శ్రమజీవుల బావుటా ఎర్రజెండా పాట


         ఉదయం తూరుపు దిక్కు ఎరుపెక్కి జగతికి కొత్త కాంతిని, దేదీప్యమానమైన వెలుగును అందిస్తుంది. హరివిల్లులో ఎరువు ఇతర రంగుల్లో కలిసి ప్రకృతికి కొత్త వన్నెలను అద్దుతాయి. ఎరుపు రంగుకు తరంగ దైర్ఘ్యము (వేవ్ లెంగ్) ఎక్కువ దూరం నుంచే కనిపిస్తుంది.
            అమ్మ నుదిటి బొట్టు ఎరుపు, ఆగ్రహం ఎరుపు, సూర్యకాంతి ఎరుపు, ఎరుపు మానవ జీవితంలో ఒక అంతర్భాగం.అలాంటి ఎరుపు రంగులో మిలమిల మెరుస్తున్న ఎరవైండా శ్రామికుల ఉమ్మడి శక్తి చిహ్నంగా ప్రపంచమంతా ఎగురుతూ ఉంది.
            నిరంతరం దోపిడీ నుంచి బయటపడడానికి శ్రమజీవులకు పనిగంటలు నిర్దిష్టంగా 8 గంటలు మాత్రమే ఉండాలని కోరుతూ సాగిన పోరాటం రక్త సిక్తం అయింది. శ్రమజీవుల రక్తంతో తడిసిన జెండా ఎర్రజెండాగా లేచి నిలబడింది. "ప్రపంచ కార్మికులారా ఏకం కండి" అంటూ ప్రపంచ కార్మికులను ఉత్తేజితులను చేసింది. అందుకే శ్రామికులు ఎర్రని జెండా... వెలుగులు జెండా, వీరుల నెత్తుటితో పుట్టిన జెండా/ త్యాగాల కోటరా ఎర్రజెండా! అంటూ ఎర్రజెండా విశిష్టతను ఎలుగెత్తి చాటుతారు. ఎర్రజెండా ఎంతోమంది త్యాగజీవుల ఊపిరి. అమరవీరుల రక్తంతో తడిసింది. మాస్కో కార్మికుల నెత్తుటి మడుగులోంచి ఎర్రశిఖరమై నిల్చొని దోపిడీదారుల గుండెల్లో సింహస్వప్నమైంది. చైనా రైతుల స్వేదం జ్వలించి ఎర్రజెండాగా అజేయంగా ఎగురుతోంది. వియత్నాం, క్యూబా, వెనిజులా, నేపాల్, చిలీ, పెరూ, అర్జెంటీనా లాంటి దేశాల్లో భూమధ్య రేఖ గుండెల్లోంచి‌నక్షత్ర గోళాన్ని తాకుతూ కొత్త శక్తితో అవతరిస్తోంది. అందుకేనేమో రాంభట్ల కృష్ణమూర్తి కార్మిక వర్గాన్ని సమాయత్తం చేస్తారు రణానికిలా ....
      అదే అదే పతాక జైత్రయాత్ర సాగుతోందిరా 
     పదే పదే రణానికై నగారా మ్రోగుతోందిరా
     ధగధగ ధగ ప్రభన్... 
     పతాక సాగుతోందిరా/ 
     ధిమిధిమి ధిమి ధ్వనిన్ 
     నగారా మ్రోగుతోందిరా...
   
            దోపిడీలు లేని, దొరబాబులుండబోని సమాజం కోసం
మార్క్స్, ఎంగెల్స్ లు ఒక శాస్త్రీయ సిద్ధాంతాన్ని కార్మిక వర్గాని అందించారు. మార్క్సిజం ఏనాడు ఇలపైన వెలసెనో, ఆనాడే
మానవాళి కరుణోదయం... అంటూ తెలకపల్లి రవి మార్క్సిజం పిడివాదం కాదని, అది ఆచరణకు మార్గదర్శిగా మానవాళి
విముక్తికి సాధనంగా వర్ణిస్తాడు. 1934లోనే శ్రీ శ్రీ మహాప్రస్థానంలో ఎర్రబావుటా నిగనిగలు చూపించారు.    
               1936లో తుమ్మల వెంకట్రామయ్య తొలిసారిగా ఎగరాలి ఎగరాలి ఎర్రజెండా పాట రాశారు. ఆ తరువాత ఇంకెందరో మార్క్సిజం వెలుగులో ఆచరణదారుల్లో మరో ప్రపంచం ద్వారాలను తెరుస్తూ కొత్తలోకపు వెలుగురేఖలను ప్రపంచంలోకి తీసుకొస్తూ ఎర్రజెండా శరవేగంగా నడిచింది. సోషలిజం పురుడు పోసుకుంది. ఆది నిలబడేలోపే దాన్ని అమెరికా, వాటికన్సిటీ కలిసి కూల్చివేశాయి. అమెరికా పెత్తనం ప్రపంచమంతా పెరిగింది. చాలా దేశాలు ముక్కలయ్యాయి. తన పెట్టుబడిదారీ విస్తరణకు, మనుగడకు ప్రపంచీకరణను అమెరికా సాధనంగా చేసుకుంది. ఇరాక్ పై దాడి చేసి సద్దాం హుస్సేన్ ను బలిచేసింది. ఇరాన్ పై కక్షకట్టింది. ఆఫ్ఘనిస్తాన్ ను ధ్వంసం చేసింది. ఎర్రజెండా ఔన్నత్యాన్ని సజీవంగా నిలిపిన సోషలిస్టు దేశ పతనం ప్రపంచ దేశాల‌ శాపంగా మారింది. ముస్లిం మతోన్మాదం అంతర్జాతీయంగా పెరిగి ఉగ్రవాదంగా మారింది. అమెరికాలో డబ్ల్యూటీసీ పై దాడి చేసింది. ఇస్లామిక్ ఉగ్రవాదం, ప్రతీకార దాడులతో నాగరికతల మధ్య యుద్ధం పేరుతో విచ్చలవిడిగా యుద్ధాలు చేసింది అమెరికా. ఇదంతా నిన్నటి మాట.
          " ప్రకృతిలో మానవుడే పరమాద్భుత పరాఠాష్ట సమష్టి వ్యక్తి. మానవుని కట్టుటకే గాని విరగ్గొట్టుటకా" అన్నాడు హరీంద్రనాథ ఛటోపాధ్యాయ.శ్రమ మానవుని జీవన గానం. శ్రమజీవులు శాంతినే కోరుకుంటారు.యుద్ధాన్ని వ్యతిరేకించారు. సామ్రాజ్యవాదంపై ప్రపంచంలో చాలా దేశాల్లో నిరసనలు వెల్లువెత్తాయి.
          ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రపంచ బ్యాంకు ఆమెరికా విధానాలు అమలు చేయాలని కోరింది. బ్యాంకు అప్పులకు ఆశపడిన ప్రభుత్వాలు విద్యుత్ చార్జీలు పెంచాయి. ప్రైవేటీకరణ చేపట్టాయి. భూములను కారుచౌకగా పెట్టుబడిదారులకు కట్టబెట్టారు. వికసించిన విద్యుత్తేజంలా కార్మిక వర్గం ఈ విధానాలను ఎదుర్కొంది. భూగర్జన చేస్తూ శ్రామిక వర్గం కదం తొక్కింది. పాలకులు నిప్పులు కక్కారు, పేదల ప్రాణాలను తుపాకీ గుళ్లకు గురి చేశారు. నిరంకుశత్వంపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం ప్రభుత్వాలను పతనం చేసింది. దోపిడీకి, పీడనకు శ్రమజీవుల పోరాటం నిర్విరామం. అందువల్లనే ఎర్రజెండా గుండెల్లోన ఒదిగిన వారురా! పోరాటాల జెండాలో దాగిన వారురా! అంటూ ఆ వీరులను కీర్తిస్తూ కవి పాడతాడు.  
            సామ్రాజ్యవాదం‌ పెట్టుబడిదారీ విధానానికి చివరి అస్త్రమని చెప్పారు. లెనిన్ అయితే ఆ విధానం మనుగడకు సామ్రాజ్యవాదంతో పాటు ప్రపంచీకరణను సాధనంగా చేసుకుంది. అందుకే దాన్ని సామ్రాజ్యవాద ప్రపంచీకరణగా వర్ణించాడు ఫిడేల్ కాస్ట్రో.పెట్టుబడిదారీ విధానం తన లాభాల విస్తరణ కోసం విస్తరించి విస్తరించి తన బరువుకు తానే కూలిపోయే దశకు చేరుకుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ సంక్షోభ దశలో ఉంది. ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయింది. 2006లో సబ్ ప్రైమ్ సంక్షోభం అమెరికా ఆర్థిక వ్యవస్థ డొల్లతనాన్ని బద్దలు చేసింది. ఆ విధానాలను అనుసరిస్తున్న ఇతర సంపన్న దేశాలు అదే దారిలో నడుస్తున్నాయి. ఆఖరుకు పెట్టుబడిదారీ విధానమే చరిత్రకు చివరిదన్న వారు పెట్టుబడిదారీ విధానం విఫలమైందని సోషలిజం ప్రత్యామ్నాయమనే వాస్తవాన్ని గ్రహిస్తున్నారు. మార్క్స్ చెప్పినట్లు కమ్యూనిస్టు ప్రణాళిక ఇందుకు మార్గదర్శిగా నిలుస్తోంది.
         సోషలిజం కోసం ప్రస్థానం సాగించే ఎర్రజెండా కార్మిక వర్గ విముక్తి కోసం ఎదురు చూస్తున్నది. అయితే కార్మికవర్గ పటిమ
ఇంకా పెరగాల్సి ఉంది. ఎర్రజెండా విజయం సాధించడానికి ఇంకా కొంతకాలం ప్రయాణం సాగించాల్సి ఉంది. గతంలోకన్నా
ఇప్పుడు సోషలిజం అనివార్యత, పెట్టుబడిదారీ విధానంలోని దోపిడీ మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో
ఎర్రజెండా పిలుస్తోంది. ఇలా... ఎర్రజెండా ఎగిరింది. నింగి నేల మబ్బుల్లో నిన్ను నన్ను రమ్మంది పోరాటాల దారుల్లో...!
                అంధకారం అలుముకుంటున్న తరుణంలో, దోపిడీదారుల చీకటి రాజ్యంలో మనిషి చేస్తున్నాడు. వెలుగుకోసం పోరాటం, సమతా స్వప్నం కోసం ధారపోస్తాడు తన ఉడుకు రక్తం. అతని అవిశ్రాంత పోరాటం అధిరోహించిన అగ్నికెరటం ఎర్రజెండా, కోటిగొంతుకలు ఒక్కటైనా విప్లవ తుఫాను హెూరుల్లో ఎర్రజెండా వెలుగుల్లో సంకెళ్లు కూడా సవాళ్లు విసురుతున్నాయి. భూమి కోసం, భుక్తి కోసం కాసింత గూడు కోసం కదం తొక్కిన పేదశ్రామిక జనం రక్తతర్పణ చేసుకుంటూ పోరుబాటలో పయనిస్తోంది‌ ఎర్రజెండా ఇలా పాడుకుంటూ...

సుత్తి కొడవలి గుర్తుగా ఉన్న
ఎర్రనిజెండా
మనకున్నది జెండా
పదరా అన్నా వదపదరా అన్నా


                                __పిళ్లా విజయ్,    
                                   9490122229

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు