స్త్రీవాద సాహిత్యం
అరవై దశకంలో స్త్రీలు నవలలు, కథలు రాసినా స్త్రీవాద దృష్టితో ఏనాడూ రాయలేదు. స్త్రీవాద దృక్కోణంతో చలం మొదలు పెట్టిన ప్రస్థానం 1980 నాటికి స్త్రీవాద ఉద్యమంగా రూపుదిద్దుకుంది. వాస్తవానికి గురజాడ స్త్రీకోణం నుంచి ఆలోచించడం మొదలు పెట్టిన రచయిత. స్త్రీల అనుభవం, పురుషుల అనుభవం కంటే భిన్నంగా ఉంటుందని ఆయన భావించాడు. స్త్రీల ప్రశ్నలు స్త్రీ జీవితానుభవం నుంచి వస్తాయి కాబట్టి వాటిని జవాబు చెప్పగల సత్తా పురుషుడికి లేదని గురజాడ అభిప్రాయం. ఇలా స్త్రీల కోణంలో
ఆలోచించిన ప్రథమ రచయితగా గురజాడను తీసుకోవచ్చు. ఆ విధంగా తెలుగు కథానిక పుట్టడమే మహిళల జీవితాన్ని కథావస్తువుగా తీసుకొని పుట్టింది. స్త్రీవాద దృక్కోణంలో 60లలో రాసిన వాళ్ళంతా మార్క్సిస్టు దృక్పథంగలవారు.
వీరిలో ముఖ్యులు ఓల్గా. రంగనాయకమ్మ కూడా రాసిందిగాని ఆమె మార్క్సిస్టు దృక్పథాన్ని వీడలేదు.
స్త్రీవాదం ఇతర దేశాలలో పుట్టింది.
అరవై దశకంలో ఇతర దేశాల్లో వచ్చిన స్త్రీవాదం, 1980 ,90లనాటికి తెలుగు రాష్ట్రాలలోకి ప్రవేశించింది.
1949లో సిమోదబువ 'సెకండ్ సెక్స్' అనే గ్రంథం రాసింది. 1969లో మార్గరెట్ బెస్టన్ 'పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ఉమెన్' లో స్త్రీల ఇంటి చాకిరిని వెలకట్టాలని చెప్పింది. 1970లో కేట్ మిల్లెట్ 'సెక్సువల్ పాలిటిక్స్' లో స్త్రీల అణచివేతకు పితృస్వామ్యం కారణమని తేల్చింది. 1972లో జర్నైన్ గ్రీల్ రాసిన 'ద ఫిమేల్ యూనిక్' లో స్త్రీ పురుషులను సెక్స్ పదంతో కాక జెండర్ పదంతో సూచించాలన్నారు. స్త్రీ ఆడతనాన్నే కాక స్త్రీ సంబంధ పదజాలాన్నంతా ఈ పదం తెలియ జేస్తుందన్నారు.'స్త్రీకి కూడా శరీరం ఉంది. దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకు మెదడు ఉంది,
దానికి జ్ఞానం ఇవ్వాలి. ఆమెకు హృదయం ఉంది. దానికి అనుభవం ఇవ్వాలి' అంటూ చలం స్త్రీవాదాన్ని ప్రవేశపెట్టాడు.
1980లలో స్త్రీలపై జరిగే హింసలో వరకట్నచావులు ప్రముఖంగా ఉండేవి. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్లు పేల్చడం, కిరోసిన్ పోసి
నిప్పంటించడం వంటి అకృత్యాలు స్త్రీలపై జరిగేవి. ఈ సందర్భంలో స్త్రీవాదం ప్రముఖంగా ముందుకు వచ్చి సమాజాన్ని ప్రశ్నించడం మొదలు పెట్టింది.
1980లో 'శిలాలోలిత' అనే కవితా సంపుటిని
రేవతీదేవి ప్రచురించింది. 'మగకీ ఆడకీ శీలాన్ని ఆస్తినీ సమంగా వర్తింపచేయండి/ కాగితాల మీద, వేదికల మీద కాదు|| నిజంగా సమంగా వర్తింప చేయండి' అంటూ రేవతిదేవి ఆనాటి పాలకులను ప్రశ్నించింది శిలాలోలిత.
'నా మీద తరాల నుంచి మోసిన / అపనిందల పైట/ నన్ను అబలను చేసిన పితృస్వామ్యపు అదృశ్యహస్తం/ నేను నడిచే శవాన్ని కాకుండా వుండాలంటే పైట- ముందుగా పైటని తగిలెయ్యాలి' అంటూ జయప్రభ రాసింది. అదే సందర్భంలో ఆంధ్రరాష్ట్రంలో కొత్తగా యన్.టి.రామారావు నేతృత్వంలో 1983లో తెలుగుదేశం పార్టీ ఏర్పడి, ఆస్తిహక్కులో మహిళలకు సమానవాటా చట్టం తెస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చింది.
1984లో సావిత్రి రాసిన 'బందిపోట్లు' కవిత వచ్చింది. ఆరోజుల్లో పత్రికలు స్త్రీవాదాన్ని బాగా ప్రోత్సహించాయి. 'తివాచీ', సర్పపరిష్వంగం, కాల్ గర్ల్ మోనోలాగ్', వంటిల్లు, 'లేబర్ రూం' వంటి కవితలు స్త్రీలు మాత్రమే బలంగా తమ అనుభూతు లను వ్యక్తీకరించగలరని స్పష్టమైంది. స్త్రీవాదం
ఒక తాత్విక పునాదిగా ఉండటంచేత చాలా మంది మహిళలు యుగయుగాల వేదనలను, తపనను, తహతహలను బలంగా, ప్రతిభావంతంగా తమ కవితల్లో ప్రతిఫలింపజేశారు. 'గురిచూసిపాడేపాట' 'నీలిమేఘాలు' సాహిత్యలోకంలో పెనుసంచలనం సృష్టించాయి. ఆ తరువాత 'సావిత్రి', 'సందిగ్ధ సంధ్య', 'యశోధరా వగపెందుకే', 'నిర్వచనం' 'నేను కనిపించే పదం' మొదలైన స్త్రీవాద సాహిత్యంవిరివిగా వచ్చింది. స్త్రీవాదుల ఆధ్వర్యంలో 'అస్మిత' పత్రిక నడిచింది. “ఈ వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మ మహారాణి/
అయినా చివరకు వంటింటి గిన్నెలన్నిటిపై నాన్న పేరే/ మనం ఏమైనా మన అంతిమ కర్తవ్యం/ గరిట తిప్పటంగా చేసిన ఈ వంటిళ్ళను/ ధ్వంసం చేద్దాం రండి' అంటూ విమల మహిళా లోకానికి పిలుపునిచ్చింది.
ప్రపంచీకరణ, వ్యాపారధోరణులు, వస్తు వ్యామోహ ప్రభంజనం స్త్రీవాదాన్ని బలహీనం చేశాయి. పైగా దళిత స్త్రీవాదులు స్త్రీవాదం, అగ్రవర్ణాల వారికే ప్రాతినిధ్యం వహిస్తోందని ఆరోపించారు. వృద్ధుల సమస్య, పిల్లల సమస్య,
పర్యావరణ సమస్యలు ముందుకు రావటంతో స్త్రీవాదం వెనక్కుపోయింది. స్త్రీవాద కవయిత్రులు రతి, ప్రసవం, అంగప్రవేశం, వీర్యవర్షం, స్వప్న స్కలనం మొదలైన అశ్లీల పదాలు ఉపయోగించారు. దిగంబర కవుల్లాగానే వీరి కవిత్వం ప్రజాసామాన్యం లో నిలువలేక పోయింది. అయినప్పటికీ స్త్రీవాదం
కొన్ని మౌలిక ప్రశ్నలను లేవదీసింది.
స్త్రీవాదం పురుషుడు స్త్రీని దోపిడి చేస్తున్నా డని ప్రధాన అభియోగం మోపింది. స్త్రీ సెక్స్ పునరుత్పత్తిలో నిర్ణయాధికారం స్త్రీకి ఉండాలని చర్చించింది. స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం ఆశించింది. ఇవన్నీ ప్రధాన చర్చనీయాంశాలుగా
చేసింది. స్త్రీని పురుషుడు దోపిడి చేయడం లేదు పైగా స్త్రీ, పురుషులిద్దరూ పెట్టుబడిదారీ వ్యవస్థలో దోపిడి చేయబడుతున్నారు. ఇద్దరు కలిసి దోపిడికి
వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం నేడుంది. స్త్రీల సమస్యల పోరాటంలో పురుషుని సహకారం, అవసరం ఎంతో వుంది. పురుషులతో స్త్రీలు శత్రువైరుధ్యాన్ని పెంచుకోరాదు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి