రామాయణ మహాభారతాలలో మానవతా విలువలు


రామాయణం, మహాభారతాలలో మానవతా విలువలు
             పిళ్లా కుమారస్వామి, 9490122229
          
          మానవతా విలువలు మానవుని మనుగడకు సమాజంలో సరైన ప్రవర్తనకు సమాజం సుఖశాంతులతో ఉండటానికి
అవసరం. ఒక వ్యక్తి సమాజంలో ఇతరులతో వ్యవహరించేటప్పుడు ఆ వ్యక్తి నడతకు మార్గదర్శకాలుగా వున్న వాటినేమానవతా విలువలు అంటారు. ఇతరులను గౌరవించడం, ప్రేమ కలిగి వుండటం, నిజాయితీగా ఉండటం, నమ్మకమైనవిశ్వాసపాత్రునిగా వుండటం, శాంతి సుహృద్భావాలతో వుండటం ఇలాంటివన్నీ మానవతా విలువలు. ఈ విలువలు కలిగిన వ్యక్తి సమాజంలో రాణిస్తాడు. సమాజం పరిఢవిల్లడానికి దోహదపడతాడు. అయితే ఇవి వ్యక్తి పుట్టుకతో రావు. కుటుంబం, సమాజం, పాఠశాల ఇవన్నీ నేర్పిస్తాయి. ఇందుకు మన వారసత్వ సాహిత్యం దోహదపడుతుంది.
          మానవతా విలువలన్నవి ఆధునిక భావన.  ప్రాచీన కాలంలో మానవతా విలువలు లేవు. అయితే భారతీయ సమాజాన్ని చాలా కాలం నుండి ప్రభావితం చేస్తున్నవి మహాభారత, రామాయణ కావ్యాలు. వీటిల్లోనున్న కథల ద్వారా మనం అనేక మానవతా విలువలు నేర్చుకుంటున్నాం.   ప్రాచీన కాలంలో మధ్యయుగాలలో రాజరికపు వ్యవస్థలున్న కాలంలో మన మిప్పుడు
భావిస్తున్న మానవీయ గుణాలు లేవు. అందువల్ల మానవతా విలువలను అందులో నుంచి గ్రహించాలంటే వాటిని భిన్న
దృక్పథంతో చూడాలి.
          
బౌద్ధ జాతక కథలు మానవతా విలువలను బోధించాయి.  మహాభారతం,రామాయణ     కావ్యాలు నేరుగా ఎలాంటి మానవతా విలువలను బోధించలేదు. మహాభారత, రామాయణ కావ్యాలలో ప్రసిద్ధ పాత్రల ప్రవర్తన ద్వారా మనం మానవతా విలువలను గ్రహించాలి.పైగా పునర్ మూల్యాంకనం చేసినప్పుడు ఆ కథా కావ్యాలు నేటి సమాజానికి సరిపోవు.అయినప్పటికీ రామాయణం,మహాభారత కథల నుండి నేటి సమాజానికనువైన మానవతా విలువలను గుర్తించి వెలికి తీయాలి.
         రామాయణమైనా, మహాభారతమైనా వాటిల్లో మనుషులున్నారు. మానవ సంబంధాలున్నాయి. ఆ మానవుల్లో
బలహీనతలున్నాయి. అనేక బలాలున్నాయి. మానవ సంబంధాలున్నప్పుడు మానవ విలువలుంటాయి. ఇవి ఆయాకాలాలను బట్టి మారుతుంటాయి. ఏవి స్థిరంగా పుండవు. నేటి సమాజానికి ఆనువైన మానవతా విలువలైన పరస్పర నమ్మకం, ప్రేమ, శాంతి, సహనం, నిజాయితీ, అంతర్ బాహిర్ రుజుప్రవర్తన మొదలైన అంశాల దృష్ట్యా వాటిని
పరిశీలించాలి. అందులో వారి ప్రవర్తనల ద్వారా మానవతా విలువలను నేటి సమాజం స్వీకరించాలి. మానవతా విలువలు ఆనాటికి నేటికి చాలా మారాయి. మనసమాజం కూడా మారింది. నేడు ఆధునిక సమాజం కొన్ని మానవతా విలువలను గుర్తించింది. వాటి వెలుగులో ఈ కథా కావ్యాలను పరిశీలిద్దాం.
          రామాయణంలో రాముని పాత్ర విశిష్టమైనది. భారతీయ సమాజం రాముని దేవునిగా కీర్తించింది. రాముడు తండ్రి మాట జవదాటడు. తన మాటకు కట్టుబడి వుంటాడు. తనను ఆశ్రయించిన వారికి సహాయం చేస్తాడు. వాలి, సుగ్రీవులు అన్నదమ్ములు. సుగ్రీవుని భార్యను 'వాలి' బలవంతంగా తన దగ్గర ఉంచుకుంటాడు. సుగ్రీవుడు రాముని సహాయం కోరతాడు.
రాముడు అతనికిచ్చిన మాట ప్రకారం సుగ్రీవునికి సాయం చేసి వాలిని చంపుతాడు.

        తనకు సహాయం చేసిన రామునికి తన మాటకు కట్టుబడి రాముని భార్య సీతను వెదకటానికి, ఆమె జాడ కనుగొన్న తరువాత రావణునిపై యుద్ధం చేయడానికి సుగ్రీవుడు
తన సైన్యాన్ని రామునికిచ్చి రాముని తరపున యుద్ధం చేస్తాడు.
       రాముడు ఇతరుల పట్ల ప్రేమను కలిగి వుంటాడు. గిరిజన వనిత శబరితో కలిసినప్పుడు ఆమె అతిథ్యాన్ని
స్వీకరిస్తాడు. వానర గణం సహాయంతో సీత జాడ కనుక్కోవడానికి హనుమంతుని సహాయాన్ని రాముడు తీసుకుంటాడు.
అప్పుడు హనుమంతునిపట్ల రాముడు ప్రేమతో వుంటాడు. వారిద్దరి మధ్య నమ్మకం, గౌరవం, అభిమానం పెరుగుతాయి.
       హనుమంతుడు నేడు మనమనుకునే మానవతా విలువలు సంపూర్ణంగా కలిగినవాడు. ఇతను దక్షిణ భారతదేశానికి
చెందిన గిరిజన యువకుడు. హనుమంతుడు వానర గణానికి చెందినవాడు. కోతి జాతి కాదు. అతడూ మనిషే.
       హనుమంతుడు రామునికి శిష్యునిలాగా, మిత్రునిలాగా, సేవకునిలాగా, ఆత్మీయునిలాగా వ్యవహరిస్తాడు.సీత జాడ కనుక్కోవడానికి వెళ్లినప్పుడు హనుమంతుడు ఎంతో నమ్మకంగా వ్యవహరిస్తాడు. ఆమెకు అంగుళీయకాన్నిస్తాడు. ఆమె క్షేమ సమాచారాలు కనుక్కొంటాడు.
         రావణునితో యుద్ధం జరిగేటప్పుడు లక్ష్మణుడు మూర్చపోతాడు. అతనిని తిరిగి బతికించడానికి సంజీవిని మూలిక
కావాలని వైద్యులు చెపుతారు. దాని కోసం ఎంతో శ్రమకోర్చి తనకు తెలియని మొక్క కోసం పర్వాతాన్నే మోసుకొస్తాడు.అంటే అక్కడి మొక్కలన్నీ కోసుకొస్తాడన్నమాట.

            రాముని పట్ల భక్తిభావంతో, ప్రేమభావంతోనే ఈ పనులన్నీ చేస్తాడు హనుమంతుడు. హనుమంతుడు రామునితో
వ్యవహరించిన తీరులో నమ్మకం, ఇచ్చిన మాటపై నిలబడటం, త్యాగం, నిజాయితీ మొదలైన మానవతా విలువలను
మనం గుర్తించవచ్చు.  సుగ్రీవుని విషయంలో కూడా అంతే.
      ఇలా రామాయణంలో హనుమంతుడు, సుగ్రీవుల మానవతా విలువలు నేటి సమాజానికి ఆదర్శప్రాయమవుతాయి.
కొన్ని పాత్రలు ఎలా వ్యవహరించాలో చెపితే కొన్ని పాత్రలు ఎలా వ్యవహరించరాదో చెపుతాయి. రాముడు సీతను అనుమానించడం, ఆమెను నిండుచూలాలిగా వున్నప్పుడు ఆమెను అడవుల పాలు చేయడం, బ్రాహ్మణులు చెప్పినారని తపస్సు చేస్తున్న శంభూకున్ని వధించడం, తన్ను పెండ్లి చేసుకోమని కోరిన తూర్పణఖ, ముక్కు చెవులను లక్ష్మణుడు కోస్తుంటే చోద్యం చూస్తున్నట్లు చూడడం, నేటి నాగరిక సమాజం ఒప్పుకోదు. ఇలాంటివి మనిషి అలవర్చు కోవలసిన విలువలు కావు. అలాగే సీతను అగ్ని ప్రవేశం చేయమనడం మానవతా విలువలు అనిపించుకోవు. చివరలో రాముడు యమునా నదిలో మునిగి తనువు చాలించడం  కూడా నేటి సమాజానికి ఆదర్శవంతమైన మానవతా విలువలు కావు. అంతేగాక రావణుడు పరాయి వ్యక్తి భార్యను తీసుకెళ్లడం తన చెల్లెలుకు చేసిన అవమానానికి ప్రతీకారం
చేయబూనడం లాంటి చర్యలు ఎవరూ ఆదర్శంగా తీసుకోజాలని మానవతా విలువలు.
రామాయణంలో శ్రవణకుమారుని కథలో శ్రవణ కుమారుడు తల్లిదండ్రులను కావడిలో మోస్తూ వారిద్దరినీ సాకుతూ వుంటాడు. ఇది తల్లిదండ్రులపట్ల పిల్లలకుండాల్సిన ప్రేమాభిమానాలను వ్యక్తంచేస్తుంది.
సమభావం, సమతావాదం, ఇతరుల హక్కులకు భంగం లేకుండా సంయమనంతో జీవించడం మానవతా విలువలు.వీటిని రామాయణ కావ్యంలోని వివిధ పాత్రలు వ్యవహరించే తీరు ద్వారా మనం గ్రహించవచ్చు.
           ఇదేవిధంగా మహాభారత ఇతిహాసంలో అనేక పాత్రల ద్వారా, కథల ద్వారా మానవతా విలువలు గ్రహించుకోగలం.ఆనాటి వ్యవస్థకు అవి సరిపోయినా ఈనాటి సమాజానికి కొన్ని విలువలు సరైనవి కావు. అయితే నేడు మనం ఆమోదిస్తున్నమానవతా విలువల దృష్ట్యా వాటిని చూసినప్పుడు అర్జునుడు కర్ణుడు, భీష్ముడు, విదురుడు, కృష్ణుడు చేసిన పనుల్లో
ఆచరించదగిన ఉదాత్త, మానవతా విలువలు కనిపిస్తాయి. కొన్ని తిరస్కారానికిగురవుతాయి.
        భారతంలో ధర్మవ్యాధుడనే కటిక వ్యాపారి ఉంటాడు. అతను ప్రతి రోజూ తల్లిదండ్రులను పూజిసస్తూ వారికి
అలాంటి లోటు లేకుండా వారిని దైవంలాగా చూసుకుంటూ వుంటాడు. దుర్వాసుడు  అతని దగ్గరకు వచ్చి ఆగ్రహించినప్పటికీ అతని రోజు వారి దినచర్యలు చూసి ఆశ్చర్య పోతాడు. ఇందులో ధర్మవ్యాధుడు వ్యవహరించిన తీరు నేటి మానవతా విలువలకు అద్దంపడుతుంది. కానీ నేటి సమాజానికి డబ్బు సంపాదన ఒక విలువగా ఏర్పడింది. డబ్బు,హోదా, పలుకుబడి మానవతా విలువలుగా పరిగణిస్తున్నారు. ఇది హర్షణీయం కాదు. మారుతున్న సమాజంలో డబ్బు పాత్ర పరిమితమైనది. పటిష్టమైన మానవ విలువలే మానవ సమాజ పరిణితికి గీటురాళ్లు.
        కౌరవులు, పాండవులు జూదమాడతారు. వారు చెప్పే అంకెలు, పాచికలు విసిరినప్పుడు ఖచ్చితంగా అవే పడితే వారు గెలిచినట్లు లేకపోతే ఓడినట్లు. ఇది వారి ఆనాటి ఆట. దానికి పందాలు ఒడ్డేవారు. దాంట్లో వస్తువులతో పాటు తమ్ముల్ని కూడా పందెం కాస్తాడు ధర్మరాజు. ఒక క్రీడను ఉల్లాసానికి కాకుండా సంపదల కోసం ఎందుకు ఆడకూడదో
భారతం చెపుతుంది. అలా చేస్తే మనుషులు ఎలా పతనమవుతారో చెపుతుంది. ఆ సందర్భంలో ద్రౌపదిని దుర్యోధనునితమ్ముడు దుశ్శాసనుడు జట్టు పట్టుకొని ఈడ్చుకువస్తాడు. అంతేగాక ఆమె వలువలను విప్పతీయడానికి ప్రయత్నిస్తాడు.
తమ్ముని భార్యపట్ల అనుచితంగా ప్రవర్తించడం ధర్మం కాదన్న విలువను తుంగలో తొక్కుతాడు. ఆ సమయంలో ఆమెకు స్వయంగా అన్నకాకపోయినా కృష్ణుడు చీరలిచ్చి ఆదుకుంటాడు. ఒక స్త్రీ నిస్సహాయురాలిగా వున్నప్పుడు, భర్తలు
చేష్టలుడిగి వున్నప్పుడు అన్నగాని, తమ్ముడుగాని తన సోదరిపట్ల వ్యవహ రించాల్సిన తీరును కృష్ణుని పాత్ర ద్వారా
తెలుస్తుంది. సమాజంలో స్త్రీలకు ఇవ్వాల్సిన గౌరవాన్ని, వారిపట్ల ప్రవర్తించాల్సిన మానవీయ విలువలను ఈ కథ ద్వారా మనం తెలుసు కోవచ్చు.కానీ నేటి సమాజంలో కూడా వీధికొక్క గాంధారి కొడుకు వెలసివున్నాడు. స్త్రీలు మనుషులేనని వారికొక హృదయముందని వారిపట్ల పురుషులు బాధ్యతగా మెలగాలన్న మానవ విలువలు పెరగలేదు. వాళ్ళను
సినిమాలలో శృంగార పరంగానే చూపిస్తున్నారు. అందువల్లే మహిళలపై నేటికీ అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి.
        భీష్ముడు తను చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి ఉండటం అతని మానవతా విలువ. తాను బ్రహ్మచారిగా వుంటానని ప్రతినబూని ఎన్నో సందర్భాలలో వివాహం చేసుకోవాల్సిన పరిస్థితులొచ్చినా తన మాటకు కట్టుబడి వుండటం చూస్తాం. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం నేడు నిబద్ధత అంటున్నాం. ఈ నిబద్ధత అనే మానవతా విలువ రచయితల్లో
నేటి సమాజంలో కొరవడుతోంది. చెప్పేటందుకే నీతులున్నాయి అంటున్నారు. ఆచరించడానికి కాదంటున్నారు. ఇది నేడు దారితప్పుతున్న మానవతా విలువ. భీష్ముడు తన ఆచరణలో తన మాటకు కట్టుబడి వుండటం ఒక ఉదాత్త
మానవ విలువ.
       అర్జునుడు ఇంద్రలోకం వెళతాడు. అక్కడ ఇంద్రసభలో వున్న ఊర్వశి అర్జునున్ని కామిస్తుంది. కానీ ఆమె ఇంద్రునికి ఉంపుడుకత్తె, ఇంద్రుడు అర్జునుని తండ్రవుతాడు. అందువల్ల ఆమె అతనికి తల్లి అవుతుంది. అర్జునుడు ఊర్వశి కోరికను తిరస్కరిస్తాడు. ఇది అతని మానవతా విలువ. వారి వరుసల విచక్షణ అర్జునునిలో కనిపిస్తుంది. ఇవి నేడు పతనమవుతున్న క్రమాన్ని సమాజంలో చూస్తాం. అలాగే మరో సందర్భంలో కూడా అర్జునుడు ఇలాంటి మానవతా విలువను ప్రదర్శిస్తాడు. విరాటరాజు కొలువులో బృహన్నల వేషంలో నాట్యాచార్యునిగా వుంటాడు అర్జునుడు. అప్పుడు విరాటరాజు కూతురు ఉత్తరకు నాట్యం నేర్పిస్తుంటాడు. బృహన్నలే అర్జునుడని తెలిశాక విరాటుడు తన కూతురు ఉత్తరను వివాహమాడమని కోరుతాడు. గురువు శిష్యురాలిని పెండ్లి చేసుకోవడం సరికాదన్న మానవతా విలువను
గుర్తుచేస్తాడు. ఇలాంటి మానవతా విలువలు నేడు మంటకలిశాయి. ప్రతి రోజు ఎక్కడో ఒక చోట ఉపాధ్యాయులు తమ శిష్యురాళ్లపై అఘాయిత్యాలు చేసి తమ కామవాంఛలను తీర్చుకొని గర్భవతులను చేస్తున్నట్లు వార్తలో చూస్తున్నాం. దిగజారుతున్న మానవతా విలువలను ఇది గుర్తు చేస్తుంది.
       శస్త్ర విద్యా పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు కర్ణుడు సూతపుత్రుడని అతనికి అర్హత లేదని ద్రోణుడంటాడు.కానీ దుర్యోధనుడు కర్ణుని అంగ దేశానికి రాజుగా ప్రకటించి శస్త్ర పరీక్షల్లో పాల్గొనేటట్లు చేస్తాడు. ఇది ఆనాటి కుల వివక్షను తెలియజేస్తుంది. ఈ రోజు మనం రాజ్యాంగంలో ఇలాంటి కులవివక్షలేని మానవ సమాజం రావాలని రాసుకున్నాం.కుల,మత, లింగ, వివక్ష లేకుండా అందరికి సమాన హక్కులు రాజ్యాంగం ద్వారా భారతీయ పౌరులందరికి ఇవ్వబడినాయి.ఇది నేడున్న మానవతా విలువ. ఇవి అప్పుడప్పుడూ సమాజంలో ఇంకా కొరవడుతూనే ఉన్నాయి. ఇలాంటి మానవతా విలువను పెంపొందించాల్సిన అవసరం నేడుంది.
       బకాసురుని కథ మహాభారతంలో వుంది. ఈ కథ ప్రకారం ఒక అగ్రహారంలో పాండవులు బ్రాహ్మణ వేషంతో ఓ బ్రాహ్మణుని ఇంట్లో నివాసముంటారు. ఆ వూరు మీదపడి దోచుకునే బకాసురునికి ఒకానొక రోజు ఆ
బ్రాహ్మణ కుటుంబం బకునికి కావాల్సిన తిండిని ఒక మనిషిని పంపాల్సి వుంటుంది. ఆ సందర్భంలో భీముడు వారి బదులు వెళ్లి బకుని చంపి ఆ పూరి పీడ వదలగొడుతాడు. ఇందులో ప్రతి వ్యక్తి ఆతిథ్యమిచ్చిన వారికి కష్టాలు వస్తే, తోడ్పాటు నందివ్వాలనే మానవ విలువ వుంది. ఇది ప్రేమపూర్వక బాధ్యతా  యుతమైన పని.
          ఇలా మహాభారతం,రామాయణం, భాగవతాలలో అనేక కథలు మానవీయ విలువలను తెలియజేస్తాయి.వీటిని నేటి సమాజం బాధ్యతగా గుర్తించి పాటించాలి. ఆ దిశలో నడుస్తుందని ఆశిద్దాం.
(15.7.2020 న మద్రాసు క్రిస్టియన్ కళాశాల వారు నిర్వహించిన అంతర్జాతీయ వెబినార్ లో సమర్పించిన వ్యాసమిది)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు