగంలోనే గడిపారు ఆరుద్ర.
___ కెవిఆర్
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి