మట్టిపోగులతో పరిమళించిన కవిత్వం
మట్టిపోగులతో పరిమళించిన కవిత్వం
___ డా॥ మక్కెన శ్రీను 98852 19712
పిళ్ళా కుమారస్వామి అనంతపురం జిల్లాలో ప్రముఖ సాహితీవేత్త మరియు పెక్కు సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు.
ఆయన అభ్యుదయ సాహితీపరుడే కాకుండా వామపక్షవాది. వారు రచించిన కవితల్లో కరువు ప్రాంత పరిస్థితులు, వ్యవసాయ సంక్షోభం,రైతు సమస్యలు, అణగారిన ప్రజల అవస్థలు ఇందులో కనిపిస్తాయి. వారు తాజాగా వెలువరించిన మట్టిపోగు కవితా సంపుటి 54 కవితల కవితాచలనం. వారి భావాలను వారి కవిత్వ భావనలను పరిశీలిద్దాం.
"భావాల సంఘర్షణతో నిత్యచైతన్యం నింపుకొని, అక్షరాల ఉలితో కొత్త ఆకృతి కోసం అక్షరధారగా ప్రేమిస్తానని"ప్రకటించుకొని కవితా ప్రవాహంగా సాగారు కుమారస్వామి.
అనంతపురం వలస పక్షులను ఆహ్వానిస్తుందంటూ,అక్కడి వర్షాభావ పరిస్థితులను, అక్షరమై పతంగంలా నలుదిశలో విహరించాలనే ఆకాంక్షను ఆయన తన కవితలో అనంతపురం పై ఉన్న మమకారాన్ని
వెలిబుచ్చారు.
"తామర పుష్పంలా విచ్చుకుంటోంది నా కవిత్వం,సంఘర్షణే ఇంధనంగా"అని తన కవితారీతిని ప్రకటిస్తూ, "కన్నీళ్ళను దోసిట్లో తీసుకొనినెర్రలలో పోసినాను" అంటూ తడిలేని నేలను రైతన్న ఎదురుచూపుల దైన్యాన్ని ఆవిష్కరిస్తారు. పట్టణీకరణతో ఖాళీ
అయిన పల్లె చిత్రాన్ని చిత్రిస్తూ "పండుటాకుల సాక్షిగా పల్లె ఇప్పుడు ఒంటరి పక్షి" అని నేటి పల్లెల దుస్థితిని ఉటంకించారు. చావు పుట్టుకల మధ్య మనిషి సాధించిన అనుభవసారం పదిమందికి
జ్ఞానదీపంలా మిగిలిపోవాలని పలికారు.
తడారిన నేల పచ్చని పైరులతో కొత్త చిగుర్లు ఉదయిస్తూ... ఆనందపు క్షణాలను ఒలికిస్తూ వుంటాయి. కొత్త రాగాలు పుట్టి వెలుగు రేఖల నదులుగా ప్రవహిస్తాయని, కోయిల పాటగా అలరించారు. ఇల్లే కదా స్వర్గసీమంటూ, ఆ గూడు కోసం భరోసాలేని వేళ పోరాటాల జెండా పట్టాల్సిందేనన్నారు.
అప్పుల ఊబిలో ఊపిరాడక విత్తు, కార్పొరేట్ మాయలో అక్షరం, యంత్రాల మధ్య ఇరుక్కుని పోగు నలుగుతున్నవైనాన్ని, నేటి సమాజ దుస్థితిని ఎండగట్టారు. స్నేహం పరిమళించు వేళ కరచాలనాల ద్వారా ప్రవహింపచేసుకొన్న ఊసులు,ఊహలు, స్నేహజండా ఎగురవేసి కొత్త భావాలతో రేపటి ఉషోదయాలకు భాష్యాలు రచించాలన్నారు.
మహిళా శక్తిని కీర్తిస్తూ' నీమేధ సముద్రమై పోటెత్తితే శిరసును వంచుతుంది. రాజ్యాధి కారం పాదాక్రాంతమవుతుంది' అన్నారు. ఎన్ని యుగాల నుండో వెలి, వెనుకబాటు తనాన్ని సహిస్తూ, ఏమిలేని వాడననే వేదన లోంచి జ్ఞానతత్వం కలిగి పునీతుడయ్యేందుకు బౌద్దం వైపు వెళుతున్న దృశ్యాన్ని మనముందుంచారు.
కార్పోరేట్ విద్యా మాయలో చదువు కొనబడి వికాసం అంతర్ధానమవుతున్న విషమ పరిస్థితిని ఆవిష్కరించారు. మహిళలకు
33 శాతం రిజర్వేషన్లంటే ఎవరికివారే అన్నట్లు వ్యవహరిస్తున్నారెందుకని ఆక్షేపణ చేశారు. అక్షరం విలువను దాని పాత్రను వివరిస్తూ అక్షరానికి ప్రభవించడమే తెలుసని,దాన్ని పోషించడం ఒక్క కవికే తెలుసన్నారు. నిద్రించిన నగరంలోని వెన్నెల సందడిని కవిత్వీకరించిన వైనం "వెన్నెల్లో వన్నెల కలం"లో కన్పిస్తుంది. శ్రమించి స్వేదిస్తేనే కాని రూపాయి పుడుతుంది. కాని కొంతమంది అవినీతి పరుల చెట్లకు ఎలా డబ్బులు కాస్తాయని ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్యంలోని అవినీతి మరకలను ఎత్తిచూపారు.
మబ్బులు ముసిరిన రాత్రి, చలిరాత్రి, చినుకులు కురిసిన రాత్రి పయనం సాగించిన కవి, ప్రకృతిలోని విన్యాసాలను వీక్షించి తిలక్ గారి వెన్నెల్లో ఆడపిల్లలక్కడ కనిపించ లేదన్నారు.
బతుకు జీవితంలో కలలు కనే జీవుల ఆశలను అక్షరీకరించారు.నీటి చుక్కని చూడని రైతన్న ఆర్తగీతం పాడుతూ, నాగలిని శిలువగామోస్తున్నాడన్నారు.మట్టే సర్వస్వం అనుకున్న తను మట్టిలో కలుస్తున్నాడు. అతని కోసం పోరాడి ఆకుపచ్చ సంతకం చేయిద్దాం రండని ప్రార్థించారు.
జీవపరిమాణ క్రమంలో ప్రకృతి మీద ఆధిపత్యం సాధించిన మనిషి సౌరకుటుంబ రహస్యాలను,జీవపరిణామ సిద్ధాంత మూలాలను, అణువులను అణువణువునా శోధించి పురోగతిని సాధించి విశ్వంపై కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతూ, భవిష్యత్తును పట్టు కొనేందుకు పరిభ్రమిస్తున్నాడొక శకలంలా అంటూ ఒక అద్భుత విశ్లేషణ అందించారు కుమారస్వామి.
నీటి కళతో అలరారిన ఒకప్పటి చెరువును, ఎండి నెర్రల బారిన నేటి చెరువు దుస్థితిని అక్షరీకరిస్తూ రైతు దీనస్థితి బ్రతుకు తెరువు కోసం పట్టణాల బాట పట్టిస్తోందని చెప్పారన్నారు.
గౌరి లంకేష్ పాత్యకు నిరసన వ్యక్తం చేస్తూ వేలాది హృదయాల్లో ఆమె రగిలించిన జ్వాల నిరంతరం వెలుగుతూనే ఉంటుంద న్నారు. వెన్ను తట్టే వారుంటే కొండల్ని పిండి చెయ్యగలరంటూ తన స్వానుభవాలను
నెమరువేశారు.
నవ్వుతూ బ్రతుకుతుంటే ప్రపంచాన్ని జయించేందుకు శక్తినిస్తుందంటారు.మనిషిలోని వివిధ పార్శ్వాలున్నా,మనిషి మానవతా పరిమళాన్ని మోసుకొస్తే చాలని ఉగాదిని ఆహ్వానించారు.
నేటి తరం కొత్త రాగాలను అందుకునే క్రమంలో నిన్నటి తరం సందిగ్ధరేఖ పై నిలబడి, ఇప్పటి గాలి అయోమయ చూపుతో కాలం గడుపుతూ ఒంటరి పయనం చేస్తున్నాయి. జ్ఞానం సముపార్జించి మానవత్వం
పరిమళంతో మరో ఉదయం కోసం వేచి చూస్తుంటాను.
ప్రేమించిన హృదయానికి గాయమైతే కలిగే బాధ వర్ణనాతీతం. మనిషి వుండలా మెలితిరుగుతూ దాహం కోసంఅరిచే కాకిలా ఉంటాడని వర్ణించారు. అక్షరంపై నిషేధం కొనసాగుతుంది, దభోల్కర్ కల్బుర్గి పై పేలిన గుండు నిద్రపోతున్న వేలఫిరంగుల్ని తట్టి లేపి, సమాజ హితం కోరే సాహిత్యమై నవరాగం పల్లవిస్తున్నదన్నారు.
పనిచేయడంలో ఆనందాన్ని పొందుతూ,ప్రతి నిముషాన్ని సద్వినియోగం చేసుకొని సాలె గూడులా అల్లుకుపోవడంలోనే ఉషస్సుందనే సత్యం పలికారు. జీడిపిలు,సెన్సెక్సుల మధ్య ట్రేడింగ్ ల నాటకంలో జీవితం రంగులరాట్నంలా తిరుగుతుంది... ఇదేనా ప్రగతని ప్రశ్నించారు.
అజ్ఞానాన్ని నిలువునా చీల్చేందుకు ప్రశ్నించు కోవడం అలవర్చుకోవాలి. ప్రశ్నిస్తున్నావంటే నీవు జీవిస్తున్నావని అర్ధం. ప్రశ్న ప్రగతికి మూలమన్నారు.
ఎర్రకోటపై ఎగరేసిన పతాకం మొగ్గ తొడుగుతుందనుకొంటే, కొండల్ని దున్ని హరిత పత్రాన్ని అందిస్తుందనుకుంటే చివరికి పతాకపు తాడు వురితాడులా వెక్కిరిస్తుందంటూ
రైతన్న వెతలు తెలిపారు.
ఆంగ్ల భాషా వ్యామోహం ప్రపంచీకరణ, కంప్యూటర్ల మధ్య చిక్కుకున్న తెలుగుభాష సతమతమవుతుంది. తల్లిభాష పురివిప్పుకొని ఆకాశమంతా వెలగాలనే ఆకాంక్షను, దర్జీ చేతిలో 'తాను' కత్తిరింపుకు గురై ఒక అందమైన రూపుకుఆచ్ఛాదన మిగులుస్తుందని,అతని పడ్డ కష్టానికి కొత్త రూపాన్ని చిరునవ్వుగా అందిస్తుందని చెప్పి శ్రమసౌందర్యాన్ని వివరించారు.
సమూహంగా మారి ఆందోళనను ఆయుధంగా మార్చుకొని నినదిస్తానని
ప్రకటించారు.పుస్తకాన్ని చదివి జ్ఞానం సంపాదించి ప్రయోజనమేముంది? ఎంత ఆచరించాం! ఎంతగా ఒదిగామన్నది
ముఖ్యమన్నారు. ఆ ఆచరణ, అనుభవమే కీర్తి శిఖరాన నిలుపుతుందంటారు. విడిచి వెళ్ళిన కాలం కొత్త ఆశలను మోసుకొచ్చే వీచిక కొత్త రూపం కోసం ఆక్రోశిస్తుందన్నారు.
విడిపోతున్న మనుషుల్ని గాయపడ్డ కవుల హృదయాన్ని కలసి పాడే గీతంగా కొత్త
స్వరాన్ని పలికించారు. నువ్వు నిన్ను చదువుకోకుంటే ఇతరులతో మమేకమవకుంటే అలవాట్లకు బానిసై వుంటే మరణానికి
దగ్గరైనట్లేనని, కలల సాకారం కోసం శ్రమించి ఇతరులతో కూడకుంటే మెల్లి మెల్లిగా జీవితాన్ని కోల్పోయినట్లేనని విశదీకరించారు.
సగటు మనిషి విద్యుత్ ఛార్జీల మోతను వివరించిన తీరు; కవిత్వం యొక్క నిర్వచనాన్ని దాని ప్రయోజనాలను వివరించిన
కవిత; కూసింత చోటు కోసం ఉద్యమమై కదిలిన జనాన్ని అణిచే తత్వం మీద ప్రశ్నై
వారి గుండెలపై ఎగిసిన మంటల కెరటాలవు తుందన్నారు.ప్రపంచ తెలుగు మహాసభల నేపధ్యంలో తెలంగాణాలో వెదజల్లుతున్న తెలుగు వెలుగు జిలుగులను మంజీరా ధ్వనులుగా వ్యక్తీకరించారు.మాతృభాషను ఎలా నిర్లక్ష్యం చేస్తున్నారో చెపుతూ 'నా మదర్ టంగ్ తెలుగే!' నంటూ వ్యంగ్యంగా చెప్పారన్నారు. అక్షరం మాత్రం నిత్యప్రవాహమై ఎన్నడూ తన ప్రభావాన్ని చూపడం మానలేదన్నారు.
నెర్రెలుబారిననేల, పల్లేరు ముళ్ళు కళ్ళ ముందు కదలాడుతుంటే ఆర్ధికావసరాలు ఒత్తిడి పెరిగి వేదనతో పల్లెని వదలి వలసబాట పట్టిన రైతు నిస్సహాయ స్థితిని కళ్ళకు కట్టించారు. దూరవాణి కార్యక్రమాలలో దూరిన మనసు తన నిజ రూపాన్ని మరచింది. దాంతో నన్ను నేను వెతుక్కుంటూ నాదైన జీవితం కోసం వెతుకుతున్నానని చెపుతూ నేటి
మనిషి ఉక్కిరిబిక్కిరితనాన్ని తేటతెల్లం చేశారు.
మతాన్ని తలకెక్కించుకొని విధ్వంసాన్ని చేయాలనుకొనే వాళ్ళు,వాళ్ళను పురికొల్పే వాళ్ళకు కదం తొక్కిన కలాలతో
గర్జించిన గళాలతో సమాధి రాయి నిర్మిస్తామని హెచ్చరిక చేస్తారు.
సృష్టిలోని ప్రతి జీవి నిన్నను మరచి నేటి కొరకు సమాయత్తమవుతుంది. కొంతమంది నిన్నటినే తలంచుకొంటూ కాలాతీత మనిషిగ ఉండి ప్రయోజనమేముందన్నారు.
పుస్తకం నిండా తాత్వికత ప్రాపంచిక విషయాలు, సిద్ధాంత భావజాలం, సమాజం మీద అనురక్తి, ప్రజల పక్షపాతిగ,సమాజ వైచిత్రిని ప్రశ్నించడమే కాకుండా, ఆసమస్యల
పరిష్కార ఆలోచనలు కన్పిస్తాయి.
తన రచనల ద్వారా సమాజ హితాన్ని అసమానతలను గట్టిగా వినిపించిన ఈ కవి కలానికి అభినందనలు. పుస్తకాన్ని చదివి,
మరికొంతమందితో చదివిద్దాం. రచయిత మరెన్నో రచనలు చెయ్యాలని ఆకాంక్షిద్దాం.
వివరాలకు
మట్టిపోగు రచయిత : పిల్లా కుమారస్వామి
వెల : రూ. 100/ప్రతులకు : డెవలప్ మెంట్ ఆఫీసర్, యల్.ఐ.సి. ఆఫ్ ఇండియా, కదిరి. సెల్ : 94901 22229
Email : krpvijay @gmail.com
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి