వేటూరి సుందరరామమూర్తి




        ‌ 
         వేణువై వచ్చాను భువనానికీ అంటూ రయ్ మని దూసుకొచ్చాడాయన.అలలు కదిలినా పాటే, ఆకుమెదిలినా పాటే ఏ పాట నేరాయను బ్రతుకే పాటైన పసివాడను అని పాడుకున్న జీవన పాట సారాయన. మనసు మాటకందనినాడు మధురమైన పాటవుతుంది. మధురమైన వేదనలోనే పాటకి పల్లవి పుడుతుంది అన్న ఆ మనిషి, “కృషి వుంటే మనుషులు ఋషులౌతారు, మహాపురుషులౌతారు, తరతరాలకి తరగని వెలుగౌతారు, ఇలవేలుపులౌతారు” అనే అజరామరమైన పల్లవులతో ఎన్నోవేల పాటలు రచించి
పాటకు పట్టంకట్టి విశ్వవిఖ్యాత పాటల రచయితగా మనీషిగా నిలిచిన మహనీయుడు ఎవరో కాదు. ఆయనే డాక్టర్ వేటూరి సుందరరామమూర్తి. 
తెలుగు సినీగేయకవితా వనమాలిగా మారి పాటల సేద్యం చేసి తెలుగు పాటను 
శ్రీ శ్రీ తరువాత జాతీయ స్థాయిలో నిలిపిన పాటల చక్రవర్తి వేటూరి  సుందరరామ్మూర్తి 1936 న జనవరి 29 న కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లిలో జన్మించాడు. మద్రాసులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్, బెజవాడలో డిగ్రీ పూర్తిచేశారు. ఆంధ్ర ప్రభ పత్రిక ఉప సంపాదకుడిగా పనిచేశారు. 1956 నుంచి పదహారేళ్ళపాటు పాత్రికేయ వృత్తిలో ఉన్నారు.
1974లో సినీపరిశ్రమలో ప్రవేశించిన వేటూరి కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన
 ఓ సీతకధ చిత్రంలో “భారతనారిచరితము” అనే హరికధతో తన గేయరచనా ప్రస్థానాన్ని ప్రారంభించి 2010 వరకూ దాదాపు 5500 పైగా పాటలు రాసి, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎవరూ అందుకోలేని స్థానాన్ని సంపాదించారు. లక్షల సంఖ్యలో  అభిమానాన్ని సంపాదించుకున్నారు.
వేటూరి సుందరరామ్మూర్తి 
8 నంది అవార్డులతో పాటు మొత్తం 14 అవార్డులు, ఒక జాతీయ పురస్కారం అందుకున్నారు. 
శ్రీశ్రీ తర్వాత జాతీయ అవార్డు అందుకున్న తెలుగు పాటల రచయిత వేటూరి సుందరరామమూర్తి. మాతృదేవోభవ సినిమాలోని రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే పాటకు ఈ అవార్డు అందుకున్నారు వేటూరి.


రాలిపోయే పూవా నీకు రాగాలెందుకే అంటూ ఆయన ప్రేక్షకులనందరినీ కన్నీటి పర్యంతం చేస్తూ 
తన కలానికి విశ్రాంతి నిస్తూ జీవిత ప్రస్థానాన్ని ముగించారు వేటూరి సుందరరామమూర్తి.
వేటూరి రాసిన మరో ఆణిముత్యం లాంటి పాట.. నరుడి బతుకు నటన. సాగరసంగమంలో కమల్ హాసన నటన ఇప్పటికీ మరిచిపోలేరెవరూ. అందుకు కారణం వేటూరి గీతాలు.. అంతే కాదు ఈ సినిమాలో పాటలు.. అందునా నరుడి బతుకు నటన పాట తనకు ఇష్టమైందని చెప్పుకుంటా రాయన.ఆయన కలం నుండి పదాలువరదలా ఉప్పొంగి ప్రవహిస్తాయి.అలవోకగా ఈ పాదం ఇలలోన నాట్యవేదం
ఈ పాదం నటరాజుకే ప్రమోదం
అంటూ రాయగలగడం ఆయనకే సొంతం. ఆరేసుకోబోయి పారేసుకున్నానంటూ మాస్ పాటను అంతే బాగా రాయగలరు.
 `ఆకుచాటు పిందె తడిసె` బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది…` లాంటి అనేక సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఈ కాంబినేషన్లో వచ్చాయి. పండిత పామరులను అలరింప చేసే అరుదైన గ్రాంధిక వ్యావహారిక భాషలో పట్టున్న వేటూరి జంధ్యాల లు  సినీ జీవితం లో సమకాలీనులవడం  తెలుగు ప్రేక్షకులు చేసుకున్న అదృష్టం. వారివురు తెలుగు వారి అభిరుచులను గ్రహించి  వ్యాపార అవసరాలకు అనుగుణంగా పని చేసిన తీరు అపూర్వం. వారు సిరి సిరి మువ్వ లతో ఆడుకున్నారు శంకరాభరణంకు అలంకారాలు చేసారు. అడవి రాముడు లో వేడుకలు చేసుకున్నారు సప్తపది కి అడుగులో అడుగు వేసారు వేటగాడు తో వినోదం పంచారు. ఇంకా చాలా సినిమాలకు కలిసి పనిచేశారు. జంధ్యాల దర్శకుడిగా మారిన తరువాత వేటూరికి వ్యాపార దృక్పధం లో కాక కొత్త కోణం లో తన ప్రతిభను ప్రదర్శించే అవకాశం కలిపించారు.
‘నిన్న మొన్న తుళ్లి తుళ్లి తూనీగల్లే ఎగిరిన పిల్లదానికొచ్చింది కళ, పెళ్లికళ’ అంటూ సుతారంగా, సున్నితంగా సంపెంగ రెక్కలతో సరాగమాడిన గీతర్షి ఆయన. 

 పడికట్టు పదాల దొంతరలు వదిలేసి, ‘ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక... ఏరు దారెటు పోతుందో ఎవరినీ అడగక...’ అంటూ ఒకింత వేదాంతంతో వేటూరి తానేమిటో ఆవిష్కరించుకున్నారు. ఇక అంతే... పదేళ్ల పాటు ఎన్నెన్ని సినిమాలకు ఆయన సింగిల్‌కార్డు గేయ రచయితగా నిలిచారో లెక్క లేదు. చక్రవర్తి, ఇళయరాజా, కీరవాణి, రాజ్‌కోటి... ఎందరో సంగీత దర్శకులు ఏరి కోరి ఆయనే కావాలని తమ బాణీలకు పాటలు రాయించుకున్నారు. కె. విశ్వనాథ్ నుంచి కె. రాఘవేంద్రరావు, ఎ. కోదండరామిరెడ్డి, ఇవాళ్టి శేఖర్ కమ్ముల, గుణశేఖర్‌ల దాకా ఎందరో దర్శకులకు ఆయన హాట్‌ఫేవరెట్. 
సన్నివేశానికి తగినట్లుగా పాటలు, ఇచ్చిన ట్యూన్‌కు అనుగుణంగా చెక్కిన పద సముదాయం గుబాళించే పాటలు వెంట వెంటనే రాయాల్సి వచ్చిన సంక్లిష్ట సంధిలో తన కోసం సిద్ధమైన సింహాసనాన్ని వేటూరి సరైన సమయంలో అధిరోహించారు.
 ట్యూన్ వినిపిస్తే అరగంటలో ఆయన ఫోనులోనే పాట వినిపించేవారని చెప్పుకుంటారు. ‘శంకరాభరణం’ లాంటి క్లాసిక్స్‌కి, ‘వేటగాడు’, ‘జగదేకవీరుడు - అతిలోకసుందరి’ వంటి ఫక్తు ఫార్ములా సినిమాలకు సమాంతరంగా సాహితీ గౌరవం కలిగిన పాటలు రాస్తూ, ఆయన తన ప్రతిభను ప్రపంచానికి స్పష్టం చేశారు.  ‘అచ్చెరువున... విచ్చిన కన్నులతో’ రసహృదయుల్ని తన్మయానికి లోను చేశారు. అలవోకగా, అతి సుందరంగా మాటలతో ప్రయోగాలు చేసి పాటలల్లిన మాంత్రికుడు ఆయన.

  ‘జిలిబిలి పలుకులు చిలిపిగ పలికిన’ మైనాల సోయగాన్ని ఆయన ‘సితార’లో అక్షరబద్ధం చేస్తే ఇళయరాజా స్వరమాలిక కూర్చి అజరామరం చేశారు.
 ‘వానకారు కోయిలనై /తెల్లవారి వెన్నెలనై / ఈ ఎడారి దారులలో / ఎడద నేను పరిచానని/కడిమి వోలె నిలిచానని’ అంటూ ఆయన లిఖించిన ‘మేఘసందేశం’ ఎన్నేళ్లు గడిచినా ఆ పరిమళాన్ని పోగొట్టుకోదు.
 ‘కలలారని పసిపాప / తలవాల్చిన ఒడిలో
 తడినీడలు పడనీకే / ఈ దేవత గుడిలో’అని లేబ్రాయపు ప్రియురాలికి ఆయన చేరవేసిన ‘గీతాంజలి’ ఎన్నటికీ సుమదళ సుకుమారమే.
 ‘ఎన్నెల్లుతేవే/ ఎదమీటిపోవే’
 అంటూ ‘పంతులమ్మ’కు ఆయన శ్రుతి చేసిన పున్నాగపూల సన్నాయి సినీ సంగీత ప్రియుల వీనులకు విందు చేస్తూనే ఉంటుంది. అంతర్లీనంగా ‘వీణ వేణువైన మధురిమ’లా పల్లవిస్తూనే ఉంటుంది.
 ఆయనకే తెలిసిన ‘ఎడారి కోయిల’లు, ‘తెల్లారని రేయి’లు కోకొల్లలు. కడలి తరంగమంత జీవన విషాదాన్ని ‘బ్రతుకంటే మృతి కంటే చేదైన ఒక తీపి పాట...’ అంటూ సంక్షిప్తీకరించడం సుందరరామమూర్తి కంటే వేరెవరికి తెలుసు? ‘వేణువై వచ్చాను భువనానికి... గాలినై పోతాను గగనానికి’ అన్న జీవన క్రోడీకరణ ఆయనకే సాధ్యం. ఒక గంధర్వ కవిత్వపు కుంచె భువిపై దిగి, 1936 నుండి 2010 దాకా 74 ఏళ్ల పాటు ‘వేదం’లా, ‘అణువణువున నాదం’లా, ‘పంచప్రాణాల నాట్యవినోదం’లా విలసిల్లిన  వేటూరి సుందరరామమూర్తి
75 సంవత్సరాల వయస్సులో మే 22, 2010 న  
నిర్వాణసోపానమధిరోహించారు.

పిళ్లా విజయ్, 9490122229

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు