పరిశీలనానుభవాల కథల సంపుటి మొగల్జడ

       
          రాయలసీమలో కథలు 1882లోనే వచ్చాయని పరిశోధకులు చెపుతున్నారు. అయితే ఆధునిక కథానికఆవిర్భవించింది మాత్రం గురజాడ ' దిద్దుబాటు'తోనే అనే విషయాన్ని అందరూ ఏకీభవిస్తున్నారు.
      కథానికి అన్నా కథ అన్నా ఒకటే. వాడుకలో కథ అనే పదం వాడుతున్నారు. కథ ముడి ఖనిజమైతే,కథానిక సానబెట్టిన పత్రిమని పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి అన్నారు.
ఒక సన్నివేశం, ఒక పాత్ర, దాని మానసిక స్థితి. మూడింటి మేళవింపుతో రాసే ఇతివృత్తమే కథగావర్ణించాడు చిన్నవీరభద్రుడు. కథలో క్లుప్తత, గాఢత, నవ్యత ఉండాలంటారు తెలకపల్లి రవి. ఆసక్తితో చదివించి,
పాఠకునిలో సంస్కారాన్ని పెంచే కథను 'మంచికథ'గా నిర్వచించాడు పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి. కుప్తత, అనుభూతి ఐక్యత, సంఘర్షణ, నిర్మాణ సౌష్టవం  ఈ నాలుగు లక్షణాలు మంచి కథకు ఉంటాయన్నాడు 'వల్లంపాటి వెంకటసుబ్బయ్య'.
        కథలో సంభాషణలు, సంఘటనలు, పాత్రలు, కరుణ, శృంగారం వంటి రసా లుంటాయి. మానవ స్వభావాలు ఉంటాయి. ప్రకృతి చిత్రణ, మనస్తత్వ చిత్రణ వుంటుంది. ఇందులో రచయిత దృక్పథం అంతర్భాగంగా దాగి వుంటుంది.
       ఒక ఇతివృత్తాన్ని పాఠకులు, మనస్సుకు హత్తుకునే విధంగా కళాత్మకంగా చెప్పే విధానాన్ని శిల్పమంటారు.దీన్నే ఇంగ్లీషులో “టెక్నిక్' అంటారు. శిల్పానికి కొన్ని కొన్ని లక్షణాలు వున్నాయి. అవి కథా సంవిధానం,
పాత్రలు, నేపథ్యం, దృష్టికోణం , కథనం.వీటినే విశదీకరిస్తే
(1) కథకుడు ఎంత వరకు చెప్పాడో అంత వరకు చెప్పాలి. ప్రారంభం నుంచి చివర వరకు చెప్పే కథకు
అనుగుణంగా వుండాలి. (2) పాత్రోచితమైన మాటలు వాడాలి. ప్రాంతాన్ని బట్టి, పాత్రను బట్టి భాష మాండలికం
వుండాలి (3) పాత్ర గురించి రచయిత చెప్పడం మాని పాత్ర ద్వారా చెప్పించాలి. (4) నిత్య జీవితానికి ఎంత
దగ్గరగా వుంటే అంత మంచిది. (5) స్థలకాలాదుల్లో చెప్పాలి. నేపథ్యం చిత్రణే దానికి ప్రాణం (5) రచయిత
వ్యాఖ్యానం లేకుండా వుంటే మంచిది. (6) కథలో ఏ వాక్యాన్ని రాసినా కథ దెబ్బ తింటుందేమోనన్నట్లు వుండాలి.
(7) పాఠకుని చైతన్యపరిధి విస్తరించాలి. అంతరాంతర జ్యోతిస్యముల్ని బహిర్గతం చేయాలి.
       కథలో జీవితం ఉంటుంది. జీవితం పట్ల అవగాహన ఉంటుంది. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ 'సాయం సంధ్య ఎంత ఆహ్లాదంగా వుంది, కాసేపు అలా నడుస్తూ వెళ్లి పోటల్ లో కాఫీ తాగుదాం రా' అంటే అది
కవిత్వమవుతంది. ఆ ఇద్దరూ కూర్చొని " ఏమిటి విశేషాలు' అంటూ మాట్లాడితే అదొక కథ అవుతుంది. ఇంకాఏంటి విశేషాలు' అంటే అదొక నవల అవుతుందని ఒక రచయిత అన్నాడు.
       రాయలసీమలోని అనంతపురం జిల్లా నుంచి మంచి కథకులు రావాలని ఆంధ్రప్రదేశ్ ఎదురుచూస్తోంది.ఇప్పటికే జిల్లాలో ప్రసిద్ధులైన సింగమనేని, బండి నారాయణస్వామి, చిలుకూరి దేవపుత్ర, శాంతినారాయణ,
శశికళ, నిర్మలారాణి, మొదలైనవారు వచ్చారు. వారి కోవలో బాలకొండ ఆంజనేయులు ఒకరు.
'మొగ్గల్జడ' కథా సంపుటిని తీసుకొచ్చిన బాలకొండ ఆంజనేయులు పోలీసుశాఖలో పనిచేస్తూ, తన గ్రామీణ జీవిత నేపథ్యంలో వచ్చిన అనుభవాలను, పరిశీలించిన సత్యాలను, తన కథల్లో పొందుపరిచారు.
ఇందులో వున్న 14 కథల్లో బాలకార్మికుల, దళితుల, రైతుల వ్యదార్థ జీవితాల, విచ్ఛినమవుతున్న కుటుంబాల,మహిళల సామాజిక పరిస్థితుల గురించి వుంది. రచయితలో సమాజంలోని మానవసంబంధా లను, మనస్తత్వాలను పట్టుకొని, వాటిని కథల్లో చెప్పే నేర్పు వుంది. బాల్యంలోకి పరకాయప్రవేశం చేసే శక్తి వుంది. ఇతని హృదయం చిగురాకు లాంటి లేత హృదయంగా కనిపిస్తుంది ఈ కథలను చదివితే.కథలను రాసేవారు కథలను ఎలా రాయాలో నేర్చుకోవాలంటే కథలను చదవాలి. కథలను సకలు కొట్టిరాయడం ఒక పద్ధతి. స్వీయ అనుభవాన్ని కల్పనతో రాయడం మరో పద్ధతి. తాము నమ్మిన జీవన సత్యాలను కథల్లో నిర్మిస్తారు.ఇవన్నీ మన సామాజిక చరిత్రల నిర్మాణానికి, చలనానికి దోహదం చేస్తాయి.
       కథ ఎలా రాస్తారని అడిగితే చాలా మంది పలు రకాలుగా చెప్పినారు. తామెక్కడా కథలు వర్కుషాపుల్లో నేర్చుకోలేదంటారు. కొత్త కథకులు తమ కథల్ని రాసే ముందర 'మొగ్గల్జడ' చదవమని సలహా ఇస్తాను. ఎందుకంటే ఇవన్నీ నేలవిడిచి సాము చేసిన కథలు కావు. ఇందులోని పాత్రలు మన కళ్లెదుట కనబడే మనుషులే. మనుషుల
మధ్య వుండే రాగద్వేషాలను చక్కగా చిత్రీకరించారు.
       మొగ్గల్జడ కథలో అలివేలు ఒక బాల కార్మికురాలు. ఆ అమ్మాయి శాంతమ్మ ఇంట్లో పనిచే మనిషిగా పనిచేస్తూ వుంటుంది. శాంతమ్మ బర్త ఒక వకీలు, శాంతమ్మ కూతురు శిల్ప  వేసుకునే మొగ్గల్జడ లాగా తాను వేసుకోవాలనిఉబలాటపడుతుంది అలివేలు. పండుగకు పల్లెకు పోయినప్పుడు అమ్మతో మొగల్జడ వేయించుకోవాలనుకుంటుంది.
తీరాబయలుదేరే సమయానికి యజమాని శాంతమ్మ అలివేలు జుట్టు చింపిరిగా వుందని గుండు గీయిస్తుంది. ఆమెకుఎదురు చెప్పలేక బాధతో అప్పుడే వచ్చిన నాన్న దగ్గరకు పోయి ఏడుస్తుంది. ఈ కథలో బాలకార్మికుల పసిహృదయాల్లో వున్న వేదననే కాక బాల్యంలో బాలలు ఏర్పరచుకొనే కోరికలు, వాటిని పెద్దలు ఎలా తుంచి వేస్తుంటారో చెప్పే కథ ఇది.
      ముళ్ళదారి కథలో కరువు నేపథ్యముంది. శివయ్య ఒక మధ్యతరగతికి చెందినవాడు. పంట చేతికి రాక సతమతమవుతున్న శివయ్యకు పుల్లన్న సలహా నచ్చుతుంది. అదేమంటే చేను చుట్టు వుండే కంపకట్టెలు కొట్టుకొని అనంతపురం టౌనులో అమ్మడం. ఎన్నోసార్లుపంటనమ్మినోడు కట్టెలనమ్ముతాడు. ' పూలనమ్మిన చోట కట్టెలమ్మడం' ఇందులో కనిపిస్తుంది.
        'తప్పెట' కథ ఒక నిరుద్యోగి కథ. వెంకటేశులు డిగ్రీ వరకు చదువుకున్నా ఉద్యోగం రాక కుటుంబపరిస్థితిని చూస్తూ నిస్సహాయంగా ఉన్న నిరుద్యోగి. 'దేవుడు లేనివాళ్లు, ఉన్నవాళ్లు తారతమ్యాలు ఎందుకు సృష్టించాడో"అని ప్రశ్నిస్తాడు. ఇక్కడ రచయిత ప్రశ్నించడం వరకే ఆగిపోయాడు. దానికి సమాధానం ఎక్కడా మరో పాత్ర ద్వారా
చెప్పించడు. ఇక్కడ రచయిత దృక్పథం బయటపడుతుంది. వాస్తవికంగా చిత్రించాలి కానీ రచయిత జోక్యం చేసుకోరాదు
అని అనుకుంటారు. కళాత్మకంగా చిత్రీకరించడమంటే పాఠకున్ని చైతన్యపరిధిని పెంచకుండా వుండే కథ టైంపాస్ కథ అవుతుంది. ఇక్కడే రచయితకు సామాజిక దృక్పథం వుండాల్సిన అవసరమనిపిస్తుంది. వెంకటేశులు తిరుపతికి పోవడానికి కావాల్సిన వందరూపాయల కోసం తన కులవృత్తిగా వున్న " తప్పెట' పనిని చేస్తాడు. ఉద్యోగం వస్తుందా
రాదా అని ఎదురుచూస్తాడు. రచయితకు మార్కిస్టు దృక్పథం వుంటే కథనం మరోలా రాసి వుండేవాడు. ఈ చైతన్యం
స్వతహాగా రావడం కష్టం. అయితే దాని అధ్యయనం పరిశీలన ద్వారా నేర్చుకోవచ్చు.
      ఇందులోని కథలన్ని 90లలో వచ్చినవి. చివరి కథ 'కోనేరులో పూచిన తామర" తప్ప. ఒక కథ గల్పిక. గల్పిక అంటే వ్యంగాత్మకంగా చెప్పే ముగింపులేని చిన్న కథ.ఇదొక కథ కాని కథ.
        విశాలమైన రోడ్లు, భవనాలతో అనేక కాలనీలు ఏర్పడి వుంటాయి. దాంట్లో నివసించే మనుషుల మనసులు మాత్రం ఇంకోరకంగా మారిపోతాయని తెలిపే కథ 'విశాలమైన ఇరుకు కథ'. సమాజంలో ఆర్థిక వనరులు పెరిగే
కొద్ది అంతరాలు పెరిగి కుల,మత వ్యత్యాసాలు పెరిగి మనుషుల మధ్య దూరమవుతున్న సామాజిక సంక్షోభ పరిస్థితికి  అద్దం పడుతుంది. ఈ కథ 2000లో వచ్చింది. ప్రపంచీకరణ ప్రభావం అప్పటికే ప్రారంభమైంది. ఈ రోజుల్లో పల్లెలకూ ప్రాకింది. పల్లెల్లో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది.
     బాలకొండయ్య కథ సన్మానం కథ. బహుశా రచయితేనేమో ! ఇది నేటికీ సజీవంగా వుంది. బాలకొండయ్య కవిత్వం రాసి సన్మానం పొందుతాడు. కాని తల్లిదండ్రులు అవన్నీ తెలుసుకున్నా బాలకొండయ్య చేసిన పుస్తకాల
ఖర్చు 'వేస్టు ఖర్చు' గా జమచేస్తారు. 'పనికి మాలిన్నాకొడుకు'గా కీర్తిస్తారు. నాలుగుదుడ్లు వేనకేసుకుంటేనే ఎవరన్నామాట్లాడిచ్చేది' అంటారు. 'మనిషి బతకడానికి ఎంత డబ్బు కావాలో, నీటి బుడగలాంటి ఈ జీవితం నిలవటానికి వెల్లువలాంటి ధనం అవసరమా?' అన్న ప్రశ్నతో ముగిసే ఈ కథ, టాల్ స్టాయ్ రాసిన “ ఎంత నేల కావాలి ?” కథను గుర్తుకు
తెస్తుంది.
     'మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు' అనే పాటలో మానవ సంబంధాలు విచ్ఛినత గురించి కవి పడేఆవేదన తెలుస్తుంది. ఉగాది ఉషస్సు కథలో కుటుంబంలో తల్లి మారెక్క పట్ల కొడుకుల తీరు ఈ పతనమవుతున్న
'మానవ సంబంధాలకు అద్దం పడుతుంది.
'మూడు ముళ్లు, ఒక గల్పిక' వరకట్నం సమస్యపై రాసిన కథ. ప్రతి ఆడపిల్ల తండ్రి పడే ఆవేదన ఇందులోకనిపిస్తుంది. దీనిని పొడిగిస్తే, మరో పెద్ద కథ తయారవుతుంది. రాజారావుకు సకాలంలో డబ్బు చేతికి అందక కూతురు పెళ్లి ఆగిపోతుంది. ఆ పెళ్లి పూర్తి కావాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు అందదు. అతను విసురుగా విసరిన గడియారం ముక్కలైనట్లు అతని హృదయం ముక్కలైందని ప్రతీకాత్మకంగా చెపుతాడు. ఇందులో రచయిత దీనికి
పరిష్కారం కాని, దీనికి కారణాలు గాని ఎక్కడా చెప్పకపోవడం శోచనీయం.
      'కడవసగినం' కథ మూఢనమ్మకాలపై ఒక వ్యంగ్యాస్త్రం.'నిప్పుకు చెదలు' కథ కుటుంబంలో భార్య భర్తల మధ్య వచ్చే అపార్థం కథ ఇది. తాను వేసక్టమీ చేయించు కున్నా భార్య గర్భవతి అని పరీక్షల్లో తేలుతుంది. దాంతో అతనికి అనుమానం వస్తుంది. కానీ జరిగింది తెలుసుకుని భర్త సిగ్గుపడతాడు. గర్భం దాల్చిన పని మనిషి తన మూత్రాన్ని ఒలికిపోయిన సీసాలో ఇవ్వడంతో ఈ చిక్కు ఏర్పడుతుంది. ఇదొక సస్పెన్స్
కథ,
        బ్రతుకు బండి కథలో కుటుంబ సభ్యుల విచ్ఛిన్నత వుంది. దీనిని 94లో రాశారు. విడిపోవడం సాధారణమై పోతున్న సంధి దశలో వున్న కాలంలో వచ్చింది. అదే నేడు సాధారణమైంది. అప్పుల్లో వున్న వెంకటరెడ్డి కొడుకులు ఎవరికి వారు విడిపోవాలను కున్నారు. అందుకు పెద్దమనుషులు కూడా తోడై విడగొడతారు ఆస్తుల్ని పంచడంతో, ఉ
మ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమవడం నేటి వ్యవస్థ లక్షణం. ఆఖరుకు అంబానీ కుటుంబాలు కూడా విడిపోయాయి. ఇప్పుడు కుటుంబం కూడా విచ్ఛిన్నమవుతున్న పరిస్థితి పెరిగింది. భార్యభర్తలు విడిపోవడం కూడా సాధారణమైపోతోంది.ఒంటరి పురుషులు,ఒంటరి మహిళలు పెరిగారు.
వ్యక్తిస్వామ్యం పెరిగేకొద్ది ఇలాంటి లక్షణాలు వస్తాయి. సమిష్టితత్వం బలహీనపడుతోంది.
         తప్పెవరిది ? కథలో మద్యం వల్ల మహిళలపై జరిగే ఆఘాయిత్యాలను ఎత్తిచూపింది. పోలీసుల నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుంది. ఆమె చావుకు కారకులెవరన్న ప్రశ్న సమాజాన్ని, పాఠకుల్ని నిలదీస్తుంది.
          చెరువుకట్ట కథ 'ముసలమ్మ మరణం' కథలాంటిది. కొండమ్మ చెరువు కట్టను తెగొట్టడాన్ని వ్యతిరేకించి రక్షిస్తుంది. ఆమె నిస్వార్థం, త్యాగం ఇందులో కనిపిస్తాయి. మనిషి మనిషిగా నిలబడుతున్న తీరును రచయిత ఈ కథలో తీర్చిదిద్దాడు.
      "కోనేరులో పూచిన తామర' కథలో వ్యవస్థ ఏర్పరచిన కులాల అడ్డుగోడల్ని గురించి ఉంది. అగ్రకుల ఆధిపత్యభావం వదిలించుకోవడంతో ముగుస్తుంది. నేటికీ కనువిప్పు కలిగించే కథ ఇది.
      కథల్లో సామాజిక సంఘర్షణ వుంది. అనేక సామెతలున్నాయి. మాండలికాలు వున్నాయి. 'నారు పోసిన వాడు నీరు పోయకుండా వుంటాడా' , 'కొనబోతే కొరివి అమ్మబోతే అడవి' అన్నట్లుంది. 'పూలమ్మిన చోటే కట్టెలమ్మడం',
అలాగే 'జేతి మీద కూర్చొని, పిల్లోడు యాప్పుల్ల పట్టుకొని నీళ్లు యాడ పడేది కరెట్టుగా చెప్పతాడంట అన్నా','భలేవాడివే మామా ఆ పాపన్న మాటింటావా' ఇలాంటి మాండలికాలు ఉన్నాయి.
        బాలకొండ తన చుట్టూ వున్న జీవితాన్ని స్వీయ అనుభవాలను, ప్రాంతాన్ని, ప్రేమిస్తూ సామెతలను, పలుకుళ్లను బాగా ఉపయోగిస్తూ తన 'మొగ్గల్జడ' కథా సంపుటిని పాఠకుల ముందుంచారు.

(జులై 2020జాబిలి మాసపత్రికలో ప్రచురితం)

_పిళ్లా విజయ్.సెల్ : 9490122229

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు