సాహిత్యానికి కొండమల్లెల పరిమళం అద్దిన దేవకి కలంనుంచి జాలువారిన అక్షరం


          మహాసముద్రం కోదండరెడ్డి దేవకి (యం.కె.దేవకి)1952 జనవరి 3న కమలమ్మ, కోదండరెడ్డి దంపతులకు ద్వితీయసంతానంగా చిత్తూరు జిల్లా వరిగపల్లి గ్రామంలోజన్మించారు.
          దేవకి వరిగపల్లిలో ప్రాథమిక విద్య, చిత్తూరు లోని బి.యస్.కణ్ణన్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో సెకండరీ విద్య, తిరుపతి లోని పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ,  వెంకటేశ్వరవిశ్వ విద్యాలయంలో ఎం.ఏ. (తెలుగు) పూర్తి చేశారు. ఎం.ఏ. లో తిక్కవరపురామిరెడ్డి బంగారు పతకం మరియు ఎం. ఎస్. వెంకట కృష్ణారావు స్మారక బహుమతిని పొందారు. అదే విశ్వవిద్యా లయంలో   జి.నాగయ్య గారి పర్యవేక్షణలో “తెలుగుబాలగేయ సాహిత్యం" అనే అంశంపై పరిశోధన చేసి, పిహెచ్.డి. పట్టా పొందారు. 1979 నవంబర్లో అప్పట్లో వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న అనంతపురం పి.జి. సెంటర్లో అధ్యాపకురాలిగా చేరి, అటుపైన రీడరుగా, ఆచార్యులుగా పనిచేసి 2012 లో పదవీ విరమణ పొందారు. 2006 - 08 మధ్య దూరవిద్యా సంచాలకులుగా విశేషసేవలందించారు. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలోనే ఆచార్యులుగా పని చేస్తున్న  పి.ఎల్. శ్రీనివాసరెడ్డి తో దేవకి వివాహం 1984 లో జరిగింది.

     దేవకి తండ్రి కోదండరెడ్డి చదివింది మూడో తరగతే అయినా అత్యంత సహజంగా వేలకొద్దీ పాటలు,పద్యాలు అల్లారు. 'సుధారసగాన శతరత్నావళి' పేరుతో వంద పాటలు అచ్చయ్యాయి కూడా.  తండ్రి నుంచి సృజనాత్మక రచనా వ్యాసంగం దేవకి గారికి వారసత్వంగా అబ్బింది. చిన్న తనంలో స్నేహితులతో కలసి పాడే గొబ్బి పాటలకు అదనంగా తను కొన్ని చరణాలను
సృష్టించి కలిపి పాడారట. ఇప్పటికీ అవి వారి వూళ్ళో వ్యాప్తిలో వున్నాయి. చదువుకునే రోజుల్లో స్నేహితులతో కలసి శ్రీవారి మెట్టు నుండి తిరుమలకు నడచి వెళ్తుండగా దారిలోని ప్రకృతి సౌందర్యం ఆమెను ఆశుకవితా సృష్టికి పురిగొల్పింది.
* కొండలలో కోనలలో
నిండుగా పారేటి
సెలయేటి గలగలలు
చెవులార విన్నాను
అడవి మల్లెపూల
అందాలు చూశాను
సెలయేటి వాగులో
రాగాల రవళిలో
మురళి నాదము నేనై మునిగి తేలాను......"
          భావ కవితా ధోరణిలో ఆశువుగా సాగిన ఈ గేయం 'మంజీరస్వనాలు' (1975) అనే గేయ సంకలనం లో ప్రచురితమైంది.

      ఆచార్య దేవకి రచనల్లో ముఖ్యమైనవి రెండు బాలగేయ సంకలనాలు తారంగం - తారంగం, గోరుముద్దలు (1990 ఆంధ్రప్రదేశ్
బాలల అకాడమి); కథా సంపుటాలు రెండు - ముళ్లతోవ, మంటల ఒడిలో; రెండు పరిశోధక గ్రంథాలు ,తెలుగు బాలగేయ సాహిత్యం, తెలుగునాట జానపద వైద్య విధానాలు; ఆచార్య దేవకి రచించిన జాతిరత్నాలు అనే పుస్తకం 9వ తరగతి విద్యార్ధులకు దాదాపు 15 సంవత్సరాలు ఉపవాచకంగా ఉండేది.
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య తెలుగు శాఖ విద్యార్థులకు “జానపద సాహిత్యం",""దాక్షిణ్యాత్య సాహిత్యం - తులనాత్మక అధ్యయనం"" అనే గ్రంథాలను రచించారు. ఈమె ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పాఠ్య గ్రంథాలకు రచయితగా, ఎడిటర్ గా; మహారాష్ట్ర లో 10,12 తరగతులకు తెలుగు
పాఠ్య గ్రంధాలు తయారుచేసే కమిటీలో సభ్యురాలిగా వ్యవహరించారు. బాలగేయాలు, పొడుపు కథలు,సామెతలు, రోగలక్షణాలు, వైద్యవిధానాలు తులనాత్మకత (కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు), జానపద గేయాలు ఈమెరచనల్లో ప్రముఖమైనవి. ఇవికాక దాదాపు 150 వ్యాసాలు వివిధ దిన, వార పత్రికలలో అచ్చయ్యాయి.సుమారు 50 రేడియో ప్రసంగాలు కడప, అనంతపురం ఆకాశవాణి కేంద్రాల నుండి ప్రసారమయ్యాయి. ఇక ప్రచురణకు నోచుకోని రచనలు తరం మారింది. సెలయేట్లో గులకరాళ్ళు, సామెతల సూరమ్మత్త వంటి నవలలు, కొల్లో డొంక కథలు, పొయ్యి గడ్డ, నిలుకు, రొండుపేట  మొదలైన కథా సంకలనాలు, కవితా సంకలనాలు, విశ్లేషణాత్మక వ్యాసాలు అనేకం వున్నాయి. ఇటీవలే కినిగి వెబ్ పత్రిక ద్వారా "ఇర్లచెంగి
కథలు" పేరుతో 25 కథలు వెలువరించారు.
ఆచార్య దేవకి రాసిన కథలన్నీ సరళమైన వాడుక భాషలో చిత్తూరు జిల్లా మాండలికంలో ఉండి పాత్రలు సజీవంగా మన ఎదురుగా నిలబడినట్లే వుంటాయి. గ్రామీణ జీవితంతో మమేకమై, పల్లె వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కథలు రాశారీమె. తాగుడుకు బానిసైన వాళ్ళ కుటుంబాలలో చెలరేగే అలజడులు, స్త్రీల సమస్యలు, లైంగిక హింస, కుటుంబంలో వ్యక్తుల మధ్య వున్న అనుబంధాలు,
చిన్న పిల్లల మనస్తత్వం, స్నేహితుల మధ్య ఆత్మీయతలు, సామాజిక ఆచారవ్యవహారాలు, వేడుకలు -వినోదాలు, సంస్కృతీ సంప్రదాయాలు వెరసి గ్రామీణ జీవనం ప్రధానంగా ఈమె కథా వస్తువులు.
సందర్భానుసారంగా ప్రయోగించిన సామెతలు, నుడికారాలు, జాతీయాలు దీవకి రచనలకు మరింత సొగసును తెచ్చిపెట్టాయి. అలాగే అమాయకత్వం, గడుసుదనం, గయ్యాళితనం కలగలసిన స్త్రీల తిట్లు కూడా అక్కడక్కడా  వినిపిస్తాయి. పొట్టక్క, పోలిగాడు, ఉరుకుందు,ఇరుపాకి, పిల్లోడు, కుట్టెక్క, కుప్పమ్మవ్వ, బజారిగాడు ఇలా పల్లెల్లో వినిపించే పేర్లు గల పాత్రలు ఈమె
కథల్లో సాక్షాత్కరిస్తాయి.
          తన పిహెచ్.డి. పరిశోధనా గ్రంథం "తెలుగు బాలగేయ సాహిత్యం" బాలల సాహిత్యంలో మొట్టమొదటి పరిశోధన కావడం విశేషం. ఇందులో గురించి లోతైన పరిశోధన తో పాటు, బాల గేయాలను విరివిగా సేకరించి పొందుపరిచారు. 10 వేలకు పైగా బాలగేయాల నుండి ఏర్చికూర్చిన 18 సంకలనాలు
ప్రచురణకు సిద్ధంగా వున్నాయి. మరో పరిశోధనా గ్రంథం "తెలుగునాట జానపద వైద్య విధానాలు"ఆంధ్రప్రదేశ్ జానపద సాహిత్య పరిషత్ వారిచే బిరుదురాజు రామరాజు అవార్డు పొందిన ఈ గ్రంథం మంచి
ఆదరణ పొందింది. మానవుని పుట్టుక నుంచీ అనుభవ ప్రధానంగా అవతరించి అలివికాని రోగాలకు అద్భుతమైన చిట్కాలు నాటువైద్యంలో అందుబాటులో ఉంటూ పేదల పాలిట వరంగా వున్న విషయాన్ని
నిరూపించారీ గ్రంధంలో. ఇదే గాక ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం, యునాని, ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్,అయస్కాంత వైద్యం, హోమియోపతి, అల్లోపతి మొదలైన వాటిని 'భిన్న వైద్య విధానాలు' పేరుతో
పరిచయం చేశారు. వివిధ పత్రికలలో ఆమె రాసిన వ్యాసాల్లో ప్రధానంగా మహిళల సమస్యలు, బాలసాహిత్యం, తులనాత్మక సాహిత్యం, జానపద సాహిత్యం, సమకాలీన సమస్యలు ప్రస్తావించబడ్డాయి.ఆకాశవాణి కేంద్రాల ద్వారా స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేశారు.
         
         1993 లో తెలుగునాట జానపద వైద్య విధానాలు గ్రంధానికి బిరుదురాజు రామరాజు పురస్కారం,1998 లో జానపద సాహిత్య అధ్యయనానికి గాను బెంగుళూరు విశ్వవిద్యాలయం తంగిరాల సాహిత్య
పీఠం నుండి ఉత్తమ పరిశోధకులకిచ్చే సీతా మహాలక్ష్మి పురస్కారం, 2006 లో చెలిమి మ్యాగజైన్,విజయవాడ వారిచే సాహితీ ప్రతిభ అవార్డు, హెల్త్ కేర్ ఇంటర్నేషనల్ వారిచే భారత మహిళా శిరోమణి అవార్డు,2015 లో ఉగాది పురస్కారం, అదే సంవత్సరం తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు - ఇలా అనేక పురస్కారాలను, గౌరవాలను అందుకున్నారు. 
         సమకాలీన సమస్యలను ప్రస్తావిస్తూ, జానపదుల జీవనాన్ని సాహిత్యంలో చిత్రించిన
దేవకి వర్ధమాన రచయితలకు మార్గదర్శకు రాలు, స్ఫూర్తి ప్రదాత. పేరుకు తగినట్లే ఆమె సాహిత్యంమహాసముద్రం.ముద్రితం కాని ఆమె రచనలకు ప్రచురణ రూపమివ్వడం సాహితీ ప్రపంచానికి తక్షణ అవసరం ఉంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు