ఆధునిక భావాలను ఆనాడే వెలువరించిన వేమన
మనసు కవి
మనకు మనసుకవి ఆత్రేయే. వేమన కూడా మనసు గురించి విప్పిచెప్పాడు. మనసు గురించి రాయని కవి కూడా వుండడు. మనిషి జీవితంలో మనసు అధిక పాత్ర వహిస్తుంది. మనసు సున్నితమైనది. అది విరిగితే అతుకుడదు.
మనసు బండబారితే దానంత కర్కశత్వం దేనికీ వుండదు. మనసుకు గాయమైతే ఎన్నిలేపనాలు పూసినా మాసిపోదు.
వేమన మనసుకవిగా మనస్సు పెట్టి ఇలా చెప్తాడు.
ఇనుము విరిగె నేని ఇరుమారు ముమ్మారు
కాచి యతుక నేర్చు కమ్మరీడు
మనసు విరిగెనేని విరియంట నేర్చునా || విశ్వ!!
మానవతావాది
అహింసోపరమోధర్మ: అని బోధించాడు బుద్ధుడు, ఒక చెంపను కొట్టితే మరొక చెంప చూపించమన్నాడుగాంధీ. శత్రువు శరణు జొచ్చితే రక్షించాలని పురాణ నీతులు బోధిస్తాయి. కాని చంపదగిన శత్రువు తన చేత చిక్కినా వానికి ఉపకారం చేయటం మంచిదని వేమన తన సహజ మానవతావాద దృక్పథాన్ని వ్యక్తీకరించాడు.
చంపదగిన యట్టి శత్రువు తనచేత
జిక్కి నేని కీడు - సేయరాదు
పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు ||విశ్వ!!
స్వార్థానికి వ్యతిరేకం
భూమి నాది యన్న భూమి ఫక్కున నవ్వు
దానహీను జూచి ధనము నవ్వు
కదనభీతుజూచి కాలుండు నవ్వును || విశ్వ!!
టాల్ స్టాయ్ తన కథలో మనిషికి కావలసింది ఆరడుగులేని చెప్తాడు. అయినా మనిషిలోని స్వార్ధంతో కోట్ల ధనాన్ని పోగుచేసుకుంటున్నాడు. 'సొంత లాభం కొంత మాని పొరుగు వానికి తోడు పదవోయ్' అన్నాడు గురజాడ.
భూమి, గాలి, నీరు ప్రకృతి సంపద. వీటిపై అధికారం ఎవ్వరికీ లేదు. ప్రపంచీకరణ దెబ్బతో గాలి, నీరు కూడా అమ్మకం వస్తువు లైనాయి. ఇది నా గాలి, నా నీరు అనే భావాలు ప్రచలితమవుతున్నాయి. దీన్ని ఆ రోజుల్లోనే వేమన తీవ్రంగా ఖండించాడు.
తాతల్ని కూడా గుర్తుంచుకోని కాలమిది. అలాంటిది ధనం కూడబెట్టి లాభమేమిటి ? మరణించినప్పుడు మూటగట్టుకు పోయేదేముంది?అవసరానికి మించిన ధనాన్ని కూడబెట్టుట వలన ఒరిగేదేముంది ? వేమన దీన్ని వ్యతిరేకించాడు. చచ్చునపుడు
గడ్డిపోచకూడా వెంటరాదని చెప్పాడు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి