వీరబ్రహ్మం జీవితం సందేశం





వీరబ్రహ్మం జీవితం సందేశం


ఆధిపత్య కులాలను పక్కకు తోసి దేశవ్యాప్తంగా
పదహైదు, పదిహేడుశతాబ్దాల మధ్య వచ్చింది భక్తి ఉద్యమం .ఈ ఉద్యమంలో ఉన్న వారంతా వెనుకబడినకులాల వారే .
 కబీరు ,తుకారాం మొదలైన వారంతా వివిధ వృత్తుల కుటుంబాల నుంచి
వచ్చిన వారే.  ఆంధ్రదేశంలో వేమన, రామదాసు ,వీరబ్రహ్మం, అన్నమయ్య వీరంతా
ఆయా కాలాల్లో వచ్చిన వారే.  వీళ్లు కేవలం భక్తి తో పాటు అనేక సామాజిక సంస్కరణల కోసం తన సాహిత్యాన్ని ఉపయోగించుకున్నారు.  వీరి రచనలు సామాజిక మార్పుకు దోహదపడ్డాయి.

         వేమన, బ్రహ్మం ప్రజల్లో జీవించారు.   వీరి పాటలు, పద్యాలు,తత్వాలు ప్రజల నాలుకలపై నిలిచాయి.  అందుకే వేమన ను ప్రజాకవి అన్నారు.
బ్రహ్మంగారు వచనం ,ద్విపద , పద్యాలు, పాటలు తత్వాలు మొదలైన ప్రక్రియలతోపాటు కాలజ్ఞానం రాయడం వల్ల ఆయన్ను  కాలజ్ఞానం చెప్పిన మహిమాన్వితుని  గాప్రజలు భావించారు, పూజించారు.  ఆయన రాసిన రచన రచనలన్నీ మౌ ఖికం గానే ప్రచారం అయ్యాయి . 1970ల  తర్వాతనే అవి  అందరికీ పుస్తకరూపంలోకి వఛ్చిఅందుబాటులోకి  వచ్చినాయి. వీరు ప్రజల కష్టాలు, కడగండ్లు ,సంతోషాలు,‌ఆవేశాలు ప్రత్యక్షంగా చూసినవారు వాటి కి స్పందించి సమాజంలో ఉన్న కుళ్లుకుతంత్రాలను బయట పెట్టడమే కాక సమాజ మార్పుకు  తనవంతు కృషి చేశారు.
సమాజంలో ఉన్న మూఢ విశ్వాసాలను, అగ్రవర్ణాల దురహంకారాన్ని , దళితుల పట్లఉన్న కులవివక్షను ఖండించారు.  విగ్రహారాధనను ఖండించడమే గాక  ఆత్మ చైతన్యం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

              కలిమి లేని కాలం బు కలుగునా అని ప్రశ్నించాడు వేమన. భూమి
నాది యనిన భూమి ఫక్కున నవ్వు అంటూ ప్రజల భూ దాహం పై చురకలు  కూడా వేశాడు
వేమన . అదే సందర్భంలో చిల్లర రాళ్లకు మొక్కుతువుంటే  చిత్తము చేదురా ఒరే
ఒరే/చిత్తములోన చిన్మయరూపిణి  జూచుచు  నుండుట సరే సరే అంటూ విగ్రహారాధనను
 వ్యతిరేకిస్తూ మనసులోని భక్తి భావానికి ప్రాధాన్యమిచ్చాడు బ్రహ్మం.
              వడ్రంగి కుటుంబం నుంచి వచ్చిన వీరబ్రహ్మం చిన్నతనం నుండే
భక్తిభావంతో ఉంటూ మూడాఛారాలకు  వ్యతిరేకంగా అనేక రచనలు చేశారు.  కాళికాంబ
హంస కాళికాంబ మకుటంతో 400 పద్యాలు వరకు బ్రహ్మం రాశారని  పరిశోధకులు
భావిస్తున్నారు . అయితే వీరబ్రహ్మం పుట్టుపూర్వోత్తరాలు వివరాలు
కచ్చితంగా కనుక్కోలేకపోయారు . తన గురించి తాను చెప్పిన పద్యాల ద్వారా
వేమన గురించి వివరాలు సరిగా ఎలా దొరకలేదో  అలాగూ వీరబ్రహ్మం  రచనల ద్వారా
కూడా ఆయన పుట్టుక గురించి సరైన కాలాన్ని గుర్తించలేకపోయారు.  అయితే
లభించిన ఆధారాల ఆధారంగా ఆయన జీవిత విశేషాలు ఇలా ఉన్నాయి

      పరిపూర్ణ చార్యులు పర్వతముల ముద్దుబిడ్డ వీరబ్రహ్మం.  క్రీస్తు శకం 1608 సంవత్సరంలో జన్మించి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.  దీనికి
ఖచ్చితమైన ఆధారాలు మాత్రం లేవు.  వీరబ్రహ్మం ను  అప్పటి మైసూరు
రాష్ట్రంలో ఉన్న నందికొండ సమీపాన పాపాగ్ని మఠం అధిపతిగా ఉన్న వీరభోజాచార్యులు,వీరపాకమాంబ  దంపతులు దత్తత తీసుకున్నారు . పాపాగ్ని మఠం
కర్ణాటకలోని కోలార్ జిల్లాలో చిక్బల్లాపూర్ సమీపాన  ఎనిమిది కిలోమీటర్ల‌ దూరంలో ఉంది.

                         బ్రహ్మం కు చిన్నతనం నుంచే మంచి గ్రహణశక్తి ఉండేది. అద్భుతమైన తెలివితేటలు ప్రదర్శించేవాడు.  తన 12వ ఏట లోనే
లోకాన్ని చూడాలని బయలుదేరాడు.  తల్లి ఎంత వారించినా వినక పోగా ఆమెకు
హితబోధ  చేసినాడు.  చేసేదేమిలేక అనుమతించింది . రామేశ్వరం, ధనుష్ కోటి,‌చిదంబరం, హరి హర పురం, శ్రీశైలం, మహానంది, యాగల్లు  మొదలైనయాత్రా ప్రదేశాలను సందర్శించారు.  చివరకు కర్నూలు జిల్లాలో ఉన్న బనగానపల్లె కి
వచ్చినాడు.  ఆ పల్లెలో ఉన్న గరిమరెడ్డి వెంకట రెడ్డి, అచ్చమ్మల‌గారింట్లో పశువుల కాపరిగా చేరినాడు.  పశువులను రోజు తోలుకు పోయి గడ్డిమేపుకొని సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేవాడు.  మామూలుగా వాటిని మేయడానికి వదిలేస్తే మెల్లగా అవి దగ్గరలో ఉన్న పొలాలు లోకి  పోయి గడ్డి మేస్తుంటాయి.  కానీ బ్రహ్మంతోలుకు పోయిన పశువులు  మాత్రం అలా కాదు.  ఆయన‌వాటి చుట్టూ ఒక గీత గీచేవాడు .  ఆయన దూరంగా ఎక్కడో ఒక గుహలో కూర్చుని
తనకు తోచిన  పద్యాలను తత్వాలను తాటాకు పత్రాలపై రాసుకునేవాడు.  పశువులు
మాత్రం ఎక్కడికీ పోకుండా ఆయన గీచిన గీతలోనే తిరుగాడుతూ గడ్డి మేసేవి.  ఈ
అద్భుతం  ఆ నోటా ఈ నోటా పడి గరిమిరెడ్డి అచ్చమ్మగారి చెవిన పడింది.  ఆమె
స్వయంగా వచ్చి చూసి అతని గొప్పతనాన్ని గుర్తించింది.  ఆయనలో ఏదో ఒక
దివ్యశక్తి ఉందని నమ్మి ఆయనకు శిష్యురాలిగా చేరడానికి అభ్యర్థించింది.
బ్రహ్మం  అందుకు అంగీకరించాడు . తర్వాత ఆమెకు కాలజ్ఞానం బోధిస్తూ
వారింట్లో దాదాపు ఇరవై సంవత్సరాలు జీవించాడు.
           బ్రహ్మం గొప్పతనాన్ని గుర్తించిన ప్రజలు ఆయనకు బ్రహ్మరథం
పట్టారు.  సాధారణంగా ఒక వ్యక్తి ప్రసిద్ధులయ్యారంటే ఆయన గురించి అనేక
ఆసక్తికరమైన విశేషాలు ప్రచారం అవుతాయి.  పుట్టపర్తి సాయిబాబా పెట్రోల్ గా
మార్చాడ ని ఒక డాక్టరు తన గ్రంథంలో రాసి బాబాను మహిమాన్వితంగా చేయడానికి
ప్రయత్నించాడు 20 ఏళ్ల కిందటే. దాదాపు మూడొందల సంవత్సరాల క్రిందట
చెప్పేపనిలేదు.  బ్రహ్మం చేసిన మహిమల్లో  మరణించిన ఆవును బతికించడం,
పోలేరమ్మ తో నిప్పును తెప్పించుకున్నాడని, జడివానలో తడవకుండా వచ్చాడని
మొదలన కథలున్నాయి . వీటికి ఎలాంటి ఆధారాలు లేవు.  సాధారణంగా ప్రసిద్ధులైన
వారు  జీవితం చుట్టూ ఇలాంటి కథనాలు ప్రచారమయ్యాయి.  వేమన ,తుకారం,
రామదాసు, అన్నమయ్య మొదలైన వారి జీవితంలో ఇలాంటి మహిమల ప్రసక్తి వస్తూ
ఉంటుంది.  విజ్ఞాన శాస్త్రం పురోగమించిన నేటి కాలంలో వీటిని విశ్వసించడం
కష్టమే.
            వీరబ్రహ్మం గారు బనగానపల్లెలో ఒక మఠాన్ని స్థాపించారు.  ఆ సందర్భంలో ఆయన పెద్దకొమెర్ల  నివాసి అయిన శివ కోటయ్య కుమార్తె
గోవిందమ్మను వివాహం చేసుకున్నారు.  వారికి గోవిందయ్య, సిద్ద లింగయ్య,శివరామయ్య, పోతులూరయ్య , ఓంకారయ్య,  వీరనారాయణమ్మ లు జన్మించారు‌.వీరబ్రహ్మం గారికి క్రమంగా అనేక మంది అన్ని కులాల నుండి శిష్యులుఏర్పడ్డారు. వీరిలో ప్రసిద్ధుడు సిద్దయ్య .  బుద్ధునికి ఆనందుడు  ఎట్లో‌బ్రహ్మంకు  సిద్దయ్య అట్లా . సిద్దయ్య  కందిమల్లయ్యపల్లెకు  పది కిలోమీటర్ల దూరంలో ఉన్నముడుమాల  గ్రామానికి చెందినవాడు.  ఇతను‌వృత్తిరీత్యా బట్టలు నేసే వాడు.  కందిమల్లయ్య పల్లి కడప జిల్లా లోకి‌ వస్తుంది.  కక్కయ్య మాదిగ అనే దళితుడు కూడా ఆయన శిష్యునిగా ఉండేవాడు.
బ్రహ్మం గారి మనవరాలు ఈశ్వరమ్మ కూడా తన తాతలాగా తత్వాలు, కాలజ్ఞానం చెప్పింది.ఆమె తన జీవిత చరమాంకం వరకు  బ్రహ్మచారిగా ఉండిపోయింది.

                              వీరబ్రహ్మం రచనల ఆధారంగా ఆయన చెప్పిన‌ అభ్యుదయ భావాలు  మనకు మనకు పూర్తిగా తెలుస్తాయి. బ్రాహ్మణుల కుల
దురహంకారాన్ని బ్రహ్మం  తన తత్వాలలో

                            బ్రహ్మమేదో తెలుపురయ్యా బ్రాహ్మణులారా!
                            పరబ్రహ్మమేదో తెలుపురయ్యా,
                           బ్రహ్మ మేదో తెలుపురయ్యా బ్రాంతి లేక జీవునకు
                           కర్మమోక్ష రహితమైన నా గతి పోయేటందుకును అని ప్రశ్నిస్తాడు.  "కులమెంచగా నేల గుణమే కారణం" అనడమే గాక దూదేకుల
సిద్దయ్యను, కక్కయ్య మాదిగను తన శిష్యులు గా చేసుకోవడం ద్వారా తనకు కులాల
పట్ల ఎలాంటి పట్టింపు లేదని తెలుస్తుంది. బ్రహ్మం ఆనాటి బ్రాహ్మణుల
ఆచారాలను,ఛాందసాలను ప్రశ్నించాడు.  పుష్పగిరి పీఠాధిపతి తో వాదించి వారి
ఛాందస భావాలను వదులుకునే విధంగా వారి కళ్ళు తెరిపించాడు.  కడప, కర్నూలు,‌సిద్దవటం నవాబులను దర్శించి బోధనలు చేశాడు.  వారిని దర్శించిన నేపథ్యంలో‌వారికి తన మాటల పట్ల నమ్మకం కలిగేందుకు కొన్ని గారడీ విద్య లాంటివేవో‌ప్రదర్శించాడని పరిశోధకులు చెబుతున్నారు. సిద్దయ్యను తన శిష్యునిగా చేసుకోవడం వల్ల ముస్లిం వర్గాల మనసులను ఆయన  చూరగొన్నాడు .  బ్రహ్మం‌విగ్రహారాధనను వ్యతిరేకిస్తున్నందున నవాబులు కూడా ఆయన పట్ల సానుకూల ధోరణితో వ్యవహరించారని పలువురు భావిస్తున్నారు. ఆ విధంగా ఆయన హిందూ
ముస్లిం సమైక్యత కు బాటలు వేశాడు.
           వేమన, బ్రహ్మం ఇద్దరూ దాదాపు ఒకే కాలానికి చెందినవారుగా‌ కనిపిస్తారు. అయితే  వేమన గ్రామాధికారి కారం కలిగిన నా కుటుంబం నుంచి వఛ్చినవాడు అయినందువలన ఆయన పద్యాలలో సూటిదనం, మాటల్లో పెలుసు దనం ప్రస్పుటంగా కనిపిస్తాయి.  అదే చేతివృత్తి కార్మిక కుటుంబం నుంచి వచ్చిన వీరబ్రహ్మం లో ప్రశాంతంగా ఎదుటి వారిని ఒప్పించే గుణం కనిపిస్తుంది. ఆయన‌మఠాలను స్థాపించి తన శిష్య వర్గాలద్వారా సమిష్టిగా ఆనాటి ఛాందస భావాలపైన పోరాటం చేశాడు. అంతేగాక వెనుకబడిన తరగతుల వారిని ముఖ్యంగా వృత్తిదారులను
ఏకం చేయగలిగాడు.దీనికి తన స్వీయ తాత్విక దృక్పథాన్ని ఉపయోగించడం ద్వారా
ఇది సాధ్యమైంది.
           " సత్తు చిత్తు ఒకటైతే శివుని పేరురా " అనే తత్త్వం   ద్వారా‌బ్రహ్మం అచలత్వాన్ని    ప్రచారం చేసినట్లుగా డాక్టర్ ఎన్.గోపి భావించారు
. అచలత్వం  అనేది పరమం , మనోవికల్పాలకు,సర్వ    ద్వయాలకు అతీతంగా ఉండడం.
ఇది వేద వేదాంతాలకు  అతీతంగా, మత  రహితంగా ఉంటుంది.  ఏ మాత్రం మారని
బ్రహ్మస్వరూపం,జ్ఞానం ఒకటైతే అదే శివుడు అని చెప్పడం అచలత్వంగా  చాలామంది
భావించారు.  ఈ భావన వల్లనే ఆయన విగ్రహారాధనను ఖండించాడు.
             " ఇలకు దిగిన వేళ కులం మెవ్వరికీ లేదని" కుల వైషమ్యాలపై
కత్తి  దూసినాడు.  "సర్వదేవతలను సర్వ మతాలను సమముగా నెరుగు  సజ్జనుండు"
అని చెప్పి హిందూమతంలో ఉన్న వైరుధ్యాలను ఖండించాడు. "మతము కల్పితమ్ము
మార్గ మొక్కటే  గాదా !" అని చెప్పడం ద్వారా మత వైషమ్యాలను, ఆనాడు
శైవులకు వైష్ణవులకు మధ్య ఉన్న విభేదాలను ఖండించాడు." మతం మత్తు గూర్చు
మార్గమ్ము కానరాదు/ హితము కూర్ప వలయు నెల్లరకును/ హితము కూర్ప లేని మతము
మారగవలె" అని మతం మత్తుమందన్న  మార్క్స్ చెప్పిన  భావాన్ని పదిహేడవ శతాబ్దంలోనే చెప్పడాన్ని చూస్తే ఆయనకు మతం పట్ల ఎంతటి సామాజిక అవగాహన‌ఉందో తేటతెల్లమవుతుంది.

           "సర్వ మానవులను సమముగా ప్రేమించు /కుల మతాల నెంచి కోపపడకు/
కాపు జాతినెల్ల కరుణించు మనే శ్రుతుల్/ కాళికాంబ! హంస!! కాళికాంబ!!" అని బ్రహ్మం చెప్పిన  పద్యం ద్వారా ఆయన  ఎంతటి ఆధునికుడో మనకు అర్థం అవుతుంది.  అందువల్లనే ఆయన నేటికీ సజీవంగా మన మధ్య ఉన్నాడు.  సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా  నేటి సమాజం వేమన , బ్రహ్మం గారు చెప్పిన ఆధునిక‌ భావాలను ఇంకా అందుకోలేక పోతోంది.ఇహలోకంలో యజ్ఞయాగాదులు చేసి మరణించాక
స్వర్గంలో రంభ ఊర్వశి మేనక లతో సుఖాలు పొందవచ్చని ప్రచారం చేసింది బ్రాహ్మణ మతం . వ్రతాలను, క్రతువులను  బౌద్ధం వ్యతిరేకించింది. ఆ‌ రోజుల్లో యజ్ఞాలలో  వేలాది గోవుల  రక్తం ఏరులై పారేది.  బ్రాహ్మణులు గోమాంసం తినేవారు.  దీనిని  బౌద్ధం పూర్తిగా వ్యతిరేకించి అహింసావాదాన్ని ప్రచారం చేసింది .  దాంతో శ్రామిక కులాలు బౌద్ధం లో  చేరిపోయాయి. బ్రాహ్మణ మతం చతికిలబడింది . చేసేదిలేక  యజ్ఞంలో జరిపే గోవధను ఇతర కర్మలను ఆపేసి బ్రాహ్మణులంతా బౌద్ధధర్మాలను హిందూ ధర్మాల్లోకి కలిపేశారు. అప్పుడు మళ్ళీ  హిందూ ధర్మం తిరిగి పుంజుకుంది.  అయినప్పటికీ క్రతువుల
ఫలితాలపై ఉన్న భ్రమలు ప్రజల్లో తొలగిపోలేదు.  అందుకే కే క్రతువుల గురించి‌బ్రహ్మం 
"క్రతువొనర్చ రంభ కౌగిట జేర్చునా?/చచ్చి స్వర్గమేగ మెచ్చుకొనునే
?/చావుపుట్టుకల్ అవి సహజ గుణములు/కాళికాంబ! హంస!! కాళికాంబ!!"అంటూ
క్రతువులు చేయడం సరికాదని  బోధిచాడు  ఈ పద్యం ద్వారా.

తల్లి ప్రేమ లో ఉన్న తగులదు మాలిన్య
మెల్ల భంగులను సహించు కొనును
తల్లి పదము విన్న ముల్లము రంజిల్లు
కాళికాంబ! హంస!! కాళికాంబ!!

అనే పద్యంలో తల్లి గొప్పతనాన్నికీర్తించాడు బ్రహ్మం. అంతేగాక ఆయన తనజీవితంలో స్త్రీలకు అత్యున్నత స్థానం ఇచ్చాడు.  తనభార్య‌గోవిందమ్మకు, మనవరాలు ఈశ్వరమ్మను  మఠానికి పెద్దగా ఉండమని కోరాడు.  యవ్వన‌ప్రాయంలో పరస్త్రీలను చూసి కలిగే వ్యామోహం,ఆ  కన్నులకు కప్పిన పొర పోతే‌ ఆమె తల్లిగా కనిపిస్తుందని చెప్తాడీ పద్యంలో.

        " యవ్వనము రాగ నజ్ఞానమను తెర
          కన్నులకును పొరగ కప్పి వేయు
         తెరలు పొరలు తెగిన పరనారి తల్లియౌ!".

           బ్రహ్మం గారిని ప్రజలు ఇప్పటికీ కాలజ్ఞానం చెప్పిన మహనీయుని గానే పూజిస్తున్నారు .ఆయన చెప్పిన ఆధునిక భావాలను అందుకోలేక పోతున్నారు. ఆయన స్థాయిని అందుకోలేక ఆయన్ని దేవుని స్థానంలో ఉంచేశారు .ఏది ఏమైనప్పటికీ బ్రహ్మంగారు భవిష్యత్తుకు సంబంధించిన విషయాలను తన కాలజ్ఞానంలో పొందుపరిచాడు. ఆ కాలజ్ఞానం ఎంతగా ప్రచారం పొందిందంటే ఇప్పటికీ ఏదైనా వింత జరిగితే దానిని బ్రహ్మంగారు ముందే చెప్పినారని ప్రజలు చెప్పుకుంటుంటారు.
         కృష్ణా నది ఉప్పొంగి కనకదుర్గ ముక్కుపుడక తాకుతుందని,శ్రీశైలంలో‌నంది రంకె వేస్తుందని, గాంధీ యనే పేరుగల కోమటి తెల్లవారిపై పోరాడుతాడని‌,, మక్కా మసీదులో పంది తిరుగాడుతుందని ఇలా చాలా విషయాలు ఆయన జోస్యం గా‌చెప్పినాడు.  ఇదేవిధంగా ఫ్రాన్స్ దేశంలో నోస్ట్రడేమస్ అనే జ్యోతిష్కుడు‌కాలజ్ఞానం చెప్పినాడు. కొంతమందికి ఉన్న ఊహాశక్తి తో భవిష్యత్తును తన పరిణామక్రమంలో ఊహించగల సామర్థ్యం ఉంటుంది. దీనికి మహిమలకు ఎలాంటి సంబంధం లేదు . హెచ్ జి వెల్స్ అనే రచయిత చంద్రమండలంపై కి పోవాలన్న ఆలోచన లేక ముందే ఇతర గ్రహాల శక్తులు భూమ్మీద మనుషులతో యుద్ధానికి వచ్చినట్లుగా స్టార్ వార్స్ అనే నవల రాసినారు కూడా .ఇలా కొంతమంది ఊహించి చెప్పగలరు .ఆ విధంగా బ్రహ్మంగారి చెప్పినవి కొన్ని నిజమయ్యాయి అయితే కేవలం కాలజ్ఞానం ఆధారంగా బ్రహ్మంగారి స్మరించడం సరికాదు.

        ఎన్నో ఆధునిక భావాలతో ఆనాటి సమాజాన్ని సంస్కరించడానికి పూనుకున్న వీరబ్రహ్మం దాదాపు 90 సంవత్సరాలు జీవించాడని చెప్తారు. ఆయన  క్రీ.శ.1693 లో కడప జిల్లాలోని కందిమల్లాయపల్లె లో వైశాఖ శుద్ధ దశమి ఆదివారం రోజున సజీవంగా స్వచ్ఛందంగా సమాధి అయ్యారు .ఆయన సమాధి నేటికీ అక్కడ ఉంది.

        బ్రహ్మంగారు అందించిన ఆధునిక భావాలను, ఆనాటి చాందస బ్రాహ్మణాధిపత్యాన్ని ఎదుర్కొన్న తీరును మనం ఇప్పటి తరానికి అందించడానికి కృషి
చేయాలి . నేటి సమాజానికి కమ్ముకుంటున్న మబ్బు తెరలను తొలగించడానికి ,సామాజిక వికాసానికి ఆయన మనకు అందించిన అపూర్వ సాహిత్యం  మనకు మార్గదర్శకం కాగలదు.
                                              కుమారస్వామి,9490122229                                                                                      

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు