గుంటూరు శేషేంద్ర శర్మ
సుబ్రహ్మణ్యశర్మ,అమ్మాయమ్మ దంపతులకు గుంటూరు శేషేంద్ర శర్మ జన్మించారు. బాల్యం గూడూరు
సమీపంలోని తోటపల్లిలో గడిచింది.
విశ్వవిద్యాలయంలో బి.ఎల్., మద్రాసు విశ్వవిద్యాలయంలో చదివారు. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసులో 1949లో చేరి
హైదరాబాదు మునిసిపల్ కమిషనర్గా పదవీ విరమణ చేశారు.ప్రభుత్వం 'కాళిదాస సమ్మాన్' పురస్కారంతో సమ్మానించింది.
హిందీ అకాడమీ సుబ్రహ్మణ్య భారతి ఏక్తా అవార్డు, 2004-05లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హంస అవార్డుతో సత్కరించింది.
నోబెల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ చేయబడిన రెండో భారతీయుడు. తెలుగు విశ్వవిద్యాలయం వీరికి డి.లిట్ ప్రదానం చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం “
రాసేందు బిరుదం ప్రదానం చేసింది. రాష్ట్రీయ సంస్కృతి పురస్కారం ఉగాది పురస్కారం, తిలక్ అవార్డు వంటి ఎన్నో బహుమానాలు
వీరు పొందారు.
విమర్శ, కవితా రంగాల్లో శేషేంద్ర శర్మ ప్రదర్శించిన ప్రజ్ఞాపాటవాలు అనన్యసామాన్యం.
ఆయన విమర్శలో ముఖ్యాంశాలు రెండు. ఒకటి - అనుభూతి గాఢత. రెండు - మేధాతీవ్రత. అందువల్ల
ఆ విమర్శ సాహిత్య ప్రశంశగా ఉంటుంది.
(ఇంగ్లీషులో Literary Appreciation అంటామే అది).12 విమర్శనా గ్రంథాలు, 11 కావ్యాలు, అలాగే నాటకాలు, కథలు రచించడమేగాక నూతనంగా కావ్యేతిహాస ప్రక్రియను ప్రవేశపెట్టి భవిష్యత్తరాలకు మార్గదర్శకులైనారు. ఆయన వెలువరించిన విమర్శ గ్రంథాలు ‘నరుడు–-నక్షత్రాలు’, ‘స్వర్ణ హంస, షోడశి’, ‘సాహిత్య కౌముది’, ‘రక్త రేఖ’, ‘కవి సేన మేనిఫెస్టో’, ‘కాల రేఖ’, ‘ఈ నగరం జాబిల్లి’, ‘సాహిత్య వ్యాసావళి’, ‘విశ్వ వివేచన’, ‘ఊహలు’ అందరి మన్ననలు పొందాయి.శేషేంద్రశర్మ విమర్శనా పటిమకు, లోకోత్తర నిపుణతకు అద్దం పట్టిన విమర్శనా గ్రంథం ‘కాల రేఖ’ 1977లో రచించిన వైజ్ఞానిక గ్రంథమైన ‘కవిసేన మేనిఫెస్టో’కు సరితూగే గ్రంథమిది.
శేషేంద్ర శర్మకు ఇంత నిశిత దృష్టిని ప్రసాదించింది, విమర్శ సిద్ధాంతాన్ని అందించింది మార్క్సిజమే. ఆ దృష్టితోనే ఆయన కావ్య సంబంధమైన రస సిద్ధాంతాన్ని అలంకార శాస్త్రాల్ని చూడగలిగారు. నవ్య విమర్శనా భావంతో నూతన సిద్ధాంతానికి రూప కల్పనే ‘కవిసేన మేనిఫెస్టో’. ఇది వర్తమాన ప్రపంచానికి ఉపలభ్యమైన ప్రాచీన ప్రాక్పశ్చిమ కావ్య తత్వ చింతన అనే చింతనా త్రయాన్ని ప్రతిపాదించింది. రాజకీయ శాస్త్రం, నీతి శాస్త్రం, తత్వ శాస్త్రాలు మూడు సమాహారంగా మారినప్పుడే రచనకు పరమావధి లభిస్తుందని గాఢంగా విశ్వసించారాయన. అలంకార విమర్శకులు అరిస్టాటిల్, ప్లేటో లాంటి ప్రాచీన గ్రీకు పండితుల పొయెటిక్స్ని, పాశ్చాత్య సాహితీవేత్తలు ఇలియట్, గోర్కీ లాంటి వారు అనుసరించిన కమ్యూనిస్టు కళా వివేచనని భారతీయ అలంకారికులు భామహుడు, అభినవగుప్తుడులాంటి వారి సిద్ధాంతాలతో సమన్వయపర్చి చేసిన వ్యాఖ్యానం అసామాన్యమైంది. అంతకు ముందు వెలువరించిన దానికంటే ఆయన విమర్శనా దృక్పథాన్ని పదునెక్కించిన గ్రంథం ‘కవిసేన మేనిఫెస్టో’.
“ 1930లలో ప్రవేశించిన సాహిత్యముఖ రాజకీయవాదులు, వాళ్ల బానిసలు, భజనపరులు,ఛాందసవాదులు మనసాహిత్యరంగంలో నిర్వీర్యవైజ్ఞానిక వర్గ ఉపేక్షచేత, అపేక్ష చేత ఈనాడు శిఖరస్థానాలెక్కి కూర్చున్నారు. ఇప్పుడు స్వేచ్ఛావాద కవి కేవలం వ్యక్తిగతంగా నిల్చుని ఈ ముఠాల్ని ఎదుర్కొని నిలవడం కష్టం. ఈ ముఠాలు పత్రికల్ని, రేడియోల్ని, వేదికల్ని, సమస్త ప్రచార సాధనాల్నీ రాజకీయ పలుకుబడి అందజేసుకుని హస్తగతం చేసుకున్నాయి. ఒంటరిగా ఉన్న స్వేచ్ఛావాది కవులు అసహాయులై పోయారు. ఈనాటి ఆంధ్రదేశంలో ఈ ముఠాకవుల ధాటికి తట్టుకోలేక అందరూ ఏదో ఒక వర్గంలో చేరిపోయి ఆ రాజకీయపార్టీ భజన చేస్తున్నారు. కనుక స్వేచ్ఛావాదులైన కవులు రక్షణ సాధించాలంటే అది ఉద్యమరూపంలోనే ఉండవలసిన అవసరం అనివార్యం అవుతోంది. కనుకనే కవిసేన అనే పార్టీ ఈనాడు ఒక చారిత్రక అవసరం.” ఈ పరిస్థితుల్లో రాయబడింది కవిసేన మేనిఫెస్టో. ఈ పేరు వినగానే గుంటూరు శేషేంద్ర శర్మ గుర్తుకు వస్తారు.1977 లో ఈ కవిసేన మేనిఫెస్టో వెలువడింది. దీని కర్త గుంటూరు శేషేంద్ర శర్మ. ఇవ్వాళ దీన్ని గురించి తెలిసిన వాళ్ల సంఖ్య అల్పం.
కవిసేన మేనిఫెస్టోను శేషేంద్రశర్మ ఆధునిక కావ్యశాస్త్రమని,వైజ్ఞానిక ఉద్యమని అన్నాడు. ఇందులో కవిసేన నియమాలు-ఆశయాల వివరణ కొంతైతే తక్కినదంతా ఆధునిక కావ్యవిమర్శే.
అసలు కవిత్వమంటే ఏమిటి? కవిత్వ ప్రయోజనమేమిటి? అన్నవి ప్రధాన ప్రశ్నలీ మేనిఫెస్టోలో. ఈ నిర్వచనాల కోసం ప్రాచ్యపాశ్చాత్య కవిత్వ సిద్ధాంతాలన్నింటినీ ఆయన అవలోకనం చేశాడు. ప్లేటో మొదలుకొని మావో దాకా వేదాలు మొదలుకొని పురాణేతిహాస కావ్యాల దాకా ఆయన ఉటంకించాడు. ఆయా సిద్ధాంతాల కనుగుణంగా పూర్వకవులనుండీ తన కవితలనుండీ ఉదాహరణలిచ్చాడు.
కవిసేనకు ఉండవలసిన ఆశయాలను ఇలా వివరించారు.
ఇది కవుల పార్టీ.
కవికి కవితా శిల్పం ముఖ్యం. కవికీ – సమాజానికీ ఉండే సంబంధాలు విశిష్టమైనవి. –వీటిపై ఈ సంస్థ రూపొందించబడింది.
కవిత్వానికి ఒక ప్రమాణం నిర్ణయించాలి. ఈ ప్రమాణం ప్రపంచంలో కవిత్వ తత్త్వవేత్తలు ప్రతిపాదించిన సిద్ధాంతాలు పరిశీలించి, ఏదో ఒక సార్వత్రికమైన సూత్రాన్ని స్వీకరించాలి. అన్నిదేశాల్లో, అన్నికాలాల్లో అగ్రగణ్యమైన కవుల కృతులను జోడించి వర్తమాన కవితని కొలిచి తీరాలి – కవిత కానిదాన్ని నిర్దాక్షిణ్యంగా బహిష్కరించాలి. కవితకు కొలబద్దలేదనే అశాస్త్రీయ దృక్పథాన్ని ఖండించాలి.
ఆర్థిక సామాజిక సమస్యలను
పరిష్కరించిన మార్క్సిస్టు సిద్ధాంతాన్ని కనీస పరిష్కారంగా స్వీకరించాలి.
సమగ్ర మానవజీవితంలో రాజకీయం ఒక భాగం మాత్రమే. కానీ కవి సంపూర్ణ మానవ జీవితంతో సంబంధం ఉన్నవాడు. కనుక కవిబాధ్యత రాజకీయ భాగానికే పరిమితం కాదు. ప్రస్తుత సామాజిక సందర్భాన్ని అనుసరించి కవి దృష్టిలో రాజకీయం హెచ్చు భాగం తీసుకోవచ్చు కానీ, కవి సంపూర్ణమానవుని మీద తనకున్న బాధ్యతల్ని విస్మరించి ఒక పరిమిత ప్రయోజనాలకు మాత్రమే బద్ధుడై పోకూడదు. కవి సరాసరి మానవజాతికి బాధ్యుడు. ఒక రాజకీయ పార్టీకి కాదు. పై కారణాల చేత అంటే మొత్తం మానవజీవితం పట్ల కవికి బాధ్యత ఉండడం చేత కవి బాధ్యత రాజకీయ పరమైన బాధ్యతకంటే గురుతరమైనది. కనుకనే మానవ సమాజక్షేమం కోసం కవి నాయకత్వం అన్నింటికంటే అగ్రగణ్యం కావాలి. ఈ వైజ్ఞానిక నాయకత్వాన్ని నెలకొల్పడానికి కవిసేన ముఖ్యంగా ఉద్యమిస్తుంది.
కవి కుల,మత,కాల,భాష, దేశాలనే పంచవిధ బంధాలను అధిగమించి వాటిని తెంచుకొని బయటపడాలి.
కవిత్వం, కవిపాత్ర – భాషాపరంగానే ముగిసిపోకుండా ఆచరణపరంగా అన్వయం అయితేనే దానికి అర్థం ఉంటుంది.
కథకుడు, నవలాకారుడు, విమర్శకుడు, నాటక రచయిత కూడా కవిగా పరిగణించబడతాడు ఈ కవిసేనలో. దీనికొక షరతు కూడా ఉంది.
ఇది రాజకీయ ఉద్యమం కాదు. ఇది ప్రధానంగా వైజ్ఞానిక ఉద్యమం. కవికి రాజకీయాలతో సంబంధం ఉంటుంది. కానీ రాజకీయ పార్టీలతో ఉండదు. రాజకీయ పార్టీల వాళ్లు సభ్యులుగా ఉండవచ్చు కానీ వారు కవిసేన ఆశయాలకు లోబడి మాత్రమే ఉండాలి.
కవిత్వానికి ఒక ప్రమాణం నిర్ణయించాలనడం,దీనికొక సార్వత్రిక సూత్రాన్ని స్వీకరించాలని, వర్తమాన కవితలను అన్నిదేశాల్లో, అన్ని కాలాల్లో అగ్రగణ్యులయిన కవుల కృతులతో పోల్చి కొలవాలంటాడాయన. అలా కొలిచి ఆ కొలతకు నిలబడని అకవిత్వాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించాలంటాడు. రచయితను కూడా తన రచనను పూర్వమహాకవుల రచనలతో పోల్చుకొని వాటిని పోలగలిగితేనే లోకం మీదికి వదలమంటాడు. కవిత్వస్థాయిని నిర్ణయించేది సహృదయహృదయం కాక నిర్దిష్టంగా 1, 2, 3 అనిమార్కులు వేయదగిందిగా ఉంటుందా అనేది ప్రశ్నార్థకమే. వాల్మీకినో, కాళిదాసునో ప్రమాణంగా తీసికొంటే అసలు సంస్కృతంలో కవిత్వముంటుందా? అన్నది కూడా ప్రశ్నే.ఇవన్నీ ఎవరు చేస్తారన్న ప్రశ్న కు సమాధానం కూడా లేదు.
కవితకు కొలబద్ద ఉందా కొలబద్ద ఎప్పుడూ సాపేక్షికమే కదా!
వివిధ సామాజిక సమస్యలకు పరిష్కారం మార్క్సిజమేనని ఆయన విశ్వాసం. కవిసేన కవుల విశ్వాసం ఇది. కాని ఇదే విశ్వాసాన్ని ప్రకటించే ఎందరో కవుల కవితల్ని ఆయన అకవిత్వమని తిరస్కరించాడు.
మానవజీవితంలో రాజకీయం ఒక భాగమేనననీ, అది ఒకప్పుడు ప్రాధాన్యం వహించవచ్చు గాని; అదే సర్వస్వం కాదనీ, కవి మొత్తం మానవజీవితానికి బాధ్యుడనీ అంటాడాయన. కవి రాజకీయ పార్టీకి బాధ్యుడు కాదంటాడు.
అందరు రచయితలు చెప్పినా చెప్పకపోయినా ఇదే అవలంబించారు.తామే పార్టీ విశ్వాసులం కాదంటూనే ఏదో ఒక పార్టీ ని వీరు ఆరాధిస్తుంటారు.
కవి వైజ్ఞానిక దృక్పథం అలవర్చుకోవాలన్నారు. బహుశా రచయితల కు
ఈ దృక్పథం ఏర్పడాలంటే
మరో వందేళ్లు పట్టొచ్చు.
కవి కులమతకాల భాషా దేశ భేదాలకు అతీతుడుగా ఉండాలనడం కవికే కాదు ప్రతి మనిషికీ వర్తిస్తుంది. అది ఆదర్శం.
కవికి నిబద్ధత అన్వయమైనప్పుడే దానికి అర్థం ఉంటుందంటాడు. ఇది మరింత వివరింపవలసిన అంశం. కవే దేశానికి నాయకత్వం వహించాలన్నదీ దీనితో సంబంధించిందే. రాజకీయం లేకుండా ఇది సాధ్యం కాదు. కవి లక్ష్యం ఇదేనా? అన్నది చర్చనీయాంశం.
కవిని విస్తృతార్థంలో తీసుకున్నారు.కవంటే రచయిత,నాటకరచయిత,
ఇలా ఎవరైనా సాహిత్య సంబంధమున్నవారెవరైనా
అనే అర్థంలో ఆయన కవి అనే పదాన్ని తీసుకున్నారు.
ఆనందవర్ధన, అభినవగుప్తాదుల కవితా సిద్ధాంతాలను శేషేంద్ర శర్మ అంగీకరించాడు. వాచ్య, లక్ష్య, వ్యంగ్యాలలో కావ్యం వ్యంగ్య ప్రధానమైనది. ఈ మూడూ ఉత్తరోత్తరం శ్రేష్ఠమైనవి.
నన్నయతో మొదలుకొని చిన్నయ దాకా తెలుగు సాహిత్యమంతా వాచ్యార్థ ప్రధానమనీ, భావకవిత్వం మాత్రం కొంచెం లక్ష్యార్థ ప్రధానంగా సాగిందనీ వారి అభిప్రాయం.
అందువల్ల స్వేచ్ఛావాదులైన కవులు, విమర్శకులు ఒక పార్టీ కావాలి. వివేకవంతులైన కవులూ, విమర్శకులు సర్వులూ కవిసేనని బలపరచాలి. ఈ నేపథ్యంలో, ఈ ఆవశ్యకతతో కవిసేన ఏర్పడింది.
కవిసేనకు సమాజం కావాలి. కాని సామాజిక చైతన్యం, స్పృహ అని నినాదాలు చేసేవారి సామాజిక చైతన్యం కాదు.
“మనకళ్లు సూర్యోదయం కోసం తహతహలాడే తరుణంలో తెల్లవారు జామున్నే కనిపించే రెండుముఖాల్లో ఒకటి వచన కవితా వీరకుంకుమ ధరించిన బుడబుక్కలవాడు. మరొకటి వాడి కొడుకు, సామాజిక చైతన్యగానం చేసేపాములవాడు… కనబడగానే వాళ్లమీద పేడనీళ్లు చల్లండి.” అంటాడు.
“కవికి సామాజిక స్పృహ కావాలి. కాని వర్తమాన ఆంధ్రకవితా రంగంలో ఈ సామాజిక స్పృహ ఒక నీచస్థాయి నినాదరూపం ధరించి భయంకర సుడిగుండంలా ఏర్పడింది. ఈ నినాదం నుంచి యువకుల్ని రక్షించుకోవలసిన సాహిత్య అవసరం బాధ్యతాయుతమైన సామాజిక స్పృహ ఉన్నవాళ్లందరి మీదా ఉంది.”
ఈ సామాజిక చైతన్యం, కవితా వస్తువు అన్న రెండు అంశాలను సమకాలిక కవి, విమర్శకులు ఉపయోగించుకుంటున్న తీరును శేషేంద్రశర్మ తప్పుపట్టాడు.
“ఎలా చెప్పాడో ముఖ్యంకాదు, ఏది చెప్పాడన్నది ముఖ్యం” అనేవాళ్లు ఎవరన్నా ఇంకా ఉంటే వాళ్లని ఏం చేయాలో తెలుగుదేశం తేల్చుకోవలసిన చారిత్రిక సన్నివేశం ఈనాడు ఏర్పడింది అంటాడాయన.
వస్తువుదేముంది. కోట్ల వస్తువులీ లోకంలో అంటాడు.
“…కేవల సామాజికచైతన్యం కూపస్థమండూకంగా మరణించకూడదు.” అంటాడు
గుంటూరు శేషేంద్ర శర్మ క్రోధమంతా సమకాలిక కవులు, కవిత్వం, విమర్శకుల మీద.
“ఈరోజు తెలుగుకు పట్టిన గ్రహణం ఏమిటి? అన్యవృత్తులనాశ్రయించి బ్రతకవలసిన యోగ్యత ఉన్నవాళ్లందరికీ కవిత్వమొక్కటే లోకువ అవుతోంది.” అంటాడు.
“దాదాపు నలభయ్యేళ్లు తెలుగుకవులూ విమర్శకాగ్రేసరులూ అదేపనిగా ‘వస్తువు’ నే చర్చించారు; మరి దేన్ని గురించీ చర్చించలేదు. సామాజిక చైతన్యం, ఆత్మాశ్రయ కవిత్వం రొమాంటిసిజం మార్క్సిజం అస్తిత్వవాదం, ఇలాగా, ఈ వెధవ చెత్తలో నుంచే పీకిపీకి తాళ్లు పేనుతూ సాహిత్యవిమర్శ అనే లేబిల్ తగిలించి వాణిజ్యం చెలాయిస్తున్నారు” అంటాడు.
“కవిత్వ విమర్శకుడు తన విమర్శనా వస్తువైన కవితలో వ్యుత్పన్నత ఎన్నిపాళ్లు ఉంది అని ముందు పరీక్షించాలి అనీ వ్యుత్పన్నత తక్కువ వున్న వాడికి నేల టికెట్టు ఇవ్వాలేగానీ రిజర్వుడు సీటు ఎక్కించి కూర్చోపెట్టకూడదు అనీ ఉద్ఘోషిస్తుంది కవిసేన” అంటాడు.
“….దొంగ కవిత్వాలు రాసీ చచ్చు కథలు పేనీ రాజకీయ జెండాల నీడల్లో మేడలు కట్టుకొనీ నలభై ఏళ్ల నుంచీ కాలక్షేపం చేస్తున్నారు.” అని విమర్శిస్తాడు.
“ఈ సాహిత్యద్రోహుల్ని వాళ్ల కోటలతో సహా విధ్వంసం చేసే చారిత్రిక కార్యం కోసమే ఈనాడు కవిసేన పుట్టింది” అంటాడు.
ఇలా కవిసేన మానిఫెస్టో నుంచి వాక్యాలు ఉద్ధరించుకుంటూ పోతే సమకాలీన కవి విమర్శకుల గురించి శేషేంద్రశర్మ క్రూరవ్యాఖ్యలెన్నో ఉటంకించవలసి ఉంటుంది. సమకాలిక కవిత్వమంతా అకవిత్వమనీ, కవులూ విమర్శకులూ మూర్ఖులనీ, వాళ్లు కవిత్వమంటున్న అకవిత్వాన్ని అంతకంటే మూర్ఖులైన పాఠకులు కవిత్వమని నెత్తిన పెట్టుకుంటున్నారనీ, నిజమైన కవిత్వాన్నీ, కవుల్నీ, విమర్శకుల్నీ గుర్తించడం లేదనీ, అకవులే రాజ్యమేలుతున్నారనీ సింహాసనాలెక్కి ఊరేగుతున్నారనీ, రాజకీయ పార్టీల మద్దతులో, వారి తొత్తులుగా వ్యవహరిస్తున్నారనీ ఆయన విమర్శ.
వచన కవితా పితామహులూ, గడ్డాలగాళ్లూ, వస్తువే సాహిత్యమని నినాదప్రాయమయిన కవిత్వం రాస్తూ శేషేంద్రశర్మ వంటివారు రాస్తున్న కవిత్వంలో అర్థమేమిటని ప్రశ్నించేవాళ్లూ మూర్ఖగార్దభాలని ఆయన విమర్శ.
మొత్తంమీద చూసినప్పుడు కవిత్వసిద్ధాంతాల గురించి కవిసేన చేసిన చర్చలో లోపమేమీ లేదు. కాని కవిసేన లక్ష్యాల గురించీ, ఆ లక్ష్యాల సాధనలో కవిసేన నిజాయితీ గురించీ కొంత ఆలోచించవలసి ఉంది. ఏ సంస్థ ఆశయాలు ప్రకటించుకుంటుందో ఆ ఆశయాల సాధనలో దాని కృషి ఎలా సాగింది, ఎంత దూరం ప్రయాణించింది, ఏం సాధించింది అన్నది చివరిగా లెక్కలోకి రావలసింది.
కవిసేన ఒక క్రియాశీలమైన సంస్థగా ఎప్పుడూ కనిపించలేదు. ఏదో ఒకానొక ఆవేశపూరితక్షణంలో పుట్టి ఎటువంటి ఉద్యమరూపమూ తీసుకోలేదు.అదెప్పుడు ముగిసిందో కూడా తెలియదు. తెలుగుసాహిత్య రంగంలో ఒక గణనీయమైన ఉద్యమంగా అది నిలవనే లేదు. కాబట్టి తెలుగు సాహిత్యచరిత్రలో అది ఒక స్థానాన్ని సంపాదించుకోలేకపోయింది.
గుంటూరు శేషేంద్ర శర్మ ఒక విశిష్టకవి. తెలుగు సాహిత్యోద్యమాలనబడే వాటిలో వేటిలోనూ ఇమిడేవాడు కాదు. అందువల్ల గొప్పకవే అయినా దేనికీ ఆద్యుడు కాకపోయాడు. వచనకవితకు కుందుర్తి ఎలానో విప్లవకవితకు శ్రీశ్రీలాగానో, భావకవిత్వానికి కృష్ణశాస్త్రిలాగానో, సంప్రదాయానికి విశ్వనాథలాగానో శేషేంద్ర దేనికీ ఆద్యుడు కాలేకపోయాడు. బహుశా ఇదే ఆయన కవిసేన స్థాపనకు దారితీసి ఉంటుంది. అయితే అది ఒక ఉద్యమరూపాన్ని ధరించలేదు. దాన్ననుసరించేవారు లేక ఏకాకిగానే ఉండిపోయాడు. ఒక ఉద్యమ నాయకుడు కాకపోయినా మంచికవిగా సాహిత్య లోకంలో శేషేంద్ర గుర్తింపు పొందాడు.
‘ఎప్పుడు ఆకు రాలి పోతుందో గాలికే తెలియదు’ అంటూ 30 మే 2007న శేషేంద్ర తన జీవిత ప్రస్థానం ముగించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి