పఠాభి(తిక్కవరపు పఠాభిరామిరెడ్డి)




"పద్యాల నడుముల్ విరగదంతాను
చిన్నయ సూరి బాలవ్యాకరణాన్ని చాల దండిస్తాను
ఇంగ్లీషు భాషాభాండారంలో నుండి
బందిపోటుంజేసి కావల్సిన మాటల్ని దోస్తాను
నా ఇష్టం వచ్చినట్లు జేస్తాను,
అనుసరిస్తాను నవీనపంధా; కానీ
భావకవిన్మాత్రము కాన్నేనే
నహంభావ కవిని —- అని ప్రకటించిన పఠాభి 1919 ఫిబ్రవరి 19 న నెల్లూరులో స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబంలో జన్మించాడు. తండ్రి పేరు రామిరెడ్డి. భూస్వామి. మహాత్మా గాంధీ వారి ఇంటికి వచ్చినపుడు, ఆయన స్ఫూర్తితో అంతా స్వాతంత్య్ర సమరంలోకి దూకారు. 
రవీంద్రనాధ టాగూరు స్ఫూర్తితో పఠాభి శాంతినికేతన్‌కు వెళ్ళి చదువుకున్నాడు. పట్టభద్రుడయ్యాక కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ చదివాడు.
ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. సాహిత్యం, సినిమాలేగాక రాజకీయ, సామాజిక రంగాల్లో కూడా కృషి చేశాడు.
1938లో కలకత్తా నుండి తిరిగివచ్చి కొన్నాళ్ళు గూడూరులో కుటుంబ వ్యాపారమైన అభ్రకం ఎగుమతి వ్యాపారం చేసేవాడు. తరువాత అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో గణితం చదివాడు. అమెరికా వెళ్లేముందే ఫిడేలు రాగాల డజన్‌ రచించాడు. తెలుగు ఆధునిక కవిత్వంలో ఇది కొత్త పుంతలు తొక్కింది. ఇప్పటికీ దానికి ఆదరణ ఉండడం ఆశ్చర్యమేమీలేదు. కారణం భాష ప్రజాస్వామీకరణ చెందడమే.రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సైన్యంలో చేరాలని అమెరికా బలవంతపెట్టింది. బ్రిటిషువాళ్లు భారతీయుల్ని జైళ్లలో నెట్టినందుకు నిరసనగా సైన్యంలో చేరేందుకు నిరాకరించారు. సాహసోపేత యాత్రతో అమెరికా వదిలి దక్షిణ అమెరికా, ఆఫ్రికాల మీదుగా నౌకలో భారత్‌ చేరుకున్నాడు.

తిరిగి మాతృదేశంలోకి వచ్చాక 1947లో స్నేహలతా పావెల్‌ అనే మహిళను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఆమె నటి. సామాజిక కార్యకర్త కూడా. 1925 హేడెన్లో జన్మించిన స్నేహలతా పావెల్ పూర్తిపేరు స్నేహలతా జాయిస్ పాట్రిషియా పావెల్. తల్లి లీలావతీ ఘోష్ అనే బెంగాలీ మహిళ, తండ్రి జేమ్స్ ఎబనైజర్ తంగరాజ్ పావెల్ అనే తమిళుడు. ఆమె కోసం అపారమైన ఐశ్వర్యాన్ని సైతం వదులుకున్నాడు. దంపతులిద్దరూ ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో పాలుపంచుకున్నారు. పీపుల్స్‌ యూనియన్‌ ఆఫ్‌ సివిల్‌ లిబర్టీస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఆయనొకడు. సోషలిస్టు పార్టీలో పనిచేశాడు. వీరికి ఇద్దరు సంతానం. కుమారుడు కోనార్క్ రెడ్డి ప్రముఖ ఫ్లెమెంకో గిటార్ వాద్యకారుడు. కూతురు నందనారెడ్డి కార్మిక న్యాయవాది, సామాజిక సేవ కార్యకర్త. 1947లో ఫోకస్ అనే ఆంగ్ల వారపత్రిక నెలకొల్పి 36 వారాలు వెలువడి నిలిచిపోయింది. దీనికి స్నేహలత ప్రచురణకర్తగా వ్యవహరించగా, టి.పి.ఉన్నికృష్ణన్ సంపాదక బాధ్యతలు నిర్వర్తించాడు.

తిక్కవరపు పఠాభిరామిరెడ్డి  కవి, తెలుగు, కన్నడ సినిమా నిర్మాత, దర్శకుడు. ఆయన తెలుగులో పెళ్లినాటి ప్రమాణాలు, శ్రీకృష్ణార్జున యుద్ధం, భాగ్యచక్రం సినిమాలు నిర్మించాడు. కన్నడ సినిమా రంగానికి తొలి స్వర్ణ కమలం సాధించిపెట్టిన సంస్కార చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించాడు. చండ మారుత, శృంగార మాస, దేవర కాడు అనే కన్నడ సినిమాలను నిర్మించాడు. అంతర్జాతీయ బహుమతి లభించిన “సంస్కార” చిత్రం ద్వారా యావద్భారత కీర్తినార్జించారు కూడా. కె.వి.రెడ్డితో కలిసి జయంతి పిక్చర్స్‌ను స్థాపించి తెలుగు చిత్రాలు తీశారు. పెళ్లినాటి ప్రమాణాలు చిత్రం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అవార్డు దక్కించుకుంది. 1971లో సంస్కార చిత్రం రాష్ట్రపతి నుంచి స్వర్ణకమలం అందుకుంది. ఈ సినిమాలో ఆయన భార్య స్నేహలత ఒక ప్రధాన పాత్ర ధరించింది. ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం అనుభవించి, అనారోగ్యంతో స్నేహలత 1977లో మరణించింది.

    "పఠాభి”గా అవతరించిన తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి
“ఫిడేల్ రాగాల డజన్”, “కయిత నా దయిత”, “పఠాభి పన్‌చాంగం” అన్న మూడు కావ్యాలు రచించారు. ఆధునిక తెలుగు కవితా రంగంలో విన్నూత్న ప్రయోగాల సృష్టిగా తెలుగు వారి మనసుల్లో కలకాలం నిలుస్తాయి.
నిత్య నూతన ప్రయోగాలను ఇష్టపడే తిక్కవరపు పట్టాభిరామారెడ్డిని కేవల ఛందోరీతుల బందోబస్తులను కాదని భాషారీతులను ఎలా వాడేడో చెప్పడంమీదే ఎక్కువ చర్చ జరిగింది.
వేల్చేరు నారాయణరావు  ప్రకారం ఈ పుస్తకం నెరవేర్చిన ప్రయోజనం చాలా గొప్పది. అది అప్పటి కవిత్వాభిప్రాయాల్ని నిర్ద్వంద్వంగా బద్దలు కొట్టడమే దాని అతిపెద్ద విజయమన్నాడు.


కవిత్వపు వేషం వేసుకుని అకవిత్వం తిరుగుతున్నప్పుడు, కవిత్వం అకవిత్వపు వేషంలో రావలిసి ఉంటుంది. సరిగ్గా ఈ పనే చేసింది పఠాభి కవిత్వం. సారం నశించిన ఆకారాలు, కాలం చెల్లిపోయినా, రాజ్యం చెయ్యకుండా వాటి వికృతిని బయటపెట్టిన విధ్వంసకుడు, iconoclast, పఠాభి.

భావకవులది అమలిన శృంగారం కాగా, పఠాభిది నూటికి నూరుపాళ్ళు మలిన శృంగారం. భావకవులది సుకుమార శృంగారం కాగా, పఠాభిది సుతారమూ సుకుమారత లేని మోటు శృంగారం.

“అరటి పండున్ పక్కు తీసి తినేలా
మ్రింగివేశాన్నేనా నగ్నాంగమును”

ఇత్యాది రీతిలో వుంటాయి పఠాభి ‘శృంగార’ వర్ణనలు. పురాణ స్త్రీల పాతివ్రత్యాన్ని కూడా నిర్దాక్షిణ్యంగా భగ్నం చేస్తాడు పఠాభి. సీత రాముడి భార్యగా కన్న రావణుడి ప్రియురాలిగా ఉండాలనుకుంటుంది.

 ‘కయిత నా దయిత’అనే కవితకు శ్రీశ్రీ ‘కవితా ఓ కవితా’ ప్రేరణ అయినా అందులో పఠాభి గొంతూ, గుండె కూడా వినిపిస్తాయి.
ఇందులో ఆయన కవిత్వాన్ని ‘నా రక్తమున తీవ్రత’ అన్నాడు. ‘‘నా కర్ణముల విశ్వగోపన/ రహస్య గీతాల నాలాపన/ సలుపునట్టి అమృత భాషిణి’’అనీ అన్నాడు. ఇంకా ‘‘నీ అమృతంపు స్పర్శన/ సలుప చిత్రముల ప్రదర్శన/ అద్భుతమగు ఐంద్రజాలిక/ ఓ నా కవనంపు బాలిక’’అని కూడా అన్నాడు. ఇంకా వాణీ నా రాణీ అంటూ చాలా రాసాడు. కానీ పై మూడు విశేషాల ద్వారా ఆయన వాణిని విందాం.
కవిత్వం ఆయన రక్తం తాలూకు తీవ్రత అని కదా అన్నది. దానివలననే ఎవరూ తొక్కని కొత్తమార్గం ఎన్నుకుని విలక్షణ కవి అయ్యాడు. ‘‘ఆమె కన్నుల అనంతాంబరపు నీలి నీడలు కలవు’’అని పూర్వ కవి రాస్తే ‘‘చిన్నదాని కన్నులలో ఉన్నదిరా ఉన్మాదము’’అని రాసేడు. ‘‘అట్టిట్టు ప్రవహిస్తు/ అట్టహాస్యము చేస్తూ/ పాతాళముకేను పడిపోవు చుంటాను/ పడుచుండి/ పడుచుండి పడి పడీ నగుతాను/ అంటూ జలపాతం కవిత రాసాడు. ఇది చదివిన వారికి విశ్వనాథ కిన్నెరసాని గుర్తుకురాక మానదు. ఇది వెటకారం కానీ, పేరడీ కాని కాదు. 
‘‘నిమేషాల పిచ్చికేక/ సమీపించనట్టిచోట/ సఖీ నీవు వచ్చుదాక/ నిరీక్షిస్తు రాత్రిపూట/ కార్చుచున్న కంటినీట/ పోషింతును పూలతోట.
మరో కవిత- పేరు కవాలి.
నేను వచిస్తాను వినూ/ గీతలోని సారమునూ
మనకు చాల మజా సదా/ ఈత చెట్టు గీత కదా
శ్రుతులు వినుచు బ్రతుకు క్షుదా
వ్యధల మాన్పు శ్రమలు వృధా
మనకు సదా మహా సరదా
మదిర సుధా పాత్రగదా
ఇలా చెప్పుకుంటూ వెళ్తే మరికొన్ని ఉన్నాయి. 
ఇలా ఆయన కవితను నయితను చేసుకున్నారు.

 “మరీనా” అన్న కవితలో 

సమూహమంతా కరిగిపోయింది, మిగిలింది
సమాజములోని మడ్డి మటుకు
అన్నం ముద్దకయి కక్కుర్తిపడి
శరీరాన్ని సవారికిచ్చే జవరాళ్ళు
తొమ్మిదణాల సినిమా టికెటునకు
తమ బహిర్దేహము మీద యాత్ర చేయుటకు హక్కునిచ్చే
కొందరాంగ్లో ఇండియన్ అభాగినులు
ఈ కార్యాల చాన్సు కోసం
ఇటూ అటు తటపటాయించుచున్న
“మర్యాదస్తుల” మంద.
ప్రకటించుచున్నవి తరంగాలు
బిగ్గరగా తమ యసమ్మతిని. గాలి ఏడుస్తూంది.
రగులుచున్నవి గగనములోన భువికార్చిన కన్నీటి చుక్కల్లాగ తారకలు
కానీ మనుజుని మనస్సులో రేగుచున్నవి
రకరకాల కోరికలు — అని ముగిస్తాడు. 

ఆయన కవితలోని స్త్రీ అతని లౌల్య ప్రతీక. ఆమెని తన ప్రతి కవితలోనూ   తేలికతనంతో చూశాడు.
ఇది సమర్ధించుకోదగినది  కాదు. అయితే అదంతా వాస్తవదూరం కూడా కాదు కనుక ఆ వర్ణన అనవసరమైనా భరించక తప్పదు.

సినారె  ఆయన కవిత్వాన్ని గురించి ఇలా వ్యాఖ్యానించాడు.
 “వస్తువైచిత్ర్య ప్రవహంలోపడి కామ శృంగారమునకు దాసుడైనాడు. గేయాలన్నీ పాశవిక శృంగార క్రీడలకు అసంపూర్ణ కామవాంఛలకు పతాకలవంటివి. ఈ ధోరణి పఠాభితోనే అస్తమించుట తెలుగు కవితలోని ఆరోగ్యవంతమైన లక్షణాలలో ముఖ్యమైనది”


ఏమైనా ఆయనకీ స్త్రీ అంటే ప్రేమే. కవిత్వం విషయంలో ఏమోకానీ కథల్లో మాత్రం స్త్రీని ‘బానిసకు బానిస’ గా 1940
నాటికి అవగాహన చేసుకొన్నవాళ్లలో పఠాభి ముందున్నాడు.  స్త్రీ జీవితంలోని అసహాయత, దుఃఖం పఠాభిని కథలు రాసేలా చేసింది. పఠాభి కథలు రాశాడని చాలామందికి తెలియదు.

మనసు ఫౌండేషన్ ఇటీవల వెలువరించిన పఠాభి మొత్తం రచనల సంకలనంలో పఠాభి రాసిన తొమ్మిది కథలున్నాయి.  పాత పత్రికలను గాలించి, ఎంతో శ్రమకోర్చి పరిశోధకులు షేక్ రసూల్ అహ్మద్ (గూడూరు) ఈ కథలను వెలికి తీశారు. ఈ వివరాల ప్రకారం పఠాభి కథలు మొత్తం పది. అయితే మొదటి కథ ప్రతిధ్వనులు (1934) దొరకకపోవడం వల్ల ఇందులో తొమ్మిది కథలే ఉన్నాయి. దాదాపు అన్ని కథల్లో స్త్రీ జీవితం, స్త్రీ పురుష సంబంధాల చిత్రణే ఉంది. ఈ కథలన్నీ ఆయన 1934 నుండి 1940 లోపు రాసినవే.
ఇందులో అనువాద కథలు రెండు.  మూకలు (1935), చిలుక చదువు (1938).  అల్లరిమూక స్వభావం 
 ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడికి పోయినా ఒకటేగా ఉంటుంది. వార్తాపత్రికలు అల్లరిమూకలో కొంతభాగం వహించుతాయి. వాటి తత్వం ఎక్కడ చూసినా ఒకటే” అని మొదలవుతుంది ‘మూకలు’ కథ.
అమెరికాలోని ‘ఒక్లహామా ‘ లో ఒక తెల్ల పిల్ల సృహతప్పి పక్కన ఉన్న నీగ్రో మీద పడుతుంది. పడేటప్పుడు ఆ నల్లవాడ్ని చూసి భయపడి అరుస్తుంది. అలా భయం కలిగించడంవల్ల ఆ నీగ్రో తనని అవమానించాడని పోలీసులకు చెబుతుంది. పోలీసులు నీగ్రో ని అరెస్టు చేస్తారు. అది తెల్లవారి రాజ్యం కాబట్టి ఈ సంఘటనతో నల్లవారి మీద మూకుమ్మడి దాడులు మొదలవుతాయి. అల్లరి మూకలు బ్రతికి ఉన్నవారిని మంటల్లో కాల్చి, పరిగెత్తేవారిని తుపాకులతో కాల్చి రాక్షస వినోదాన్ని అనుభవిస్తారు. ఇలా అక్కడి నీగ్రోలను పూర్తిగా నాశనం కావించటంతో కథ ముగుస్తుంది. ఈ కథ  అనువదించేనాటికి పఠాభి ట్రిప్లికేన్ లో ఉంటూ మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు.ఇటీవల బ్లాక్
లైవ్స్ మాటర్ ఉద్యమాన్ని గుర్తుకు తెస్తుంది.
విద్యావ్యవస్థ మీద రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన వ్యంగ్య కథను ‘చిలుక చదువు' ను పఠాభి అనువదించాడు. చదువు పేరుతొ చిలుకను బంగారు పంజరంలో బంధిస్తారు. అది ‘విద్య యొక్క కైలాస శిఖరము’ . చిలుకకు చదువు నేర్పే నిమిత్తం పండితులు వచ్చి నస్యం పీలుస్తూ “పుస్తకాలు అధికంగా ఉంటేనే గాని చదువు సాగద”న్నారు. చివరకు చిలుక చచ్చింది. ఇదేమిటన్నాడు రాజు.
“పక్షికి శిక్షణ పూర్తి అయింది” అన్నారు రాజుగారి అల్లుళ్ళు.
“అదింకా ఎగురుతుందా?”
“రామ! రామ!” అన్నారు రాజుగారి అల్లుళ్ళు.
అదింక పాట పాడ్తుందా?
“ఆహా”
“ఇంకా రెక్కలు టపటప కొట్తుందా?”
“అలా సాహసింపలేదు”
రాజుగారు చిలుకను ఒకసారి చూడాలన్నాడు. చిలకను రాజు వేలితో పొడిచాడు. “అది ఆ అనలేదు, ఊ అనలేదు. దాని కడుపులోనమటుకు గ్రంధప్రతుల యొక్క శుష్క పత్రములు కసకస గజగజ చేయసాగినవి” ఇలా ముగుస్తుంది కథ.

ఇలా సాహిత్యం, రాజకీయం, వ్యాపారం, చలనచిత్ర రంగాలలో రాణించి 87 ఏళ్ళ వయసులో 2006 మే 6న పఠాభి బెంగుళూరులో కన్నుమూశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు