గోర్కీ
గోర్కీ
"కవితలల్లే నీ కలము...
పాటలు పాడే నీ గళము...
ప్రజలకంకితం చేస్తావా....?
ప్రభుతకూడిగం చేస్తావా...? "
- గోర్కీ
గోర్కీ 'అమ్మ' నవల రష్యా విప్లవ కాలంలో ఓ కుదుపు కుదిపింది. 1917-అక్టోబరు విప్లవం విజయవంత మవటానికి ఎంతో దోహదం చేసిందీ రచన. జర్మనీలో ఫాసిస్టులు రాజ్యాధికారంలోకి రావడంతో తమ ప్రధాన ఆయుధాలు ' తొలి సోషలిస్టు' రాజ్యమయిన రష్యాపైకి ఎక్కుపెట్టగలరని ముందుగానే ఊహించాడు 'గోర్కీ'. ఈ సందర్భంగా గుర్తుకొస్తున్నాయి. '....యుద్ధాలు వస్తున్నాయి... సిద్ధంగా ఉండాలి...' అంటూ... 1936- జూన్ 18వ తేదీన తన తుది శ్వాసను విడిచిన మాక్సీమ్ గోర్కీ సరిగ్గా ఇదేరోజున(28 మార్చి 1868 ) జన్మించి విశ్వసాహిత్యానికి ఉత్తేజమయ్యాడు.
''..........ఎంత కాలమైతే... కొందరు ఏ పనీ పాటా లేకుండా... తాము ఏమీ చేయకుండా... ఇతరులను ఆజ్ఞాపిస్తూ వుంటారో... మరి కొందరు మాత్రమే పనిచేసి ఆకలిదప్పులతో అలమటిస్తారో... అంతకాలం వరకూ... మేము విప్లవ కారులుగానే వుంటాం'' ...మాక్సిమ్ గోర్కీ 'ఆమ్మ' నవలలో పావెల్ మాటలివి....
రష్యా విప్లవ సాధనలో విరామ మెరుగక పోరాడిన కలం యోధుడు మాక్సీమ్ గోర్కీ. తనకు సాహిత్యంతో పరిచయం ఉండకపోతే...తాను సాహిత్య కారున్ని అయివుండకపోతే... ఎప్పుడో ఆత్మహత్య చేసుకుని ఉండేవాడినని' అనేవాడట గోర్కీ .
'ఎంత అద్భుతమైన బాధ్యత... ఈ ప్రపంచంలో మానవునిది' అని గోర్కీ అన్నాడంటే సాహిత్యం ఎంత ప్రభావవితమైనదో తెలుస్తుంది.
గోర్కీ 1906లో రచించిన నవల 'అమ్మ'. అనాటి రష్యాలో ఎందరినో విప్లవకారులుగా తీర్చిదిద్దిందీ 'అమ్మ' . వివిధ భాషల్లోకి అనువాదమై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలకు ఉత్తేజాన్ని ఇచ్చింది. టాల్స్టాయ్, లెనిన్వంటి హేమా హేమీలకు అత్యంత ఇష్టుడైన గోర్కీ జీవితం అగాధం నుంచి ఎగిసిపడ్డ నిప్పుకెరటం. అత్యంత దుర్భర దారిద్య్రం నుంచి ప్రారంభమైన గోర్కీజీవితం' మార్క్సిజం వెలుగు తో 'తుపాను' పక్షిగా మారింది.
గోర్కీ 1868 మార్చి 28, (అవెగ్సీమాక్సిమోదిచ్) రష్యాలోని వోల్గా నదీ తీరాన గ్రామం నిజిని నోవో గోరోడ్లో జన్మించాడు. 1872లో తండ్రి (వడ్రంగి) మరణిం చాడు. 1878లో తల్లిమరణంతో చెప్పుల షాపులో పనిమనిషిగా చేరాడు. 1880లో ఓల్గానదిలో ఓడలో వంట చేసే వానికి సహాయకునిగా పని చేశాడు. వంటవాడే పుస్తకాలు చదివే ఆలవాటును ప్రోత్సహించాడు. 1881-82 వరకు పిట్టల్ని పట్టేవాని గా, గ్రంథాలయంలో గుమస్తాగా, చిత్ర కారుడి దగ్గర నేర్చుకునేవాడిగా పనిచేశాడు. ఆ తరువాత 1884లో కజాన్లో దుర్భర దారిద్య్రం. పనుల కోసం వలసపోయే వారితో పాటు రోడ్డు ప్రక్క జీవితం. రొట్టెలు చేసే వానికి సహాయకునిగా పని చేశాడు.
1888లో విప్లవ కారులతో పరిచయం ఏర్పడింది.1890 లో 'కొరో లెంకో' అనే రచయితతో పరిచయం . కవ్కాజ్ అనే పత్రికలో 'మేకర్ చంద్రా' అనే మొదటి కథ ప్రచురణ. మాక్సిమ్ గోర్కీ' అనే కలం పేరు పెట్టుకున్నాడు.
'మాక్సిమ్' అంటే చేదు నిండినవాడు. ఆ తరువాత ఎన్నో కథల్ని రాశాడు. 1898లో కథారచయిత 'చెహోవ్'ను కలిశాడు. 1900లో మాస్కోలో టాల్స్టాయ్ ను కలుసుకున్నాడు.
'మనం మాట్లాడిందంతా టాల్స్టాయ్ వినడు. పిల్లవాడు నచ్చిన బొమ్మలనే సేకరించుకున్నట్టుగా అవసరమనుకున్నవి మాత్రమే వింటాడు' -అని గోర్కీ అనేవాడు. అంతేకాదు-'ఎంత ఆలోచించినా, ఎంత అధ్యయనం చేసినా టాల్స్టాయ్ మనకెప్పుడూ అంతుపట్టని మిస్టరీగానే మిగులు తాడు. ఇలాంటివాళ్ళతో కలిసి బతకటం అసాధ్యం- ఒకే ఇంట్లో మరీ ముఖ్యంగా ఒకే గదిలో-అతనికి (టాల్స్టాయ్) చేరువగా వెళ్ళటమంటే సూర్యగోళాన్ని స్పృశించటమే. ఆ అగ్ని తాపానికి పరిసరాలన్నీ మాడిమసి కావలసిందే. 'టాల్స్టాయ్ గురించి గోర్కీ చెప్పేవాడు.
'....ఆయన రచనలు చదవక పోతే, జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన అంశాన్ని గురించిన పరిజ్ఞానం లేకుండా చేసుకోవడమే అవుతుంది...' అని ప్రముఖ బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటర్జీ అన్నారు.
గోర్కీ సృష్టించిన ' అమ్మ' పాత్ర మొత్తం ప్రపంచసాహిత్యంలోనే అద్భుతమైంది, అపురూపమైంది. కార్మికవర్గ పోరాట యోధురాలిగా, ఆమె (నీలోన్నా) క్రమ పరిణామాన్నీ గోర్కీ అద్వితీయంగా సృజించాడు. తాగుబోతు భర్త(వ్లాసోవ్) పాశవిక హింసాత్మక ప్రవర్తనతో ఆమె నిర్జీవంగా బతుకీడ్చిన వైనం గగుర్పాటు కలిగించే విషాదం. ఆమె జీవితమంతా కన్నీళ్ళు, భయం తప్ప మరేమీ లేవు. మనల్ని నాశనం చేస్తున్నది భయమే.. దాన్నొదిలించుకోవాలి అని కొడుకు పావెల్ చెపుతాడు.'తను జీవితమంతా భయంతోనే గడిపాననీ, భయపడకుండా ఎలా వుండగలననీ రోదిస్తుంది. ...' నీ జీవితంలో ఏమి సంతోషాన్ని అనుభవించావు... ఏ మంచిని జ్ఞాపకముంచుకుంటావు? అని పావెల్ అడిగినప్పుడు.. అసలు ఆ విధంగా తనను గురించి అడగడమే ఆమెను ధిగ్భ్రాంతికి గురి చేస్తుంది. తల్లులను గురించి జాలిపడే వారు అరుదు అని గోర్కీ వ్యాఖ్యానిస్తాడు.
జనం ఎలా బతికారో నాకు తెలీదు ఎలా బతకాలో నేను తెలుసు కోవాలి' అంటాడు పావెల్ సహచరుడు వెశినిశ్చికోవ్. ఇందులో 'చరిత్రను వ్యాఖ్యానించడం కాదు, దానిని మార్చాలి' అన్న మార్క్స్ భావం కనిపిస్తుంది. ఈ లోకంలో 'అమ్మ' ఉన్నంతకాలం గోర్కీకి మరణం లేదు.
__రాశే
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి