చిత్రకళకు కవిత్వబంధం
చిత్రకళకు కవిత్వబంధం
"పెయింటింగ్ ఈజ్ మ్యూట్ పొయిట్రీ, పోయెట్రీ ఈజ్ స్పీకింగ్ పిక్చర్" అంటూ ఫ్లూటార్క్ నిర్వచించిన కవిత్వం,కళాచిత్రాల గురించి నిరంతరం గా అధ్యయనం చేసి అనేక వ్యాసాలు రాసి వాటన్నిటినీ కూర్చి యల్.ఆర్.వెంకటరమణ "వర్ణ పద చిత్రణ" గ్రంథాన్ని వెలువరించారు. సాధారణంగా కవిత్వమో, కథలో రాస్తుంటారు ఎవరైనా. రమణ కవి, చిత్రకారుడు. అందువల్లే సరికొత్తగా చిత్రకళకు సాహిత్యానికి ఉన్న సంబంధాన్ని వాటి విశిష్టతను వివరిస్తూ అనేక వ్యాసాలు రాసి,వాటిని ఒక గ్రంథంగా మనకందించారు. స్వతహాగా చిత్రకారుడు కావడం వల్లే ఇది సాధ్యమైంది.
వర్ణ పదచిత్రణ గ్రంథం లోకి ప్రవేశిస్తే ఇందులో 28 వ్యాసాలు ఉన్నాయి.వీటిలో చిత్రకళ ,కవిత్వం వాటి మధ్యనున్న పరస్పర సంబంధాలను పాశ్చాత్యులు చిత్రించిన తీరును, తెలుగు చిత్రకారులు చిత్రించిన తీరును,వారి కవిత్వాన్ని, విశ్లేషిస్తూ దాదాపు పన్నెండు వ్యాసాలున్నాయి.చిత్రకారులై వుండి కవిత్వాన్ని రాసిన వారి గురించి పన్నెండు వ్యాసాలున్నాయి. చిత్రాల ఆధారంగా కవిత్వం రాసిన తెలుగు కవులు గురించి నాలుగు వ్యాసాలు ఉన్నాయి.
టాల్ స్టాయ్ చెప్పినట్లు కళ, భావాల పరస్పర మార్పిడికి సాధనంగా ఉపయోగ పడుతుంది.ఈ పరిస్థితి ఆదిమానవుడి నుండి నేటి దాకా కొనసాగుతూనే ఉంది. ఆదిమానవుడు గుహల్లో జీవించే కాలంలో తీరిక సమయాల్లో తన భావాలను ఇతరులకు చెప్పడానికి అనేక చిత్రాలు గీచాడు.భాష లేని కాలంలో సంకేతాలను ఉపయోగించేవాడు. వాటినే చిత్రాలుగా, ముద్రికలుగా తయారుచేసేవాడు. అదే కాలక్రమంలో లిపిగా మారాయి.
ప్రాచీన సెమైట్ భాషలో ఎద్దు కొమ్ములు, తల నేటి ఆంగ్ల అక్షరం Aకు సంకేతంగా ఉండేది.మొదటి అక్షరాన్ని అప్పట్లో వారు అలెఎఫ్ అనేవారు. అలీఫ్ అంటే ఎద్దు అని అర్థం. O అనే లాటిన్ అక్షరం కంటికి గుర్తు. P పొడుగాటి మెడ మీద ఉన్న తలకు గుర్తుగా వుండేది. తమ మాటల బొమ్మలను చెట్టు బెరడు మీదనో మట్టి పలకల మీదనో గీచేవాళ్ళు.
క్రీ.పూ.2600 లోని హరప్పా కాలంలో స్త్రీ యోని ని కుంభం(కుండ)గా భావించేవారు. అప్పట్లో వారు కుంభ పూజ చేసేవారు. కుంభాన్ని స్త్రీ మర్మాంగం గా పోల్చడాన్ని కథాసరిత్సాగరం కావ్యంలో కనిపిస్తుంది. మొహంజదారో తవ్వకాలలో అనేక ముద్రికలు, బంక మట్టి పలకలు దొరికాయి. వాటిలో అమ్మ తల్లి ప్రతిమ పశుపతి బొమ్మలు ఉన్నాయి అమ్మ తల్లిని ఆదిశక్తిగా పశుపతిని నేటి శివుని భావించవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు.
ఈజిప్షియన్ గుళ్ళు గోడలమీద ప్రాచీన మానవుడు గీచిన బొమ్మలు ఉన్నాయి. వేలాది సంవత్సరాల కింద కత్తులు ఈటెలు పట్టుకుని ఉండే యోధుల బొమ్మలను రాళ్ళపై చెక్కినారు. వాళ్ళ వెనక బందీలుగా ఈడ్చుకు పోతున్న దృశ్యం ఉంటుంది .బానిసత్వం ఆరంభాన్ని ఈ చిత్రం చూపిస్తుంది.
ఈ బానిస విధానాన్ని చూచి మియాగ్రా పట్టణానికి చెందిన గ్రీకు కవి థియోగ్నిస్ ఒక చోట
"ఉల్లి కోళ్ల నుంచి మల్లి పువ్వు రాదు/బానిసీడు బిడ్డ స్వేచ్ఛ గాడు కాదు " అంటూ రాశాడు.
మానవుని నాగరికత ప్రస్థానంలో తొలి ఆవిష్కరణ నిప్పుగా వెంకటరమణ చెపుతాడు. దానిని ఎప్పుడు కావలిస్తే అప్పుడు తయారుచేసుకోవడానికి చెకుముకి రాళ్లను లేదా కర్రలను సిద్ధంగా ఉంచుకునే వారు. ఈ నిప్పు తయారు చేసే దానిని ఆరణి అన్నారు. క్రీ.పూ.400రాసిన మహాభారతంలో దీనిపై ఒక కథ కూడా ఉంది. తన ఆరణిని ఎవరో యక్షుడు దొంగిలించాడని ఒక బ్రాహ్మణుడు పాండవులతో మొరపెట్టుకుంటాడు. పాండవులు ఒక్కొక్కరు వెతకడం కోసం పోయి యక్షుల బారిన పడతారు. చివరకు ధర్మరాజు ప్రశ్నలకు సమాధానం చెప్పి వారి బారి నుండి రక్షిస్తాడు. నిప్పు తరువాత మానవుడు మరింత అభివృద్ధి చెందడానికి దోహదం చేసింది చక్రం అని చెప్పాడు రమణ.చక్రం మానవుని ఒకచోట నుండి మరో చోటుకు వెళ్ళడానికి దోహదం చేసింది. చక్రం సౌష్టవలక్షణం కలిగి ఉంటుంది. నిలువుగా అడ్డుకోత కోస్తే కుడిఎడమల సమానంగా ఉండటమే సౌష్టవం. ఇది సహజంగా ఆకులలో, చతురస్త్రం లో ,మనిషిలోనూ (గుండె మినహాయిస్తే) ఇలా చాలా చోట్ల కనిపిస్తుంది దీంతో పరిమాణం అవసరమైంది. దాన్ని కొలిచేందుకు కొలత కూడా అవసరమైంది. కొలతల నుంచి సంఖ్యా పద్ధతి ,సంఖ్యల కోసం సంకేతాలు, సంకేతాల కోసం బొమ్మలు లిపి క్రమానుగతంగా ఏర్పడినట్లు రచయిత గుర్తించాడు. బొమ్మల లిపి అక్షరాలకు బాటలు వేసిందన్నాడు. రాయడమన్నది ఇనుప యుగంలో ప్రారంభమైందని రచయిత చెప్తాడు.
బొమ్మల లిపి మనదేశంలో సింధు నాగరికతా కాలంలో కనిపిస్తుంది. అక్షరాలకు సంకేతంగా అనేక చిత్రాలను వారు ముద్రికలపై చెక్కినారు. క్రీ.శ. 1853 నుండి 1923 వరకు పరిశోధన చేసి ఆనాటి లిపిని సంస్కృతి ని పూర్తిగా తెలుసుకున్నారు. ఆ పరిశోధనలో లభించిన కుండలు,మట్టి గాజులు, బంగారు నగలు,పెన్సిళ్ళు వగైరాలపై అనేక లిపి సంకేతాలు చెక్కివుండటం గమనించారు. వీటిలో కొన్ని చేప ,పక్షి ,మనిషి రూపంలో ఉన్నాయి. ఈ లిపికి ద్రావిడ భాషా లిపికి దగ్గర సంబంధం ఉందని భావిస్తున్నారు. అలాగే సుమేరియన్ లిపికి, చైనా లిపికి, ఈజిప్టు లిపికి సంబంధం ఉందని కూడా పండితులు నిరూపించారు. ఇప్పటి వరకు 400 సంకేతాలను గుర్తించారు. అయితే ఈ లిపిని ఎవరూ ఇప్పటివరకు చదువలేకపోయారు.
ప్రకృతిని అనుకరిస్తూ కల్పన జోడించి సొంత నైపుణ్యంతో చేసే పనే "కళ" అని చెప్పాడు రచయిత. అందుకే ప్రకృతికనుకరణమే కవిత్వం అన్నారు. కళకు సంబంధించిన విధి విధానాల గురించి చెప్పడానికి శాస్త్రం అవసరమైంది.ప్రకృతి ఆధారంగా ఏర్పడిన కళను విశ్లేషిస్తూ దాని బాగోగులను దానిలో ఉన్న నైపుణ్యాలను అందరికీ ఆమోదయోగ్యంగా నిర్దారించడమే శాస్త్రం అన్నారు. కళలను మన పూర్వీకులు 64 రకాలుగా విభజించారు. దానిలో ప్రధానమైనవి చిత్రలేఖనం, కవిత్వం, నాట్యం ,శిల్పం. ఇవన్నీ ఒక దానికి ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి.
వీరభద్రయ్య రాసిన 'కళా తత్వశాస్త్రం 'లో సౌందర్యం, ప్రతిభ ,అభివృద్ధి _ఈ మూడింటిని ఏ కళైనా కలిగి ఉంటుందన్నారు. అలాగే కళ విశ్వమంతటికీ దర్పణంగా ప్రతిబింబించగలదని క్రిష్టఫర్ కాడ్వెల్ చెబుతాడు.ఇవన్నీ ప్రతి కళకూ వర్తిస్తాయి.
కళ ఎవరి కోసం? అన్న చర్చ ఫ్రెంచి విప్లవ కాలంలో వచ్చింది. కళ కళ కోసమే అని కొందరు ,కళకు సామాజిక ప్రయోజనం ఉంటుందని కొందరు వాదించారు. కళ కళ కోసమే అని చెప్పినవాడు ఆస్కార్ వైల్డ్ .వాస్తవ జీవిత ప్రతిబింబమే కళ అని చెప్పిన వాడు ఆప్టన్ సింక్లేర్. కళ ప్రజల్లో ప్రచారమై తగిన ప్రయోజనం సాధించాలంటే దానిపై కళాభిరుచులు పెంపొందించే విమర్శ అవసరమని కొడవటిగంటి కుటుంబరావు అభిప్రాయపడ్డాడు. అయితే ఈ గ్రంథంలో వెంకటరమణ దీనిపై తనకున్న స్పష్టమైన అభిప్రాయం వెలిబుచ్చివుంటే బాగుండేది.
వెంకటరమణ ఈ గ్రంథంలో పాశ్చాత్య దేశాల్లో చిత్రకారులు గా, కవులుగా రాణించిన వారి కవిత్వాన్ని, చిత్రకళా కృషిని సమగ్రంగా విశ్లేషించారు.విలియం బ్లాక్ ఎలిజిబెత్ సిడాల్, బాషో, ఫ్రిదా కాహ్లో మొదలైన చిత్రకళా కవుల గురించి వివరణాత్మకంగా రచించారు. చిత్రకారులుగా కవులుగా రాణించిన వారు తెలుగు సాహిత్య లోకంలో కూడా చాలామంది ఉన్నారు. కాపు రాజయ్య ,దామెర్ల రామారావు, తలిశెట్టి రామారావు ,సి .ఎస్. వెంకట్రావు (అనంతపురం) కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి మొదలైన వారి గురించి పరిచయం చేసిన రచయిత కృషి అభినందనీయం.
జాన్ కీట్స్ చిత్రకారుడు కాకపోయినా సౌందర్యాత్మక ప్రకృతి కవి ఆయన.'ఇటనుండె నొకడు నీట రాసిన పేరు గల వాడు ' అని తన సమాధి శిలాఫలకంపై వ్రాయమని కోరిన కవాయన. ప్రకృతి వర్ణనే తన కవిత్వంలో చిత్రించి ఎందరో రసజ్ఞుల హృదయాలను చూరగొన్నాడు.
ఈ గ్రంథంలో ముఖ్యంగా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది గుయెర్నికా చిత్రం గురించి. గుయెర్నికా స్పెయిన్ లోఒక పల్లె.1936 లో పదవి కోల్పోయిన ఫ్రాంకో పదవి దాహంతో ముస్సోలిని హిట్లర్ ల తో చేతులు కలిపి అంతర్యుద్ధానికి తెరలేపాడు. దాంతో జర్మనీ సైన్యం సహకారంతో అత్యంత అమానుష దాడి జరిపించాడు. వేలాదిమంది మరణించారు.
వందలాది మంది క్షతగాత్రులయ్యారు. ఈ దారుణ మారణ హోమాన్ని ఆనాటి ప్రసిద్ధ చిత్రకారుడు పికాసో తన 'గుయెర్నికా' చిత్రాన్ని క్యూబిజం పద్ధతిలో చిత్రించాడు.రూపంలో నైరూప్యాన్ని చూడ్డం పికాసో ప్రత్యేకత; నైరూప్యంలో రూపాన్ని చూడ్డం ఆయన వైశిష్ట్యం. అదే విధంగా ఆకృతిని వికృతిగా వికృతిని ఆకృతిగా మార్చడంలో ఆయన దిట్ట. అర్థాన్ని అయోమయంగా, అయోమయాన్ని అర్థంగా మార్చడంలో సైతం ఆయన ఘటికుడు. పికాసో గీచిన "గుయెర్నికా"చిత్రం ఫాసిజం పై పోరాటానికి కవులకు కళాకారులకు అంతర్జాతీయంగా స్ఫూర్తినిచ్చింది. ఈ చిత్రం ఆధారంగా ఎంతోమంది ఎన్నో కవితలు రాశారు.ఈ చిత్రం ఇప్పటికీ చాలా మందికి స్పూర్తి దాయకం. వెంకటరమణ ఒక అధ్యాయాన్ని దీనికోసమే కేటాయించడం దీని పట్ల ఆయనకున్న ఆసక్తి, అనురక్తి తెలియజేస్తుంది.
చిత్రకళ, కవిత్వం ఒక దానికొకటి పరస్పరా ధారితాలు.రవి వర్మ చిత్రం చూసి రాసిన గేయాలు ఎన్నో ఉన్నాయి.ఎంకి పాటలు విని గీసిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి కళకు ఇంకో దానితో సంబంధం ఉంది.అన్నింటికీ మూలమైనది శ్రమైక జీవనం. శ్రమైక జీవులు తమ శ్రమను మరిచిపోవడానికి వ్యక్తీకరించిన రూపం కళ. అది కవితో, కథో,నాట్యమో, పాటో,పద్యమో. ఇలా ఏదైనా విరామ సమయం లోనే.కానీ ఆధునిక జీవితం సంక్లిష్టంగా మారింది. విరామమెరుగని జీవితం గా మారిన నేటి ప్రపంచీకరణ యుగంలో కళలకున్న ప్రాధాన్యత అయోమయంలో ఉంది.మన సంస్కృతికి మన కళలే పట్టుకొమ్మలు. అవి నశిస్తే మన సంస్కృతి నశించినట్లే. వాలస్ స్టీవెన్స్ చెప్పినట్లు ఆధునిక కవికి ఉన్న సమస్యా, ఆధునిక చిత్రకారుల సమస్యా ఒక లాంటిదే. దీనిని అధిగమించడానికి వెంకటరమణ విశేష కృషి చేస్తున్నారు.
__ కుమారస్వామి
9490122229
కవి ప్రముఖ చిత్రకారులు శ్రీ ఎల్ వి రమణ గారి వర్ణ పద చిత్రణ కావ్యపరిచయం సంక్షిప్తంగా సమగ్రంగా ఉంది విశ్వాస సంబంధమైన అనేక అంశాలు పరిణామక్రమంలో గల అంశాలు చాలా విశదపరిచారు కావ్యాన్ని చాలా ఆసక్తికరంగా తీర్చిదిద్దారు అనే భావన కలుగుతుంది ఈ కోణంలో ఆలోచించి రాసిన రచయిత గారికి ప్రత్యేక అభినందనలు ఈ కావ్యాన్ని బ్లాగుల పరిచయం చేసిన పరిచయ కర్త జిల్లా కుమారస్వామి గారికి కి ధన్యవాదములు
రిప్లయితొలగించండి