సమ్మక్క -సారక్క (మేడారం జాతర)
మేడారం జాతర ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా కీర్తి గడించింది. ఇక్కడి వన దేవతలను దర్శించుకొనేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలివస్తుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. అయితే, మేడారానికి ఇంతటి ప్రాశస్త్యం ఎందుకు దక్కింది? ఇక్కడ వన దేవతలుగా కొలిచే సమ్మక్క సారక్క ఎవరు? జంపన్న వాగు ప్రాముఖ్యం ఏమిటి? అసలు ఈ జాతరను ఇంత వైభవంగా ఎందుకు నిర్వహిస్తున్నారు? ఇలాంటి సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. వాటికి సమాధానాలు చూడండి.
మేడారం, సమ్మక్క సారలమ్మలకు వనదేవతలుగా కొలిచేందుకు కారణాలను విశ్లేషిస్తే.. ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం కోయదొరలు వేటకోసం అడవికి వెళ్లిన సందర్భంలో అక్కడ వారికి పెద్ద పులుల కాపలా మధ్య ఓ పసిపాప కనిపించింది. ఆ పాపను కోయదొరలు గుడారానికి తీసుకెళ్లి దాచారు. పాప గూడేనికి వచ్చినప్పటి నుంచి అన్నీ శుభాలే జరగడంతో కొండ దేవతే ఆ రూపంలో ఉందని నమ్మారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఆ పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు. సమ్మక్కను ఆ ప్రాంతపు కోయ చక్రవర్తి మేడరాజు పెంచి పెద్ద చేశాడు.
కాకతీయుల కాలం(క్రీ.శ. 1260 నుంచి 1320) లో ఇప్పటి జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పొలవాసను గిరిజన దొర మేడరాజు పాలిస్తూ ఉండేవాడు. ఇతను తన మేనల్లుడు, మేడారం పాలకుడైన పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశాడు. సమ్మక్క-పగిడిద్దరాజు దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న ముగ్గురు సంతానం కలిగారు.
మేడారాన్ని పాలిస్తున్న పగిడిద్దరాజు కాకతీయుల సామంతుడు. ఆ రోజుల్లో కరవు కాటకాల కారణంగా కొన్నేళ్ల పాటు ప్రజలు శిస్తు కట్టలేదు. కాకతీయుల సామంతునిగా ఉంటూ శిస్తు కట్టకపోవడం, తన మామ మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనుల్లో విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే ఆరోపణలతో కాకతీయ సామ్రాజ్యాధినేత ప్రతాపరుద్రుడు పగిడిద్దరాజుపై సమర శంఖం పూరించాడు. ఇది గమనించిన గిరిజనులు ప్రభుత్వంపై తిరగబడేందుకు సిద్ధమయ్యారు.
మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారంపైకి కాకతీయ సేనలు దండెత్తాయి. ఈ క్రమంలో ములుగు జిల్లా లక్నవరం సరస్సు వద్ద గిరిజనులకు-కాకతీయ సేనలకు మధ్య యుద్ధం జరిగింది. ఈ క్రమంలో సాంప్రదాయ ఆయుధాలతో పగిడిద్ద రాజు, సారలమ్మ, నాగులమ్మ, జంపన్న, గోవింద రాజులు (సమ్మక్క-పగిడిద్దరాజు అల్లుడు) వీరోచితంగా పోరాటం చేశారు. కానీ, కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవింద రాజులు యుద్ధంలో మరణించారు. వారి మరణ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక అక్కడి సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి సంపెంగవాగును జంపన్న వాగుగా పిలుస్తున్నారని చరిత్రకారులు చెబుతారు.
తన కుటుంబం మరణించిందన్న వార్త విన్న సమ్మక్క యుద్ధ రంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడింది. వీరోచితంగా పోరాటం సాగిస్తుంది. ఆమె వీరత్వం చూసి ప్రతాప రుద్రుడు ఆశ్చర్యపోతాడు. కానీ, ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెన్నుపోటు పొడుస్తాడు. ఆ గాయంతోనే మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టకు వెళ్లి ఆమె అదృశ్యమైపోయిందని చెబుతారు. ఆ తర్వాత చెట్టుకింద ఓ పుట్ట దగ్గర ఓ కుంకుమభరిణ కనిపించిందట.
అందువల్లే కుంకుమ భరిణెలకు పూజలు చేయడానికి కారణం అంటారు. తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోతాడు.
కొంతకాలానికి ప్రతాపరుద్రుడు కోయరాజులు కట్టాల్సిన కప్పాన్ని రద్దుచేసి, సమ్మక్క భక్తుడై కానుకలు సమర్పించాడు. రెండేళ్లకోసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాడు. ఈ సమ్మక్క సారలమ్మ జాతర అలా మొదలయ్యిందనే కథ విస్తృతంగా ప్రచారంలో ఉంది. కుంకుమ భరిణెలనే సమ్మక్కగా భావించి అప్పటి నుంచి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క-సారలమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకొనే సాంప్రదాయం ఏర్పడింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు కేంద్రం నుంచి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో మారుమూల అటవీ ప్రాంతంలో మేడారం గ్రామం ఉంది. ఈ దట్టమైన అడవులు, కొండల మధ్యనే సమ్మక్క సారలమ్మలు కొలువై ఉన్నారు. నాలుగు రోజుల జాతరలో భాగంగా గద్దెనెక్కిన దేవతలు చివరికి వన ప్రవేశం చేస్తారు. దీంతో మహా జాతర ముగుస్తుంది.
1967లో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎండోమెంటు శాఖ ఈ జాతర గురించి పెద్దయెత్తున
ప్రచారం చేసింది. సమ్మక్క సారక్కలను దేవతలుగా చిత్రీకరించి మహిమలు అంటగట్టి, కష్టాలు, బాధలు తీరుతాయని
విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు.దాంతో జాతర గురించి రాష్ట్ర నలుమూలలకు పాకింది. ప్రక్క రాష్ర్టాల నుండి కూడా జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు.
ప్రభుత్వం జాతరకు ప్రత్యేక ఆర్.టి.సి బస్సులు వేసింది .కానీ సౌకర్యాలు ఏర్పాటు చేయడం లేదని ప్రజల అభిప్రాయం. జాతర పేరుతో అనేక అసౌకర్యాలకు
ప్రజలు గురవుతున్నారు. అంతేకాకుండా స్త్రీలపై అత్యాచారాలు, ఆడ, మగ, తేడా లేకుండా విచక్షణారహితంగా ఒకేచోట
వాగులో అర్ధనగ్న స్నానాలు చేయడం, శివాలూగడం వంటివి వికృతంగా మారుతున్నాయి.
ఈ జాతర సందర్భంగా నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, మొత్తం పంటపొలాలు మలమూత్రాలతో పాడైపోయి,
వారి పంటలు దెబ్బతిని వారి జీవన స్థితి గతులను దెబ్బతీస్తున్నాయి.
జాతర మూలంగా కలరా, అతిసార వంటి అంటువ్యాధులు విపరీతంగా ప్రబలి ప్రతిసారి జాతర సందర్భంగా అనేక
మంది రోగాల బారిన పడుతున్నారు. ఇదే కాక త్రాగునీటి కొరకు జంపన్నవాగుపై ఆధారపడిన గ్రామాలు నీటి కాలుష్యంతో
త్రాగునీటికి, సాగునీటికి నానా బాధలు పడుతున్నారు. దానిని ప్రభుత్వం పట్టించుకోక పోవడం శోచనీయం. అంతేకాక ఈ
గిరిజనుల జాతర పేర వస్తున్న కోటానుకోట్ల రూపాయల ధనాన్ని గిరిజనుల అభివృద్ధికి కనీసం ఒక పైసా
కూడా వెచ్చించకుండా పాలక వర్గం సవతి తల్లి ప్రేమను చూపడం శోచనీయం.
ఈ జాతరనే కాకుండా వరంగల్ జిల్లాలో కోటంచ (కొడవటంచ) జాతర, కొమ్మాల జాతర, ఆదిలాబాద్
జిల్లా అడవుల్లో నైజాంతో పోరాటం చేసి వీరమరణం పాందిన ఆదివాసి గిరిజన నాయకుడు కొమురం భీమును దేవుడు చేసి
జాతర నడుపుతున్నారు. ప్రజల్లో వున్న దైవభావాన్ని అసరాగా చేసుకొని ప్రభుత్వం పుష్కర స్నానాలకోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి