తిరుమల రామచంద్ర
PC: Wikipedia
తిరుమల రామచంద్ర 17.6.1913లో అనంతపురం జిల్లా, ధర్మవరం తాలూకా రాఘవంపల్లెలో, శ్రీమాన్ శేషాచార్యులు, శ్రీమతి జానకమ్మ దంపతులకు తొలి పుత్రుడుగా జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి సంస్కృత-తెలుగు విద్వాన్, పంజాబు విశ్వవిద్యాలయం నుంచి హిందీ ప్రభాకర, అలీగఢ్ ఆయుర్వేద పీఠం నుంచి ఆయుర్వేద భూషణ పట్టాలు పొందారు.ఆయనకు సంస్కృత, ప్రాకృత, తెలుగు, కన్నడ, హిందీ, తమిళ,ఆంగ్ల భాషలలో పరిచయం ఉన్నట్టు చెప్పుకున్నారు.
డెయిలీ టెలిగ్రాఫ్, తెలంగాణ పత్రిక, మీజాన్, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, భారతి మాసపత్రిక, ఆంధ్రభూమి, హిందుస్థాన్, సమాచార్ వంటి ప్రముఖ పత్రికలలో రకరకాల పదవులు నిర్వహించారు. పాత్రికేయులు కావటానికి ముందు తరువాత మద్రాసు ఓరియంటల్ మాన్యుస్క్రిప్టు లైబ్రరీ, తంజావూరు సరస్వతీ మహల్ లైబ్రరీలో పండితుడుగా, లాహోర్-పంజాబ్ విశ్వవిద్యాలయంలోను, జిల్లా రీసెర్చి ఇనిస్టిట్యూట్, హైదరాబాద్లోను, సంస్కృత లిఖిత గ్రంథాల క్యాటలాగగా, ఇస్కాన్,హైదరాబాద్ లో అనువాదకుడుగా, తెలుగు విశ్వవిద్యాలయంలో సమ్మాన్య ప్రాచార్యుడుగా, క్వెట్టా- చమన్లో భారత సైన్యంలో హవల్దార్ క్లర్కుగా ఎన్నో ఇతర ఉద్యోగాలు చేశారు.
సంస్కృత ప్రాకృత కన్నడ, తమిళ, హిందీ, ఆంగ్ల భాషల నుంచి అనువాదాలు చేశారు. పలు గ్రంథాలు, బాల సాహిత్య పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. ఎన్నో సదస్సులలో పరిశోధన పత్రాలు సమర్పించారు.
వీరగాథలు, దక్షిణాంధ్ర వీరులు, హిందువుల పండుగలు- పర్వములు, నుడి-నానుడి, మన లిపి పుట్టు పూర్వోత్తరాలు, తెలుగు వెలుగులు, సాహితీసుగతుని స్వగతం, నూరేళ్ళ తెలుగు వ్యాసం, మరపురాని మనీషి, నాగలాపురం-దాని పరిసరాలు, గాథాసప్తశతిలో తెలుగు పదాలు, మూడు వాజ్మయ శిఖరాలు, ధర్మదీక్ష, తెలుగు పత్రికల సాహిత్య సేవ, ప్రాకృత వాజ్మయంలో రామకథ, మనవి మాటలు, బృహదారణ్యకం, అహంభో అభివాదయే, అవధాన కల్పలత, బృహత్కథా మంజరి, లలిత విస్తరం, హరమేఖల, లీలావతి, హాలుని గాథలు, హంపీ నుంచి హరప్పా దాక - ఇది ఆయన చివరి గ్రంథం. దీని తరువాత 'హైదరాబాదు నుంచి హైదరాబాదు దాక' అనే రచన ప్రారంభించాలనుకున్నారు కాని, ఆయువు చాలలేదు.
బౌద్ధ సాహిత్యం పట్ల, విశేషాభిమానం గలవారు కనుక, అందులోనూ విశేష కృషి చేశారు. 'వీరగాథలు, దక్షిణాంధ్ర వీరులు' పుస్తకాలు కలిపి 'ఆంధ్ర వీరులుగానూ, 'హాలుని గాథలు'ను ప్రాచీనాంధ్ర గాథలు' గానూ 2013లో ఎమెస్కో వారు ప్రచురించారు. ఆంధ్రప్రభ దినపత్రికలో వచ్చిన పలుకుబడిని రామచంద్ర శతజయంతి సందర్భంగా 2013లో సీనియర్ పాత్రికేయ సంఘం వారు ప్రచురించారు.
తెలుగు పత్రికల సాహిత్యసేవలో తెలుగు పత్రికలఆవిర్భావం, తొలి మహిళా మాసపత్రిక 'బాలిక', మహిళలనిర్వహణలో మహిళల సంపాదకత్వంలో తొలి మహిళలమాసపత్రిక హిందూ సుందరి వంటి విశేషాలనుతెలియజేశారు.
మన లిపి పుట్టు పూర్వోత్తరాలులోని విషయం బహుగంభీరమైనా, పిల్లలకు సైతం కుతూహలం కలిగించే పద్ధతిలోప్రకరణాలకు చక్కని పేర్లు పెట్టారు. 'ప్రాణాలతో ఉన్న పుస్తకం,మాట్లాడే వస్తువులు, కథ చెప్పే కాయితం, బొమ్మల జాబు,అంకెల అందచందాలు, చర్మ పుస్తకాలు, కాయితాల కథ,అచ్చట ముచ్చట వాటిలో కొన్ని. వీటి వివరాలను సరళశైలిలోరచించటం వల్ల చిరకాలం గుర్తుండే రచయితగా ఖ్యాతినిసంపాదించారు.
నుడి-నానుడిలో రకరకాల పదాల ఉచ్చారణను బట్టి వాటి అసలు రూపాలు ఎలా ఉంటాయో ఊహించి, అవి నిర్ధారించేందుకు రామచంద్ర చేసిన పరిశోధన మనను చకితులను చేస్తుంది. పంచతంత్రంలో విష్ణుశర్మ ఏ విధంగా వివిధ జంతువులు, పక్షుల చేత మాట్లాడించి, వాటి మధ్య స్నేహం కుదిరేలా చేసి కథల ద్వారా విషయగ్రహణం చేయించాడు. అదే విధంగా రామచంద్ర పుస్తకంలో తెడ్డు, గరిట, రోలు, రోకలి మొదలైన వాటితో మాట్లాడించి మున్నగు వాటి వివరాలేమిటో తెలియజెప్పారు. ఆయా పాత్రల ప్రవర్తనతో చక్కని హాస్యం కూడా చిలకరించారు.వేరుశెనగ, మిరపకాయ, సీతాఫలం,నిమ్మ వగైరా పదాలలో కొన్ని మన భాషాపదాలు కావనీ, కొన్ని వస్తువులైతే పూర్తిగా మనవి కావనే విషయాన్నిఆయన చేసిన చర్చ చదివితే, ఒక మామూలు పదానికి సైతం ఇంత చరిత్ర ఉందా? అనిపించి తీరుతుంది.
ఆంధ్ర సాహిత్యంలో స్త్రీ పర్యాయ పదాలు అనే వ్యాసంలో మొత్తం 90 స్త్రీ పర్యాయ పదాలున్నాయనీ, వాటికి పూర్వులైన నిఘంటుకారులు ఎలాంటి వ్యుత్పత్యర్థాలనూ నిరూపించలేదనీ చెప్పారు. సందర్భోచితంగా కవిత్రయ భారతంలో నన్నయ సైతం స్త్రీ సంబోధన పదాలను ప్రయోగించాడని చెప్పారు.
నేటి సాహిత్య విమర్శ అనే వ్యాసంలో విమర్శ అంటేగుణదోషాల సాకల్య సమీక్షేగాని దుమ్మెత్తిపోయడం కాదు.అప్పుడే అది సద్విమర్శ అవుతుంది అన్నారు.
ఎంత వెదకినా కనిపించని ముద్రారాక్షసాలు నేటివారికిచురక వంటి వ్యాసం. నేటి పత్రికలు తెరిస్తే అపార్థాలుస్ఫురించే సమాసాలూ, ముద్రారాక్షసాలూ వీరవిహారం చేస్తుంటాయి. తెలుగులో, హిందీ, తమిళం, ఆంగ్ల పదాలు
కలిపేస్తున్న దుస్సమాసాలతో తెలుగు భాష పయనిస్తుంది.రామచంద్ర అన్నట్లు ఈ ముద్రాసురులు నిఘంటువులలోను తల దూరుస్తున్నారు. మనం వీరిని ఎంత త్వరలో అంతం చేస్తే,అంత శ్రేయస్సు. అటువంటి స్థితి కోసం ఎదురుచూడడంలో ఎంత మాత్రం ఆలస్యం తగదు.
ఆయన 12.10.1997న హైదరాబాదులో మరణించారు.
__తిరుమల నీరజ (సేకరణ: పిళ్లా కుమారస్వామి)
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి