వ్యక్తిత్వ వికాస సూత్రాలు బోధించిన వేమన
వేమన ఆశావాది. నిరంతర విజయాభిలాషి, పురోగమనవాది. ఆయన చెప్పిన తినగ తినగ వేము పద్యం నేటికీ
పట్టుదలకు మారుపేరుగా నిలుస్తోంది. 'సాధనమున పనులు సమకూరుధరలోన' అన్నది సామెతగా మారింది. సాధనతో
విద్య వస్తుంది. కృషి వుంటే మనుషులు రుషులవుతారనే నిజాలెన్నో సూక్ష్మంగా చెప్పాడు. వెయ్యిసార్లు ఓడినా
వెయిన్నోటోకసారి విజేతలవుతారనే ఆత్మవిశ్వాసాన్ని పాదుకొల్పినవాడు వేమన.
అనగనగ రాగ మతి శయిల్లుచునుండు
తినగ తినగ వేము తీయనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన || విశ్వ!!
బాట తెలియకున్న బహుదూరమై తోచు
చోటు దెలియకున్న చూపునిలదు.
కోటకొమ్మ మీద గుదురుగ జూడురా ||విశ్వ!!
లక్ష్యసాధన కోసం ప్రయత్నించే వ్యక్తి ముందు వెనుక లాలోచించరాదు. ఒకసారి లక్ష్యం కోసం అడుగుముందు వేశామా వెనుదిరుగరాదు. కష్టాలు వస్తాయని భయపడరాదు చేద్దాం, చూద్దాం అంటూ కాలాన్ని వృధా చేయరాదు.
ఒకసారి పనిని ప్రారంభించాక మధ్యలో వదలిపెట్టరాదు. లక్ష్యసిద్ధే కొనదాకా వూపిరిగా నిలవాలి. 'పట్టిన పట్టును విడుచుటకన్న పడిచచ్చుటమేలు' అంటూ వేమన కార్యసాధకుడికి వుండాల్సిన పట్టుదలను నొక్కి వక్కాణించాడు.
పట్టు పట్టరాదు పట్టి విడువరాదు
పట్టెనేని బిగియ పట్టవలయు
పట్టువిడుచుట కన్న పడిచచ్చుటే మేలు || విశ్వ!!
శ్రమవల్ల సంపద పెరుగుతుంది. సమాజం పురోగమిస్తుంది. సోమరితనం లేకుండా శ్రమచేసేవానికి అంతో ఇంతో ధనం సంపాదించ వీలవుతుంది. కనీసం కడుపు నింపుకోవడానికి వీలవుతుంది. సమస్యల్లా పని దొరకడమే.అందుకు నేడు ' పనిహక్కు' ను ప్రాథమిక హక్కుగా చేయాలని మేధావులుకోరుతున్నారు. పనులేలేని సమాజంలో బ్రతుకు దుర్భరం. అయితే ధనం సంపాదించేవానిని సమాజం గుర్తిస్తుంది. కీర్తిస్తుంది.
సిరిలేనివానిని చిన్న చూపు చూస్తుంది. అందుకే పెద్దలను గౌరవించడమంటే వయస్సులో పెద్దవాన్ని గాక సంపదగలవాన్ని గౌరవించడంగా సమాజం భావిస్తోంది. మానవ సంబంధాలన్ని డబ్బు సంబంధాలుగా మారే నేటి సమాజంలో డబ్బున్నవాడే ఉన్నతుడుగా చెలామణి అవుతున్నాడు. డబ్బులేని వాడు దుబ్బుకైనా కొరగాడు అన్నదందుకే. అందుకే వేమన విత్తహీనుని జూచి ఇలా అంటాడు.
"కలిగిన మనుజుండు కాముండు సోముండు
మిగుల తేజమునను మొరయుచుండు"
అప్పులేనివాడే ధనవంతుడన్నాడు.
అప్పు చేసి పప్పు కూడు తినడం సరైంది కాదని చెపుతాడు.నీకు 100రూపాయలు ఆదాయం ఉంటే నీ ఖర్చు 99 ఉండాలి.101రూపాయ లుంటే మాత్రం పేదవాడి కిందే లెక్క అన్నారు.
అప్పుల పాలవడం సరైంది కాదని అర్థం.దీన్నే
ఈ పద్యంలో ఇలా వివరించాడు.
ఉప్పులేనికూర హీనంబు రుచులకు
పప్పులేని తిండి ఫలములేదు
యప్పులేనివాడె యధిక సంపన్నుండు!!విశ్వ!!
వీలుగానిచోట విర్రవీగరాదు. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి.ఎక్కడ తల ఎత్తాలో అక్కడ తల ఎత్తాలి. ఇది తెలుసుకున్న వాడు జీవితంలో రాణిస్తాడు.దీనినే ఆరోజుల్లో అందరికీ అర్థమయ్యే లా ఇలా చెపుతాడు వేమన.
అనువుగాని చోట అధికుల మనరాదు,
కొంచెముండుటెల్ల కొదువ కాదు
కొండ అద్దమందు కొంచమై యుండదా?!!విశ్వ!!
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి