విందు
అది ఎథెన్స్ నగరంలో ప్రముఖ యువ కవి నాటకకర్త అగాథన్ ఇల్లు.
గ్రీకు రంగస్థలంలో ఆ యువకుడు వ్రాసిన నాటకానికి ప్రథమ పురస్కారం వచ్చిన సందర్భంగా అతడు తన మిత్రులను, ఆత్మీయులను విందుకు పిలిచాడు. ఎందరో అతిథులు ఆ విందుకు వచ్చారు. అతిథులందరూ ఎన్నో విషయాలపై మాట్లాడుకుంటున్నారు.
అందరి చర్చ ప్రేమ మీదకు మళ్ళింది. ప్రతిఒక్కరు తమ తమ అభిప్రాయాలను, నిర్వచనాలను చెబుతున్నారు.
ఫేడరస్ ఒక వేదాంతి, వక్త.అతను ముందుగా
“ ప్రేమ దేవతలందరిలో అత్యంత ప్రాచీనదేవత. అత్యంతశక్తివంతమైనది. అది సామాన్య మానవులను కూడా కథానాయకుల్ని చేస్తుంది. కారణం ఏ ప్రేమికుడు తన ప్రియురాలిముందు పిరికివానిగా ఉండాలి అనుకోడు. నాకు ఒక ప్రేమికుల సైన్యాన్ని ఇవ్వండి. నేను ప్రపంచాన్ని అంతటినీ జయించేస్తాను.” అని చెప్పాడు.
మరో వక్త పౌసానియస్ “నేను ఫేడరస్ అభిప్రాయంతో ఏకీభవిస్తాను. కాని భూలోకప్రేమ వేరు, అమరప్రేమవేరు. భూలోకప్రేమ రెండుశరీరాలకలయికకోసం కాంక్షతో ముడివడిఉంటుంది. రెండు ఆత్మలకు చెందినది అమరప్రేమ. భౌతికప్రేమ యౌవనంతో ఆగిపోతుంది. యౌవనం దాటగానే ఆ ప్రేమకు రెక్కలు వస్తాయి. అది ఎగిరి చక్కా పోతుంది. కాని అమరప్రేమ ఉదాత్తమైనది. అది ఆత్మవలె శాశ్వతమైనది. చెరగని కథగా చరిత్రలో మిగిలి పోతుంది.” అని ముగించాడు.
హాస్యకవి అరిష్టోఫేనస్(The Father of Comedy of Greece literature)
తన కథనం మొదలుపెట్టాడు.
“ నే చెప్పబోయేది ప్రేమకు చెందిన అత్యంతనూతన సిద్దాంతం. ఇది ఎవ్వరికీ తెలియనిది. పూర్వం ఒకప్పుడు మానవులలో స్త్రీలు, పురుషులు అని రెండువిభాగాలు ఉండేవి కావు. అప్పట్లో మనుషుల శరీరాలు బంతిలాగా ఒకగోళపు ఆకృతిలో ఉండేవి. ఆ గోళానికి పైన నాలుగు చేతులుక్రింద నాలుగు కాళ్ళు ఉండేవి. ఆనాలుగుకాళ్ళతో, అజేయంగా లోకమంతా తిరుగుతూ ఎన్నోవిన్యాసాలను చేస్తూ ప్రపంచాన్ని అంతటినీ జయిస్తూ తిరుగుతూ ఉండేవారు మానవులు. వారికి దేవతలను కూడా జయించాలి అనే కోరిక కలిగింది. వెంటనే దేవతలరాజు 'జ్యూస్' కి ఒక ఆలోచన వచ్చింది. ఈ బంతి ఆకారంలో ఉన్న జీవులను సగానికి చీల్చివేస్తే ఇక ఈజీవికి స్వర్గాన్ని జయించే అవకాశం ఉండదనుకున్నాడు. వెంటనే తన సేనకు అజ్ఞను ఇచ్చాడు. “నిలువునా రెండుగా నరకండి. అ జీవుల బలం సగానికి తగ్గిపోతుంది.” అని. దేవతలు మానవులను ఒక్కొక్కరిని రెండు రెండుఖండాలుగా చీల్చివేశారు. అలా రెండుగా చీల్చబడిన ఆ జీవులే పురుషులు, స్త్రీలుగా విడివడ్డారు. అప్పటినుంచి వారిద్దరూ తిరిగికలిసి ఒకటై స్వర్గాన్ని జయించాలి అని మనస్సులో కోరుకుంటున్నారు. వారినిరువురినీ కలుపుతున్నదే ప్రేమ. అది వారిని స్వర్గం వరకూ తీసుకుని వెళుతోంది.కానీ స్వర్గాన్ని జయించగల శక్తిని వారు పొందేలోపున వారికి నేను పురుషుణ్ణి, నేను స్త్రీనీ అనే స్పృహను కలుగజేస్తున్నాడు దేవతలరాజు. వారిద్దరూ వేరైపోతున్నారు. అలా ఎప్పటికీ ఒకటిగా కలవలేకపోతున్నారు. స్వర్గాన్ని గెలవలేకపోతున్నారు.
మేము ఒకటి అయిపోతున్నామనే వారి ఆనందమే వారు స్వర్గ సుఖ మనుకుంటున్నారు.” అంటూ తన కథనాన్ని ముగించాడు.
ఈకథను విన్నవారందరిలో ఏదో తెలియని పారవశ్యం కలిగింది. అందరి కరతాళధ్వనులు ఆకాశాన్ని అంటుతున్నాయి.
అంతలో అక్కడ ఉన్నవారిలో సోక్రటిస్ లేచాడు. “ఇంతవరకూ ఎందరోప్రజ్ఞావంతులు ఎన్నెన్నో విషయాలను చెప్పారు. ఇంతమందిమధ్యలో నేనొక మూర్ఖుణ్ణి. నేను చెప్పే విషయాలు మీకు ఎంతవరకు నచ్చుతాయో నాకు తెలియదు. అయినా మనిషి తను నమ్మిన సిద్దాంతాన్ని చెప్పడానికి ముందే అది మంచి లేక చెడు అని తనే అనుకోరాదు. అందుకని మీ ముందు నా ఆలోచనలు ఉంచుతున్నాను. అయితే నేను నా అభిప్రాయాన్ని చెప్పే ముందు నాకన్నా ముందుచెప్పిన వక్తలను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఆతరువాత నా సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాను.” అన్నాడు.తరువాత ఎన్నో ప్రశ్నలు వేసి వారి భావాలను ఖండించాడు. ఆ తరువాత తన కథనం ప్రారంభించాడు. “ప్రేమ దివ్యసౌందర్యాన్ని చూడటానికి ఆత్మ పడే ఆరాటం. ప్రేమికులు కేవలం ఆ దివ్యత్వాన్ని చూడటమే కాదు. దాన్ని సృష్టించాలి అనికూడాపరితపిస్తారు. అలాసృష్టించిన సౌందర్యాన్ని శాశ్వతం చేయాలనుకుంటారు. ఈ ప్రయత్నంకోసమే, ఈ సౌందర్యసృష్టికోసమే స్త్రీ పురుషుల కలయిక. అలాగే వారు సంతానాన్ని పొందుతున్నారు. ఆ సంతానం కన్నా సుందరమైనది సృష్టిలో వేరేమీ లేదని వారి భావన. ఇలా సౌందర్యాన్ని వారు తమ సంతతి ద్వారా అంతమెరుగని ఆనందస్రవంతిని ప్రవహింపజేస్తున్నారు.
కాని అందరూ వెదుకుతున్నది ఈ మానవ సృష్టి వెనుకనున్న పరమసత్యం ఏమిటా? అని. ప్రపంచమంతా ఎన్నో వేల రకాల జీవరాసులుఉండగా మనిషిని మాత్రమే ఇలా సృష్టించిన ఆ తత్త్వమేది? ఈ ప్రశ్న వేసి అందరినీ ఆలోచింపజేశాడు.అందరూ ఆలోచిస్తూ ఉండగానే ఆయనే మళ్ళీ"అదే సత్యం. అదే జ్ఞానం. అదే పూజనీయం. అదే శౌర్యం. అదే న్యాయం. అదే తత్త్వం. అదే సౌందర్యం. అదే ఆనందం.” అనిచెబుతూ ముగించాడు. అందరూ కరతాళధ్వనులతో అతన్ని ప్రశంసించారు.
ఆ తరువాత ఎవరు ఎక్కువ మత్తు పానీయాన్ని త్రాగుతారోనని పందెంవేసుకున్నారు.
కానీ ఒక్కొక్కరూ మెల్ల మెల్లగా ఒరిగిపోయారు.
చివరకు అరిష్టోఫేనస్ అగాథన్ కూడా తెలవారే సమయానికి ఒరిగిపోయాకా తనచేతిలో ఉన్న పాన పాత్రలోని ద్రవాన్ని సేవిస్తూ వైన్ దేవతకు తలవంచి ఉదయించే సూర్యుని ఊహిస్తూ,దాన్లో కొత్తసౌందర్యాన్ని చూస్తూ ఆనందిస్తూ నెమ్మదిగా పారవశ్యంతో మత్తుప్రభావం వల్లనేమో తెలియని స్థితి లోకి జారుకున్నాడు.
ప్రపంచాన్ని చైతన్యం పరచడానికి
భానుడుఉదయించే వేళ చిట్ట చివరిగాఒకే ఒక్క తత్త్వవేత్త సోక్రటీస్ తన నిశిలోకి చేరుకున్నాడు.
(క్రీ.పూ.427-347 నాటి గ్రీకు కథ)
(Facebook నుండి)
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి