అనంత ప్రజల హక్కుల కోసం కలం పట్టిన ఎస్ ఎం భాష
ఎస్ ఎమ్ భాష అనగానే మానవ హక్కుల వేదిక గుర్తుకొస్తుంది. అనంతపురం ప్రజలకు తమకు ఏం కావాలో అడిగే హక్కు సాధించుకునే హక్కు ఉందని,ఆ హక్కులు ఊరకే పాలకులు ఇవ్వరని, పోరాడి సాధించుకోవాలని జిల్లాలో ఊరు వాడ ఒక్కడే తిరిగి ప్రజలను చైతన్యం చేసి ప్రజలు అంతో ఇంతో బాగుపడినప్పుడు వారి ఆనందమే తన ఆనందం గా భావించే వ్యక్తి బాష.ఆయన పూర్తి పేరు సయ్యద్ మహబూబ్ బాషా.
పుట్టింది కడప జిల్లాలోని సిద్ధవటం మండలం లోనైనా ఆయనలోని మానవీయ కోణాలు అనంతపురం జిల్లాలోని ప్రజల కోసం పనిచేయడానికి పురికొల్పాయి. సయ్యద్ ఫక్రుద్దీన్,సాదక్ బీ దంపతులకు 1 .7.1950 లో జన్మించిన ఎస్ఎం బాషా బాల్యమంతా తన తాత దగ్గర తాడిపత్రిలో గడిచింది.అక్కడే ఎస్ఎస్ఎల్సి పూర్తి చేశారు.తర్వాత బీఏ డిగ్రీ ని ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా పూర్తి చేశారు .1975లో అనంతపురం వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ గా ఉద్యోగంలో చేరడం ఆ శాఖలో సుమారు 33 సంవత్సరాలు పనిచేసి సీనియర్ అసిస్టెంట్ గా స్వచ్ఛంద పదవీవిరమణ చేసినారు.
వ్యవసాయ శాఖలో ఉద్యోగం చేస్తూ ఆ శాఖలో బాధ్యతగా ఉద్యోగాన్ని నిర్వహించేవారు. ప్రజలకు విత్తన సరఫరా చేసే విధానంపై ఒకసారి ఆ శాఖ జాయింట్ డైరెక్టర్ ద్వారా ఒక నోట్ రాసివ్వమని అడిగినప్పుడు ప్రజల సాధక బాధకాలు తెలిసిన వ్యక్తిగా ప్రజలకు విత్తనాలు ఎన్ని కావాలి, ఎప్పుడు సరఫరా చేయాలి,ఏ రకాలు ఇవ్వాలి లాంటి అంశాలతో సమగ్రంగా నివేదిక రాసి ఇచ్చారు. దాన్ని రాష్ట్ర స్థాయి సమావేశంలో ప్రవేశ పెట్టినప్పుడు అనంతపురంజిల్లా లాగా సమగ్ర నివేదిక ప్రతి ఒక్కరూ ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయ అధికారి ప్రశంసలు కురిపించిన సంఘటన ఆయన విధి నిర్వహణకు తార్కాణం గా నిలిచింది.
1972లో కమ్యూనిస్టు నాయకుడు తరిమెల నాగిరెడ్డి సభలకు హాజరైనప్పుడు ఆయన భావాలకు ఆకర్షితులై కమ్యూనిస్టు భావాల వైపు మొగ్గు చూపాడు. ఆ నేపథ్యంలో ఓ పి డి ఆర్ లో చేరి జిల్లా ప్రజల ప్రజాస్వామిక హక్కులకై పోరాటం చేశారు. 1978లో ఆ సంస్థ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు.
1980లో అనంతపురం జిల్లాకు చెందిన ముంతాజ్ బేగం తో వివాహం జరిగింది.వారికి ఇద్దరు కుమార్తెలు కలిగారు. వారిద్దరిలో ఒకరు ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు గా,మరొకరు బ్యాంకు లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు.
కదలిక ఇమామ్ ప్రారంభించిన కదలిక మాసపత్రికకు చేదోడు వాదోడుగా ఉండేవారు. దాదాపు 83 నుండి 90 వరకు దానికి సహాయ సంపాదకుడిగా అన్నీ తానై ఆ పత్రికను తీర్చి దిద్దే వారు. ఆ తర్వాత బాలగోపాల్ నాయకత్వంలో ఉన్న పౌర హక్కుల సంఘం లో ఉండి ప్రజల హక్కుల కోసం పనిచేసే వారు. దానితోవిభేదించి బాలగోపాల్ విడిగా మానవ హక్కుల వేదిక ఏర్పాటు చేసినప్పుడు దాని వ్యవస్థాపక సభ్యుడిగా ఎస్ ఎమ్ భాష ఉన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చాలా కాలం పనిచేశారు.కదలిక పత్రికలో జిల్లా లోని కరువు పరిస్థితులపై అనేక వ్యాసాలు రాస్తూ ఉండేవారు.
2003లో అనంతపురం జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు ఉద్యోగానికి సెలవు పెట్టి జిల్లా అంతటా పర్యటించాడు. ముఖ్యంగా కరువు బారిన పడి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి వారి బాధలు విని చలించిపోయిన ఆయన హృదయం ద్రవించి ఎన్నోసార్లు కన్నీరు పెట్టుకున్నారు. ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పి కరువు కరాళ నృత్యానికి భయపడి ఆత్మహత్య చేసుకోవడం సరైన పద్ధతి కాదని, ప్రభుత్వాన్ని నిలదీహసి జిల్లాకు నీళ్లు తెచ్చుకోవడమే పరిష్కారమని వారిని చైతన్యం చేశారు.ఆ సందర్భంలో అనేక విలేకరులతో సమావేశం పెట్టి పత్రికల ద్వారా ప్రజల బాధలను వెలుగులోకి తెచ్చారు.ఆ సందర్భంలో ఆయనకు ఎదురైన అనేక సంఘటనలను కదలికలో వ్యాసాలుగా రాశారు. జిల్లాలోని రచయితలను ప్రజా సంఘాలను కలిసి రైతుల ఆత్మహత్యల నివారణ కోసం, రైతుల ఆత్మస్థైర్యం కోసం, రైతు యాత్రను కూడా జరపడం వెనుక బాషా గారి కృషి గణనీయంగా ఉంది.
కదిరి ప్రాంతంలో ఓబులదేవరచెరువు ,తనకల్లు, మండలంలో పర్యటించినప్పుడు అక్కడ జన జాగృతి, రెడ్స్ సంస్థలు తగిన తోడ్పాటు ఇచ్చాయి. వారి సహకారంతో జిల్లాలోని ప్రజాస్వామిక ప్రజా సంఘాలతో కలిసి జిల్లాకు నీళ్లు కావాలన్న ప్రజాస్వామిక హక్కుల పై అనేక పోరాటాలు చేశారు.రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించాల్సి వచ్చినప్పుడు జిల్లా కరువు పరిస్థితులపై ఆయన రాసినవ్వ్యాసాలను ఆధారంగా చేసుకుని ప్రభుత్వం నిర్ణయించడం ఆయన సమగ్ర విశ్లేషణకు తార్కాణం.ఇతర ప్రజాసంఘాల తోడ్పాటుతో ఆయన చేసిన కృషి వలన జిల్లాలోని ప్రజల దయనీయ పరిస్థితులు జాతీయస్థాయిలో పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. మీడియా ఫోకస్ చేసింది. దాంతో దేశంలోని చాలా విశ్వవిద్యాలయాల్లో జిల్లాలోని రైతుల స్థితిగతులపై పరిశోధనలు సాగాయి. డిల్లీ నుండి స్వామినాథన్ ఫౌండేషన్ కూడా అధ్యయనం కోసం జిల్లా పర్యటించి యస్ ఎం బాషా దగ్గర వివరాలు సేకరించారు.
2003 నాటికి ప్రజల్లో తమ హక్కుల పట్ల చైతన్యం లేక తమఖర్మ అనుకునే పరిస్థితి ఉండేదన్నారు. గత పదేళ్ల కాలంలో ప్రజల చైతన్యంలో మార్పులు వచ్చి తమకు ఏం కావాలో అడగడం నేర్చుకున్నారు. ఇప్పుడు తమకు నీళ్ళు కావాలని కనీసం 200 టీఎంసీలు నీళ్లు ఇచ్చినా ఒక పంటకు పండించగల మన్న చైతన్యం ప్రజల్లో వచ్చిందన్నారు. ఈ చైతన్యం అనేక ప్రజా సంఘాల నిరంతర పోరాట ఫలితమే అన్నారు. నేడు చెరువులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన జగన్ ప్రభుత్వం కూడా హంద్రీనీవా పూర్తి చేసి, సమాంతర కాలువ కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇది కార్యరూపం దాల్చడానికి ప్రజలు పోరాడాలని ఆయన కోరారు.
ఆయన తాను జిల్లాలో పర్యటించి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పే సందర్భంలో వారి ఆత్మహత్యలతో కు దారితీసిన పరిస్థితులను వెలుగులోకి తెచ్చేందుకు *ఆరుగాలంకరువు* పుస్తకాన్ని ప్రచురించారు. ఆ పుస్తకం ఆనాటి రైతుల దీనగాథలను,పాలకుల నిర్లక్ష్యాన్ని కరువు పిప్పి చేసి వదిలి పెడుతున్న రైతు కుటుంబాల పరిస్థితులను కళ్లకు కట్టినట్లు వివరించారు బాషా .ఇందులో ఆయన చెప్పిన తీరు ఆయన ఆత్మను సాక్షాత్కరింపచేసింది.
ఆయన కదలిక మాస పత్రికలో రాసిన నీటి వనరుల పై అనేక వ్యాసాలను రాసినారు. వాటిని "అనంతపురం జిల్లా సాంప్రదాయక నీటివనరులు" పేరుతో ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించారు. ఈ పుస్తకం ఇప్పటికీ ఎప్పటికీ ప్రతి ఒక్కరికీ జిల్లా గురించి తెలుసుకోవాలంటే అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో చెరువులు కుంటలు రిజర్వాయర్లు వంకలు వాగులు గురించి అపారమైన సమాచారం అందించారు.
ఆయన రచనా కృషిలో భాగంగా వచ్చిన "అనంతపురం జిల్లా కరువులు, వ్యవసాయం, నీళ్లు" పుస్తకం ప్రజల ఆకాంక్షలను,జిల్లా సమగ్రాభివృద్ధికి పాలకులు చేయాల్సిన కర్తవ్యాన్ని ప్రస్ఫుటం చేస్తుంది. ఈ పుస్తకం 2017 లో వచ్చింది. ఇందులో 11 విలువైన వ్యాసాలు ఉన్నాయి. ఈ వ్యాసాలు చదివితే అనంతపురం జిల్లా స్థితిగతులు తో పాటు ప్రజల వెతలు, వాటి కారణాలు పరిష్కారాలు దొరుకుతాయి. పాలకవర్గం చదివి ఇందులో ప్రతిపాదించిన పథకాలు అమలు చేస్తే జిల్లాలో కరువు కూడా పారిపోతుంది.
ఇందులో జల్లా చారిత్రక పరిస్థితులను వివరించారు. అనంతపురం జిల్లా రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా. దీని వైశాల్యం 19135 చ.కి.మీ.గోదావరి రెండు జిల్లాలంత ఉంటుంది. ఇందులో సాగు భూమి 25 లక్షల ఎకరాలు. దీనిలో ఒక లక్షా 76 వేల ఎకరాలు నీటి పారుదల పథకాల కింద ఉంటే, 55 వేల ఎకరాలు చెరువులు కుంటల కింద సాగువుతోంది.దాదాపు 88 శాతం వర్షాధారం మీద ఆధారపడి ఉంది. జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువ.గాలులు ఎక్కువ.జీవనదులు లేవు. జిల్లాలో వర్షపాతం తక్కువ. కేవలం 550మి.మీ. మాత్రమే. జిల్లాలో సగటు ఆవిరి నష్టం 1850 మిల్లీమీటర్లు.
భూమి మీద పడిన నీరు ఆవిరై పోతుంది. జిల్లాలో ఏ మండలంలో కూడా సహజమైన నీటివనరులు లేవు.మొత్తం గ్రామాలన్నీ తాగునీటి కోసం బయటి నుంచి వచ్చే నీటి మీద ఆధారపడాల్సిందే.జిల్లాలోని రిజర్వాయర్ల సామర్థ్యం 24 టీఎంసీలు మాత్రమే. చెరువు లు కుంటలు 16టిఎంసిలు.
ఈ జిల్లా లో చారిత్రకంగా దొరికిన శిలా శాసనాల ప్రకారం ఈ ప్రాంతం మౌర్య సామ్రాజ్యంలో భాగంగా ఉండేది.బాదామి చాళుక్యులు,నోలంబ పల్లవులు పాలించారు.ఈ జిల్లాలో చిత్రమేలి అనే రైతు సంఘం కూడా వుండేది.జిల్లాలో పరిపాలించిన రాజులు చాలా చోట్ల చెరువులు తవ్వించారని శాసనాల ద్వారా తెలుస్తోంది.శాసనాల విశేషాలను ఒక వ్యాసంలో వివరణాత్మకంగా రాశారు రచయిత.చెరువుల కింద భూములు ఇనాముగా కొందరు పొందేవారు.వాళ్ళు దశబంధపద్ధతి లేదా కట్టంగొడుగు పద్ధతిలో చెరువుల మరమ్మతులు వారే చూసుకోవాలి.చెరువులు, కుంటలు కట్టించడాన్ని సప్తమి సంతానంగా పరిగణించి నట్లు క్రీ.శ.1538లోని శిలాశాసనం చెపుతోందని రచయిత వివరించారు.ఇవి గ్రామీణ జీవితాల్లో సాంస్కృతిక నాగరికత లకు కేంద్రాలుగా నిలిచాయి.
గతంలో కల్నల్ మెకంజీ ఫార్ములా ప్రకారం 300 టీఎంసీల సామర్థ్యంతో మల్లేశ్వరం వద్ధనూ, 60టిఎంసిలతో కడప జిల్లాలోని గండికోట వద్దనూ రిజర్వాయర్లను నిర్మించి
కృష్ణా నీటిని తరలించాలని ప్రణాళిక రచించారు. 1905_06 లో కర్నూలు జిల్లా సిద్ధేశ్వరం వద్ద కృష్ణా నది మీద ఆనకట్ట నిర్మించాలని కూడా ఆయన ప్రతిపాదించాడు. ఇవి అమలై ఉంటే జిల్లాకు 60 నుంచి 70 టీఎంసీలు నమ్మకంగా వచ్చేవని చెప్పాడు రచయిత.
తుంగభద్ర ఎగువ కాలువ ద్వారా 32 టీఎంసీల కేటాయించామని చెప్తున్నారు. కానీ ఇందులో వచ్చేది మాత్రం 20 tmc లు మాత్రమే. దాంట్లో కూడా ఆరు టిఎంసిలు కడప కర్నూలు కు పోతాయి. హంద్రీనీవా పథకం ఈ జిల్లాలో సాగుతోంది. రాయలసీమ జిల్లాలకు 40 టీఎంసీలు కేటాయించారు శ్రీశైలం డ్యాంలో చేరిన వరద నీటిని లిఫ్ట్ ద్వారా ఈ నీళ్ళు ఇవ్వాలన్నారు. కానీ అనంతపురం జిల్లాకు వరద నీరు ఒక టీఎంసీ నీరు కూడా రావట్లేదు.
జిల్లాలో కరువును పారద్రోలడానికి అనేక సూచనలు ఈ పుస్తకంలో పొందుపరిచారు ఎస్ ఎమ్ భాష. ఈజిల్లాకు కనీసం 200 టీఎంసీల లో వస్తే ఒక పంట అయినా రైతులు పండించుకుంటారని అంటాడు ఎస్ ఎం భాష. దీనికోసం కృష్ణా నది నీటి కేటాయింపు పునఃపంపిణీ చేయాలి. సర్కారువారు మూడు పంటలకు సరిపడా నీళ్లు తీసుకుంటున్నారు.రెండు పంటలు కూడా నోచుకోని ఈ జిల్లాకు 100 టీఎంసీల నికర జలాలు ఇవ్వడానికి సిద్ధపడాలి. తుంగభద్ర డ్యాం నుండి 50 టీఎంసీల నీరు జిల్లాకు మళ్ళించే ప్రణాళిక అమలు చేయాలి. కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాం నుంచి 30 టీఎంసీల నీరు అడిగి తీసుకోవాలి. చెరువులు కుంటల్లో పూడికలు తీయాలి. ఇలాంటి సూచనలు మరెన్నో ఈ గ్రంథంలో సమగ్రంగా వివరించారు.
అనంతపురం జిల్లాలో మానవ హక్కులు, వ్యవసాయం ,గ్రామీణ జీవనోపాదులు, కరువు, దారిద్ర్యం, సాగునీరు, తాగునీరు సమస్యలు, జలవివాదాలు మొదలైన అంశాలపై నిశితంగా అధ్యయనం చేసి వాటి పరిష్కారాలను తన వ్యాసాల ద్వారా వివిధ ప్రజా సంఘాల ద్వారా జిల్లా ప్రజల్లో చైతన్యం చేయడంలో బాషా పాత్ర ప్రశంసనీయం. ఆయన కలం ద్వారా ప్రసంగాల ద్వారా ఈ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రజలను చైతన్యవంతం చేయడానికి నిరంతరంగా కృషి చేయడానికి ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా జీవించాలని కోరుకుందాం.
__ పిళ్లా విజయ్
(జాబిలి మాసపత్రిక ఆగస్టు,2020లో ప్రచురితం)
అన్నకు అభివందనాలు.
రిప్లయితొలగించండి