తెలుగు ప్రజల మొదటి నివాస ప్రాంతం రాయలసీమ

         ఇనుప యుగం కంటే ముందు నుంచి రాయలసీమ ప్రాంతంలో ఆదిమానవులు ఉన్నారు. తప్పకుండా ఈ ప్రాంతంలో జనపదాలు ఏర్పడి ఉండాలి. పైగా భాష కూడా ఏర్పడి ఉండాలి. జనపదాలు పెద్దవై రాజ్యాలు ఏర్పడిన తర్వాత తొలి శాసనాలు  రాయలసీమలోనే లభించాయు. దీన్నిబట్టి తెలుగువారు రాయలసీమ వారై ఉంటారని భావించవచ్చు .  క్రీ.శ.6వ శతాబ్దం నాటికి దానిని రేనాడు అనిపిలిచే వారు.రేనాడు ఏడువేల గ్రామాల  సముదాయం.దీనిని రేనాటి చోళులు పాలించేవారు. కర్నూలు జిల్లా ఎర్రగుడిపాడు ఎర్రగుడి దగ్గర లభించిన శాసనాల ద్వారా సీమాంధ్ర ప్రాంతం మౌర్య చక్రవర్తి అశోకుని పాలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
      దీన్ని దృష్టిలో పెట్టుకొనే తెలుగు ప్రజల మొదటి నివాస ప్రాంతం రాయలసీమ తర్వాత తెలంగాణ అని తుర్లపాటి రాజేశ్వరి పేర్కొన్నారు.  
    క్రీ.శ.575లో కడప జిల్లా కమలాపురం మండలం లోని కలమల్లలో ఎరికల్ ముత్తు రాజు బిరుదు గల ధనంజయుడనే రాజు రేనాడును పరిపాలిస్తున్న కాలంలో వేయించిన శాసనం తెలుగులో వుంది. కమలాపురం లోని ఎర్రగుడిపాడు దగ్గర లభించిన క్రీ.శ.600 నాటి శాసనం కూడా తెలుగులోనే వుంది. కమలాపురంలోనే ఇందుకూరు లో ధనంజయుని కొడుకు చోర మహారాజు కూడా ఒక శాసనాన్ని తెలుగులో వేయించాడు.క్రీ.శ. 630 నాటి కమలాపురం లోని తిప్పలూరు శాసనం  కూడా తెలుగులో ఉంది. క్రీస్తు శకం 643 లో తూర్పు చాళుక్య రాజైన జయసింహ వల్లభుడు వేసిన విప్పర్ల చేజెర్ల శాసనాలు ఆనాటి తెలుగుభాషకు అద్దం పడుతున్నాయి. క్రీస్తు శకం 9వ శతాబ్దంలో చాళుక్య సేనాని పండరంగడు వేయించిన అద్దంకి శాసనం ఉంది.అది తరువోజ లో ఉంది.చాళుక్య భీముడు వేయించిన శాసనం సీస,గీత పద్యాలలో, యుద్ధ మల్లుడి బెజవాడ శాసనం మధ్యాక్కర లో రాశారు. ఇవన్నీ నన్నయకు పూర్వం శాసనాలు. దేశీయమైన కవితలు.
క్రీ.శ.575 నాటి నుంచే తెలుగు లిపి పరిణామం చెందుతూ వచ్చింది. ఇది బ్రాహ్మిలిపి నుంచి వచ్చింది.ప్రారంభంలో తెలుగు,కన్నడ లిపులు ఒకే రకంగా ఉండేవి.దీనిని తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యుల లిపి.కాల గమనంలో రెండు భాషలకు వేరు వేరు లిపి రూపొందింది.
             క్రీ.పూ.వేల సంవత్సరాల నుండి ఉన్న గోండులు ప్రాచీన ఉత్పత్తి కథను చెప్పుకుంటూ టేకం,మార్కం,పూసం,తెలింగం  అనే నలుగురు మూలపురుషులను దేవతలుగా చెప్పుకున్నారు. ఇందులో తెలింగం అనే వ్యక్తి తెలుగు జాతి మూల పురుషుడని ఆరుద్ర అభిప్రాయపడ్డాడు. ప్రాచీన కాలం నుంచి తెలైంగ్ జాతి వారు  నివసించి నందువల్ల తెలింగ, తెలుంగు పదాలు వాడుకలోకి వచ్చాయని వారు మాట్లాడే భాష తెలుంగు అని ఆ జాతి ప్రజలను తెలుగు వారని అన్నారని ఖండవల్లి సోదరులు భావించారు. బర్మా లో నివసించే ఒక తెగ ఇప్పటికీ తాము తలైంగ్ జాతి వారని చెప్పుకుంటారని పేర్కొన్నారు. తెలుగు వీరి భాష అని ఖండవల్లి తన ఆంధ్ర సాహిత్య సంగ్రహం లో  పేర్కొన్నారు. మార్కండేయ,వాయు పురాణాలలో తిలింగ ప్రస్తావన కూడా ఉంది.ఈ తెలైంగ్ జాతి వారు రాయలసీమ వారై వుండవచ్చు.
          తెన్ అనే మాటకు తమిళ కన్నడ భాషల్లో దక్షిణ దిక్కు అని అర్థం. అందువల్ల దక్షిణ భాష 'తెనుగు' అన్నారని పరిశోధకులు భావించారు. 
ద్రావిడ వర్గానికి చెందిన తెలుగుభాషకు ఉత్తరాన ఈనాటికీ ఉన్న గడబ,గోండి, పర్జీ మొదలైన ద్రావిడ గిరిజన భాషలు ఉన్నాయి.వారి భాషలో తెనుగు అంటే దక్షిణ భాష.వారికి దక్షిణాన ఉన్న తెలుగు భాషను తెనుగు అని ఉంటారని కస్తూరి విశ్వనాధం భావించారు.

తెలుగు భాష పుట్టు పూర్వోత్తరాలను చారిత్రక ఆధారాలతో నే గాకుండా ఆనాటి  జనపదాల రాజులు ప్రవేశపెట్టిన నాణేల ఆధారంగా కూడా కనుక్కోవడానికి ప్రయత్నం చేశారు.

క్రీ.పూ. ఆరవ శతాబ్దంలో మగధ మహాజన పదం రూపుదిద్దుకుంది. ఇదే ప్రధమ మహా సామ్రాజ్యం. ఈ మహా జనపదాధిపతినే 'చక్రవర్తి' అన్నారు.దానికన్నా ముందు చాలా జనపదాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్పట్లో 16 మహాజనపదాలు,100 పైగా జనపదాలున్నట్లు   ఆధారాలు ఉన్నాయి. పాణిని రాసిన 'అష్టాధ్యాయి'లో 30 పైగా జనపదాలు ఉన్నాయని చెప్పాడు.అనేక త్రవ్వకాలలో దొరికిన ఆధారంగా చూస్తే 
క్రీ. పూ. ఆరవ శతాబ్దం కంటే ముందుగానే తెలుగు జనపదం ఉందని తెలుస్తోంది.  పురాణాల్లో  శాతవాహనులను ఆంధ్ర భృత్యులు (సేవకులు) అని పేర్కొన్నారు .అంటే శాతవాహనులు కన్నా ముందే ఆంధ్ర లో వేరే రాజుల దగ్గర వీరు రాజోద్యోగులు ఉండి ఉంటారు.  శాతవాహనులు స్థానిక చివరి రాజైన సమగోపుని దగ్గర రాజోద్యోగులుగా ఉండి ఉండవచ్చని డా!!రాజారెడ్డి అభిప్రాయపడ్డారు. 
       జనపదాలు, మహాజనపదాలు క్రీ. పూ. ఏడవ శతాబ్దంలో విడుదల జేసిన నాణేలు మన దేశపు తొలి నాణేలు. ఇంతవరకూ అంధక,ఆంధ్ర,కోసల,కళింగ,
కాశీ,మగధ,సౌరాష్ట్ర,సౌరసేన, పాంచాల,కురు,మల్ల,అస్మక, అవంతి,గాంధార,శాక్య, విదర్భ, అసిక,ఛేది అనే 18 జనపదాలు విడుదల చేసిన నాణేలు మాత్రమే ఇప్పటికీ వెలుగుచూశాయి. అన్ని జనపదాల నాణేలలో ఏనుగు గుర్తు ఒక్కటే ఉంది. ఇవన్నీ వెండి లో పోత పోయబడినాయి.
     
     లిపిలేని నాణేలను మొదట,  లిపిగల నాణేలను తర్వాత మొట్టమొదట విడుదల చేసిన రాజు గోభదుడు. ఈ నాణాలలో బొరుసు ఖాళీగా ఉంది.ఇతని తర్వాత వచ్చిన రాజుల్లో చివరివాడు సమ గోపుడు.ఇతను విడుదల చేసిన నాణేలపై గల  అక్షరాలు లిపి శాస్త్రాల ప్రకారం  క్రీ. పూ. మూడవ శతాబ్ది గాని లేదా అంతకు ముందు కాలానికి గాని చెందినవని తేల్చారు.నాణేల ఆధారంగా తెలుగు భాష  క్రీ.పూ. మూడు శతాబ్దం నాటికే ఉందని  నిరూపించారు డాక్టర్ రాజారెడ్డి తన పరిశోధన ద్వారా.
                                      __ పిళ్లా కుమారస్వామి
                                          

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు