అనంత కథల్లో శ్రామిక కార్మిక జీవితం
శ్రీశ్రీ చెప్పిన కమ్మరికొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి, సహస్ర వృత్తుల సమస్త కష్టజీవులు శ్రామికులే, కార్మికులే.ఇలా తీసుకొంటే అనంతపురం జిల్లానిండా నూటికి తొంభైమంది వారే.
ఎవరైతే తమ రెక్కల కష్టాన్ని అమ్ముకోవడానికి తప్ప మరేమీ లేని వారందరూ శ్రామికులే. ఎవరి శ్రమ లేకుండా ఈ సమాజం నడవదో వారంతా శ్రామికులే.. అయితే ఆశ్రామిక వర్గానికి విశ్రాంతి లేదు. అలసట, అనారోగ్యం, అవిశ్రాంత జీవనపోరాటం, కష్టాలు, కన్నీళ్ళు, అప్పుడప్పుడు కల్మషం లేని నవ్వులు. ఆ వర్గం నుంచి కవులు, కథకులు రావాలంటే చాలా కష్టం. వారి గురించి ఎవరైనా రాయగలరు అంటే వారే మధ్య తరగతి బుద్ది జీవులు. వాళ్ళు ఎక్కువగా రైతుకుటుంబాల నుంచి వచ్చినవారు. లేదంటే ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలనుంచి వచ్చినవారు.
అనంతపురం జిల్లాలో కథలు రాసే రచయితలు తమచుట్టూ పరుచుకున్న కరువును పట్టుకున్నంతగా ఇంకే కథా వస్తువును పట్టుకోలేదు. లేదంటే కులపీడన సమస్యల్ని కథాంశాలుగా తీసుకున్నారు. విచిత్రమేమంటే నవలలు కూడా వ్యవసాయ రంగంపై జిల్లాలో రాలేదు. కవులు కూడా అంతే, ఒకరిద్దరు తప్ప.
రచన చేసేటప్పుడు రచయిత తన చుట్టూ ఉన్న భౌతిక జీవితాన్ని తీసుకోవడం తప్ప వేరే మార్గంలేదు. కానీ ఈ జిల్లా రచయితలు కరువువైపే మొగ్గు చూపి రైతు వ్యధలను తమ కథల్లో వస్తువుగా స్వీకరించారు.
కరువు పీడన నుంచి బయట పడేందుకు రైతులు వలసబాట పట్టి పట్నం వచ్చి రకరకాల పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరంతా పట్టణ పేదరికంలో భాగమైన శ్రామిక వర్గం. ఇలా రావడం వెనుక ఇరవై ఏళ్ళ క్రితం ప్రపంచ బ్యాంకు షరతులు కారణంగా ఉన్నాయి. భూమిపై ఆధారపడిన వారిలో నుండి డెబై అయిదు శాతం మందిని బయటకు తీసుకు రావాలని ఆ బ్యాంకు షరతు. అలా వచ్చిన వారంతా విదేశీ కంపెనీల మార్కెట్ సర్వీసుకోసం పనిచేయాలన్నది వారి ప్యూ
వ్యూహం. ఆ వ్యూహాన్ని పాలకులు పకడ్బందీగా అమలు చేశారు. అన్ని రంగాలను ప్రవేటు పరం చేసినారు. కాంట్రాక్టు కార్మికుల్ని తెచ్చినారు. యంత్రాలను, వ్యవసాయంలో, చేనేత రంగంలో, రోడ్ల నిర్మాణంలో,ప్రాజెక్టు నిర్మాణంలో విరివిగా ప్రవేశపెట్టినారు. ఆఫీసు పనుల్లో కంప్యూటర్లను తెచ్చినారు. కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించారు. సర్వీసు రంగాలు పెరిగాయి. దాంతో విద్య, వైద్య, రవాణా నిర్మాణ రంగాలలో శ్రామికులు బాగా పెరిగారు.ఇదంతా దేశవ్యాప్తంగా జరుగుతూ వుంది. మన అనంతపురంలో కూడా జరుగుతూవుంది. కాకపోతే రచయితలు మాత్రం వీటిని ఎందుకనో తమ రచనల్లోకి వస్తువుగా తీసుకురాలేకపోయారు.
తలకిందుల సమాజాన్ని సజావుగా చూడటం నేర్చిన ఒకరిద్దరు రచయితలు మాత్రం వాటిని తమ కథల్లోకి వస్తువుగా స్వీకరించారు.ఇదే కాకుండా రచయితలు విస్మరించిన మరో అంశం పరాయీకరణ.
ప్రపంచీకరణ ప్రభావంతో వ్యవసాయం అతలాకుతలమై పోయింది. మానవ సంబంధాలు విచ్ఛిన్నమైపోయి భాషా సంస్కృతులు విధ్వంసమైపోయి సమాజం శకలాలు శకలాలుగా మారిపోతున్న తరుణంలో, మనిషి తన మూలాల్ని పోగొట్టుకొని దిక్కు తెలియని ప్రపంచంలోకి పోతున్న సందర్భంలో, తమపట్టు కోల్పోతున్న మనిషి మూలాల గురించి రచయితలు అన్వేషించడంలేదు. మరోమాటలో చెప్పాలంటే మనిషి పరాయీకరణ చెందటాన్ని అనంత కథా రచయిత పట్టుకోలేకపోయాడు. పల్లెల్నించి పొట్టచేతపట్టుకొని వచ్చిన
వలసజీవులు తమ మూలాలు వెదుక్కుంటూ మళ్ళీ పల్లెకు వెళ్ళలేక అటు పట్నంలో తనకే మాత్రం ఇష్టంలేని పనుల్ని బలవంతంగా చేసుకుంటూ బతికే మనుషుల పరాయీకరణ భావనల్ని తమరచనల్లో రచయితలు చిత్రీకరించలేకపోయారు.. ఇదంతా శ్రామిక దృక్పథంతో చూసినా, మానవీయ దృక్పథంతో
చూసినా రచయిత తన కథల్లోకి వస్తువుగా తీసుకోవడానికి వీలవుతుంది.
శ్రామిక సంబంధ కథల్ని ఏవి తీసుకోవాలని ప్రశ్నించు కున్నప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలను పరిగణలోకి తీసుకొన్నాను. ఒకటి ఆకథ శ్రామిక సంబంధ కథై ఉండాలి. రెండు కథల్లో శ్రామికుని గురించైనా ఉండాలి. మూడు ఆఫీసులో పనిచేసే ఉద్యోగస్తున్ని కూడా శ్రామికునిగా చూడాలి.
వీటి ఆధారంగా చిలుకూరి దేవపుత్రగారు రాసిన విలువలు, ఇట్లు తమ విశ్వాస పాత్రుడు,తనిఖీ, శశికళగారు రాసిన మార్చి 8వతేదీ, డ్రైవరన్న, వర్తమానం ఏూరులో, ప్రగతిగారు రాసిన ఇదిమహిళా దినం, గువ్వగూడు, ప్రయాణం కథల్ని పరిశీలనకు తీసుకున్నాను.
2000సం|| ముందురాసిన కథల్ని గురించి చెప్పి, ఆ తర్వాత కథల్ని మళ్లీ చెప్పుకుంటే సమాజంలో జరుగుతున్న మార్పులను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కూడా.
శశికళ గారు రాసిన డ్రైవరన్న కథ తొంభైనాటిది. బస్సు డ్రైవరు పడే అగచాట్లను తెలియజేస్తుందీ కథ. ఇలాంటి సంఘటనలు మనం ఎన్నో చూసింటాం. ప్రయాణీకులను సురక్షితంగా గమ్యానికి చేర్చే డ్రైవరు గురించి పట్టించుకోం. మన ప్రాణాల్ని అతని చేతిలో పెట్టి నమ్మకంగా ధైర్యంగా మనంనిద్రపోతుంటాం. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రం మనం ఆందోళన చెందుతాం. ఈ కథలో మల్లన్న బస్సు డ్రైవరు, కనకమ్మ ఒక ప్రయాణికురాలు. తన బిడ్డతో బస్సు ఎక్కుతుంది. బస్సు కొండెక్కడం మొదలు పెట్టినాక ఇంజను వేడెక్కి దానినుంచి పొగలు వస్తుంటాయి, రేడియేటరులో నీళ్ళు
అయిపోయినాయి. దాంతో ఇంజను అడుగున ఉన్న నీళ్ళుకుతకుత ఉడుకుతూ పైకి ఎగజిమ్మడంతోముందు సీట్లోనే కూర్చున్న కనకమ్మ ఇదేమీ తెలియక ఆందోళన చెంది గట్టిగా కేకలు వేస్తుంది. దాంతో బస్సులో ఉన్న వారందరూ లేచి కదుల్తున్న బస్సులోంచి మెల్లగా దిగుతారు. డ్రైవరు ఎంత చెప్పినా వినరు. సలసల కాగే నీళ్ళు ఇంజను నుంచి చిమ్ముతూ డ్రైవరు పై పడుతున్న లెక్కచేయకుండా జాగ్రత్తగా బస్సును నడుపుతాడు. రోడ్డుపక్కనే లోయలున్నాయి. ఏకొంచెం తేడా వచ్చినా ప్రమాదమే. నెమ్మదిగా కొండగట్టుపై బస్సు నిలుపు తాడు. రేడియేటర్ లో నీళ్ళు పోశాక బస్సు కదులుతుంది.
ఆందోళన, ఉద్విగ్నత కూడుకున్న క్షణాలు అవి. ప్రతి డ్రైవరు ఎదుర్కొనే సమస్య ఇది. ఇప్పుడు అద్దె బస్సులు వచ్చాక రిపేర్లు ప్రవేటువారు చేసుకోవాలి. డ్రైవర్లు కూడా ప్రవేటువారే. ఇంతకుముందు కన్నా ప్రమాదం ఎక్కువగా పెరిగింది.
హృదయవిదారకమైన మరోకథ 'వర్తమానం హోరులో'.దీనిని 1988లో శశికళగారు రాసినారు. సోమిగాడు లచ్చిమి ఇసుర్రాళ్ళు చెక్కి అమ్మిబతికే దంపతులు. వారికి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం ఆమె బాలింతరాలు. ఆపరేషను చేయించుకుంటే వందరూపాయలు ఇస్తారని ప్రభుత్వ ఆసుపత్రికి పోతుంది.వాళ్ళు సగంచేతిలో పెట్టి బెడ్స్ లేవని చెప్పి ఆపరేషనుచేసి పంపించేసినారు. ఇప్పుడు వాళ్ళకు కూడులేదు, గూడులేదు. ఓ స్కూలు బిల్డింగులో రాత్రిపూట పడుకుంటారు. వాళ్ళతోపాటు అలాంటి పనులు
చేసే వారుకూడా అక్కడే పడుకుంటారు. ఉదయానికి లచ్చిమి మరణిస్తుంది. శవాన్ని పూడ్చటానికి కూడా డబ్బుల్లేక
పిల్లలను అడుక్కొనేందుకు పంపిస్తాడు సోమిగాడు. సంచార జీవుల వ్యధార్థ జీవన కథ ఇది.
చిలుకూరి దేవపుత్రగారి 'విలువలు' కథ తొంభై ఒకటి నాటిది. మనిషి శ్రమ ముందు యంత్రభూతం చేసే వికటాట్టహాసాన్ని చూపిస్తాడు. ఒకాయన తన భార్యతో బస్సులోంచి దిగుతాడు. ఆటోలో ఒకరికి నాలుగు రూపాయలైతే ఇద్దరికి ఎనిమిది అవుతుందని, అదే రిక్షా అయితే తక్కువకే వస్తుందని ఆటోను వద్దంటాడు. రిక్షావానితో ఇద్దరికి కలిపి నాలుగు రూపాయలకు బేరం కుదుర్చుకుంటాడు. అదే సిటీ బస్సులో అయితే రెండు రూపాయలకే పోయిండచ్చుని భార్యతో చెపుతాడు. ఆరకంగా రెండు రూపాయలు
నష్టమని చెపుతాడు. బస్సులు రిక్షా రెండూ ఒకటే ఎలా అవుతాయని భార్య అంటుంది. “ఆదియంత్రం, ఇది రిక్షావాడిశ్రమ" అని భార్య వాదిస్తుంది. “అవన్నీ ఎవడిక్కావాలి. డబ్బు ఎంత తక్కువన్నదే ముఖ్యంగాని”అని భర్త అంటాడు.
ఇదే పరిస్థితి పట్టుచీరలకు వర్తిస్తుంది. మగ్గం నేసేపట్టుచీర ధర ఎక్కువ. యంత్రం పై నేసే పట్టుచీర ధర తక్కువ . తక్కువ ధర చీరనే కొంటాంగాని ఎక్కువైనా నేసిన చీరను ఎందుకు కొంటారన్న ప్రశ్న వచ్చింది ఒకరోజు. టెక్నాలజీ పెరిగే కొద్దీ మానవశ్రమ తగ్గిపోతుంది. దాంతో మానవశ్రమతో
చేసిన వాటి ధర పెరిగిపోతుంది. యంత్రంతో చేసిన వస్తువు విలువ తగ్గిపోతుంది. ఇదే పరిస్థితి వ్యవసాయ రంగంలో నెలకొనింది. వ్యవసాయ కూలీల రేట్లు పెరిగాయి. అదేపని యంత్రాలతో చేస్తే రైతుకు తక్కువ సమయంలో తక్కువ రేటుతో పని జరిగిపోతోంది. 'విలువలు' కథ ద్వారా రచయిత
రాబోతున్న యంత్రభూతాల ప్రమాదాన్ని తెలియజెప్పింది అప్పట్లోనే.
దేవపుత్ర గారి 'ఇట్లు తమ విశ్వాసపాత్రుడు' కథ 1998నాటిది. ఇందులో గుర్నాథం ఒక గుమాస్తా.చాలా సీనియర్. గుర్నాథంకు ఆఫీసు మొదటి భార్య, పెళ్ళిచేసుకున్న భార్య రెండోది. ఆయనది“యువర్స్ ఫెయిత్ ఫుల్లీ', మనస్తత్వం. ఎప్పుడూ ఆఫీసు పని తప్ప మరొకటి తెలియని ఓబిడియంట్ గుమస్తా. ఆయనకు షగరు వ్యాధి వస్తుంది. ఉన్నట్టుండి ఓ మధ్యాహ్నం ఆయన కోమాలోకి వెళ్ళిపోతాడు.ఎవరు పిలిచినా పలకడు. ఇంతలో రెవెన్యూ డివిజనల్ ఆఫీసరు వస్తాడు. ఆయన తన బంధువుల్ని
పరామర్శించడానికి, ఆయనకు గుర్నాధం విషయం తెలుస్తుంది. గుర్నాధం కూతురు సుగుణ తన తండ్రి చెవిలో మీజఫీసరు వస్తున్నాడని చెపుతుంది. ఆఫీసరు అన్నమాట వినగానే కోమా నుంచి తేరుకుని కళ్ళు తెరచి ఆఫీసరుతో 'నమస్తేసార్' అని అంటాడు వినయంగా. గుర్నాధంలాంటి బానిస మనస్తత్వం గల గుమాస్తాలు, ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు. వీరంతా ప్రభుత్వాలకు, అధికార్లకు విధేయులు. వీరు తాము మొదట మనుషులమని, తరువాత పౌరులమని, ఆతరువాతే ఉద్యోగులమని మరచిపోతుంటారు.
బ్రిటీషు వాడు నేర్పిపోయిన బానిస మనస్తత్వం శ్రామికులకు వదలిపోలేదని తెలుపుతుందీ కథ.
దేవపుత్రగారి మరో కథ 'తనిఖీ' 1991నాటిది. ఆఫీసు ఉద్యోగులకు సంబంధించింది. అవినీతి చట్రంలో నిఖార్సైన ఉద్యోగి ఎలా బలైపోతుంటాడో చెప్పేకథ ఇది.చింతమానిపల్లెలో భూమిలేనినిరుపేదలకు భూమివ్వాలని ప్రభుత్వం ఆదేశిస్తుంది.
నూట అరవై ఎకరాల భూమిని సేకరించాలి. ప్రభుత్వభూములు ఏవీ లేనందున ఎవరైనా ఇస్తారేమోనని కనుక్కోవాలను కుంటాడు. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే తండ్రి శ్రీనివాసరావు తన పనికిరాని చెత్త భూమిని ఇస్తానని ముందుకువస్తాడు. తన పలుకుబడితో వ్యవసాయ యోగ్యంగా రిపోర్టు రాయిస్తాడు.
ఆర్.ఐ. ఫైలు రాసి యం. ఆర్. వోకు ఇస్తాడు. కాకపోతే అనుకోని పరిణామాల వల్ల పాత యం.ఆర్.వోస్థానంలో కొత్త యం.ఆర్.వో వచ్చి ఆభూమి వ్యవసాయానికి పనికిరాదని రాసి జాయింట్ కలెక్టరుకు పంపిస్తాడు. జాయింటు కలెక్టరు అసలు కథ తెలుసుకోవటానికి ఎంక్వయిరీకి వస్తాడు. ఆభూమి వ్యవసాయ మైనదేనా అని ఆర్. ఐని అడుగుతాడు. పనికిరాదని అతడు చెపుతాడు. తానూ అదేఅభిప్రాయంతోనూ ఉంటాడు. మరెవ్వరికి లాభం అని ఆరాతీస్తాడు. శ్రీనివాసరావు మంచి భూమిని తనదగ్గర ఉంచుకొని పనికిరాని చెత్త భూమిని ప్రభుత్వపరం చేస్తున్నాడని తెలుసుకొని దాన్ని ఆమోదించడు
జె.సి. అది తెలిసి శ్రీనివాసరావు వత్తిడి చేస్తాడు. జె.సి. ఒప్పుకోడు. రెండు రోజుల తరువాత జెసిని ట్రాన్స్ ఫరు చేయిస్తాడు ఆ పెద్దమనిషి. అవినీతి పరులు ఉద్యోగస్తులను తమచేతిలో తోలుబొమ్మలుగా భావించి వ్యవస్థను ఎలా ఉపయోగించుకుంటారో ఈ కథ చెపుతుంది. ఉద్యోగులు బాధ్యతతో ఉంటే పేదలకు ఎలాంటి న్యాయం జరుగుతుందో కూడా కథ పరోక్షంగా తెలుపుతుంది.
శశికళగారు రాసిన మార్చి 8వ తేది 2016లోనిది. ఇది ఒక ఇంటి పనిమనిషి కథ. ఇంటి పనివారల దీన పరిస్థితులు ఇందులో మనకు కనిపిస్తాయి. కమలమ్మ ఇంట్లో పావని పనిమనిషిగా ఉంటుంది. పావని స్నేహితులు స్వర్ణ కూడా పనిమనిషే. పావని భర్త శంకర్ తాగుబోతు. డ్రైవర్ గాపని చేస్తుంటాడు. ఇంట్లో పావనిని చీటికి మాటికి కొడు తుంటాడు తాగొచ్చి. ఇలాంటి పరిస్థితే స్వర్ణది కూడా. స్వర్ణ భర్త కదిరప్ప కూడా అంతే, పావని భర్త శంకర్ డ్యూటీలు బాగా చేసినా వచ్చిన డబ్బును ఇంట్లో ఇవ్వడు. తాగుడుకే వాడుకుంటాడు. పైగా ఆమె దగ్గర డబ్బును గుంజుకుంటాడు. భర్త ఆక్సిడెంట్ కు గురై చావుబతుకుల్లో ఉన్నప్పుడు లక్ష రూపాయలు అప్పుచేసి బతికిచ్చుకుంటుంది. అయినా
అతనికి ఎలాంటి కృతజ్ఞత ఉండదు.స్వర్ణ పావనీల సమస్య ఒకటే. వారిద్దరూ ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఉంటారు.
బాధలు ఒకరికి చెప్పుకుంటూ ఉంటారు. మార్చి 8న టివిలో మోదీ భారతదేశంలో మహిళల గొప్పతనం గురించి చెపుతుంటాడు. రాష్ట్రంలోని మహిళలను నెంబర్ వన్ స్థానానికి తీసుకుపోతానని చెపుతుంటాడు. అది విని పెళ్ళైనప్పటి నించి ఈ నేతలు మాటలు వింటున్నా తన పరిస్థితుల్లో మార్పు రాదేమిటో అని ఆలోచిస్తూ తాగివచ్చి కొట్టే తన భర్తకోసం ఎదురు చూస్తూ కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది.
మహిళా దినోత్సవం రోజున మహిళల సాధికారత అంటూ మాట్లాడుతుంటారు. పాలకులు.మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్లు కల్పించటానికి ఇంతవరకు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టలేదు. మహిళల్లో అక్షరాస్యత పెంచటానికి చర్యలులేవు. ప్రవేటీకరణ జరిగినపుడల్లా ఆదెబ్బమహిళల మీదే పడుతోంది. ధరలు పెరిగినపుడెల్లా ఆభారం మహిళల మీదే పడుతోంది. ఈకథ ద్వారా సమాజంలో శ్రామిక మహిళల స్థితిగతులను జరుగుతున్న ధోరణులను ఎత్తి చూపుతుంది.
ప్రగతిగారు రాసిన 'మహిళాదినం' కథ 2017లోనిది. శశికళగారు శ్రామిక మహిళల పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదని చెపితే. ప్రగతిగారు మహిళల్లో వున్న వర్గవైరుద్యాలను బహిర్గతం చేసింది. ఈ కథలో మహిళా క్లబ్ 'అధ్యక్షురాలు ఆమె ఇంటి పనిమనిషి రెండు పాత్రలుంటాయి. అంటే విభిన్నప్రపంచాలు. వైరుధ్యాలతోపాటు శ్రామిక మహిళలు చైతన్యం అవుతున్న తీరును కూడా బహిర్గతమవుతుంది. మేడేను సకల దేశకార్మికులు తమ విముక్తి కోసం చేసే దీక్షాదినంగా చూస్తారు. మార్చి 8 ని శ్రామిక మహిళాలోకం తమ విముక్తి కోసం చేసే దీక్షాదినంగా చూస్తున్నారు. మహిళా క్లబ్ అధ్యక్షురాలుమహిళలకు వంటల పోటీలు పెట్టి చైతన్య రహితుల్ని చేస్తూంటుంది. పనిమనిషి మాత్రం తనపనినితొందరగా పూర్తిచేసుకుని మహిళలు చైతన్యం కావాల్సిన అవసరాన్ని తెలియచెప్పే సమావేశానికి హాజరై మార్చి 8 ప్రాముఖ్యత కూడా తెలుసుకొంటుంది.పాలకులు ఏదో చేస్తారని ఎదురుచూ సేకన్నా తమ సంకెళ్ళను తాము తెంచుకోవడానికి తాము సంఘటితం కావాలన్న చైతన్యం అవసరమని చెపుతుందీ కథ. దీనికి మహిళలు తమ చైతన్యాన్నిపెంచుకోకుండా కేవలం వినోదాలతో, విందులతో కాలక్షేపం చేసే తీరును, శ్రామిక మహిళలు చైతన్యమవుతున్న తీరును తెలియజేస్తుందీ కథ.
ప్రగతిగారి మరో కథ ప్రయాణంలోనూ పని మనిషులే పాత్రలు. ఇది కూడా 2017లో వచ్చింది.భర్త భార్యను తాగొచ్చి కొడుతూ ఉండటం, కొన్నాళ్ళకు ఆభర్త ఆమెకు తన జబ్బులు అంటిస్తాడు.అతను చనిపోతాడు. ఆమె జబ్బులతో బాధపడుతూ చనిపోతుంది. వాళ్ళ కూతురు పెరిగి పెద్దదై ఒకబట్టల ఫ్యాక్టరీలో బెంగుళూరులో పనిచేస్తూ ఉంటుంది.
ఇందులో కొత్తతరం మహిళలు ఫ్యాక్టరీ కార్మికులుగా మారుతున్న వైనాన్ని తమ కాళ్ళమీదతాము నిలబడాలనే బలమైన కాంక్షను కథ ద్వారా తెలియజేస్తుంది రచయిత్రి,
ప్రగతిగారి మరొకథ 'గువ్వగూడు' ఇది కూడా 2007లోనిది. కుల్లాయి అనే పిల్లాడు పదోతరగతి ఫెయిలయ్యాక సేద్యం పనిలో పడతాడు. వానలు రాక, నీళ్ళు లేక సేద్యం గిట్టుబాటు కాక గాలిమరల్లో కార్మికునిగా చేరతాడు. గాలిమరల్లో ఒక సారి షార్ట్ సర్క్యూట్ జరిగి కాలి బొగ్గయి పోతాడు. నేలరాలినగువ్వగూడును సరిచేసి గువ్వపిల్లలను సరిచేసి ఉంటాడు తన చిన్నతనంలో, కానీ కుల్లాయిలాంటి శ్రామికులు గూడు చెదిరితే ఆకుటుంబగూడును సరిచేసే వారెవ్వరు అని ప్రశ్నిస్తుంది రచయిత్రి, గాలిమరలపనివాళ్ళు, విద్యుత్ కార్మికులు, భవననిర్మాణ కార్మికులు, వ్యవసాయ కార్మికులు అనేక ప్రమాదాల్లో మరణిస్తూ ఉన్నారు. ఒక్కోసారి నడుము విరిగి అచేతనులు కూడా అవుతున్నారు. వీరందరికినష్టపరిహారం గాని కనీస సహాయంగాని అందటం లేదు. అనేక పోరాటాలు చేస్తే కొంత ఉపశమనం లభిస్తోంది.
ఇటీవల రైతుకు ఎలాంటి ధీమా ఇవ్వలేని పాలకులు బీమా మాత్రం చివరకు ఇవ్వగలిగినారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అసంఘటిత కార్మికులకు బీమా ఇస్తున్నారు. వాస్తవానికి అసంఘటిత కార్మికులకు వారినైపుణ్యాన్ని బట్టి సరైన శిక్షణ ఇవ్వాల్సిన అవసరాన్ని, కార్మికుల హక్కులను కాపాడే విధంగా చట్టాలు చేయాల్సిన అవసరాన్ని తెలియజేస్తుందీ కథ.
పై కథలన్నీ పరిశీలిస్తే 2000కు ముందు నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయింది. ప్రపంచీకరణ శరవేగంగా వచ్చింది. పెట్టుబడిదారీ సంబంధాలు పెరిగాయి. అన్ని రంగాల్లోకి పెట్టుబడి ప్రవేశించింది. విద్య, వైద్యం, వ్యవసాయం కార్పోరేట్ చేతుల్లోకి వెళ్ళిపోయింది.రియల్ ఎస్టేట్ పెరిగి స్థలాల ధరలు పెరిగిపోయాయి. ఇవన్నీ ప్రజలపై విపరీత భారాన్ని పెంచాయి.ధనస్వామ్యం నేర్పే అన్ని అవలక్షణాలు సమాజంలో విస్తరించాయి. ఇందులో అవినీతి ప్రధానమైనది.ఉద్యోగులు తమ జీతాల్ని పెంచుకోవడమేగాక అవినీతిని కూడా పెంచుకున్నారు. నిఖార్సైన వారినిగుర్తించడం చాలా కష్టమైపోయింది. అంతోఇంతో అవినీతి అంటని పోస్టాఫీసు, బ్యాంకుల్లో కూడా నోట్లరద్దు అవినీతిని అంటేటట్లు చేసింది. అవినీతి పేద ప్రజలపై భారాన్ని ఎక్కువ చేసింది. శ్రామికుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. చిన్నయిల్లు, రేషను వీరికి అందినా విద్య,వైద్యం, ఆవినీతి వల్ల వారి జీవితాల్లో ప్రచ్చన్న పేదరికం తొంగిచూస్తోంది. ఈ విషయం 2000 తర్వాత వచ్చిన కథల్లో గమనించవచ్చు. మద్యం ప్రభుత్వమే టార్గెట్లు పెట్టి అమ్మడం వల్ల పేదల కుటుంబాలు ఎలా గుల్లవుతున్నాయో పనిమనిషుల కథల వల్ల తెలుస్తుంది. మానాన్ని అమ్ముకుంటూ బతుకు సాగిస్తున్న జీవితాలను, పరాయీకరణకు గురైన వారి జీవితాలను,జీవితం అగాధం అంచులకు పోనీకుండా ధైర్యంగా సాగి పోయేవారి జీవితాలను కథలుగా తీసుకురావాల్సినఅవసరం నేటి యువతరం మీద ఉంది.
పిళ్లాకుమారస్వామి - 9490122229
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి