విశ్వనాథ అంతరంగం లో శ్రీశ్రీ
1967-68 లలో ఓ సారి విశ్వనాథ సత్యనారాయణతో , జర్నలిస్ట్ శ్రీరమణ ఇలా సంభాషించారు.
'శ్రీ శ్రీ గారిమీద మీ అభిప్రాయం?' అన్నాను.
నాకళ్లలోకి చూస్తూ 'అవసరమా?' అన్నారు. దర్శించినిలువుగా తలవూపి మరింత ఒదిగాను. వెనకసీట్లో జారగిలగావున్న విశ్వనాథ నిటారుగా కూర్చు న్నారు. లాల్చీ జేబులోంచి పొడుంకాయ తీశారు. బరువైన ఫేవలుబా వాచీని సవరించి బిగించారు. జరీ ఉత్తరీయపు రెండు కొసల్ని గుండెలకు హత్తు కున్నారు. నశ్యం మంచి పట్టుపట్టి, ఆ తన్మయత్వం లోంచి తేరుకొని, తల విదిల్చి సందర్భానికి వచ్చారు.
'ఆ ఏమిటన్నావు. ఆ.. శ్రీశ్రీ.. చెబుతా- క్షీరసాగరమథనం ఒక గొప్ప సన్నివేశం. యుగానికొక మహత్తర ఘటన. చెప్పాలంటే, కృతయుగానికిది, త్రేతాయుగానికి సీతారామ కల్యాణం, ద్వాపర యుగానికి కురుక్షేత్ర సంగ్రామం. ఎందువల్ల? ఇది వేరేవిషయం. ఆ మహామథనంలో ఐరావతం, కల్పతరువు,
కామధేనువు, ఉచ్చైశ్రవం, చంద్రరేఖ, వారుణి
వాహిని, అచ్చర కన్నెలు... ఏమేమి అద్భుతాలు...!
మేమంతా అంటే ఎవరన్నమాట సంప్రదాయ కవులు...మాకు ఇవన్నీ కనిపించాయి. మేము వీటిని దర్శించి,పరవశించి ఎన్నెన్ని పద్యాలు చెప్పాం! ఎన్నెన్ని వెనక పాటలు పాడాం. ఆయా దృశ్యాలు కవితామయంచేశాం.
మరి నువ్వన్న ఆ శ్రీ శ్రీ అన్నవాడున్నాడే అతడేమి
చూశాడు? ఆ మహామథనంలో మంథరగిరి వొరిపిడికి నలిగిపోతున్న అట్టడుగు జీవరాశిని చూశాడు.
అంతేనా, ఆ కొండకింద చితికి చివుకుతున్న కోట్లాది అల్ప ప్రాణుల తాలూకు రక్తజీరను
శ్రీ శ్రీ చూశాడు. చలించాడు. గొంతువిప్పాడు. ఆ నిమ్నజీవుల ఆక్రందనల్ని లోకానికి వినిపించాడు. ఇదీ వైవిధ్యం.'
నేను రెప్పవేయక విశ్వనాథని చూస్తూ వుండి పోయాను. ఇలాంటి విశ్లేషణ వస్తుందని నేను ఊహించలేదు.
(శ్రీ ఛానెల్-2 నిరంతర హాస్యవ్యంగ్యప్రసారాలు, 2014)
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి