అభ్యుదయ సాహిత్యోద్యమం




అభ్యుదయ సాహిత్యోద్యమం

               1930లో యూరప్ లో వచ్చిన ఆర్ధిక సంక్షోభంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అదే సందర్భంలో ఆంగ్ల కవిత్వంలో లెఫ్ట్ వింగర్స్ బయలుదేరారు.న్యూసిగ్నేచర్స్ (కొత్త సంతకాలు) పేరుతో కవితా సంపుటిని ఆడేన్, స్టీఫెన్
స్పెండర్, డేలూయిస్ మొదలైన కవులు ప్రచురించారు. అదే సంవత్సరంలోనే జర్మనీలో హిట్లరు, ఇటలీలో ముస్సోలినీల ఫానీజమనే పెనుభూతం విజృంభించింది.
            ఫాసిజం సంస్కృతి నుంచి ప్రపంచాన్ని రక్షించాలని రోమారోలా, వెల్స్, థామస్ మూర్, మాక్సింగొర్కీ వంటి రచయితలు 1935లో ప్యారిస్ లో ఒక మహాసభ జరిపారు. ఆ సభకు మనదేశం నుండి సజ్జద్ జహీర్, ముల్క్ రాజ్ ఆనంద్, ప్రమోద్ సేన్ గుప్తా మొదలైన రచయితలు పాల్గొన్నారు. వీరు ఇండియాకు వచ్చిన తరువాత అదే సంవత్సరం డిసెంబరులో 'ఇండియన్ ప్రోగ్రెసివ్ రైటర్స్
అసోసియేషన్' ను అలహాబాద్లో ఏర్పరిచారు.
ఆ మరుసటి సంవత్సరంలోనే ప్రేమ్ చంద్ అధ్యక్షతన అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం ప్రథమ మహాసభ జరిగింది. ఈ సభకు మన తెలుగు రచయిత అబ్బూరి  రామకృష్ణారావు హాజరయ్యారు.
            జీవితాన్ని విమర్శించేదే సాహిత్యమని ఆ మహాసభ చెప్పింది. జీవితాన్ని వ్యాఖ్యానించాలి. భాష్యం చెప్పాలి. మానవుడి ఔన్నత్యానికి, దివ్యతకు అవరోధంగా ఉన్న వాటిని ఎదుర్కోవాలి. దళితుల, పీడితుల పక్షం వహించాలి అని ఆనాటి రచయితల సంఘం చెప్పింది.
         అబ్బూరి రామకృష్ణారావు విశాఖ వచ్చాక, శ్రీశ్రీ
పురిపండా అప్పలస్వామి వంటి యువ రచయిత లను కలుపుకొని ఆంధ్ర వర్ధమాన లేఖిని సంఘంను ఏర్పరిచాడు.
         శ్రీశ్రీ తన భావకవిత్వం నుంచి అభ్యుదయ కవిత్వంలోకి మారినాడు. మహాప్రస్థాన గేయం రచించాడు. శ్రీశ్రీ తన కవిత్వంలో మానవుడే నా సంగీతం, మానవుడే నా సందేశం' అని మనిషి కేంద్రంగా తన కవిత్వాన్ని రచించాడు. కవిత్వానికి ఒక వూపును తెచ్చాడు. ప్రపంచాన్ని కదిలించే కవిత్వాన్ని ఆవిష్కరించాడు.
నా ఆకాశాలను
లోకానికి చేరువుగా
నా ఆదర్శాలను
సోదరులంతా పంచుకునే
వెలుగుల రవ్వల జడిగా'
కావాలని శ్రీశ్రీ రాసిన కవిత్వం నేటికీ ప్రజల గుండెల్లో మార్మోగుతోంది.  గురజాడ వేసిన బాటను తాను విశాలం చేశానని వినమ్రంగా శ్రీశ్రీ చెప్పుకున్నారు.
           1936లోనే గుంటూరులో నవ్యసాహిత్య పరిషత్ ఏర్పడింది. ప్రతిభ అనే పత్రిక నడిపింది. గురుభాగవతుల ధర్మారావు, పంచాగ్నుల
ఆదినారాయణ శాస్త్రి, చిలుకూరు నారాయణరావు దీనిని స్థాపించారు. దీని జీవిత కాలం 5 సంవత్సరాలు మాత్రమే.
          1943 ఫిబ్రవరిలో తెనాలిలో తాపీ ధర్మారావు అధ్యక్షతన అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఏర్పడింది. సర్వతోముఖా భివృద్ధి, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత, శాంతి, అరసం తన మార్గాలుగా నిర్ణయించుకుంది.
            ఆకలి, దరిద్రం, అవిద్య, బానిసత్వం, వర్గభేదాలు పోయి నూతన సామాజికవ్యవస్థ
రావాలి అన్న లక్ష్యాన్ని పెట్టుకుంది.సామ్రాజ్య వాదాన్ని వ్యతిరేకించింది. దీనితో పాటే ప్రజానాట్యమండలి ఏర్పడి అనేక నాటికలను
ప్రదర్శించింది. సుంకర వాసిరెడ్డి గార్లు రచించిన 'ముందడుగు', 'మా భూమి' నాటకాలను ప్రదర్శిస్తూ ఆంధ్రదేశంలో ప్రఖ్యాతిగాంచింది. 'మా భూమి' నాటకం ఇస్తున్న చైతన్యానికి భయపడి ఆనాటి కాంగ్రెసు ప్రభుత్వం దాన్ని నిషేధించింది.
            అరసం ప్రభావంతో అభ్యుదయ రచనలు విరివిగా వచ్చాయి. శ్రీశ్రీ 'మహాప్రస్థానం' ఆరుద్ర 'త్వమేవాహం', సోమసుందర్ 'వజ్రాయుధం' రమణారెడ్డి 'అడవి', గంగనేని 'ఉదయిని' మొదలగు కవితా సంపుటాలు వచ్చాయి. మగ్దూమ్ మొహియుద్దీన్ హైదరాబాద్ రాజ్యంలో సాహితీ ఉద్యమాన్ని నడిపాడు. ' రైతుకు రొట్టెనివ్వని పొలమెందుకు, కాల్చేయండి ప్రతి గోధుమకంకిని' అనే ఇక్బాల్ కవితను నినదించేవాడు. అక్తర్ హుస్సేన్ రాయ్ పురి, సిట్తెహసన్లతో కలసి హైదరాబాద్ లో అభ్యుదయ రచయితల సంఘం స్థాపించాడు. సరోజినీ నాయుడు నివాసమైన గోల్డెన్ త్రిషోల్డ్ లో డా||జయసూర్య, జె.వి. నరసింగరావు లతో కలిసి సాహిత్య సామాజిక రాజకీయ అంశాలపై చర్చలు జరుపుతుండేవాడు. 1944లో సుర్జ సువేరా (అరుణోదయం) రాశాడు. 1944-51మధ్యకాలంలో తెలంగాణ అనే కవిత రాశాడు. అభ్యుదయ సాహిత్య ఉద్యమం ప్రభావంతో ఆయన రాసిన గీతం అంతర్జాతీయ గీతంగా ప్రసిద్ధి పొందింది.

      సారాసంసార్ హమారా హై | పూరబ్, పశ్చిమ్, ఉత్తర్,దక్కన్ /హం అమెరీకి, హం అప్రంగి/హం చీనీ జాంబాజానె వతన్ "
(ఇది స్వాతంత్ర్య సమరం, మేము అమెరికన్లం, మేముఆఫ్రికన్లం, చైనీయులం ప్రపంచమంతా మేమే, ప్రపంచమంతా మాది). అలా మగ్దూమ్ కవిత్వం తెలంగాణ సాయుధ పోరాట సమయంలో
జాతీయోద్యమ కాలంలో అభ్యుదయ సాహిత్యంలో భాగంగా వచ్చింది.
              1946-51 మధ్యకాలంలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన జరిగిన తెలంగాణా రైతాంగ ఉద్యమం తెలుగు సాహిత్యానికి గొప్ప ఊతా న్నిచ్చింది.
             ఆరుద్ర 'త్వమేవాహం' కుందుర్తి 'తెలంగాణా' లు ఆవంత్స సోమసుందర్ 'వజ్రాయుధం' ఈ పోరాటాల ప్రభావంగా వచ్చాయి.
           'నైలు నదీ నాగరికతలో | సామాన్యుని జీవనమెట్టిది /తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు, అంటూ శ్రామికవర్గ సందేశాన్ని
శ్రీశ్రీ తన 'దేశచరిత్రలు'లో వినిపించాడు.
             శ్రీరంగం నారాయణబాబు 'రుధిరజ్యోతి' కవితలను రాశాడు. 'రక్తపతాకం/ శక్తినాలుక అగ్నికిరీటం / ఆకాశమున మునిమాపు/ కేకలు వేస్తూ పిలిచింది ” అంటూ నారాయణబాబు 'సామిదేని' కవితలో రష్యా పిలుపునువర్ణించాడు.
'ఫిడేలు రాగాల డజన్' సంపుటిని పఠాభి వెలువరించాడు. 'నా వచనపద్యాలనే దుడ్డుకర్రతో | పద్యాలనడుముల్ విరగదంతాను/ చిన్నయసూరి
బాలవ్యాకరణాన్ని చాలదండిస్తాను' అని రాశాడు.
'ముసలి నక్కకు రాచరికమ్ముదక్కునే' అని దాశరథి నిజాంను ఎదిరించి జైలుకెళ్లాడు. 'మా నిజాం రాజు జన్మజన్మల బూజు' అనిఅన్నాడు. 'తెలంగాణమున గట్టి పోచయును సంధించెన్ కృపాణమ్ము' అంటూ ప్రజల తిరుగుబాటును వర్ణించాడు.'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని చాటాడు.
         'నవ యుగంబున నాజీవృత్తుల | నగ్న నృత్య మింకెన్నాళ్ళు పోలీసు అండను దౌర్జన్యశక్తులు / పోషణ బొందే కాళోజీ దెన్నాళ్ళు' అని 'నా గొడవ'లో 'కాళోజీ' ప్రజాగొంతుక వినిపించారు.
         ఫాసిజంపై పోరాట దశలో మొదలైన సాహిత్యం నుంచి స్వాతంత్ర్యోద్యమం వరకు వచ్చిన సాహిత్యమంతా భావకవిత్వంపై యువకవుల తిరుగుబాటు కాలంగా మనం గుర్తించవచ్చు. ఈ కాలంలోనే రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. ఫాసిజం కూడా ఓడిపోయింది. మనకు స్వరాజ్యం వచ్చింది. అభ్యుదయ సాహిత్యం గ్రాంధిక భాషకు శాశ్వతంగా ఉద్వాసన చెప్పి వాడుక భాషను సాహిత్యంలోకి తీసుకువచ్చింది. అనేక చారిత్రక
సందర్భాలను అక్షర బద్ధం చేసింది. ఉద్యమాలకు సాహిత్యం ఊపిరిలూదింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు