అబ్బూరి ఛాయాదేవి




అబ్బూరి ఛాయాదేవి రాజమహేంద్ర వరంలో1933 అక్టోబరు 13 లో సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.1951-53 మధ్య నిజాం కళాశాల నుండి ఎం.ఏ. చదివారు. 1953లో కాలేజీ మాగజైన్ లో ప్రచురించిన అనుభూతి వీరి మొదటి కథ. అప్పటి నుంచి ఛాయాదేవి గారు చాలా వరకు మధ్య తరగతి కుటుంబాలలోని స్త్రీలు ఎదుర్కొనే సమస్యల గురించి, పురుషాధిక్యతకు లోబడిన స్త్రీల గురించి చాలా కథలు రాసారు. కొన్ని కథలు హిందీ, తమిళ, మరాఠి, కన్నడ భాషలలోకి అనువదించ బడ్డాయి. వీరి కథల్లో బోన్‌సాయ్ బ్రతుకు, ప్రయాణం సుఖాంతం, ఆఖరికి ఐదు నక్షత్రాలు, ఉడ్‌రోజ్ కథలు చాలా ప్రసిద్ధిపొందాయి. ఆడపిల్లల పెంపకంలోను, మగపిల్లల పెంపకంలోను వివక్ష చూపిస్తూ ఆడవాళ్ళ బ్రతుకుల్ని బోన్ సాయ్ చెట్టులా ఎదగనివ్వటం లేదని చెప్పే కథ బోన్ సాయ్ బ్రతుకు. ఈ కథని 2000 సంవత్సరంలో ఆంధ్రపదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో చేర్చింది. కన్నడ ప్రభుత్వం కూడా ఆ కథ అనువాదాన్ని పాఠ్యపుస్తకంలోకి తీసుకున్నారు.ఆమె 'బోన్సాయ్ బతుకులు' కంటే మంచి ఫెమినిస్టు కథ ఉంటుందా? అతి సులువుగా జెండర్ పాఠాలనెన్నింటినో ఆమె తన కథలలో చెప్పారు. ఆమె తనకు తెలిసిన బాగా పరిచయమైన మధ్యతరగతి స్త్రీల గురించే రాశారు. తను ఎవరి కోసం రాస్తున్నానో, ఎవరు తన పాఠకులో ఆమెకు తెలుసు. ఐతే వివక్షను, అసమానతలు ఎత్తిచూపడానికి ఆమె ఎంచుకున్న జీవితాలు, ఇతివృత్తాలు ఎంతో బాగా సరిపోయాయి. స్త్రీలు చేసే చాకిరి, స్త్రీలకు పని చేసే చోట ఎదురయ్యే లైంగిక వేధింపులు, భర్తలకు నీడల్లా బతకాల్సిన పరిస్థితి, వీటన్నింటి మీదా తిరగబడాలనిపించే వారి మానసిక స్థితి- వీటిని ఛాయాదేవిగారు చాలా నేర్పుగా పట్టుకున్నారు.
ఆమె కథలలో స్త్రీలు తిరుగుబాటుదార్లుగా కనిపించరు. కానీ, తిరుగుబాటుదార్లే. వారి మార్గం వేరు. తమ జీవితాలలోని అణచివేతను తప్పించు కోవడానికి వారెంచుకున్న దారులు చాలా భిన్నమైనవి. తమ జీవితాలలో పెను మార్పులు రాకుండానే మెల్లిమెల్లిగా తమకంటూ కొంత చోటు కల్పించుకుని దానిని మెల్లిగా విస్తరించుకుంటూ పోతారు. అది కుదరనపుడు కూడా 'సుఖాంతం'లో వలే నిరసన ప్రకటన చేసి నిష్క్రమిస్తారు. ఆ నిరసన ఒక తిరుగుబాటుగానే ఉంటుంది

ఈ సుఖాంతం కథను నేషనల్ బుక్ ట్రస్ట్ వారి కథాభారతి అనే సంకలనంలో 1972లో ప్రచురించబడింది.

ఛాయాదేవి వృత్తిరీత్యా న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో డిప్యూటీ లైబ్రేరియన్ గా పనిచేసి 1982లో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు.

1993లో వాసిరెడ్డి రంగనాయకమ్మ సాహిత్య పురస్కారం, 1996లో మృత్యుంజయ పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నారు. 2000 సంవత్సరంలో కళాసాగర్ పందిరి సాహితీ పురస్కారాలు అందుకున్నారు. 2005 సంవత్సరంలో తనమార్గం అనే కథాసంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్నది.
జిడ్డు కృష్ణమూర్తి తాత్త్విక దృక్పథమే ఆమె జీవితాన్ని నడిపించింది. ప్రతి క్షణాన్నీ విలువైనదిగా భావించి జీవించడం, జీవితం పట్ల ప్రేమ పూర్వక నిర్లిప్తత, మనుషుల పట్ల అవ్యాజమైన ప్రేమాసక్తులు, ఇవన్నీ ఆమెకొక ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. 1933లో రాజమండ్రిలో పుట్టిన ఆమె 1997లో కర్నాటకలో పుట్టిన వారికి కూడా అభిమాన రచయిత్రి కాగలిగిందంటే కారణం ఆమె కథలలో ప్రతిఫలించిన ఆమె వ్యక్తిత్వమే.తన మార్గం' కథలో వర్థనమ్మ కొడుకులను కాదని తన ఇంట్లో తాను బతుకుతూ తన స్వతంత్రతను సంపూర్ణంగా అనుభవించిన తీరు రాసిన ఛాయాదేవి, 'తన మార్గం' తాను వేసుకున్నారు. జీవితంలో డిటాచ్‌మెంట్ ఎంత అవసరమో ఆమెకు బాగా తెలుసు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు