అనంత సాహితీ కళారత్న బిక్కికృష్ణ



తెల్ల జొన్న రొట్టె పై ఎర్ర కారం నంజుకుని మల్లె మొగ్గల లాంటి అన్నపు మెతుకు కోసం అక్షరాలు విత్తుల్ని మెదడులో నాటుకుని సాహితీ వృక్షంగా ఎదిగిన రైతుబిడ్డ బిక్కికృష్ణ శెట్టూరు మండలం వడ్డె పాళెం గ్రామంలో బిక్కిహనుమంతప్ప,భీమక్క దంపతులకు 8.8.1964 లో   జన్మించారు. ప్రాథమిక విద్య వర్ణచేడులోని ‌వీధిబడిలో, హైస్కూల్ విద్య కళ్యాణదుర్గంలో పూర్తి చేశారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలోఇంటర్ ను,  బి.ఎ.డిగ్రీ ని రాయదుర్గంలో ప్రభుత్వ కళాశాలలో 1967లో పూర్తిచేశారు. ఇంటర్ డిగ్రీ చదివే రోజుల్లోనే వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. విద్యార్థి నాయకుడిగా కూడా పనిచేశారు. డిగ్రీ పూర్తయ్యాక కళ్యాణదుర్గం మండలం తిమ్మ సముద్రంలోని ఆర్డిటి స్కూల్లో ఉపాధ్యాయుడిగా కొంతకాలం పనిచేశారు. 1989లో శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. తెలుగు పూర్తి చేశారు. తర్వాత తెలుగు కన్నడ భాషల్లో తులనాత్మక అధ్యయనంలో యం.ఫిల్ కూడా చేశారు.
        పీజీ చదువుతున్న రోజుల్లోనే రాసిన కవితలను చరమగీతం పేరుతో పుస్తకంగావెలువ రించారు. హిందూపురంలో సేవా మందిరంలో ఉన్న జిల్లా కేంద్రం శిక్షణా విభాగంలో   లెక్చరర్ గా కేంద్ర ప్రభుత్వం తరఫున పని చేశారు. ఆ సందర్భంలో కూడా "వేకువపిట్టలు" కవితా సంపుటిని వెలువరించారు. 1996లో పత్రికా రంగంలోకి ప్రవేశించారు.  తొలుత  ప్రజాశక్తిలో పని చేశారు. తరువాత ఆంధ్రజ్యోతి,వార్త, ఆంధ్రభూమి పత్రికలో విలేకరిగా హిందూపురం, అనంతపురం లో పనిచేశారు.ప్రింట్ మీడియా నే కాక ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా పనిచేశారు.అశ్వనీదత్ లోకల్ ఛానల్ ,స్టూడియో ఎన్,10 టీవీ లలో వివిధ హోదాల్లో పని చేశారు.ఛానల్_4లో మొట్టమొదట హైదరాబాదులో సాహిత్యాన్ని ప్రవేశపెట్టిన ఘనత బిక్కికృష్ణదే.  10tvలో అక్షరం కార్యక్రమాన్ని సాహిత్యం కోసం నిర్వహించారు.
     బాల్యం లో మద్దిలేటి సారు నాలుగు అక్షరాలు నేర్పించి ప్రోత్సహించారు. ఆయన ప్రోత్సాహం వల్లనే తను ఇంతవాడినయ్యానని భావిస్తారు బిక్కికృష్ణ . ఎనిమిదో తరగతి చదివేటప్పుడు తెలుగు టీచర్ ఖాజావలి ప్రోత్సాహంతో కవిత్వం రాయడం ప్రారంభించారు.పీజీ చదువుతున్న రోజుల్లో శర్మ అనే పెద్దాయన రెంటాలసర్పయాగం, మహాప్రస్థానం గ్రంధాలు ఇచ్చి చదవమని ప్రోత్సహించాడు అది చదివాక బిక్కి కృష్ణలో కవిత్వం పెల్లుబుకింది. 'కార్మికుల స్వేదనా వేదం కర్షకుల ఖేదం నా నాదం' కవితను కూడా ఆవిష్కరించాడు. విద్యార్థి సంఘాల లో పనిచేయడం వల్ల అభ్యుదయ భావాలు ఏర్పడ్డాయి. ప్రీస్టు అయినా, కమ్యూనిస్టు అయినా, తొలుత హ్యూమనిస్టు కావాలని కోరుకుంటాడు కృష్ణ. పేదల  గురించి కవి తప్పకుండా ఆలోచించాలని కోరుతాడు బిక్కికృష్ణ. ఈ ఒరవడిలో అనేక పుస్తకాలను రాసి ఆవిష్కరించారు. 'చినుకు' కవితా సంపుటిని,"భావన_ సాహిత్య విమర్శ వ్యాసాలు", ఇండియా టుడే సమీక్షలను సమీక్షలను 'సమీక్షణం'_ఇలా మూడు పుస్తకాలను 2006లోనే వెలువరించారు. సాయిబాబా జీవితంలోని లీలలపై 'ప్రేమాంజలి', సాయి ప్రేమతత్వం  దీర్ఘకావ్యాలు రాశారు.       వస్తువులో వైవిధ్యం, అభివ్యక్తిలో,పద చిత్ర కల్పనలో నూతనత్వం సాధించిన బిక్కికృష్ణ కొత్తతరం కవులు కోసం కవిత్వం డిక్షన్ రాసి ప్రచురించారు. "కర్షక కవి రాసిన పొలం కావ్యం" అంటూ రైతుని గొప్పగా చిత్రీకరించాడు కవ బిక్కి. "నీ అక్షరాలను కొండల గుండెలరాతి బండలపై అక్షరాలుగా లిఖించు"అంటూ కాలం నది ఒడ్డున కావ్యాన్ని వెలువరించారు బిక్కికృష్ణ. పర్సోనిఫికేషన్,అపోస్ట్రఫీ లాంటి కవితా నిర్మాణ పద్ధతులను ఉపయోగిస్తూ "రాత్రి జాబిలికి జలుబు చేసిందేమో ఉదయమే పూల తోట పై మంచు కురిసింది" అంటూ 'వాన వెలిశాక' కావ్యాన్ని వెలువరించాడు.'కొత్త కోణం 'లాంటి విమర్శా గ్రంథం తో విమర్శా  రంగంలోకి అడుగు పెట్టిన బిక్కి కృష్ణ సాహిత్య రంగంలో తన కీర్తిని ఇనుమడింపజేసుకున్నారు.
"చెట్టులోని పువ్వులు పెనుగాలికి రాలినట్టు
మనిషిలోని సున్నితత్వాన్ని ఎవరో నలిపేశారు"
అంటూ కాలం నది ఒడ్డున కవితా సంపుటి ని
ప్రచురించారు.
       సాహిత్య రంగంలోనే కాక సినిమారంగంలోకి కూడా ప్రవేశించారు. అనేక సినిమాలకు పాటలు కూడా రాశారు.సాయి లీలలు అనే సినిమాలో చంద్రమోహన్ తో కలిసి నటించారు. 600 వరకు గజల్స్, బాల గేయాలు రాశారు సాయేదైవం, ప్రత్యక్ష దైవం శిరిడీసాయి ,అనుమానం మొగుడు వంటి సినిమాలకు పాటలు కూడా రాశారు.
        షి ఫౌండేషన్ ,చక్రి ఫౌండేషన్ ,గిడుగు రామ్మూర్తి ఫౌండేషన్ సంస్థల్లో కార్యదర్శిగా ఉంటూ శత కవి సమ్మేళనాలు నిర్వహించారు.జైనీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ను 2017లో స్థాపించి దానికి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. దీని ద్వారా డాక్టర్ ఎన్.గోపి రాసిన జలగీతం కావ్యానికి లక్ష రూపాయల నగదు బహుమతిని అందజేశారు. సాహితీ సృజన కారులను గుర్తించి వారిని వెలుగులోకి తెచ్చేందుకు ప్రతి ఏడాది సాహిత్య సమావేశాలు ఏర్పాటు చేసి బహుమతులు ఇస్తున్నారు.  నవ్యాంధ్ర రచయితల సంఘం స్థాపించి దానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు. అవనిగడ్డలో సహస్ర కవి సమ్మేళనం నిర్వహించారు. శత, ద్విశత, త్రిశత కవి సమ్మేళనాలు, కథ ,నవల గజల్స్, కవిత్వంపై అనేక శిక్షణా శిబిరాలు విజయవాడలో నిర్వహించారు.ప్రస్తుతం వివిధ సాహిత్య కళా సేవా సంస్థలను ఏకం చేసి ఎన్జీవో నెట్వర్క్ ద్వారా సాహిత్య రంగానికి హైదరాబాద్ కేంద్రంగా సేవలు చేస్తున్నారు. ఆయన సాహిత్య రంగానికి చేస్తున్న సేవలకు గాను పలు పురస్కారాలు పొందారు. 2001లో హిందూపురంలో స్వర్ణ భారతి సాహితీ సంస్థ ద్వారా ఉత్తమ కవితా పురస్కారం, 2014లో హైదరాబాదులో ఎన్.గోపి చేతుల మీద రంజని కుందుర్తి అత్యున్నత కవితా పురస్కారం,
2014లో విజయవాడలో హైకోర్టు జస్టిస్ చంద్రకుమార్ చేతుల మీదుగా మల్లెతీగ అత్యున్నత కవితాపురస్కారం, 2014లో హైదరాబాద్లో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేతులమీదుగా నార్త్ అమెరికా యువకళా
వాహిని పురస్కారం,2017లో నెల్లూరులో కాలం నదిఒడ్డున అనే కావ్యానికిపాతూరి మాణిక్యమ్మ జాతీయ స్తాయి పురస్కారం,2017లో కడపలో సాహితీ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో మహిళా కమిషన్ చైర్ వర్సన్ నన్నపనేని రాజకుమారి చేతులమీదుగా శ్రీ శ్రీ పురస్కారం, 2014హైదరాబాద్ రవీంద్రభారతిలో చక్రి ఫౌండేషన్ అవార్డు,2015లో ఆర్వీఎస్ కళాసమితి ద్వారా హైకోర్టు జడ్డి చేతులమీదుగా ఉత్తమ కవి పురస్కారం,2016చీరాల సహజ సాహితీ సంస్థ తో మహా కవి గురజాడ పురస్కారం,
2017లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోవిజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుచేతుల మీదుగా ఉగాది పురస్కారం,2018లో రాష్ట్ర ప్రభుత్వంచే విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునా
యుడు చేతుల మీదుగా కళారత్న పురస్కారం పొందారు.గేయకవిగా, రచయితగా ,కవిగా, విమర్శకునిగా లబ్ధ ప్రతిష్టులైన  బిక్కికృష్ణ భవిష్యత్తులో మరెన్నో రచనలు చేసి యువతరానికి చేయూత నిస్తారని ఆశిద్దాం.ఎన్నో పురస్కారాలు అందుకోవాలని కోరుకుందాం.

పిళ్లా కుమారస్వామి
9490122229

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు