వేమన
కుటుంబం పట్ల మమకారమున్న వేమన
కుటుంబం నుండి వెలుపలికి వచ్చి సన్యాసిగా మారినా పచ్చనికుటుంబం,కలతలు లేని కుటుంబం పరిఢవిల్లాలని మనసా, వాచా కోరుకున్నాడు వేమన. కుటుంబంలో భార్యభర్తల మధ్య కలతలులేకుండా వుండాలంటాడు. వారి మధ్య సఖ్యత లేకుంటే ఆ కుటుంబం ఒక సూర్యగోళమే.ఆరనికుంపటే. ముఖ్యంగాభార్యభర్తల మధ్య ప్రేమానురాగాలు ఆ కుటుంబ బంధాన్ని గట్టిగా పట్టి వుంచుతాయి. భార్యగయ్యాలైతే భర్త వేదాంతి
అవుతాడంటారు. గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ వేదాంతిగా మారడానికి కారణం భార్య గయ్యాళితనమేనంటారు. వేమన
భార్య కూడా గయ్యాళేనని పరిశోధకుల అభిప్రాయం. దానితో వేమన కుటుంబంవదలి బయటికొచ్చి కుటుంబ సఖ్యత ఆవశ్యకత గురించి జనానికి హితబోధచేశాడని తెలుస్తోంది. గయ్యాళి భార్య గురించి చేసిన ప్రస్తావన క్రింది పద్యం మనకు స్పష్టం చేస్తుంది.
చెప్పులోని రాయి చెవులోనిజోరీగ
కంటిలోని నలుసు కాలిముల్లు
నింటిలోని పోరు నింతంతగాదయా || విశ్వ!!
వేమన భౌతికవాది, నేలవిడిచి సాము చేయడు. ఇహలోక ధర్మం గురించి స్పష్టమైన అభిప్రాయాలు గలవాడు. అందుకే గృహసీమ స్వర్గసీమగా ఎప్పుడు అవతరిస్తుందో ఆయనకు బాగా తెలుసు. కింది పద్యం దీనిని విశదం చేస్తుంది.గృహానికి శోభనిచ్చేదేమిటో ఇల్లు చూసి ఇల్లాలిని చూడమన్నారు. ఇల్లాలే జగతికి జీవనజ్యోతి అని ఓ సినిమా కవి
పాడాడు. ఇంటి శోభకు నిలయమైనదేదో వేమన విప్పిచెప్పాడు క్రింది పాదాల్లో
గుణవతియగు యువతి గృహము చక్కగ నుండు
చీకటింట దివ్వెచెలగురీతి
దేవియున్న ఇల్లు దేవార్చన గృహంబు || విశ్వ!!
కుటుంబంలో ఒక్కడు గుణవంతుడుంటే చాలు. ఆ కుటుంబానికి మంచి పేరు వస్తుంది. ఆనాటి కుటుంబం ఉమ్మడి కుటుంబం. అందువల్ల ఒక్కనివల్లే ఆ కుటుంబానికి లేదా వంశానికి పేరు ప్రఖ్యాతులువస్తూండేవి. నేడు
పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఉమ్మడి కుటుంబం విచ్ఛిన్నమవుతోంది. అందుకే చిన్న కుటుంబాలుగా మారిపోతు న్నాయి. వేమన ఆనాటి కుటుంబ వ్యవస్థ లక్షణాన్ని చెప్పినా, నేటికీ అది వర్తిస్తుంది.
కులములోన నొక్క గుణవంతు డుండెనా
కులము వెలము వాని గుణముచేత
వెలయు వనములోన మలయజంబున్నట్లు
|| విశ్వ!!
డబ్బు సంబంధాలే మానవ సంబంధాలుగా మారతాయి పెట్టుబడిదారీ సమాజంలో. నేడున్న సమాజం అలాంటిదే. కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య, భార్య భర్తల మధ్య ఇలాంటి సంబంధాలే రాజ్యమేలుతున్నాయి.
ఇది పెట్టుబడిదారీ విధాన అవలక్షణం. ఎవని బ్రతుకు వానిదే అని చెప్తుంది పెట్టుబడిదారీ వ్యవస్థ. దాంతో సమిష్టితత్వం విరిగి వ్యక్తి స్వామ్యం అవతరిస్తుంది. అందుకేనేమో నేటి తల్లిదండ్రులను పట్టించుకోకుండా వుండే పుత్రులెంతో మంది ఉన్నారు. వీలైతే వృద్ధాశ్రమంలో చేర్పించేవారు కూడా చాలా మంది వున్నారు. విదేశాలకు వెళ్లిన పుత్రులు
స్వదేశంలో తల్లిదండ్రులు మరణిస్తే 'కండోలెన్స్ మెసేజ్' ఇచ్చే పరిస్థితి కూడా ఉంది. ఇలాంటివి ఆనాటి సమాజంలో చెదురుముదురుగా కనిపించే వుంటాయి. అందుకే అలాంటి పుత్రులను ఏవగించుకుంటూ ఇలా అంటాడు గదా!
తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు
పుట్టనేమి ? వాడు గిట్టనేమి ?
పుట్టలోన చెదలు పుట్టదా ? గిట్టదా? || విశ్వ!!
స్వయంగా అనుభవించినవానికే తెలుస్తాయి లోటుపాట్లు.అనుభవం అయితేనే గాని తత్వం బోధపడదని అంటారు. సిగరెట్లు తాగేవానికే తెలుస్తాయి, ఆ పొగ ఇచ్చే సమస్యల గురించి.వేశ్యాలోలునికే తెలుస్తుంది ఎయిడ్స్ బాధల గురించి.వేశ్యల వెంట తిరగటం అవివేకమని స్వయంగా గ్రహించిన వేమన పురుషుల జారత్వాన్ని ఈసడించాడు.
ఇంటియాలు విడిచి యిల జారకాంతల
వెంటదిరుగు వాడు వెర్రివాడు
పంట చేను విడిచి పరిగె ఏరినట్లు || విశ్వ!!
స్త్రీ వ్యామోహహాన్నిఅభిశంసించిన వేమన
ఎవరికైనా అనుభవమైతేనే గాని తత్త్వం బోధపడదంటారు.అలా స్వానుభవంతో జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకున్నవాడు వేమన. అందుకే మోహం వదులుకోమని పలుమార్లు సెలవిచ్చాడు.
అంగమెల్ల పొంగి అటుదంత ములవీడి
తనువు జరయిచేత తరచువణకి
ముప్పుతిప్పలు బడమోహంబు లూడవో
|| విశ్వ!!
పురుషుడు బాహ్య సౌందర్యానికి దాసుడవుతాడు. స్త్రీ సోయగాలు, వంపు సొంపులు చూసి మైమరచి మోమరాగం
ఆలపిస్తాడు. అంతః సౌందర్యం వదలి అంతరంగంలో వలపు తలుపులు తెరుస్తాడు. అంతేగాక దేహం రక్తమాంసాల
అస్థిపంజరమని దేహంతర్భాగంలో మురికి మస్తుగా వుంటుందనే విషయం మరచిపోతాడు. ఇదే నేటికీ పురుషుల
బలహీనత. దీనిని అధిగమించిన వేమన పురుషలోకాన్ని హెచ్చరించాడీ పద్యంలో...
కాంతమేను జూచి కళవళపడుదురు
కడుపులోని రోతగాసలేరు
ఇంత రోత బ్రతుకు ఈదేహమేలరా || విశ్వ!!
స్త్రీవ్యామోహం సాధారణ పురుష పుంగవులకే కాక యోగులకు కూడా వుంటుంది. అనాటి సమాజంలో యోగు లనబడే వాళ్ళంతా ఆబాపతువాళ్లే. నేడూ సత్యానందస్వాముల్ని మనం చూశాం. 'బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు' అన్నది లోకోత్తర సామెత. వీటిని గమనంలో
వుంచుకొనే వేమన తన పద్యంలో యోగుల మానసిక చిత్తవృత్తిని బహిర్గతం చేశాడు.
వెర్రివానికైన వేషధారినైన
రోగికైన పరమయోగివైన
స్త్రీలజూచి నపుడల చిత్తంబురంజిల్లు ||విశ్వ!!
రాజరికాలు రాజ్యమేలు ఆనాటి సమాజంలో రాజులు కేవలం స్త్రీల అంద చందాలను జూచి రకరకాల సౌకర్యాల నందించేవారు. కవి చౌడప్ప దీన్ని నిరసిస్తూ అనేక బూతుపద్యాలు రాశాడు. సమాజంలో నేటికీ చాలా మంది పురుషులు ఇలాంటి వ్యవహారాన్ని నడుపుతూ వుండటం మనం చూస్తూనే వున్నాం. ప్రధానంగా వలపు రగలిన చోట చెలిమాట తీపిగానే వుంటుంది. అదే రాజుకే వలపురగలితే, తావలచిన మగువ మనసు దీర్చటం ఆయన పరమావధిగా
మారుతుంది. గతంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి తన ప్రేయసి అడుగుజాడల్లో నడచాడని ప్రతీతి. ఇలాంటి దృష్టాతాలు
పురాణాల్లో, చరిత్రలో ఎన్నో వున్నాయి. అందుకే వేమన అరటి పండొలిచి పెట్టినట్లు పద్యం వదిలాడు.
పనసతొనలకన్న పంచదారలకన్న
జుంటి తేనెల కన్న జున్ను కన్న
చెరుకు రసముకన్న చెలిమాటతీపిరా ||విశ్వ!!
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి