రచయిత అంతరంగంపై ఎక్స్రే “దరి-దాపు
రచయిత అంతరంగంపై ఎక్స్రే “దరి-దాపు
సమాజంలో నుంచి రచయిత వస్తాడు. సమాజంలోని మంచి, చెడు లాంటి వైరుధ్యాలు రచయితలో కూడా ఉంటాయి. రచయితకు ప్రత్యేక చైతన్యం ఉంటే వీటినన్నింటిని అధిగమిస్తాడు. అప్పుడు రచయిత సమాజం నుంచి బయటకు వచ్చి క్రికెట్ ఆటను ప్రేక్షకుడు చూసినట్లు సమాజాన్ని పరిశీలించి తన చైతన్యం జోడించి రచనలు చేస్తాడు. సమాజంలోని వాస్తవానికి తన చైతన్యంతో కల్పన జోడించి కళాత్మకంగా రచన చేస్తాడు. అప్పుడద వాస్తవికత అవుతుంది. “మనిషి చైతన్యం భౌతిక ప్రపంచాన్ని ప్రతిఫలించడమే కాదు దానిని
సృష్టిస్తుంది కూడా” అంటాడు లెనిన్. అంటే వాస్తవం రచయిత భావనా ప్రపంచంలోకి పోయి అక్కడ అంతర్మథనానికిలోనై వాస్తవికంగా బయటకు వచ్చి రచనలో ప్రవేశిస్తుందన్నమాట.
సమాజంలోని వైరుధ్యాలను అర్ధంచేసు కోవడంలోనే రచయిత చైతన్యం బయటపడు తుంది. రచయితకు జీవితం పట్ల ఉన్న అవగాహన, దానిపట్ల అతని వైఖరులు, అతను దానిలో కోరుకునే సవరణలు, మార్పులు,అందుకు రచయిత ప్రతిపాదించే ప్రత్యామ్నాయం... ఇవన్నీ కలిసి రచయిత చైతన్యం అవుతాయని రాచపాళెం
గారు పేర్కొన్నారు. దీన్ని ఇంకో మాటలో సమాజంలో ఉన్న స్థితి సమాజ చైతన్యం అయితే సమాజంలో ఉండాల్సిన స్థితిని చెప్పడాన్ని రచయిత చైతన్యం అన్నారు.
రచయితకు చైతన్యం ఎలా వస్తుందో తెలియాలంటే దరి-దాపు పుస్తకంలోకి వెళ్లాలి. దరి-దాపులో
రచయిత చైతన్యవంతుడవడానికి తోడ్పడే అంశాలపై ఐదు వ్యాసాలున్నాయి. అలాగే సాహిత్య అధ్యయనంలో అవగాహన చేసుకోవటానికి కావలసిన పరికరాలను సాహిత్యం-స్థలకాలాదులు, సాహిత్యావగాహన- శాస్త్రీయతల్లో వివరించారు.
రచయిత చైతన్యవంతుడయ్యేందుకు తోద్పడే ప్రాథమిక అంశం రచయిత ప్రాపంచిక దృక్పథం. దాంతోపాటు తాను నమ్మిన విలువలతో, తాను సమాజంలో ఎవరివైపు వుండాలో గుర్తించి అటువైపు నిలిచి రచనలు
'చేస్తూ నిబద్ధత కలిగి వుండటం రెండవ అంశం. మూడవది సమాజంలో వైరుధ్యాలను పరిష్కరించడానికిశరచయిత ఒక పరిష్కార మార్గాన్ని సూచించగలగడం. దీన్ని తన రచనలో వ్యక్తీకరించడానికి తనకంటూఒకశైలిని, ఒక కంఠస్వరాన్ని ఏర్పరచుకోవడం. ఇదే నాలుగవ అంశం. ఈ నాలుగింటి గురించి విపులంగా దరిదాపులో వివరించారు రాచపాళెం చంద్రశేఖర్రెడ్డి.
మొదటగా ప్రాపంచక దృక్పథం. ప్రాపంచక దృక్పథం అంటే ఏమిటో వివరిస్తాయన. ప్రపంచాన్నిగురించి రచయిత వైఖరి. అంటే కనిపించే జీవితం పట్ల రచయిత తన మనససులో ఏమనుకుంటున్నాడు అనేదే అతని దృక్పథం. దీనినే రచయిత తాత్విక దృక్పథం అని, ఆలోచనా విధానమని అన్నారు.
ప్రపంచాన్ని అర్ధం చేసుకొనే తీరులో రెండు రకాల భావధారలు ఉన్నాయి. ఒకటి భావవాద ప్రాపంచికదృక్పథం. రెండు భౌతికవాద (ప్రాపంచిక దృక్పథం. ఈ రెండు దృక్పథాలలో ఏదో ఒక దానికి రచయిత చెందిఉంటాడంటారు రాచపాళెం.
భావవాద రచయిత (ప్రపంచమంతా భగవంతుని సృష్టిగా భావిస్తాడు. తను చేసే పనులన్నింటికి
పూర్వజన్మలో చేసిన కర్మఫలాలని భావిస్తాడు. సమాజం మారదని భావిస్తాడు. ఈ ప్రపంచం మిధ్య అని కూడాభావిస్తాడు. విధిని నమ్ముతాడు, తలరాత సిద్ధాంతాన్ని విశ్వసిస్తాడు. ప్రభుత పట్ల విధేయతను కలిగి వుంటాడు.
వర్ణవ్యవస్థ భగవంతుని సృష్టిగా నమ్ముతాడు. అన్ని ఆర్థిక, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక అసమానతలను ఆమోదిస్తూ సమర్థిస్తాడు.
భౌతికవాద ప్రాపంచిక దృక్పథం గల రెండో రకం రచయిత వీటినన్నింటిని వ్యతిరేకిస్తాడు. ఆచరణే
గీటురాయిగా భావిస్తాడు. సమాజం మారుతుందని దీన్ని మార్చగలమని విశ్వసిస్తాడు. ప్రపంచం వాస్తవమని, మనిషే చరిత్ర నిర్మాత అని నిరూపిస్తాడు.
భావవాది ఆచరణలో మాత్రం భౌతికవాదిగా లాగానే వ్యవహరిస్తాడు. భావవాది తన భావనా ప్రపంచంలో మాత్రమే భావవాది. అందువలన భావవాద దృక్పథం కలిగిన రచయిత కూడా ఆచరణలో భౌతికవాదిగా ఉన్నప్పటికీ తన రచనలో మాత్రం భావవాద దృక్పథంతోనే రాస్తాడు. సృష్టికర్త ఒకడున్నాడని అతడు మానవాతీతుడని
(ప్రచారంచేయడమే భావవాద ప్రాపంచిక దృక్పథం, ప్రాచీనాంధ్ర కవులలో అందరిదీ ఈ దృక్పథమేనని చెప్పుతాడు రాచపాళెం. నన్నయ్య వీరికి ప్రతినిధిగా నిలిచాడన్నారు.
ధర్మరాజు కౌరవులతో యుద్ధానికి వెళుతున్నప్పుడు ' విధి నియుక్తుడయి యపుడు విదురుతో నేగ నిశ్చయంచె నిందకులుడు' అని నన్నయ్య భారతంలో చెబుతాడు. విధి నియుక్తుడు అనే పదం నన్నయ్య ప్రాపంచిక దృక్పథాన్ని తెలియజేస్తుంది. పోతన “ వివేకంబుగల వశంబులుగా దలంచి" అంటూ కర్మసిద్ధాంతాన్ని చెపుతాడు. దూర్జటి “అంతామిథ్యే తలచి చూచిన' అనడం భావవాదం దృక్పథం.
"మనిషి చేసిన రాయి, రప్పకు / మహిమకలదని సాగి మొక్కితే మనుషులంటే రాయి రప్పలకన్నా /
కనిష్టంగానూ చూస్తారేయి ! అని గురజాడ అంటున్నప్పుడు ' పరమాణువు సంకల్పంతో ప్రభవం పొందినవాడా' అని శ్రీశ్రీ అన్నప్పుడూ, 'మాయాంటావూ ? అంతా మిథ్యాంటావూ? " అని శ్రీశ్రీ ప్రశ్నించినపుడు భౌతికవాద ప్రాపంచిక దృక్పథం స్పష్టంగా కనిపిస్తుందని రాచపాళెం సోదాహరణంగా వివరిస్తారు.
భౌతికవాద ప్రాపంచిక దృక్పథంగల రచయిత సమాజమార్పును గుర్తిస్తాడు. సమాజంలోగల చోదకశక్తిని గుర్తించి దానిని తన రచనల్లో తాసు కురిపిస్తాడు. పాఠకుల చైతన్య పరిధిని విప్రతం చేస్తాడు. అందువల్ల రచయిత చైతన్యానికి అతని ప్రాపంచిక దృక్పథం గీటురాయిగా నిలబడుతుంది.
రచయిత చైతన్యానికి దోహదపడే రెండో అంశం అతని నిబద్ధత, తాను చెప్పేదానికి కట్టుబడి ఉండటం నిబద్ధత అన్నారు. 'ఒక వర్ణంపట్ల పక్షపాతంతో రచనలు చేయటం నిబద్ధత” అని రాచపాళెం చంద్రశేఖర్రెడ్డి నిర్వచించారు. మొదట్లో నిబద్ధత అనే పదాన్ని 'పీడిత పక్షాన నిలబడటం' అనే అర్ధంలో వాడినారు. కానీ తరువాత దశలో సమాజానికి సంబంధించిన ఆలోచనా ధోరణుల్లో ఏదో ఒక దానికి చెందినవాడిని నిబద్ధునిగా ఆయన గుర్తించారు. దీని ప్రకారం విశ్వనాథ హైందవ సంస్కృతికి నిబద్ధుడైతే, శ్రీశ్రీ విప్లవ మార్గానికి నిబద్ధుడు.
స్త్రీ వాదులు తమ మహిళా నిబద్ధత కారణంగానే పురుషాధిక్యతను ప్రశ్నించారు. చుండూరు, కారంచేడు.సంఘటనల తరువాత దళిత చైతన్యం పెరిగింది. దళితవాదం వచ్చింది, కులమే వర్గంగా ప్రతిపాదించారు.
దళితరచయితలది కులనిబద్ధత. అలాగే ముస్లిం వాదం వచ్చింది. ఇది వారి నిబద్ధత.
నిబద్ధత గురించి శ్రీశ్రీ మాట్లాడుతూ తెలిసిగాని, తెలియకుండాగానీ (ప్రతి రచయితకు నిబద్ధత ఉ
ంటుందన్నారు. మానివేయి మాకు ఎగువవయ్యా లినుకోవడం కూడా ఒక నిబద్ధతే' అని అన్నారు ఒక ఇంటర్వ్యూలో. రారా దృష్టిలో ' ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉండటం లేదా భావజాలానికి కట్టుబడటం' నిబద్ధతగా చెపుతాడు.
ప్రస్తుత దోపిడీ వ్యవస్థే కొనసాగాలనే రచయితలను ఒక భావజాలం ఉంది. దానికి సంబంధించిన నిబద్ధత
ఉంది. సమాజాన్ని సమూలంగా మార్చాలనే వాళ్ళకూ ఒక భావజాలం ఉంది. ముఖ్యంగా వామపక్ష రచయితలకు. వీరికి ప్రచారదృష్టి ఎక్కువగా ఉంటుంది. అందుకే అమెరికా రచయిత ఆప్టన్ సింక్లేర్ ' సాహిత్యమంతా ప్రచారమే'నన్నాడు.
రచయితలకు నిబద్ధత ఒక బందిఖానా అని, అది రచయితలోని సృజనాత్మకతను దెబ్బతీస్తుందని చెప్పేవారున్నారు.వీరు వ్యతిరేకిస్తున్నది నిబద్ధతనేనని అనుకుంటే అది పొరపాటవుతుందన్నారు రాచపాళెం. వీళ్లు వ్యతిరేకించేది వామపక్ష భావజాలమైన మార్క్సిజాన్ని, దీన్ని సూటిగా ఎదుర్కోలేక నిబద్ధత పై దాడి చేస్తారు. దీన్ని వ్యతిరేకించడమంటే ప్రజల వైపు నిబద్ధత లేకపోవడమే.
ధ్వానాశాస్తి, కె.ఎన్.వై., పతంజలి, గంగాధర గార్లిల్ లాంటి వారంతా మార్చిజం వ్యతిరేకులుగా ఉంటున్నారు. వీరు పీడితులను వ్యతిరేకిస్తున్న వర్ణంలోకి చేరిపోయారు. మార్కిస్టు భావజాలం అంటే కూడా తెలియని కందుకూరి, గురజాడలు సంస్కరణవాద నిబద్ధతతో రాశారు. వారి రచనల్లో ఎలాంటి సృజనాత్మకతా లోపంలేదు. అలాగే ప్రాచీనకవులు అధర్మానికి వ్యతిరేకంగా రచనలు చేసినారు.
వారిలో సృజనాత్మకత లోపంలేదు. మార్చిజం ప్రభావంతో రాసిన శ్రీశ్రీ రచనల్లో ఎలాంటి సృజతనాత్మకత లోపించిరటి.
ప్రశ్నిస్తారు రాచపాళెం.
శరత్, ప్రేమ్చంద్, కిషన్చందర్ లాంటి రచయితల నిబద్ధ సాహిత్యాన్ని ప్రజలు నేటికీ ఆదరిస్తున్నారంటే అర్థం ఏమిటి ? రావిశాస్త్రి, కొ.కు., ఇనాక్, అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, పెద్దిబోట్ల, చాసో, కారా వంటి వారంతా నిబద్ధత కలిగిన వారే. వారి రచనల్లో ఎలాంటి సృజతనాత్మకత లోపించలేదు కదా అని ప్రశ్నిస్తారు రాచపాళెం. దీనిని బట్టి సాహిత్యంలో నిబద్ధత సృజనాత్మకతను చంపలేదని నిరూపించారు. నిబద్ధతకు కూడా వర్గం, వర్ణం, లింగం, ప్రాంతం, మతం, భాష ఉంటాయి. సృజనాత్మకతకు ఇవే వర్తిస్తాయి. అయితే కొత్తదనం లేని రచయితలు నిబద్ధతతో ఉన్నా వాళ్లు గాలికి కొట్టుకుపోతారన్నారు.
నిబద్ధతగల రచయితలు పీడితుల పక్షాన నిలబడడమేగాక వాళ్ల సమస్యలకు మూలాన్ని వెతికి విశ్లేషిస్తూ పరిష్కారాలను కూడా చెపుతారు.
ఇక్కడ విమర్శకులు వేర్వేరు బృందాలుగా విడిపోయారు. రచయిత పరిష్కారం చెప్పాలా ? వద్దా? అన్న చర్చ
వచ్చింది. కొంత మంది సమాజంలోని సమస్యలను రచయిత విశ్లేషిస్తారు, లేదా పాఠకుల ముందు పెడతారు.
అంతేగాని పరిష్కారం చెప్పరు అని అంటారు. మరికొందరు ప్రజలకు సమస్యల గురించి బాగా తెలుసు వాళ్ళకు చెప్పాల్సింది పరిష్కారమేనంటారు.
దీనికి సమాధానంగా రాచపాళెం చంద్రశేఖర్రెడ్డి వాదన హేతుబద్ధంగా ఉంది. వేదాంతులు వారి దృష్టికోణంలో ప్రజల సమస్యలను పరిష్కారాన్ని చెపుతున్నారు. విప్లవకారులు మానవ సమస్యలకు పోరాడాలని చెపుతారు. సామాజిక
వైజ్ఞానిక శాస్త్రవేత్తలు ప్రజల సమస్యలను అవసరాలను గుర్తించి పరిష్కారం చూపుతున్నారు. అలాగే కళాకారులు,
రచయితలు కూడా పరిష్కారాలను వెదికి చెప్పాలిగదా అని చెపుతారు. అప్పుడు కళకు, సమాజానికి అవినాభావ సంబంధం కుదురుతుందన్నారు. 'సమాజం కోసం కాకపోతే నేను కలం కూడా ముట్టను" అన్న జార్జ్ బెర్నార్డ్ షా ప్రవచనంను గుర్తుచేస్తారు.
ప్రాచీనకాలంలో పరిష్కారం చెప్పకుండా ఉన్న రచనలసలేలేవు. అధర్మం విజృంభించినప్పుడు ధర్మానికి రక్షణగాభగవంతుడు అవతారమెత్తాడని సాహిత్యం సృజించారు. వాళ్ళ రచనలో దుష్టభక్షణ, శిష్టరక్షణ సిద్ధాంతం సమస్యల పరిష్కార సిద్ధాంతం.
ఆధునిక కాలంలో సంఘసంస్కర్తలు, జాతీయోద్యమం తెలంగాణా పప్రజాపోరాటం, గిరిజనోద్యమం, దళిత మహిళా ఉద్యమాలు ఆయా వర్గాల సమస్యల పరిష్కారం కోసమే పుట్టాయన్నది నిర్వివాదాంశం. కొందరికి మార్క్సిజం, ఫెమినిజం, అంబేద్కరిజం సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపుతాయని భావిస్తారు. అయితే అందరూ ఒకే రకమైన పరిష్కారం చూపాల్సిన అవసరం అసలే లేదని పరిష్కార వ్యతిరేకవాదులు అర్ధం చేసుకోవాలని రచయిత చెబుతారు.
సీరియస్ రచయితలు జీవితాన్ని నిశితంగా పరిశీలించి అఖండంగా కనిపించే జీవితంలోని చీలికల్ని గుర్తిస్తారు. వాటికి కారణాలను అన్వేషించి, వాటిని నిర్మూలించి తిరిగి జీవితాన్ని అఖండం చేయడానికి రచనలు చేస్తారు. ఇది వైద్యులు శస్త్రచికిత్స చేసి శరీరం లోపి కల్మషాన్ని తీసేసి, మళ్లీ కుట్లు వేసినట్లుందన్నారు. అదే కాలక్షేప రచయితలులోపలి కణతిని అలాగే వదలిపెట్టి బయటి ఒంపు సొంపుల్ని మెచ్చుకోవటం లాంటిది చేస్తారన్నారు.
'రచయిత తన రచనల్లో ఒక స్వరాన్ని వినిపిస్తాడు. అది వర్ణవ్యవస్థపై ధిక్కారస్వరంగానూ, రాజుల మీద ధిక్కార స్వరంగానూ, సమకాలీన అశాస్త్రీయ, సాంఘిక, ఆర్థిక, తత్వ రంగాలమీద ధిక్కారంగానూ ఉంటుంది. పాల్యూరికి
'సోమన వర్ణవ్యవస్థపై ధిక్కార స్వరాన్ని వినిపించాడు. పోతన కావ్యాలను రాజులకివ్వడం పై ధిక్కారస్వరం వినిపిస్తే 'రాజుల్మత్తుల్, వారి సేవ నరకప్రాయంబు' అటూ ధూర్జటి రాజులపై ధిక్కార స్వరాన్ని వినిపించాడు. “నిధి చాలా
సుఖమా, రాముని సన్నిధి సుఖమా” అంటూ త్యాగరాజు రాజాజ్ఞను ధిక్కరిస్తే, అదే దోవలో ధరాపతులను ఒకింత 'సేయము, భద్రాచల రామసేవ మానము మానము” అంటూ రామదాసు రాజాజ్ఞను ధిక్కరించాడు.
'మత, వేద సిద్ధాంతాలపై వేమన, ్రహ్మం ధిక్కార స్వరం వినిపించారు. వీరేశలింగం, గురజాడలు ఆనాటి సమాజంలోఉన్న అశాస్త్రీయ మూఢనమ్మకాలకు, సాంఘిక దురాచారాలపై తమ అక్షరయుద్ధాన్ని ప్రకటించారు. ఇవన్నీవారి కంఠస్వరానికి సంకేతాలు. త్రిపురనేని రామస్వామి చౌదరి, గుర్రంజాషువాలు కర్మ సిద్ధాంతాన్ని శ్రమదోపిడి కోసం పుట్టిన సిద్ధాంతమన్నారు. చిలకమర్తి ట్రిటీష్వారి ఆర్ధికదోపిడీని వ్యతిరేకించాడు. దాశరథి రాజుపై గళత్తినాడు.
“ముసలి నక్కకు రాచరికంబు దక్కునే” అన్నారు.
శ్రీశ్రీ 'వ్యధార్థ జీవిత యదార్థ దృశ్యాలను', (శ్రమైక్యజీవన సౌందర్యాలను, లోకపుట న్యాయాలను తమసాహిత్యంలోకి తీసుకువచ్చారు. కొ.కొ., చాసో, ఆశ్రేయ తమ రచనల్లో నిరసన ధ్వనుల్ని వినిపించారు. అరుద్ర,సినారె, అనిశెట్టి, కుందుర్తి, బెల్లంకొండ, పురిపండా, మల్లారెడ్డి మొదలగు వారంతా ఆనాటి అసమ సమాజంపై ధిక్కారం ప్రకటించారు. స్రీ వాదులు, పురుషాధిక్యంపై, కుటుంబ హింసకు వ్యతిరేకంగా “ మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తోందని" అంటూ తమ నిరసన గళం వినిపించారు.
'కసిరిబుసరకొట్టు హైందవ నాగరాజు" అంటూ వర్ణవ్యవస్థ దుర్మార్గంపై గుర్రం జాషువా, కుసుమ ధర్మన్న నిరసన స్వరం వినిపిస్తే, 'ఇప్పటి దాకా జోడించిన చేతులు అలవోకగా పిడికిలై లేవాల్సిందే' అంటూ దళిత కవులు గౌరిశంకర్, రాణి, బి.ఎస్.రాములు, శివసాగర్ తమ తిరుగుబాటు స్వరాన్ని వినిపించారు.
ఇలా చాలా మంది రచయితలు తమ రచనల్లో తమ కంఠస్వరాన్ని వివిధ రకాలుగా వినిపించారని, నిరూపించారు రాచపాళెం.
సాహిత్యాన్ని స్థలం, కాలం, ప్రాంతం, వర్ణం జండర్ మతం వంటివి నియంత్రిస్తుంటాయి. ఒక కాలంలో
సాహిత్యం ఆకాలంలోని జీవితాన్ని వ్యక్తం చేస్తుంది. చారిత్రక పరిస్థితులను ఆనాటి సమాజంలో ఉన్న వ్యవహారాలను అక్షరబద్ధం చేస్తుంది.
అవధానాన్ని కోస్తా వాల్లు చేపట్టి ప్రచారం ఏసి అదొక గారడీ విద్యగా భావించి వదిలేస్తే, రాయలసీమలో ఇప్పటికీ ప్రచారం చేస్తూ దానికొక మార్కెట్ను సృష్టిస్తారని వివరించారు రాచపాళెం.
తెలంగాణ, రాయలసీమ నుంచి ఇటీవలిదాకా వ్యాపార సాహిత్యం రాలేదు. కానీ సామాజిక బాధ్యత గల సాహిత్యాన్ని సృష్టించిన కోస్తా సాహిత్యమే సమాజ వ్యతిరేక సాహిత్యాన్ని కూడా పుష్కలంగా ఉత్పత్తి చేసిందన్నారు.
ఇది కూడా వర్తమాన సమాజంలోని వైఫల్యాన్ని, వైరుధ్యాలను ఎత్తి చూపుతోంది. కోస్తా ప్రాంతంలో పంట భూములురొయ్యల చెరువులుగా మారడం వ్యవసాయం పెట్టుబడిగా మారిపోవడానికి చిహ్నం. ఇదే పరిణామం సాహిత్యంలో
సంభవించింది. ప్రపంచీకరణ ప్రభావంలోకి వచ్చిన సమాజంలో పరాయికరణ, డీహ్యూమనైజేషన్ చొచ్చుకొని వచ్చి మానవ సంబంధాల్లో డాలర్ బలం పుంజుకుంది. మనిషి జీవితంలో సమాజంలో ఒంటరితనం ప్రవేశించింది.నోస్టాల్టీయా పెరిగింది. అదే సమయంలో రాయలసీమలో ఫ్యాక్షనిజం పెరిగి అది వికటించి సీమ అభివృద్ధికి ఆటంకంగా మారిపోయింది. ఆకలిచావులు ఆత్మహత్యలు రాయలసీమ జీవన చిత్రంగా మారింది.
సాహిత్యం ఎప్పుడూ స్థలకాల నిబద్ధమై ఉంటుందని సోదాహరణంగా చెప్పినారు. జాగ్రఫీ లేకుండా సాహిత్యం పుట్టదని కవిశివారెడ్డి అంటారు. అన్ని వేదాల్లో ఉన్నాయష అనే దృష్టితో సార్వత్రికంగా చూడడం వలన చాలా అనర్థాలున్నాయి. ప్రాచీన సాహిత్యాన్ని స్థలకాలాదుల్లో చూస్తేనే మనకు వాస్తవం బోధపడుతుందని రచయితవివరించాడు. దీనికి ఉదాహరణగా భారతంలో ఒక కథను చూపించాడు. ఒకసారి పాండవులు సరస్సులో స్నానం చేయాలని పోతే అక్కడ ఒక గంధర్వుడు అది తన సామ్రాజ్యం అంటాడు. అప్పుడు అర్జునుడు 'అడవులు, ఏరులు నీ స్వంతమా? గంగానది అందరిదీ, ఆ నది నీ స్వంతమా?' అని ప్రశ్నిస్తాడు. దీనిని పట్టుకొని అర్జునుడు సామ్యవాది అని చెప్పడం, ఆనాడే అభ్యుదయం చెప్పినాడు కదా అని అనడం చారిత్రక దృష్టిలోపం అవుతుందని తెలియజేస్తాడు
రాచపాళెం.
"శ్రీశ్రీకి ముందు చీకటి, శ్రీశ్రీకి తరువాత అంతా చీకటి' అని అజంతాలాంటివాళ్లు చెప్పడం చరిత్రను తిరస్కరించి నట్లవుతుందన్నారు. సాహిత్యం చరిత్రను రికార్డు చేస్తుందని, అది చరిత్రకు సాక్షీభూతంగా నిల్లువదన్నారు.
రచయిత బాధ్యతలను సాహిత్యాన్ని పాఠకుడు అర్ధంచేసుకోవాల్సిన తీరును వివరించి విశ్లేషిస్తుంది 'దరి-దాపు' గ్రంథం. ఇది కొత్తరచయితలకు మార్గదర్శినిగా, కరదీపికగా నిలుస్తుంది. ఈ గ్రంథాన్ని సాహితీ ప్రాంగణంలోకి వచ్చినవారందరూ తప్పకుండా చదవాలి.
రచన: కుమారస్వామి,9490122229
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి