ప్రకృతి పాడే వికాస గీతం ఉగాది
ప్రకృతి పాడే వికాస గీతం ఉగాది
తెలుగు వారి నూతన సంవత్సర ఆరంభదినం ఉగాది. జనవరి1 ని ఎలా పండుగగా జరుపుతున్నామో అలా ఉగాదినీ జరుపుతున్నాం.
తెలుగు తనం మెల్లగా తగ్గిపోతున్న వేళ
విష్ యూ హ్యాపీ ఉగాది అంటున్న వేళ
మరో విశ్వావసు వచ్చింది.
'శిశిరంలో
వాడినా, ఓడినా
వసంతం నాటికి
కొంగొత్తగా చివుళ్లెత్తే
చైతన్యమే జీవితం !'
--- అని చాటి చెపుతుంది ఈ ప్రకృతి పండుగ.
ప్రతి ఉగాది మన జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని, దానికి మనమందరం కృషి చేయాలని కోరుకుందాం.
ఉగాది వసంత రుతువు మొదలయ్యే రోజుల్లో ప్రారంభమవుతుంది. ఎక్కువ చలీ కాకుండా, ఎక్కువ ఎండా కాకుండా వాతావరణం చాలా ఆహ్లాదకరంగా వుంటుంది. చెట్లు కొత్త చిగుళ్ళు తొడిగి ప్రకృతి శోభాయమానంగా అందంగా కనువిందు చేస్తుంటుంది. కోయిల పాడే కమ్మని పాటలతో మావి చిగుళ్ళతో మనస్సు ఆనందతాండవం చేస్తుంది. తెలుగువారికి మాత్రమే సొంతమైన పద్యపఠనం, రుతుచక్రం పై శ్రవణం, కవితా గోష్టులు, కవితా గానాలు, రసఙ్ఞులను ఆనందడోలికలలో ఊపుతాయి.
ఉగాది పచ్చడి
ఉగాది పండుగలో ప్రత్యేకత ఉగాది పచ్చడి.
ఈ ఉగాది పచ్చడికున్నంత ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. మన జీవితంలోని అన్ని అనుభూతులను వివరిస్తున్న ఈ షడ్రుచులతో కూడిన పచ్చడి తినడం అందరికీ తప్పనిసరి. ఈ పచ్చడి తయారీకి ఉపయోగించే పదార్థాలకు ఉన్న లక్షణాలు కూడా ప్రత్యేకం. మిగిలిన పండుగల్లో పిండివంటలు చేసుకుంటే ఉగాది రోజున పచ్చడి చేసుకుంటాం. అది కూడా పూర్తిగా సహజంగా. అంటే, ఏవిధంగానూ వండకుండా తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారం అనే ఆరు రకాల రుచులు అందించే పదార్థాలు కలిపి పచ్చడి తయారుచేస్తాం.
ఈ రుచుల్ని కలపటంలో ఓ లెక్క ఉంది. తీపి, కారం సమానంగా కలపాలి. వీటి మోతాదుకు సగభాగం పులుపు, వగరు.వీటికి సగభాగం ఉప్పు, చేదు కలపాలి.
పచ్చడి తయారీలో ఉపయోగించే బెల్లం –తీపి - ఆనందానికి ప్రతీక. కొత్త చింతపండు –పులుపు – నేర్పుగా వ్యవహరించుటకు, వేప -చేదు -జీవితం లోని కష్టకాలాలు, పచ్చి మామిడికాయ – వగరు – జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడం, ఉప్పు – రుచికోసం – ఉత్సాహం నింపుటకు, అల్లం – సహనం కోల్పోవడం వంటి లక్షణాలను సూచిస్తాయి.
ఉగాది పచ్చడిలో ఉపయోగించే పదార్థాలన్నీ శరీరంలో సమతూకాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందింపజేస్తాయి. సంవత్సరం పొడవునా జీవితంలో ఏర్పడే కష్టనష్టాలు, సుఖసంతోషాలను సమానంగా స్వీకరించి ముందుకుసాగాలనే తాత్త్విక సందేశం ఉగాది పచ్చడిలో ఉంది.మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టం, సుఖం, బాధ, ఉత్సాహం, సవాళ్లు మొదలైన అనుభవాలకు ఈ ఉగాది పచ్చడి సంకేతం.
ఉగాది రోజున ఏ ప్రత్యేక దేవతను పూజించేది లేదు. ఇదొక రుతుచక్రం సూచించే దినం. వసంత రుతువు ఆగమనం తో కవులు హృదయాలు వెల్లి విరుస్తాయి. పురివిప్పి నాట్యం చేస్తాయి కవులు భావాలు.
ఉగాది రోజున తలస్నానం చేసి క్రొత్త దుస్తులు ధరించడం ఆనవాయితీ. ముందుగా ఉగాది పచ్చడిని సేవిస్తారు.పండగ అంటే ప్రత్యేక వంటలు అనేది సర్వసామాన్యం. ఉభయ తెలుగు రాష్ట్రాలలో కర్ణాటకలో పులిహోరా,ఓళిగలు (బొబ్బట్లు) తప్పనిసరిగా చేసుకుంటారు.ఇంటికి అలంకరణ కోసం ఇంటిముందు ముగ్గులు వేసి,గడపలకు మామిడి తోరణాలు కట్టి ఉగాది పండుగ జరుపుతారు. పండుగ మనిషి జీవితానికి ఉత్సాహాన్ని నింపే ఒక శుభప్రదమైన రోజు.
పూర్వం నారదుడు (సమాచార సంధాన కర్త) తానొక గొప్ప త్యాగిని, సన్యాసిని అని ప్రచారం చేసుకుంటూ గర్వంతో విర్ర వీగుతుండేవాడు. ఒకసారి ఒక అందగత్తెను చూసి ఆమె మోహంలో పడి ఆమెను వలచాడు. ఆమెను వివాహం చేసుకుని 60మంది పిల్లలను పుట్టించాడు. వారే.. ప్రభవ.. విభవ.. శుక్ల.. చివరగా అక్షయ. వారంతా ఒకరి తర్వాత ఒకరు మరణిస్తుండటంతో పుత్రశోకంతో ఉండిపోయాడు. సంసార సాగరంలో మునిగిపోయి అసలు తానెవరో మర్చిపోయాడు. అప్పుడు నారదుడిని కృష్ణుడు కలిశాడు. నువ్వేదో గొప్ప సన్యాసిని గొప్పలు చెప్తివి.అంతా ఉత్తదేనా?
అని అడిగాడు.అందుకు నారదుడు సిగ్గు పడ్డాడు. ఇదొక కట్టుకథ. సంవత్సరాల పేర్లు ఎలా ఏర్పడినాయన్న ప్రశ్న కు ఇదొక సమాధానం గా ప్రచారం ఉన్న ఆసక్తికర కథగా మనం దీనిని తీసుకోవచ్చు.
కాలమానం ఎప్పుడో తయారైంది. ఇది ద్రావిడులు సృష్టించుకున్నది. అందువల్లే ఈ పండుగ దేవుళ్ళతో సంబంధం లేకుండా రుతు చక్రాన్ని బట్టి దక్షిణ భారతదేశంలో, మహారాష్ట్ర లో కొంత భాగం లో జరుపుకుంటారు.తరువాత కాలంలో ఆర్యుల ద్రావిడులతో కలిశాక నారదకథలలాగా పురాణ గాధలు సృష్టించారు.తెలుగువారు – ఉగాది, మరాఠీవారు – గుదిపడ్వగా, తమిళులు – వర్షవరుప్పు, మలయాళీలు – విషు, సిక్కులు – వైశాఖీ, బెంగాలీలు – పోయ్ లా బైశాఖ్ గా ఉగాది ని జరుపుకుంటారు.
మనం ఉగాది నుండి ఏమి నేర్చుకోవాలి?
ధన,కుల,మత,వర్ణ, ప్రాంతం లాంటి ఆధిపత్యాలు లేకుండా జీవించమనే ప్రకృతి సందేశమే ఉగాది.
అప్పుడే మూఢనమ్మకాల ఉగాది కాకుండా ప్రకృతి
సహజమైన ఉగాది అవుతుంది.ప్రకృతి వాది మానవతావాది కూడ అవుతాడు.అపుడే
ప్రకృతి ని, పర్యావణంను రక్షించుకునే సంకల్పం ఏర్పడుతుంది.
ఆకులు రాలినా పోరాడి గెలవమని
నీ భవిష్యత్తు ను నీకుగా నువ్వే
దిద్దుకోమని చిగురించే చెట్టు ద్వారా చెపుతుంది ఉగాది. కుహు కుహూల
వసంతం చిగురాకుల చల్లగాలులతో ఆహ్వానిస్తూ
గతకాలపు భయాలనూ చేదు జ్ఞాపకాలనూ
మరపు కప్పగించినూతన శకానికి నాంది
పలకమంటుంది ఉగాది.
ప్రభవ నామ సంవత్సరంతో ప్రారంభమైన తెలుగు సంవత్సరాలు అక్షయతో ముగుస్తాయి.
మన తెలుగు సంవత్సరాల పేర్లు
1. ప్రభవ, 2. విభవ, 3. శుక్ల, 4. ప్రమోదూత, 5. ప్రజోత్పత్తి, 6. ఆంగీరస, 7. శ్రీముఖ, 8. భవ, 9. యువ, 10. ధాత, 11. ఈశ్వర, 12. బహుధాన్య, 13. ప్రమాధి, 14. విక్రయ, 15. వృక్ష, 16. చిత్రభాను, 17. స్వభాను, 18. తారణ, 19. పార్థివ, 20. వ్యయ, 21. సర్వజిత్, 22. సర్వధారి, 23. విరోధి, 24. వికృతి, 25. ఖర, 26. నందన, 27. విజయ, 28. జయ, 29. మన్మథ, 30. దుర్ముఖి, 31. హేవలంబి, 32. విలంబి, 33. వికారి, 34. శార్వరి, 35. ప్లవ, 36. శుభకృతు, 37. శోభకృతు, 38. క్రోధి, 39. విశ్వావసు, 40. పరాభవ, 41. ప్లవంగ, 42. కీలక, 43. సౌమ్య, 44. సాధారణ, 45. విరోధికృతు, 46. పరీధావి, 47. ప్రమాదీచ, 48. ఆనంద, 49. రాక్షస, 50. నల, 51. పింగళ, 52. కాళయుక్త, 53. సిద్ధార్థి, 54. రౌద్రి, 55. దుర్మతి, 56. దుందుబి, 57. రుధిరోద్గారి, 58. రక్తాక్షి, 59. క్రోధన, 60. అక్షయ.
__ పిళ్లా కుమారస్వామి,9490122229
ఈ కామెంట్ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమంచి ఆర్టికల్ సర్...మంచి విషయాలను తెలియజేసారు.
రిప్లయితొలగించండి