అమెరికా లో చర్చిల్‌, కొలంబస్‌ విగ్రహాలు కూలినాయెందుకు?




వైరస్‌లు కదలికలో ఉన్నాయి... జాత్యహంకారం కదలికలో ఉంది..ప్రతిఘటన కదలికలో ఉంది..స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కదలికలో ఉన్నాయి... అమెరికా కదలికలో ఉంది.. ఒక్క మాటలో చెప్పాలంటే యావత్‌ ప్రపంచం కదలికలో ఉంది.
నిరసన జ్వాలల్లో అమెరికా ఉంది. దాని ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ ఆగ్రహానికి జాత్యహంకారుల చిహ్నాలు ఒక్కటొక్కటి కూలిపోతున్నాయి.
మానవాళిపై నేరాలకు ఒడిగట్టినవారు గౌరవనీయులుగా, సాహసవీరులుగా కీర్తించ బడుతున్నారు. ఎవరు చంపుతున్నారు అన్నదానిపైనే ఇదంతా ఆధారపడి ఉంటుంది. 'నరహంతకులు ధరాధిపతులై చరిత్రలో ప్రసిద్ధికెక్కిరి' అన్న మహాకవి శ్రీశ్రీ నానుడి బహుశా వీరిని దృష్టిలో పెట్టుకునే రాసి ఉంటారనిపిస్తున్నది. ఊచకోతలో ఘనత వహించిన రక్త పిపాసులకు కట్టిన విగ్రహాలను కూల్చడమే ధ్యేయంగా అమెరికాలో కొత్త కదలిక వచ్చింది. ఫ్లాయిడ్‌ హత్య తరువాత ఇది మరింత ఉధృతరూపం దాల్చింది. పోలీసుల దమనకాండ, రాజ్య హింసను ఈ ఉద్యమం గట్టిగా ప్రతిఘటిస్తున్నది. ఈ మార్పును యావత్‌ ప్రపంచం నిండు మనసుతో హర్షిస్తున్నది. వీరులుగా కీర్తించబడే వారు సాగించిన ఘోరాలు, అకృత్యాలు వందల ఏళ్ల తరువాత వెలుగులోకి వస్తున్నాయి. వేలాది మంది నెత్తురు తాగినవారికి విగ్రహాలా? అని నిలదీస్తూ ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు.
అమాయక పౌరులను ఊచకోత కోసిన వారి విగ్రహాలను నేలమట్టం చేయనక్కర్లేదా? అని నిలదీస్తున్నారు. వారి డిమాండ్‌లో హేతుబద్ధత ఉంది. కచ్చితంగా అది జరగాల్సిందేే. జాత్యహంకార కుంభస్థలాన్ని దెబ్బ తీయాలనుకునే వారెవరూ ఈ విగ్రహాల కూల్చివేత గురించి ఆందోళన చెందరు. శ్వేతజాతి ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూసే కులీనులే (సూపర్‌ రిచ్‌) గుండెలు బాదుకుంటున్నారు.
సామూహిక మారణకాండకు యథేచ్ఛగా పాల్పడిన నేతలను కీర్తించడం ద్వారా సమాజంపై తమ పట్టును నిలువుకోవాలన్నది ఈ జాత్యహంకారుల ఆరాటం. సమాజంలో ఊడలు వేసుకుపోయిన శ్వేత జాతి ఆధిపత్యానికి ప్రతినిధులే లియోపాల్డ్‌, చర్చిల్‌, కొలంబస్‌. వీరి విగ్రహాలే నిరసనకారులకు నేడు టార్గెట్‌ అయ్యాయి.
బెల్జియం రాజు లియోపాల్డ్‌ విగ్రహాన్ని 'బ్లాక్‌ లైవ్స్‌ మాటర్‌' ఉద్యమకారులు ఇటీవల ధ్వంసం చేశారు. ధ్వంసం చేయడమే కాదు. దానిని అక్కడి నుంచి పూర్తిగా తొలగించారు. లియోపాల్డ్‌ కాంగోను తన సొంత జాగీరుగా మార్చుకుని, నల్ల జాతీయులపై అనేక అకృత్యాలకు పాల్పడ్డాడు. నల్ల జాతీయులచేత రబ్బర్‌ తోటల్లో వెట్టి చాకిరీ చేయించుకునే వాడు. దీనికి వ్యతిరేకంగా ఎదురు తిరిగిన వారిని ఊచకోత కోశాడు. లియోపాల్డ్‌ సాగించిన ఈ దారుణ మారణకాండకు దాదాపు కోటిన్నర మంది వరకు బలయ్యారు. ఇంకా అనేక మంది కాళ్లు చేతులు నరికించాడు. ఈ నరమేథం ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు. 20 ఏళ్లపాటు సాగింది. అతని క్రూర నేర చరితను తవ్వి తీసి బయట ప్రపంచానికి చాటిచెప్పడంలో నల్లజాతీయుడైన ఓ అమెరికన్‌ జర్నలిస్టు కీలక పాత్ర పోషించారు. ఊచకోత అనగానే మనకు ఐరోపాకు చెందిన అడాల్ఫ్‌ హిట్లరే టక్కున గుర్తుకొస్తాడు. నాజీ హిట్లర్‌కు ఈ లియోపాల్డ్‌ ఎందులోనూ తీసిపోడు.
ఈ కోవకు చెందిన మరో వ్యక్తి బ్రిటన్‌ మాజీ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌. ఈయన రెండో ప్రపంచ యుద్ధ కాలంలోను, దానికి ముందు తలెత్తిన బెంగాల్‌లో మహా క్షామం (భయంకరమైన కరువు) వచ్చిన సమయంలోను గోధుమలు, బియాన్ని లూటీ చేసి బ్రిటిష్‌ ఆర్మీకి నైవేద్యంగా పెట్టిన ఘనుడీయన. బెంగాల్‌లో ఆనాడు 30 లక్షల మంది ఆకలిచావులకు గురికావడానికి ఈ మహానుభావుడే కారణం. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత బ్రిటిష్‌ పాలనపై తిరగబడ్డ ఇరాకీయులను గ్యాస్‌ చాంబర్‌లో పెట్టి చంపించడం, మూలవాసులపై విషవాయువు ప్రయోగించడం వంటి క్రూరమైన నేరాలకు పాల్పడిన చరిత్ర ఈయనది. 1918లో రష్యన్‌ బోల్షివిక్కులపై రసాయనిక దాడులకు తెగబడిన ఈ పాపాల భైరవుడికి లండన్‌ పార్లమెంటు స్క్వేర్‌లో విగ్రహాన్ని పెట్టారు. నిరసనకారులు ఎక్కడ దాడి చేస్తారోనని ఆ విగ్రహాన్ని కాపాడుకోవడానికి బ్రిటిష్‌ పాలకులు పెద్ద బాక్స్‌ను బోర్లించారు. చర్చిల్‌ ముమ్మాటికీ జాత్యహంకారి. ఇటువంటి దుష్ట చరితుల విగ్రహాలను కూల్చడమంటే అవమానాలకు అంతం పలకడమే. వర్జీనియా లోని రిచ్‌మండ్‌లో బానిసల వ్యాపారి రాబర్ట్‌ ఇ లీ విగ్రహాన్ని కూడా నిరసనకారులు కూల్చివేశారు. చాలా మంది చరిత్రకారులు భ్రష్టు పట్టిపోయిన ఈ దుష్ట వ్యవస్థను మరింత దృఢతరం చేయాలని చూశారే తప్ప సత్యాన్ని బయటపెట్టే పని ఎన్నడూ చేయలేదు. విగ్రహాలను కాపాడాలని కులీనులు చేసే విజ్ఞప్తులను ప్రజలెవరూ పట్టించుకునే స్థితి లేదు. దీంతో నిరసనకారులు దీనిని తమ చేతుల్లోకి తీసుకున్నారు.
జాత్యహంకార కులీనులచే వీరుడు శూరుడు అని కీర్తించబడిన మరో వ్యక్తి క్రిస్టోఫర్‌ కొలంబస్‌. ఈయన స్పానిష్‌ రాజు తరపున, ఇతర యూరోపియన్‌ దేశాల నిరంకుశ ప్రభువుల తరపున నాలుగు పర్యాయాలు అట్లాంటిక్‌ సముద్రంలో నావికా యానం చేసి అమెరికాను కనుగొన్నాడు. తరువాత దానిని యూరోపియన్‌ వలస కాలనీగా మార్చాడు. అనేక దండయాత్రల్లో స్వయంగా పాల్గొన్నాడు. పలు వ్యాధులనూ తీసుకొచ్చాడు. దక్షిణ అమెరికాలోని ఒక దేశానికి అతని పేరు కూడా పెట్టారు. అదే కొలంబియా. ఉత్తర అమెరికా రాజధాని ఉన్న జిల్లాకు కూడా అతని పేరు పెట్టారు. ఈయన పేరుతో ఏర్పడిందే కొలంబియా యూనివర్సిటీ. కెనడాలోని పశ్చిమ రాష్ట్రానికి బ్రిటిష్‌ కొలంబియా అని పేరు పెట్టారు. దక్షిణ అమెరికా నుంచి అలస్కా వరకు దేశీయ తెగలను, మూలవాసులను నెత్తుటేరుల్లో ముంచిన చరిత్ర ఈయనది. ఆ తరువాత ట్రాన్స్‌ అట్లాంటిక్‌ బానిసల వర్తకానికి ఇది దారి తీసింది. ఆఫ్రికన్లను బానిసలుగాను, చరాస్తులుగాను పరిగణిస్తూ ఉత్తర, దక్షిణ అమెరికా అంతటా వీరిని తిప్పాడు. న్యూయార్క్‌ సిటీలో కొలంబస్‌ విగ్రహాన్ని కూల్చివేయడాన్ని చర్యకు ప్రతి చర్యగా న్యూయార్క్‌ గవర్నరు ఆండ్రూ కౌమో అభివర్ణించారు. ఇటాలియన్‌ అమెరికన్లు మాత్రం న్యూయార్క్‌కు చేసిన సేవకు ప్రతీకగా ఈ విగ్రహాన్ని భావిస్తుంటారు. వారి ఉనికిని చాటుకునేందుకు కూడా ఇది అవసరం. సామూహిక మారణకాండకు పాల్పడిన కొలంబస్‌, లియోపాల్డ్‌, చర్చిల్‌, రాబర్ట్‌ ఇ లీ విగ్రహాలు శ్వేత జాత్యహంకారానికి, సమాజంపై వారి ఆధిపత్యానికి ప్రతీకలుగా ఉన్నాయి. నరహంతకుల విగ్రహాలు పతనం కావాల్సిందే.

మార్గరెట్‌ కింబర్లీ
(వ్యాసకర్త న్యూయార్క్‌కు చెందిన పాత్రికేయురాలు,
హక్కుల కార్యకర్త)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు