గరిమెళ్ళ సత్యనారాయణ


           మాకొద్దీ తెల్లదొరతనమని
 కీర్తించబడిన మహనీయులు జాతీయకవి, గాయకుడు, రచయిత, గాంధేయవాది, స్వాతంత్ర్యసమరయోధుడు, అభ్యుదయవాది,  అయిన  గరిమెళ్ళ సత్యనారాయణ గాంధీ  పిలుపు అందుకుని చదువుకి మధ్యలోనే స్వస్తి పలికి వీరావేశంతో స్వాతంత్ర్యోద్యమంలోకి దూకారు. ఆ ఉద్యమమే నేపథ్యంగా "మాకొద్దీ తెల్లదొరతనమంటూ"గొప్ప గీతాన్ని ఆలపించారు. ఆ కారణంగా ఏడాదిపాటు కఠిన కారాగారవాసం తెల్లదొరలు విధించారు. రాసి పాడిన ఈయనతో పాటు ఆలపించిన వారినీ ప్రభుత్వం చెరసాలలో పడేసింది. జైల్లో ఉండగానే తండ్రి కాలం చేసారు. తెల్లదొరల ముందు తలవంచనని అంత్యక్రియలకు వెళ్ళలేదు. పైగా తాతగారికి వేదాంత ధోరణిలో లేఖ రాసారు. నిర్వేదభరితంగా. ఈయన పలుమార్లు జైలు జీవితం చవిచూసారు ఈ జైలు కాలంలోనే భార్యకూడ కన్నుమూసింది. దొరలను బెయిల్ అడగడానికి ఇష్టపడలేదు. జైలులో ఉండడానికే ఇష్టపడ్డారు. కానీ భార్య మరణంతో మానసికంగా కొంత వరకూ క్రుంగిపోయారు. అప్పటికి ఇద్దరు ఆడపిల్లల తండ్రి గరిమెళ్ళ వారు. ఈయనగారి గీతం ఎంతలా ప్రజలపై ప్రభావం చూపిందంటే కాంగ్రెస్ స్వచ్ఛంద సేవకులు ఖద్దరు దుస్తులు ధరించి గాంధీ టోపీలతో జెండా ఎగురవేస్తూ ఈ పాటను పాడుతూ రోడ్లపైనే కవాతు చేసేవారు. ఆఖరికి పెళ్ళిళ్ళలో ప్రారంభగీతంగా మాకొద్దీ తెల్లదొరతనమంటూ బేండు మేళం వారు వాయీంచేవారు. స్త్రీలైతే "రారా! గాంధికుమారా! అంటూ నలుగు పాటలు పాడేవారు. మంగళ హారతి పాటలుగా మంగళంబు భరతమాత  అని ఆరంభించేవారు."ఈయనగారి పాటకు సంబంధించిన ఓ సంఘటన తెలుసు కోవలసిందే.అదేమంటే...గాంధీజీ సబర్మతీ ఆశ్రమంలో గాంధీజీ ఆదేశానుసారం అక్కడకు వచ్చిన వివిధ భాషాకవులు తమతమ భాషలలో దేశభక్తి గీతాలను ఆలపించారు. గరిమెళ్ళ వారు పాడనన్నారు. అదేమంటే నా పాటకి దొరలు ఒక ఏడాది కఠిన కారాగారవాసం శిక్షగా విధించారు అన్నారు గరిమెళ్ళ. గాంధీజీ నమ్మలేదు సరికదా ఇంకేదో కాని పని చేసి ఉంటావు. పాట పాడితే జైలు శిక్ష వేస్తారా ఎక్కడైనా అన్నారు. మిగిలిన వాళ్ళైతే ఇతనికి పాడడం రాదని గేలిచేసారు. మహాత్మాగాంధీ ఎలాగైనా పాడమన్నారు. అంతే ఈయనగారి కంచు కంఠంలో ఉద్వేగభరితంగా ఈ గీతం వెలువడింది. భాషరాకపోయినా ఆ పాడడంలోని ఆవేశమూ దేశభక్తి తత్వమూ ప్రస్ఫుటితమవ్వడంతో గాంధీ ఉద్విగ్నతతో నిండిపోయారు. అంతే ఇదే పాట వరుసలో అందరూ తమతమ భాషలలో పాటలు వ్రాయవలసిందని కోరారు. జైలులో బంధించబడినా ఆయన మనస్సులో దేశభక్తి ప్రబోధగీతాలనేకం వెలువడేవి. శిక్ష ముగిసిన పిదప బాహాటంగానే పాడడం మొదలుపెట్టారు. ఆయనతో వేలాది కంఠాలు కలిసేవి. దొరలు మళ్ళీ ఈయన బయటవుంటే ప్రజలను రెచ్చగొడతాడు. తమకి ప్రమాదం అంటూ రాజద్రోహం పేరుతో జైలుశిక్ష విధించేవారు. ఓసారి ఇలాగే శిక్షపడి కాకినాడ మెజిస్ట్రేట్ ఎదుట హాజరవ్వాల్సి వచ్చింది గరిమెళ్ళ వారికి. సంజాయిషీ అడిగారు. సహజ కవి గనుక తడుముకోకుండా తన వాఙ్మూలాన్ని పరప్రభుత్వం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ "కూలిపోతున్నది కూలిపోతున్నది మూలమట్టముతోటి కూలిపోతున్నది ప్రభుత్వం, కూకటి వేళ్ళతో కూలిపోతున్నది మూర్ఖ ప్రభుత్వం"అంటూ అద్భుత గేయరూపంలో ఇచ్చారు. చాలా సార్లు ఈయన జైలుజీవితాన్ని చవిచూసారు. తిరుచిరాపల్లి జైలులో ఉన్నప్పుడు సహఖైదీలైన ఎన్ ఎస్ కృష్ణ స్వామి అయ్యంగార్ వద్ద తమిళం నేర్చుకుని తమిళ సాహిత్యం లోని అద్భుతమైన గ్రంథరాజం తిరక్కురళ్ ని తెలుగులోకి అనువదించారు. ఉత్సాహంగా ఉన్నప్పుడు తమిళ గీతాలు కూడా ఆలపించేవారు. ఈ క్రమంలోనే కన్నడభాషను కూడా నేర్చి  తళ్ళికోట అనే నాటికను తెలుగులోకి అనువదించడం మొదలుపెట్టారు. అనువాదం ఎందుకు మీరే ఓ నాటకం రాయవచ్చును గదా అని రాజమండ్రి మిత్రులు టేకుమళ్ళ కామేశ్వర రావు అన్నారు. మానవ స్వభావాన్ని లోతుగా అధ్యయనం చేస్తే తప్ప నాటకం వ్రాయడానికి వీలుకాదని నిజాయితీగా సమాధానమిచ్చారు గరిమెళ్ళవారు.
          ఆంగ్ల భాషలో కూడా పట్టున్న వారు కావడం వలన హార్ట్ ఆఫ్ ద నేషన్  అన్న పద్యకావ్యాన్ని మదర్ ఇండియా అన్న పద్యాన్ని రచించారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య రచన 
ద ఎకానమిక్ కాంక్వస్ట్ ఆఫ్ ఇండియా ను భరతఖండముపైనిఆర్థిక విజయము లేక బ్రిటిష్ సామ్రాజ్యము (లిమిటెడ్) అన్న పేరుతో తెనిగించారు. ఉద్యోగం చేయడమంటే బానిసత్వాన్ని అంగీకరించినట్టేనన్న ఆలోచనతో ఉండేవారు. పైగా ఆంధ్రపత్రిక వంటి వాటిలో కొన్నాళ్ళు పని చేసినా ఎక్కడా స్థిరపడలేదు. విపరీతమైన స్వేచ్ఛాప్రియత్వము వంటి స్వభావాలే అందుకు కారణం. వావిళ్ళవేంకటేశ్వర శాస్త్రిగారికి గరిమెళ్ళ వారంటే చాలా గౌరవం. తన త్రిలిఙ్గ వారపత్రికలో గరిమెళ్ళ వారి వ్యాసాలను ప్రచురించేవారు. ఆర్థికంగా కూడా నెలకు పదిరూపాయలు ఇచ్చి ఆదుకునేవారు. సాహిత్యం, రాజకీయాలకు సంబంధించిన వ్యాసాలను రాయడంలో గరిమెళ్ళ వారు దిట్ట. తెలుగుదేశంలో సుబ్రహ్మణ్య భారతిలాంటి వారు మన గరిమెళ్ళ అని వావిళ్ళవారనే వారు. చనిపోయిన పిదప సుబ్రహ్మణ్య భారతికి గుర్తింపు వచ్చింది. కానీ మన గరిమెళ్ళను తెలుగు వారు ముఖ్యంగా ఈయన పాటలను ఆలపించి అందలాల్లో ఉన్న కాంగ్రెసు ప్రముఖులు కనీసం పలకరించనూ లేదు. గరిమెళ్ళ వారికి నలుగురు అన్నదమ్ములు ముగ్గురు సోదరీమణులు. మగబిడ్డలందరినీ తండ్రి మంచి చదువులు చదివించారు అప్పులు చేసి మరీ! కానీ వీళ్ళెవరూ ఉద్యోగ ప్రయత్నాలు చేయలేదు. తెల్లవారి క్రింద పని చేయడమేమిటనీ భావించారు. ఉన్న పొలం కొద్దిపాటి ఆస్తి చాలావరకూ హారతికర్పూరమైపోయింది. మిగిలిన ఆస్తిని అమ్మి అప్పులు తీర్చారు. చివరి దశను మదరాసులో  గడిపారు. ఒక కంటికి శస్త్ర చికిత్స జరిగింది. అది వికటించి ఆ కన్నుపోయింది. కొన్నాళ్ళకు రెండో కన్ను కూడా! వీధులలో యాచకవృత్తి చేసారు. ఏ పనైనా చూసుకోలేక పోయారా? అని టేకుమళ్ళ వారు అడిగితే *కొందరు త్యాగం చేయాలి!నశించాలి!నాశనమైపోవాలి! అప్పుడే కానీ దేశం బాగుపడదు* అంటూ ఆవేశపూరితంగా సమాధానం చెప్పారు. ఈ మదరాసులో ఉండి లాభం ఏమిటీ అని అంటే "మరెక్కడా లేని లాభం ఉంది. ఈ మూల అడుక్కుంటే ఆ మూలవాడికి తెలియదు అందుకే ఇక్కడే కడతేరడం మంచిదని నిస్పృహతో పలికారు. వీటికి తోడు పక్షవాతం కూడా దాపురించింది. స్వాతంత్ర్యానంతరం రాజకీయ బాధితులకు ఇచ్చినట్లే ఈయనకూ పదెకరాల మెట్టభూమిని ప్రభుత్వం ఇచ్చింది. అది కూడా ఆయన గానీ ఆయన వారసులుగానీ అనుభవించలేదు సరిగదా వీరు హస్తగతం చేసుకోలేకపోయారు కూడానూ! ద్వా.నా.శాస్త్రి  పిల్లలమర్రి హనుమంతరావు గార్లు మాకొద్దీ తెల్లదొరతనమంటూ ఒకప్పుడు రాసారు గదా మాకొద్దీ నల్లదొరతనమంటూ ఇప్పుడు రాయవచ్చును గదా అని సలహా ఇచ్చారు. దేశభక్తి, స్వాతంత్ర్య ప్రియత్వం, నిజాయితీ గల వారు కావడం వలన నేనేదీ ఆశించి చేయలేదు. ఇలా రాసి నా వాళ్ళను నా ప్రభుత్వాన్ని విమర్శించి రాయలేనన్నారు. కాకపోతే ఆంధ్రజాతీయ నాయకులు తనను గుర్తించలేదనే బాధ ఆయనలో వ్యక్తమయ్యేది. సుప్రసిద్ధ జాతీయ నాయకులు ఆచార్య రంగా గారిచే *ప్రజాపాటల త్యాగయ్య* అనీ ప్రముఖ దేశభక్తుడు రాఘవశర్మ గారిచే జాతీయగేయ *కవిసార్వభౌముడనీ(, కవిసమ్రాట్ విశ్వనాథ వారిచే *జాతీయ కవిసార్వభౌముడని* కీర్తించబడ్డారు. సరళమైన గ్రాంథికంలో రచనలు చేసారు గరిమెళ్ళ. అమరజీవి డిశంబరు15, 1952న చనిపోయారు. ఆంధ్ర రాష్ట్రం అట్టుడికి పోయింది. సరిగ్గా మూడురోజులకు గరిమెళ్ళ కాలం చేసారు. అమరజీవికై అంతా ఆలోచించారు గానీ ఈయనను పట్టించుకున్న నాథుడు కూడా లేడు. ఓ విధంగా చెప్పాలంటే దిక్కమాలిన శవంలా మిగిలింది ఈయన శరీరం. ఇరుగుపొరుగు వారు అంత్యక్రియలు చేసారు. తన రచనలతో కంచుకంఠంతో ప్రజలలోదేశభక్తిని రగిల్చిన మహారచయిత అంత్యకాలంలో అనామకుడిగా కన్నుమూయడం భయంకరమైన దురదృష్టం. తెలుగు వాడని మనం గర్విస్తాం కానీ అన్యభాషీయుడుగా పుట్టి ఉంటే ఈసరికే బ్రహ్మరథం పట్టించుకున్నవారిలో అగ్రస్థానంలో ఉండేవాడు. ఆ మహనీయునికి సజల నయనాలతో సవినయ నివాళులర్పిద్దాం!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు