ఓల్గా(లలిత)


ఓల్గా(లలిత)
               ___ పిళ్లా కుమారస్వామి 9490122229

”స్వేచ్ఛ ఎవరో ఇచ్చేది కాదు. ఎవరినుండి సాధించుకునేది కాదు. మన అవసరాలను, మన ఉనికికి అత్యవసర విషయాలను మనం గుర్తించడమే స్వేచ్ఛ. నిజానికి అది సాధించడం చాలా కష్టం” అని చెప్పే ఓల్గా ప్రసిద్ధ స్త్రీ వాద రచయిత్రి.ఆమె అసలు పేరు పోపూరి లలిత.రష్యాలో ఓల్గా పేరుగల ఒకామె పోరాటంలో మరణిస్తే,నాన్న కోరిక మేరకు
లలిత తన కలం పేరు ను ఓల్గాగా పెట్టుకున్నారు.
ఓల్గా అంటే వేయి వోల్టుల ఒక అక్షర ప్రవాహం. ఆమె రచనలు కణకణమండే నిప్పుకణికలు. ఆమె ప్రసంగాలు భగభగ మండే నినాదాలు. 

ఈమె నవంబర్ 27, 1950లో గుంటూరు జిల్లా చుండూరు మండలం యడ్లపల్లి గ్రామములో జన్మించారు. వీరి తల్లిదండ్రులు పోపూరి వెంకటసుబ్బారావు, వెంకటసుబ్బమ్మ. తండ్రి కమ్యూనిస్టు భావజాలం కలిగిన వ్యక్తి.దాంతో చిన్న తనం నుంచే ఇంటికొచ్చే
సోవియట్ సాహిత్యం చదివేది.
టాల్స్టాయ్, శ్రీశ్రీ,చలం,కొకు, మాలతీ చందూర్, రంగనాయకమ్మ, వాసిరెడ్డి సీతాదేవి, విశ్వనాథ, అడవి బాపిరాజు, యద్దనపూడి సులోచనారాణి ఇలా చాలామంది రచనలు విరివిగా చదివేది.గుంటూరు ఏసి కాలేజీలో బియ్యే పూర్తి చేశారు.
 ఆంధ్ర విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉన్న గుంటూరు పి జి సెంటర్లో తెలుగు సాహిత్యం ఎం.ఎ. చేసిన తర్వాత తెనాలిలోని వి.ఎస్.ఆర్. కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేశారు. డిగ్రీ చదివేటప్పుడు ఎస్ ఎఫ్ ఐ ఉద్యమాలలో పాల్గొన్నారు.
ప్రాంపంచిక దృక్పథం ఆ రోజుల నుంచే అలవడింది.
1972లో ఆమె సాహితీ ప్రస్థానం మొదలైంది. 
జైలుగది ఆత్మకథ ఆమె రాసిన మొట్ట మొదటి కథ.తరువాత కాలాల్లో ఆమె కవిత్వం కూడా రాసింది.పైగంబర కవుల్లో ఒకరిగా ఉన్నారు. తెలుగు సాహిత్యంలో నెలకొన్న నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది పైగంబర కవిత్వం. 
సుగమ్ బాబు, దేవిప్రియ ,కమలాకాంత్, కిరణ్ కుమార్. ఓల్గా ఈ ఐదుగురు
పైగంబర కవులుగా దిగంబర కవుల అరాచక స్వభావాన్ని పరోక్షంగా వ్యతిరేకించారు.

"నేను పతివ్రతామ తల్లిని కాను
 ప్రబంధ కన్యనుకాను
 పంచదార చిలకను కాను
 ఫ్యాషన్ పెరేడ్ బొమ్మను కాను
 పసిపాపల చంపే పాపిని కాను
 పంచాది నిర్మల వారసురాలిని"

అంటూ తన విప్లవ స్ఫూర్తి నితన కవిత్వంలో వ్యక్తం చేసింది.
"అన్యాయం విజృంభించినపుడు
న్యాయం భయపడి పారిపోయినపుడు
 అధర్మం అందలం ఎక్కినపుడు
 ధర్మం దుమ్ములో కలిసినపుడు
 మౌనంగా కూర్చోవడం మానవత్వం కాదు
 కోట్లకొలది ప్రజలు రాక్షస పాదాల
 క్రింద నిర్దాక్షిణ్యంగా నలపబడుతుంటే
 ఆ రాక్షసిని చంపటం హింస
 అనడానికి నోరెలా వచ్చింది నేస్తం ? “
రామాయణంలో రాముడేం చేశాడు. తాటకిని చంపాడు. అది తప్పుకాదుగా?
అది తప్పుకానప్పుడు మనలో మెలిగే రాక్షసత్వాన్ని చంపడం తప్పెలా అవుతుంది.?"

అంటూ   ప్రశ్నించింది ఓల్గా.

"గీత కారుడేమన్నాడు.సత్యం కోసం,ధర్మం కోసం హింస తప్పు కాదన్నాడు.
ధర్మాన్ని రక్షించడానికి కృష్ణుడు కురుక్షేత్ర యుధ్ధం జరిపించలేదా? ఇదీ అంతే.!"
అంటూ  ధర్మం కోసం
అధర్మాన్ని సంహరించడం
తప్పుకాదని చెప్పింది.

తరువాత కాలంలో విరసం లో పనిచేశారు.తర్వాత ఈమె జనసాహితీ సాంస్కృతిక సమాఖ్యలో చురుగ్గా పాల్గొన్నారు.వాటిల్లో ఉన్నప్పుడే స్త్రీ వాద ఉద్యమానికి ఆమెలో బీజం పడింది. విప్లవ పంథాలో చురుగ్గా ఉన్న వారు సైతం మహిళల సమస్యల మీద పెద్దగా దృష్టి పెట్టేవారు కాదు. దాంతో ఆమె లో  స్త్రీవాద రాజకీయాలు కొత్త ఊపిరి పోసుకున్నాయి. 
అప్పటిదాకా ఒక సిద్ధాంతానికి కట్టుబడి పని చేసినామె,ఒక పార్టీని ఇష్టపడ్డామె,కొన్ని సంఘాల్లో పని చేసినిమె, వాటన్నిటిని కాదని బైటకు వచ్చి నిలబడ్డారు. స్త్రీ గొంతుకై మాట్లాడారు. 

ఇది అకస్మాత్తుగా వచ్చింది కాదు. సంఘాల్లో పనిచేసిన రోజుల్లోనూ సంఘర్షణ వుంది. బైటికి వచ్చాకా ఉంది. స్త్రీవాదిగా మారుతున్న క్రమం లో లోతుగా వెళుతున్నా కొద్దీ సంఘర్షణ తీవ్రమైంది. అది ఒక ప్రాసెస్. ఆ క్రమంలోనే ఓల్గా స్త్రీ వాదిలా మారారు. 
తన స్త్రీ వాద రాజకీయ చైతన్యాన్ని సాహిత్య రూపంలో అందించడానికి కథా రచనను మార్గంగా ఎంచు కున్నారు. రాజకీయ కథలు తెలుగు సాహిత్యంలో కొత్త చూపును అందించడానికి రాసిన కథలు. వీటిల్లో స్త్రీల శరీర రాజకీయాలను చర్చకు పెట్టారు. స్వేచ్ఛ నవల స్త్రీల పౌరసత్వ భావనను చర్చకు పెట్టింది. ప్రయోగం, భిన్నసందర్భాలు కథా సంకలనాలు పునరుత్పత్తి, నిర్ణయాధికారాల గురించి ఆలోచింపజేస్తాయి.
ఉపన్యాసకులుగా పదహారేళ్ళు పనిచేశాక  హైదరాబాద్ లో చలన చిత్ర రంగానికి సంబంధించిన 'ఉషా కిరణ్' సంస్థలో తొమ్మిదేళ్లు పనిచేసి చిత్రాలు నిర్మించి పురస్కారాలు పొందింది. వనిత టివీ ఛానెల్ హెడ్ గా కూడా పనిచేశారు.

ఈమె రాసిన స్వేచ్ఛ నవలని వివిధ భారతీయ భాషల్లోకి అనువదించడానికి నేషనల్ బుక్ ట్రస్టు స్వీకరించింది.1986 నుండి 1995 వరకు ఆమె ఉషా కిరణ్ మూవీస్ లో సీనియర్ కార్యవర్గ సభ్యురాలిగా పనిచేసారు. 1991 నుండి 1997 వరకు అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ విమెన్ కు అధ్యక్షురాలిగా పనిచేసారు. ఆమె ప్రస్తుతం అస్మితలో జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

అమెరికన్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ వారు ఓల్గా వ్రాసిన 12 రచనలను, ఆమె కథల ఆంగ్లానువాదాలను తమ సంపుటిలో చేర్చారు.

రాజకీయ కథలు,
స్వేచ్ఛ,సహజ,ప్రయోగం,
మానవి,కన్నీటి కెరటాల వెన్నెల,గులాబీలు,
అకాశంలో సగం,
పలికించకు మౌనమృదంగాలు,
అలజడి మాజీవితం,
జీవితం,కన్నీటి కెరటాల వెన్నెల,అక్షర యుద్ధాలు,
అతడు-ఆమె మనం,
నవలామాలతీయం,
సరిహద్దులు లేని సంధ్యలు (వసంత కన్నాభిరన్, కల్పన కన్నాభిరన్‌లతో కలిసి) మొదలైన రచనలు చేశారు.
విముక్త, కుటుంబ వ్యవస్థ, కన్నీటి కెరటాల వెన్నెల, మానవి, మాకు గోడలు లేవు, ఉరికొయ్య అంచున, మృణ్మయనాదంతో పాటు ఇంకా కొన్ని పుస్తకాలను రచించారు. ఇవేకాక అనువాదాలు, నాటికలు, చిన్న కథలు, వ్యాసాలు రాశారు
స్వేచ్ఛ, ఆకాశంలో సగం నవలలు ఉత్తమ నవలలుగా అవార్డులు అందుకున్నాయి. 

 ఇవాళ మహిళల గురించి మాట్లాడకుండా ఎవరూ ఉండలేరు. కారణం స్త్రీవాద ఎజెండా రాజకీయాల్లో కూడా రావడం. ఓల్గా లాంటి రచయితలు దాన్ని విజయవంతంగా సమాజంలోకి ప్రవేశపెట్టగలిగారు. సారా ఉద్యమం దగ్గర్నంచి మొదలుపెడితే రాజకీయం వరకు- మహిళలు మాట్లాడుతున్నారు. మహిళలు వాదిస్తున్నారు. మహిళలు ఫైట్ చేస్తున్నారు. ఇదంతా చూసి పురుషులకు భయం పట్టుకుందంటారు ఓల్గా. నిజమే.ఫ్యూడల్ భావాలు ఇంకా బుసలు కొడుతునే ఉన్నాయి.బలమైన ఉద్యమాలను నిర్మించుకుంటూ వెళ్తే తప్ప ఆకాశంలో సగం- అవకాశంలో సగం లాంటి పదాలకు జస్టిఫికేషన్ రాదు.  సారా ఉద్యమం ఆనాడు ఉంది. ఈనాడు ప్రభుత్వమే  ఆలోచిస్తోంది.  ఇవాళ్టితో ఈ సంకెళ్లు తెగినాయంటే రేపు కొత్త సంకెళ్లు రెడీ అవుతాయి. బానిసత్వానికి సంబంధించిన వేర్లు సమాజంలో ఇంకా బలంగానే ఉన్నాయనేది అనేది ఓల్గా భావన.
        పురుషస్వామ్యం రకరకాల రూపాల్లో ఉంటుంది. విషయ పరిజ్ఞానం ఉన్న స్త్రీలు ఎక్కడ నిలదీస్తారో అని మగవాళ్లకు భయం పట్టుకుంటుంది. అందుకే మహిళల పైన హత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ విషయాల మీద ఓల్గా చాలా లోతుగా చర్చించారు. రచించారు. ఆ తిరుగుబాటు తత్వం ఓల్గా రచన లన్నింటిలోనూ ప్రతిబింబిస్తుంది. ఫెమినిజం- మేల్ ఛావనిజం ఈ రెండు క్లాసిఫికేషన్స్ కల్పితాలు కావంటారు ఓల్గా. అవి స్త్రీల జీవితాలను నియంత్రించే కమాండర్లు. బట్టల దగ్గర్నుంచి తినే తిండి, చేసే స్నేహాలు- అసలు స్త్రీ ఆలోచనా విధానాన్నే ఈ వర్గీకరణ నియంత్రిస్తున్నదని ఓల్గా నిరూపించారు.
స్త్రీవాదం సాహిత్యంలోనూ, సమాజంలోనూ బలంగా నాటుకుపోవాలన్నదే ఆమె సంకల్పం. ఆమె అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. కొన్నిసార్లు వ్యక్తిగత విషయాలపైనా దాడి చేశారు. అట్లాంటివి జరిగినపుడు బాధ పడ్డారే తప్ప.. భయపడలేదు. ఆమాటకొస్తే అలాంటి సందర్భాలు ఎదుర్కొన్న రచయిత ఓల్గా మొదటివారూ కాదు చివరివారూ కాదు. ప్రపంచంలోని అన్ని భాషల్లోని రచయిత్రులకూ అది అనుభవమే. తను కూడా అందులో భాగమనుకున్నారు. పేరుకు తగ్గట్టే ఓల్గా నదిలా ముందుకు సాగిపోతున్నారు. ఆ సాహితీ ప్రవాహంలో ప్రతీ అక్షరం భగభగ మండే నిప్పుకణంలా జ్వలిస్తునే వుంటుంది. 

స్త్రీ వాదం స్త్రీకి   పురుషున్ని పోటీగా నిలిపింది.స్త్రీని దోపిడీ చేస్తున్నాడని చెప్పింది. పునరుత్పత్తి హక్కులు కావాలని కోరింది.ఈ ఉద్యమం
ఉన్నత వర్గ స్త్రీ లకే పరిమితమైందని విమర్శలనెదుర్కొనింది.
1980లలో ఉత్తుంగ తరంగంలా వచ్చి ఇప్పుడు
సాధారణ స్థాయి లో ఉండి పోయింది.అయితే 
పురుషాధిక్యపు భావజాలం వున్నంతకాలం ఈ స్తీవాదం రగులుతూనే వుంటుంది.
మనువాదులు రాజ్యంలోకొచ్చాక వీరిలో
పోరాట స్వభావం చాలా తగ్గిపోయిందన్న విమర్శలున్నాయి.

ఓల్గా రాసిన సహజ నవల 1986 లో వచ్చింది.ఇది ఒక నలుగురు స్నేహితుల కథ. వీరు పెళ్ళి, కుటుంబం వారి జీవితాన్ని, సృజనాత్మకతను నాశనం చేసిందని, ఆ అణిచివేత నుండి బయటపడటానికి చేసే ప్రయత్నమే ఈ నవల. 
        తరువాత ఆమె కలం నుండి స్వేచ్ఛ నవల 1987 లో వచ్చింది. తెలుగులో స్త్రీ స్వేచ్ఛ పై అత్యంత వివాదాస్పదమైన, అత్యంత ప్రజాదరణ పొందిన నవలిది.  ఈ నవల స్త్రీ స్వేచ్ఛను చర్చకు తెచ్చింది. ఈ నవలను తొలి తెలుగు స్త్రీవాద నవలగా కూడా పరిగణిస్తున్నారు.
కథలోని ప్రదాన పాత్ర అరుణ చిన్నతనం నుంచి అణచివేతకు గురవటంవల్ల స్వేచ్ఛగా జీవించాలని ఆమె  కోరికుంటూ ఉంటుంది.ఆ అణచివేతనుండి బయటపడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఆప్రయత్నాలు ఒకసారి ఆమెను మళ్ళీ అణచివేత చట్రంలోకే తీసుకొచ్చి పడేస్తాయి. అరుణ తండ్రికి పెళ్ళి చేసే ఆర్థిక స్థోమత లేకపోవటం వల్ల ఎమ్ ఎ వరకు చదువుకోగలుగుతుంది.
అరుణ తండ్రి, మేనత్త ఆంక్షలు లేకపోతే, తనకు ఆర్థిక స్వాతంత్ర్యం వుంటే తన జీవితం హాయిగా సాగుతుందని అనుకుంటుంది. ఆ రెండు సాధించి ప్రకాశాన్ని పెళ్ళి చేసుకోవటం వల్ల స్వేచ్ఛ లభిస్తుందనుకుంటుంది. అది రెన్నాళ్ళ ముచ్చటే అవుతుంది. ప్రతి విషయంలోనూ తన మాటే నెగ్గాలన్న దోరణి ప్రకాశంది. ఇప్పుడే పిల్లలు వద్దంటే లేదు, కావాలి అనే ప్రకాశం అధికారం అరుణను కలవరపెడుతుంది. ఆర్థిక నిర్ణయాలు, సమాజ సేవ లాంటివి ప్రకాశంకు నచ్చవు.

“ఎంత సమర్థవంతంగా ఉద్యోగాన్ని, కుటుంబాన్ని చూసుకుంటున్నా.. అరుణ అభ్యుదయ భావాలతో సమాజంలో తిరగడం, ఒక పత్రిక కోసం పని చేయటం, ఇంటర్వ్యూలు, మీటింగ్ లంటూ తిరగడం ప్రకాశంకు నచ్చేది కాదు. భార్యంటే పూర్తిగా కుటుంబానికి పరిమితం కావాలంటాడు. సమాజంతో మనకు అవసరం లేదంటాడు. ప్రకాశంలోని మార్పును, అతని మాటలను సహించలేక పోతుంది అరుణ. అందువల్ల ఇద్దరిమధ్య గొడవలు. అతనికి నచ్చేలా వుండలేదు అరుణ. అలా వుండమంటే స్వేచ్ఛకి అర్థం లేదంటుంది అరుణ. చివరికి సంసారం కావాలో, సమాజం కావాలో తేల్చుకోమంటాడు ప్రకాశం.

బంధనాల స్వభావం తెలిసేకొద్ది అరుణకు స్వేచ్ఛ స్వరూపం అర్థమౌతుంది. సమదృష్టి లేనప్పుడు, భార్యాభర్తలు ఒకరికి ఒకరు అభిప్రాయాలను గౌరవించుకోలేనప్పుడు ఆ సంసారం సుఖంగా సాగదు. సమాజానికి తనవంతు సాయం అందాలనుకుంటుంది. ”మొత్తం సమాజాన్ని మార్చను నాకు చేతకాదని ౼ నాకు చేతనైంది కూడా నేను చెయ్యొద్దా? అలా చేయకుండా నేను బతకలేనని నాకు తెలిసిపోయింది. ఆ పనిలో నన్ను నేను నిరూపించు కుంటాను. దానివల్ల నాకెంతో తృప్తి. నా జీవితం సార్థకమవుతోందన్న భావం. ఆ భావం కలగటమే స్వేచ్ఛకు అర్థం కదూ?నా బతుకు నేను బతకటానికయితే నాకీ స్వేచ్ఛ అక్కర్లేదు. నా స్వేచ్ఛకు ఒక అర్థం వుండాలి. ఆ అర్థం కోసం అన్వేషించటమే ఇప్పుడు నా పని. నాకు ప్రపంచంతో సజీవ సంబంధం కావాలి. నా ఉనికి వల్ల సమాజానికేదో చలనం వుండాలి” అని అనుకొని చివరకు బంధాలనుండి విముక్తి కావాలనుకుంటుంది అరుణ.
“మన జీవిత పరిస్థితుల గురించిన సరైన జ్ఞానం నుంచే మనం జీవించే శక్తినీ మన జీవన సరళికి హేతువులను సంపాదించుకోవాలి. అట్లాంటి జ్ఞానాన్ని సంపాదించు కోవాలనుకునే స్త్రీలకు తమ జీవిత పరిస్థితులను అర్థం చేసుకోవటంలో ఏ కొంచెం సహాయపడినా ఈ నవల ప్రయోజనం నెరవేరినట్లే.

ఈ నవల అరుణకు గానీ అటువంటి స్త్రీలకు గానీ ఏ పరిష్కారాన్ని అందించిందా అనేది చాలా మంది అడిగే ప్రశ్న. అసలు రచయితలను సమస్యలకు పరిష్కారాలు, అందులోనూ సరైన, కరెక్టయిన, ఏ పొరపాటూ లేని ఫర్ ఫెక్ట్ పరిష్కారాలు అడగటం, వాటికోసం రచనల్లో వెతకటం చాలా తెలివి తక్కువతనం. అట్లా వెతకొద్దని “కొడవటిగంటి కుటుంబరావు గారు” ఎన్నడో చెప్పారు తన ‘సాహిత్య ప్రయోజనం’ వ్యాసాలలో.. ఒక వ్యక్తి తన సమస్యను చాలా సమర్థతతోనో, తెలివిగానో పరిష్కరించుకున్నట్లు రాసినంత మాత్రాన అది నిజమైన పరిష్కారం, అందరికీ వర్తించే మార్గం అవదు. స్త్రీ స్వేచ్చ గురించీ, లైంగిక పునరుత్పత్తి హక్కుల్ని గురించీ, రాసే రచయిత చేయగలిగిందేమిటంటే యింతవరకూ వ్యక్తి గతమైన విషయాలు నిరూపించి సాంఘిక పరిష్కారాల కోసం వెదకమని సూచించటం. ఆ సమర్థవంతంగా చేయటంలోనే నేటి స్త్రీవాద రచయితల విజయం, బలం కనిపిస్తాయి. స్వేచ్ఛ నవల అలాంటి ప్రయత్నమే నంటారు ఓల్గా.

కేంద్ర సాహిత్య అవార్డును పొందిన ఓల్గా రచించిన విముక్త 
ఒక కథా సంపుటి.ఇందులో  స్త్రీలు తమ మీద తాము అధికారాన్ని సంపాదించుకోవాలి, అస్తిత్వాన్ని నిరూపించుకోవాలి, స్త్రీలు పరస్పరం సహకరించుకోవాలని చెప్పిన సంఘటనలెన్నో కనిపిస్తాయి. ఇందులో   సీత, శూర్పణక, అహల్య, రేణుక, ఊర్మిళ పాత్రలు ఉంటాయి.
వీరి స్వగతాలను,ఆలోచనలను
నేటి కాలంలో వారెలా ఆలో చిస్తారో అలా వారందరినీ ఆమె తీర్చిదిద్దారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు