దేవిప్రియ
దేవిప్రియ
__ పిళ్లా విజయ్,9490122229
రాష్ట్రానికి రాష్ట్రానికి/ పెట్టి కీచులాట
నవఢిల్లీ పాడుతోంది/ ఇపుడు జోలపాట!
ఎప్పుడో 1986లో దేవిప్రియ రాసిన రన్నింగ్ కామెంటరీ ఇది. కాని నేటికీ అది సందర్భోచితంగానే ఉంది. కవెప్పుడూ ఒక సరిహద్దు సిపాయి. ఎత్తయిన బురుజు మీద నిఘాకు నిలబడి శత్రువులు ఎవరు చొరబడుతున్నారా అని పహారా కాసే కలం సిపాయి.
పాత్రికేయునిగా దాదాపు ముప్పయ్ నలభై ఏళ్లుగా కొనసాగుతున్నా అందులోని రెండు దశాబ్దాల కాలాన్ని ఆయన రన్నింగ్ కామెంటరీకి వెచ్చించారు.
వార్తలు జరిగింది జరిగినట్టు చెపుతాయి. అదే కవైతే జరిగినదాని వెనుక ఉన్న ఉద్దేశాలను వ్యాఖానిస్తాడు. జరగబోయే నష్టాన్ని దుశ్శకునంగా చూపుతాడు.
1983లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజీవ్ గాంధీ(1991) హత్యోదంతం వరకూ దాదాపు పదేళ్లపాటు సమకాలీన జాతీయ, రాష్ట్రీయ పరిణామాలపై దేవిప్రియ అనునిత్యం పేల్చిన వ్యంగ్య తూటాలు, పదును బాణాలు మూడు భాగాలతో సంపుటీకరణ చెంది ‘దేవిప్రియ రన్నింగ్ కామెంటరీ’గా వచ్చాయి.
రాజకీయ వ్యంగ్య కవిత్వం ప్రతి రోజూ రాసి, పాఠకులను మెప్పించడంతో ఈ శీర్షిక ఘనవిజయం సాధించింది.దాంతో చాలా పత్రికలు దీనిని అనుకరించాయి. ఇప్పుడన్ని పత్రికలు ఏదో ఒక పార్టీ కి వెన్ను దన్నుగా నిలిచి వాస్తవాలను ప్రజల కందించలేక ఆ శీర్షిక మానేశారు.
ఆయన పదం పేదవాడి పక్షం. పాలకుడు ఆయన ప్రత్యర్థి.
గుండెలెందుకు బాదుకోడం/ పాలధర పెరిగిందని?
పేదప్రాణం రేటు మినహా / దేని ధర తరిగిందని?
ఇది దేవిప్రియ సునిశిత వ్యంగ్యం.
ఎవరికెవరు తీసిపోని/ రాజకీయ పీతలు
ప్రజల ఉసురు పోసుకునే/ నీతిలేని నేతలు.
ఇది దేవిప్రియ ఆక్రోశం.
ఇలా సాగిన ఆయన సునిశిత విమర్శ సామాన్యులను ఆకట్టుకుంది.తాము అనాల్సిన మాటలనే కవి అంటున్నందుకు పొంగిపోయారు. ఇలాంటి గౌరవం దక్కినప్పుడే కవి ప్రజల నాల్కల మీద సజీవుడవుతాడు. దేవిప్రియ తన రన్నింగ్ కామెంటరీతో అలా సజీవుడైనాడు. తన అపారమైన రాజకీయ పరిజ్ఞానం వల్ల, అనల్పమైన శబ్ద సంపద వల్ల దేవిప్రియ ఈ వ్యంగ్య కవిత్వాన్ని రక్తి కట్టించగలిగారు. సులభమైన పదాలతోనే కావలసిన స్పందనను సాధించుకోవడంలో సఫలీ కృతుడయ్యాడు. ఇది కచ్చితంగా వేమన బాణీ.
మల్లారెడ్డి కచేరీలు,శ్రీశ్రీ, ఆరుద్రల తరువాత దేవిప్రియ తన నిబద్ధత తో చేసిన రన్నింగ్ కామెంటరీ ఆయన ప్రతిష్ఠ ను పెంచాయి. ఆయన కవిగా ఆయన ఎంత పేరు సాధించాడో గాని రన్నింగ్ కామెంటరీ ద్వారా మాత్రం జన హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.
దేవిప్రియ అసలు పేరు ఖ్వాజా హుస్సేన్ . దేవిప్రియ ఇతని కలం పేరు.అస్తిత్వ ఉద్యమాలు రాక పూర్వం చాలామంది ముస్లిం కవులు ఇలాంటి కలం పేర్లుపెట్టుకున్నారు. కడపలో షేక్ హుస్సేన్ 'సత్యాగ్ని'అని,షేక్ బేపారి రహంతుల్లా'శశిశ్రీ' గా తమ కలాలకు పేర్లు పెట్టుకున్నారు.ఇప్పుడాసమస్యలేదు. రచయితలు తమ పేర్ల చివర కుల చిహ్నం పెట్టుకోవడం సాధారణమై పోయింది.అదొక హోదాగా భావిస్తున్నారు కూడా.
దేవిప్రియ 1949 ఆగష్టు 15 న గుంటూరులో షేక్ హుస్సేన్ సాహెబ్, షేక్ ఇమాం బీ దంపతులకు జన్మించారు.
ఇతనికి తల్లిదండ్రులు పెట్టిన పేరు షేక్ ఖాజాహుస్సేన్. గుంటూరు లోని ఎ.సి.కాలేజీలో బి.ఏ. పూర్తి చేశారు.
కాలేజీ రోజుల్లోనే కవిత్వం పట్ల ఆకర్షితుడై పద్యాలు, గేయాలు రాయడంప్రారంభించారు. గుంటూరు కేంద్రంగా అవతరించిన పైగంబర కవులు బృందంలో దేవిప్రియ ఒకరు. పాత్రికేయునిగా ప్రజావాహిని, నిర్మల, ప్రజాతంత్ర, జ్యోతి, మనోరమ మొదలైన పత్రికలలోనూ, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఉదయం, హైదరాబాద్ మిర్రర్ దినపత్రికలలోను పనిచేశారు. వ్యంగ్య, విమర్శనాత్మకమైన ఇతని 'సమాజానందస్వామి', 'రన్నింగ్ కామెంటరీ' కార్టూన్ కవిత్వం ద్వారా తెలుగు పత్రికారంగంలో కొత్త ఒరవడిని సృష్టించాడు. సినిమా రంగంపై సాధికారమైన వ్యాసాలు రాశారు. దాసి, రంగులకల మొదలైన సినిమాలకు స్క్రీన్ ప్లే, పాటలు రాశారు. ప్రజాగాయకుడు గద్దర్ పేరుతో ఆంగ్లంలో పూర్తి నిడివి డాక్యుమెంటరీ ఫిలిం మ్యూజిక్ ఆఫ్ ఎ బ్యాటిల్షిప్ పేరుతో నిర్మించి దర్శకత్వం వహించారు.
స్వయంగా 'మనోరమ' వారపత్రిక నడిపారు. 'హైదారాబాద్ మిర్రర్' దినపత్రికకు వ్యవస్థాపక ప్రధాన సంపాదకులుగా పనిచేశారు. ప్రస్తుతం 'హెచ్ఎం టివీ'లో సీనియర్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 'ఉదయం' దినపత్రిక నాటి 'రన్నింగ్ కామెంట్రీ'ని 'హెచ్ఎంటివీ'లో దృశ్యీకరించారు.అమ్మచెట్టు,
సమాజానందస్వామి,గరీబుగీతాలు,నీటిపుట్ట, తుఫాను తుమ్మెద ,రన్నింగ్ కామెంటరీ, అరణ్య పురాణం,పిట్ట కూడా ఎగిరి పోవలసిందే,చేప చిలుక,అధ్యక్షా మన్నించండి (సంపాదకీయాలు),గాలిరంగు,గంధకుటి ,
ఇన్షా అల్లాహ్ (పద్యకావ్యం)Poornamma the golden doll (అనువాదం)The Cobra Dancer (కె.జె.రావు జీవితకథ) మొదలైన రచనలు వీరి కలం నుండి వెలువడినాయి.
1980లో అమ్మచెట్టు కవిత్వానికి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు లభించింది.1991లో నీటిపుట్ట కవితాసంకలనానికి సినారె కవితాపురస్కారం (కరీంనగర్),2001లో కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ సత్కారం,తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం 2013,
ఆయన సాహిత్య కృషి కి లభించిన పురస్కారాలు. ఆయన రాసిన గాలిరంగు పుస్తకానికి 2017 లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి