అనంత సాహితీ విమర్శా వనంలో వికసించిన విమర్శాపుష్పం బి. నాగశేషు
'కొలకలూరి ఇనాక్ రచనలు - బహుజన దృక్పథం' పై సిద్ధాంత గ్రంధాన్ని రాసి డాక్టరేట్ పొందిన బి.నాగశేషు అనంతపురం జిల్లాలోని రామగిరి మండలం, గరిమేకుపల్లిలో 1-8-1976లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు
ముత్యాలప్ప, కె. లక్ష్మమ్మ. ప్రాథమిక విద్యను పుట్టిన పల్లెలోనే పూర్తిచేసి, ఇంటర్, డిగ్రీ విద్యను పావగడలో చదివారు. బెంగుళూరు విశ్వవిద్యాలయంలోఎం.ఏ. లో గోల్డ్ మెడల్ సాధించాడు. తరువాత ఇనాక్ రచనలపై పరిశోధన పూర్తిచేసి డాక్టరేట్ సాధించాడు.
'వారధి' (ఆలోచనాత్మక వ్యాసాలు) గ్రంధాన్ని 2015లో వెలువరించి సాహిత్య విమర్శాలోకంలో ఒక మంచి విమర్శా పుష్పంగా వినిపించాడు. పలు అంతర్జాతీయ సదస్సుల్లో అనేక సాహిత్య వ్యాసాలను సమర్పించారు. ఆకాశవాణి,వివిధ సంస్థలు నిర్వహించే అనేక సాహిత్య గోష్టుల్లో పాల్గొన్నాడు. పలు కవితలు రాశాడు. ఒక వైపు సాహిత్య రచన చేస్తూనే మరో వైపు 'సాహితీ స్రవంతి జిల్లా కార్యదర్శిగా కూడా అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించేవాడు
హిందూపురంలో.
వారధి గ్రంథంలో వివిధ సాహిత్యాంశాలపై విశ్లేషణాత్మక, వివరణాత్మక వ్యాసాలు రాశారు. అంతేగాక ప్రముఖ కవులు, రచయితలైన కొలుకలూరి ఇనాక్, ఓల్గా, సడ్లపల్లి చిందకరరెడ్డి, రాఘవల సాహిత్యంపై సమీక్షా
వ్యాసాలు రాశారు. వేమన, రాయలు,అన్న మయ్యల సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం చేసినారు. విద్య,భాషాసంస్కృతులు, ప్రపంచీకరణ, కార్ల్ మార్క్స్ పై విశ్లేషణా వ్యాసాలు రాసినారు.
ఓల్గా రాసిన స్వేచ్ఛ నవలను సమీక్షిస్తూ స్త్రీ, పురుషుల మధ్య జరిగే వివాహం రెండు మనసుల కలయికకు సంబంధించినదని, మనీకి సంబంధించినది కాదని అభిప్రాయ పడినాడు నాగశేషు. స్త్రీసంపాదనాపరురాలైతే స్వేచ్ఛదొరుకు తుందనేది వాస్తవం కాదని చెపుతాడు. స్త్రీ, పురుషుల మధ్య అవగాహన ఉండటం అవసరమంటాడు.సడ్లపల్లి చిదంబరరెడ్డి కార్యాచరణే ఆయన కవిత్వంగా మారిందని విశ్లేషించాడు నాగశేషు. ఆయన సహజకవిగా, ప్రకృతి ప్రేమికునిగా పేరుపొందినాడన్నారు. పెన్నమ్మ చేలగట్లు, ఏటిగట్లు, ఆప్యాయతలు, అనురాగాలు కనుమరుగై పోతున్న దృశ్యాలను తన దృశ్యప్రవాహంలో కన్నీటి ప్రవాహం చేయించాడన్నారు.
దళితులెవరు అన్న ప్రశ్నకు సమాధానంగా తరతరాలుగా అస్పృశ్యతకు గురై, విద్యా సౌకర్యాలు కరువై, ఆర్ధికంగా సామాజికంగా అణచివేతకు గురైనవాళ్లు అనే అర్థంలో దళితపదాన్ని ఉపయోగించవచ్చని కె.కె. రంగనాధాచార్యులు అన్నారన్నారు. అదే
ఇనాక్ దృష్టిలో గత మూడు వేల సంవత్సరాలుగా వివిధ మతాలలో పంచములుగా,అధములుగా ముద్రపడిన షెడ్యూల్డు కులాలకు చెందిన వారంతా దళితులుగా భావించారని నాగశేషు తన వ్యాసంలోపేర్కొన్నారు. అంతే కాకుండా తరతరాలుగా అంటరానితనానికి ఆక్రమణకు, అన్యాయాలకు, నిరాదరణకు గురై
మానధన ప్రాణాలకు భద్రత లేకుండా బతికే దీనజనులందరూ దళితులేనని నాగశేషు వ్యాఖ్యానించడం ఆయనసామాజిక స్పృహకు నిదర్శనం.
ఇనాక్ రచనలను అధ్యయనం చేసిన నాగశేషు ఏ ఇజం లేకుండా నిజాలు మాత్రమే ఇనాక్ రాసినట్లుగా గుర్తించాడు. . ప్రతి వ్యక్తికి ఏదో ఒక ఇజం (సిద్ధాంతం) ఉంటుంది. ఏ ఇజం లేకపోవడం అంటే అది తప్పనిసరిగా
పాలకవర్గానికి వత్తాసు పలికెదై ఉంటుందనే సత్యాన్ని మనం మరువరాదు. ఈ సత్యాన్ని నాగశేషు తొందరగా గ్రహిస్తే మంచిది. ఇనాక్ కవిత్వాన్ని విశ్లేషిస్తూ ఆయన నేటి తరం కవులందరికీ దారీ దీపంలాంటివాడని అభివర్ణించాడు.ఆయనను మానవతావాదిగా గుర్తించాడు.నిగ్రహంతో ఉన్న మనస్సు గొప్ప గొప్ప పనులు చేస్తుందనే సత్యాన్ని రచయిత
' మనసెరిగిన వేమన' వ్యాసంలో
ప్రస్తావించాడు. మహిళల గురించి వేమన చెప్పిన పద్యాలను విశ్లేషిస్తూ స్త్రీని ఒక వ్యక్తిగా గౌరవించాలని వేమనచెప్పాడన్నాడు. సమాజంలో గౌరవంగా బతికిన నాడు నీతిబద్ధమైన బాధ్యతగల సమాజం అవతరిస్తుందని నాగశేషు చక్కగా వివరించాడు. స్త్రీలు అన్ని రంగాల్లోనూ రాణించాలంటే పురుషులతో పాటు మహిళా సంఘాలు కృషి చేయాలని చెపుతాడు నాగశేషు.
మినీ కవిత గురించి రాస్తూ 'ఎన్ని గజాలు రాశాడన్నది కాదు/ ఎన్ని నిజాలు రాశాడన్నది ముఖ్యం' అనే ఆరుద్ర కవితను ప్రస్తావించాడు. దీనికి ఉదాహరణ గురజాడ సాహిత్యమే. గురజాడ ఎన్ని రాశాడన్న దానికన్నా ఏమి రాశాడన్న దానిపైనే వారిని యుగకర్తగా గుర్తిస్తున్నాం.
మాతృభాష గురించి రాస్తూ మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని నాగశేషు అభిప్రాయపడినాడు. ప్రజల్లో
భాషాసంస్కృతులు పట్ల చైతన్యం రావాలని ఆయన అభిలషించాడు. మాతృభాషాభివృద్ధికి ప్రభుత్వం ఇతోధిక సాయం చేయాలన్నాడు.
మాతృభాషలో బోధన, అధ్యయనం విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచుతాయని పేర్కొన్నాడు. మానవసంబంధాలు, మానవీయ లక్షణాలు మాతృభాష ద్వారా పెంపొందు తాయన్నాడు. రాబోయే తరానికి మనమిచ్చే గొప్పఆస్తి భాషేనని చెప్పడం ద్వారా మాతృభాష ఔన్నత్యాన్ని గొప్పగా కీర్తించాడు.
రచయిత సంప్రదాయవాదైతే మార్పు జరుగుతున్న సందిగ్ధ కాలంలో కొంత అయోమయానికి గురవుతాడు.
నాగశేషు విషయంలో అదే జరిగింది. సంప్రదాయం లేని జీవితం సున్నం లేని తాంబూలం లాంటిదిగా వర్ణించడానికి
అదే కారణం. మరోవైపు పాత సంస్కృతి దోపిడీ వర్గానికి అనుకూలంగా వుందనే ఇనాక్ గారి అభిప్రాయాన్ని ఏకీభవిస్తారు.ఇలా అయోమయానికి గురికాకుండా ఉండాలంటే సంప్రదాయాలన్ని సమాజానికి సరియైనవి కావని కాలానుగుణంగా మారిపోవాలని, మనం ఈ రోజు చేసేపనులే రేపటి సంప్రదాయాలుగా మారుతాయని రచయిత గుర్తిస్తే మేలు.
ప్రస్తుత సమాజం పెట్టుబడిదారీ వ్యవస్థ వైపు శరవేగంతో దూసుకుపోతోంది. ఈ వ్యవస్థలో మనిషి పరాయికరణచెందుతాడని మార్క్స్ చెప్పినాడు. అలాగే వ్యక్తిస్వామ్యం కూడా సహజంగా ఉంటుంది. వ్యక్తిగత అభివృద్ధి, వ్యక్తిగతారాధన,స్వార్ధం ఇవన్నీ వ్యక్తి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సమిష్టి ప్రయోజనం శూన్యం. సామాజిక బాధ్యత తగ్గిపోతూ వుంటుంది. కార్మికులు సమిష్టిగా ఈ వ్యవస్థను కూలదోయగలిగినప్పుడే సమాజం మారుతుందనే విశ్వాసాన్ని రచయిత
నాగశేషు వ్యక్తీకరించడం ఐక్యతపట్ల, సమాజ బాధ్యత పట్ల ఆయనకున్న నిబద్ధత అర్థమవుతుంది.
సాహిత్య విమర్శారంగంలోకి ప్రవేశించి కొత్త భావాల్ని ప్రవేశ పెట్టి పాఠకులను చైతన్యం చేయడానికి పూనుకోవడం నాగశేషు చేస్తున్న గొప్ప సాహిత్య కార్యక్రమం. త్రిపురనేని చెప్పినట్లు సాహితీ రచన కన్నా సాహిత్య విమర్శ చేయడం చాలా క్లిష్టమైన పనే . ఒక రచనలోని మంచి చెడులను వివరించడం ద్వారా పాఠకులకు కొత్త వెలుగును ప్రసరింపజేస్తాడు విమర్శకుడు.
మరింత సమర్ధవంతంగా చేయడానికి తగిన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందుకుని మరిన్ని సాహితీ, విమర్శ గ్రంథాలు నాగశేషు కలం నుండి జాలువారుతాయని ఆశిద్దాం.
(ప్రజాశక్తి దినపత్రిక లో ప్రచురితం)
__పిళ్లా విజయ్, 9490122229
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి