ఆచార్య ఆత్రేయ
‘‘మనసు గతి ఇంతే.. మనిషి బతుకింతే
మనసున్న మనిషికి సుఖము లేదంతే’’ (ప్రేమనగర్)
2. ‘‘మనసు లేని బతుకొక నరకం
మరపులేని మనసొక నరకం’’ (సెక్రటరీ)
3. ‘‘మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు
మనసు మనసును వంచన చేస్తే కనులకెందుకో నీళ్లిచ్చాడు!’’
(ప్రేమలు-పెళ్లిల్లు)
పై ఉదాహరణల్లో మనిషికి మనసెంత ముఖ్యమో, కానీ ఆ మనసున్న మనిషి ఎంత నరకయాతన అనుభవిస్తాడో ఆత్మీయంగా, అనుభవైకవేద్యంగా చెప్పారు ఆత్రేయ. చివరి ఉదాహారణాల్లో దేవుడు మనిషికి మనసిచ్చి ఆ మానసిక మఽథనాన్ని చోద్యంగా చూస్తున్నాడనడం కళ్లు చెమ్మగిల్లే అక్షరీకరణం!
మనసెంత చంచలమైనదో, మాయలాడో- అది మనిషిని కీలుబొమ్మను చేసి ఎలా ఆడిస్తుందో విశ్లేషించిన ఆత్రేయ ఒక మనోవైజ్ఞానికవేత్తలా అనిపిస్తాడు.
‘‘కోర్కెల నెలవీవు, కూరిమి వల నీవు
ఊహల ఉయ్యాలవే మనసా, మాయల దయ్యానివే!’’ (గుప్పెడు మనసు )
అంటూ అంతుచిక్కని మనసు గురించి, అర్థం కాని దాని స్వభావం గురించి తల పట్టుకున్న ఆత్రేయ మరో సందర్భంలో మనసు నిత్యమనీ, అది జన్మజన్మల బంధమనీ భావించారు.
‘‘మనిసి పోతే మాత్రమేమి మనసు ఉంటది
మనసు తోటి మనసెపుడో కలిసిపోతది ’’(మూగ మనసులు)
‘కర్మ చేయడమే నీ వంతు, ఫలితం దైవాధీనం’ అనే భగవద్గీత వాక్యాన్ని ఆత్రేయ విశ్వసించేవారు. ఆయన కొన్ని పాటల్లో దైవం ఉనికిని ప్రశ్నించినా, ‘తానొకటి తలిస్తే.’ అనే సామెతకు కట్టుబడ్డారు. ఆ దృష్టితోనే సందర్భానుసారంగా ఆత్రేయ రాసిన-
1. ‘‘అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని
జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని’’(మురళీ కృష్ణ)
2. ‘‘తలచినదే జరిగినదా - దైవం ఎందులకు?
జరగనిదే తలచితివా - శాంతి లేదు నీకు’’ (మనసే మందిరం )
మొదలైన పాటలు తెలుగు నాట నానుడిగా, ఓదార్పుగా నేటికీ వినిపిస్తున్నాయి.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి