విశ్వనరుడు జాషువా కవిత్వం - సామాజికత
తరాలు మారినా దళితుల సరిస్థితి భారతదేశంలో మారడం లేదు. నిచ్చెనమెట్ల కులవ్యవస్థ దీనికి ప్రధాన అడ్డంకి. భారతదేశాన్ని ఆంగ్లేయులు వర్ణ వ్యవస్థను వాళ్ళ పరిపాలనను సుస్థిరపరచుకోవడానికి ఉపయోగించుకున్నారు తప్ప మార్చడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు.
క్రైస్తవ మిషనరీల సేవల వల్ల చాలామంది దళితులు క్రైస్తవంలోకి మారారు. మతం మారినా వారి సామాజిక పరిస్థితుల్లో ఎలాంటి మార్పురాలేదు.
హిందూవర్ణ వ్యవస్థ అత్యంత దుర్మార్గంగా వుండడమే దీనికి కారణం. ఒక కులంలోంచి
మరొక కులంలోకి మారేటందుకు వీలులేదు. కుల వ్యవస్థను పాలకులు రూపుమా పే దిశగా
లేకపోగా కుల వ్యవస్థను మరింతగా పెంచి పోషిస్తున్నారు.
ఇప్పుడే ఇలావుంటే 1895లో ఎలావుండి వుంటుందో ఊహించుకుంటే ఆనాటి వర్ణవ్యవస్థ దుర్మార్థం మరింత దారుణంగా వుంటుందనేది వాస్తవం. ఇదంతా ఎందుకంటే మనం చర్చించబోయే
విశ్వనరుడు జాషువా స్వానుభవంతో ఈ విషయం పై తన ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేశారు కాబట్టి.
జాషువా 1895 సెప్టెంబరు 28న వినుకొండ పట్టణానికి దూరంగావున్న మిస్సమ్మతోటలో వీరయ్య, లింగమాంబలకు జన్మించాడు. వీరిద్దరిది కులాంతర వివాహం. వీరయ్య యాదవ కులమైతే, లింగమాంబది మాదిగ కులం.అప్పట్లో మాదిగల పట్ల సమాజంలో అంటరానివాళ్ళుగా చూసే పద్ధతి వుండేది. జాషువాకు బాల్యంలో అనేక చేదు అనుభవాలు అంబేద్కర్ కు కలిగినట్లే కలిగాయి.
అంటరానివానిగా చూస్తూ బడిలో విడిగా కూర్చోపెట్టేవారు. ఆటలాడేటప్పుడు జట్టులోకి తీసుకొనేవారు కాదు. అనేక అవమానాలు
ఎదుర్కొన్నాడు. ఇవన్నీ అతన్ని రాటుదేల్చాయి. అంబేద్కర్ హిందూవర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా
పోరాడి పోరాడి అలసిపోయి బౌద్ధం స్వీకరించారు. జాషువా కుటుంబం క్రైస్తవంలో చేరింది.ఒక రకంగా ఇది హిందూ వర్ణవ్యవస్థ పై ఇది ఒక ధిక్కారం.
జాషువా ఉన్నత పాఠశాలలో చదువు పూర్తయ్యాక, 1919 నుంచి 1928 దాకా గుంటూరులోని ట్రైనింగు స్కూలులో పనిచేశారు. తరువాత 15సం||లు గుంటూరు జిల్లా బోర్డు పాఠశాలలో తెలుగు పండితులుగా పనిచేశారు. తరువాత మూడేళ్ళు యుద్ధ ప్రచారం కోసం ఉపన్యాసకునిగా పనిచేశారు. అనంతరం ఆకాశవాణిలో నిర్మాతగా పనిచేశారు. తరువాత శాసనమండలి సభ్యునిగా ఎంపికైనారు.
జాషువా కవితా రంగప్రవేశం:
జాషువా కవితారంగ ప్రవేశం చేసేనాటికి జాతీయోద్యమం జరుగుతోంది. ఆ సందర్భంలోనే
భావకవిత్వం రాస్తూ ప్రణయగీతాల్లో మునిగివున్నాడు కవి నండూరి సుబ్బారావు. హిందూ వర్ణ వ్యవస్థను కీర్తిస్తూ విశ్వనాథ సత్యనారాయణ వేయిపడగలను రచిస్తున్నారు.
'నాకుగాదులులేవు, ఉషస్సులులేవు', 'నేదిగిరాను దివి నుంచి భువికి దిగిరాను దిగిరాను', 'నేనంత శోక భీకరలోకైకపతిని' అంటూ తనలో తిమిరాన్ని సృష్టించుకున్న కవి కృష్ణశాస్త్రి. వీళ్ళను
చూసి "ప్రణయకవి ఒకండు/పాషాణకవి మరొకండు/ఏడ్చుకవియొకండు/నేకమగుచు/రెండోనులను
జూచిఓదార్చుకొనుచున్న/బాగుపడునె భావిభారతజాతి?" అని ప్రశ్నిస్తూ ముందుకు వచ్చారు జాషువా.
జాతీయోద్యమ కవిత్వం రాస్తున్న కవులు మాత్రం దేశవైభవాన్ని మాత్రమే కీరిస్తూ కవిత్వం
రాస్తున్నారు. దేశంలోని దరిద్ర్యాన్ని కొంచెం కూడా ప్రస్తావించక పోవడం జాషువాను బాధించింది.
దీన్ని గమనించిన జాషువా తన పద్యంలో ఇలా చెపుతారు.
"ప్రతిమల పెండ్లి చేయుటకు వందలు వేలు వ్యయించుగాని దు:ఖిత మతులైన పేదల
ఫకీరుల శూన్యములైన పాత్రలన్ మెతుకు విదల్చరీ భారతమేదిని" అంటూ పేదలపట్ల సమాజంలో
వున్నలోకరీతిని ప్రశ్నిస్తారు.
జీవితమనే పాఠశాలలో నేర్చిన అంతులేని పోరాటం:
జాషువాకు గురువులు ఎవరూలేరు. ఆంగ్లవిద్యలో ప్రావీణ్యం లేదు. సాహిత్య సిద్ధాంతాలు, నవ్యకవితామార్గాలు తెలీదు. ప్రజల భాషలో చక్కని పదాలనుపయోగించి కవిత్వం రాయటం మాత్రం అభ్యసించి అద్భుతంగా రాయటం నేర్చుకున్నారు. మనిషికి జీవితం ఎన్నో పాఠాలు నేర్పుతుంది. అపాఠాలను వంటబట్టించుకున్నవాడే
జీవితంలో రాటుదేలుతాడు. జాషువాకు పేదరికం సహనాన్ని నేర్పింది. కులమత భేదాలు ఆయనలో ఎదిరించే శక్తిని నేర్పింది. ఎన్ని అవమానాలు ఎదురైనా చీత్కారాలు జరిగినా క్రుంగిపోలేదు. ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించాడు. సమాజంలో వున్న లోకరీతిని తన కవితాఖడ్గంతో ఖండించారు.
జాషువా మాటల్లో చెప్పాలంటే.....
"దారిద్ర్యాన్ని కుల భేదాన్ని చీల్చివేసే మనిషిగా నిరూపించు కోదలిచాను. వాటిపై
కత్తిగట్టాను. అయితే నాకత్తి కవిత. నాకత్తికి సంఘంపై ద్వేషంలేదు. దాని విధానం పైన
ద్వేషం".
ఆయన ఎదుర్కొన్న సంఘటనలు ఆయన హృదయాన్ని ఎంతగానో బాధించాయి. అయినా
గుండె నిబ్బరంతో ఎదరుర్కొని వాటిని తన ఆత్మకథలో రాసుకున్నారు.
ఒకసారి రైలులో వెళుతున్నప్పుడు ఒక పండితుడు జాషువాను కవిత్వం చెప్పమని కోరాడట. జాషువా కవిత్వం విని ఆయన బాగా మెచ్చుకున్నాడు. తరువాత 'నీకులమేది' అని అడిగాడు. దానికి నేను క్రైస్తవున్ని' అని చెప్పాడు జాషువా. 'అయ్యో! వాణి అంటుపడింది' అంటూ చివుక్కున లేచి మరోచోటకు వెళ్ళిపోయాడు. దాంతో జాషువా మనసు కకావికలమై కింది కవితను ఆవిష్కరించారు.
“నాకవితా వధూటి వదనంబు నెగాదిగాజూచి/రూపు రేఖా కమనీయ వైఖరులుగాంచి, భళాభళి
అన్నవాడె మీదేకులమని ప్రశ్న వెలయించి/పోవుచో బాకున కుమ్మినట్లుగును!" అంటూ తాననుభవించిన మానసిక క్షోభను 'నాకథలో' రాసుకున్నాడు జాషువా ఒకచోట.
1943లో కాకినాడలో పిఠాపురం రాజావారి ఆస్థానంలో సాహిత్యసభలో ఆయనకు స్టేజి మీద
కుర్చీని దూరంగా వేశారు.. 'ఇప్పుడు జాషువా తమ పంచమ స్వరాన్ని వినిపిస్తారు" అని ప్రకటించారు
విశ్వనాథ సత్యనారాయణ. అప్పుడు జాషువా తమ కవిత్వాన్ని తన ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటూ ఇలా వినిపించాడా సభలో,
“గవ్వకు సాటి రాని పలుగాకుల మూకలసూయ చేతన
న్నెవ్విధ ధూలినన్ నను వరించిన శారదలేచిపోవునే
యివ్వ సుధాస్థలిన్ పొడమారే రసలబ్దులు ఘంటమూనెదన్
రవ్వలు రాల్చెదన్ గరగరల్ సవరించెద నాంధ్రవాణికిన్".
మానసికంగా ధృడసంకల్పం గలవాడు, ధృఢచిత్తుడు, జీవితాన్ని గుండెలునిండా
ప్రేమించినవాడు. సమాజంపట్ల ప్రేమగలవాడు. ఈసమాజం మారాలన్న కోరిక గలవాడు.అందువల్లనే మృత్యుభావనను ఏనాడూ దగ్గరకు రానీయలేదు. ఏటికెదురీదేతత్వం ఆయనది. ప్రతిఘటనా చైతన్యం ఆయన కవిత్వంలో అణు వణువునా తొడికిసలాడుతుంది.
వెన్నెల నా కవిత్వం:
ఆయన జీవితం వెలుగు నీడల్లా వడగాడ్పు, వెన్నెలతో మిళితమై సాగిపోయింది.
"వడగాడ్పు నాజీవితమైతే, వెన్నెల నాకవిత్వం" అని అన్నాడు. లోకం కులాన్ని బట్టి చీదరించింది చైతన్యాన్ని గుర్తించి ప్రశంచింది.ఆయనకు జీవితంలో ఎన్నో సత్కారాలు లభించాయి. కవికోకిల, కవివిశారద, నవయగచక్రవర్తి, పద్మభూషణ్ మొదలైన బిరుదులతో సాహిత్యరంగంలో ప్రసిద్ధిపొందారు.శాసనమండలి సభ్యునిగా ప్రభుత్వం ఆయన్ను నియమించింది. బంతిని నేలకేసి కొట్టితే పైకెగిరినట్లు ఆయన అవమానింపబడిన ప్రతిసారీ తన ఆత్మ ఔన్యత్యంతో సాహిత్య రంగంలో గౌరవాలు పొందారు.
నాకథలో ఇలా రాసుకొన్నాడు దీన్నే
"ఒకడు ప్రోత్సహింప, నొక్కడు నిరసింప
నొకడు చేర బిలువ, నొకడు తరుమ
మిట్టపల్లములను మెట్టుచు నెట్టులో
పలుకులమ్మ సేవ సలిపినవాడ"
పేదరికం నేర్పిన వినయం:
పేదరికం మనిషికి అత్యంత దయనీయ స్థితికి నెట్టుతుంది. పేదరికం మనిషికి సహజంగా
వుండే సిగ్గు, ఆత్మాభిమానాన్ని చిదిమేస్తుంది. ఆకలి మనిషిని మనిషిగా గుర్తింపజేస్తుంది. అది కడుపు నింపుకోవడానికి కావాల్సిన ఓపికను నేర్పిస్తుంది. తన స్వప్న కథలో ఈవిషయన్నే తన
కవిత్వంలో వ్యక్తీకరిస్తాడు జాషువా.
"పేదరికం పెద్ద వింత పాఠశాల/ దానిలోన లజ్జగానపడదు/ఉదరమొజ్జయగుచు నోరంత
పొద్దుట/వోర్మి విద్య నేర్పుచుండునచట"
జాషువా కవితాతత్వం:
" దొడ్డ పదవులెక్కి గడ్డిమే సెడువారి
నెత్తి పొడుచు చిత్త వృత్తినాది" అని తన కవితా రీతిని పేర్కొన్నాడు. “మతపిచ్చిగాని,
వర్గోన్నతిగానీ, స్వార్థచింతనల్ గానీ నాకృతులందుండదు" అని తన కవితాలక్ష్యాన్ని చాటుకున్నాడు.
సమతా వాద దృక్పథం:
బుద్ధుడు, క్రీస్తు, గాంధీల కరుణామయ దృక్పథం జాషువా కవితల్లో తొణికిసలాడుతుంది.
కులమతాతీతమైన వ్యవస్థ నిర్మాణం తన ధ్యేయంగా పేర్కొన్నాడు. "సమతలేని రిక్త చదువు లేల?పదివేలమతములేల?"
కులమతాలపై సమరం:
కులవివక్షను స్వయంగా ఎదుర్కొన్న వాడు కాబట్టి అది మనుషుల మధ్య సృష్టించే అగాధాల్ని,
కాటువేసే విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కవిత్వం రాశాడు.
"కపిరిబుస కొట్టు నాతని గాలిసోక
నాల్గు పడగల హైందవ నాగరాజు" అంటూ
హిందూ మతంలో వున్న వర్ణ వ్యవస్థను హైందవ నాగరాజుగా వర్ణించాడు.
“మాట వరుస కొక్క మతమందు మేగాని/కుల సమస్య వద్ద కుమ్ముదుమ్ము" అంటూ కుల
విద్వేషాలపై నిరసన వ్యక్తం చేశాడు.
ధన స్వామ్యంపై సమరం:
ధనము కొంతమంది దగ్గరే కేంద్రీకరింపబడటాన్ని జాషువా వ్యతిరేకించాడు. 'ధనము
ధాన్యమ్ము నొకని పెత్తనము క్రింద కట్టుబడి వ్యర్థ మగు త్రుప్పుపట్టరాదు" అంటూ ధనస్వామ్యంపై
ఆయన తన కలాన్ని ఝలిపించాడు. అంతేగాక ధనస్వామ్యం పేదవాన్ని పట్టించుకోకుండా గుళ్ళు, గోపురాల కోసం ధారాళంగా ధనాన్ని ఖర్చుచేయటాన్ని ఆక్షేపిస్తూ
“గుళ్ళు గోపురాల కోసరంబై నీవు
ధారపోయుచున్న ధనము చూసి
కటిక పేదవాని కడుపులో వర్తించు
కత్తులెన్నో లెక్క పెట్టగలవా?" అని ఆయన ప్రశ్నించారు.
దోపిడి పై నిరసన:
మార్క్స్ చెప్పిన దోపిడీ రద్దును జాషువా కూడా తన కవిత్వంలో వ్యక్తీకరించాడు. "సహజమైన
ప్రకృతి సౌఖ్యంబులొక వ్యక్తి/ దొంగిలించి మనుట దొసగనాగు" అంటూ దోపిడి చేస్తూ కొంతమంది
సుఖంగా ఉండటం, దోపిడీ చేయబడే వాళ్ళు పేదలుగా వుండిపోవడం సరియైనది కాదని చెప్పాడు జాషువా.
ఆర్థిక అసమానతపై తీవ్ర నిరసన వ్యక్తం చేసినా దాన్ని రూపుమాపే మార్గాలను ఆయన
చెప్పలేదు. రాజకీయ సిద్ధాంతాలను ప్రతిపాదించ లేదు. కారణం ఆయనకు మార్క్సిస్టు సిద్ధాంతాలతో
ఎలాంటి సంబంధంగాని ఆవగాహనగాని లేక పోవడమే.
హేతువాద దృక్పధం:
జాషువా నాస్తికుడు కాదు. కాని గోరా వంటి నాస్తికులతో సంబంధ బాంధవ్యాలు పెరిగాక
నెమ్మదిగా హేతువాదం సరైనదని భావించాడు. మెట్ట వేదాంతం మనిషిని ముందుకు నడిపించదని
సమాజాన్ని మార్చలేమని తెలుసుకున్నాడు అందుకే
“విశ్వ సింపవలదెపుడున్ మెట్టవేదాంతముల్" అని ప్రభోదించాడు.
రాజ్యాన్ని ప్రశ్నించడం:
పాలకులకు నొప్పి కలుగకుండా కవులు కవిత్వం రాస్తూ వుంటారు. వీరు అభ్యుదయ వాదులుగా చెలామణి అవుతుంటారు కూడా. పాలకులిచ్చే బిరుదులకోసం, అవార్డులకోసం
తాపత్రయపడుతుంటారు. జాషువా రాజ్యాన్ని ప్రశ్నించడానికి తన కవిత్వాన్ని సాధనం చేశాడు.
"రాజ్యపీఠమెక్కి రాజదండము బట్టి, మూడు సంవత్సరాలు మునిగిపోయె, దొరల రాచరికమె
మెరుగయ్యననిపించే మారుపల్కవేల? మంతిరన్న"
అని రాజ్యాన్ని నిలదీశాడు.ఇలాంటి వాటితో కదిలే రకం కాదు నేటి మంత్రురన్నలు.
హంగ్రీథర్టీస్ ప్రభావం:
1930 కవులను తీవ్రంగా కదిలించింది. శ్రీశ్రీలో వర్గ కసిని కలిగించింది. మొదటి ప్రపంచ
యుద్ధానంతరం ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్థిక సంక్షోభం ప్రపంచాన్ని చుట్టుముట్టింది.పెట్టుబడిదారీ ప్రపంచం గగ్గోలు పెట్టింది. లక్షలాది శ్రామికులు ఆకలి, దారిద్ర్యంతో అలమటించారు. అభ్యుదయ కవులు, రచయితలు తమ కలాలకు పదును పెట్టారు. ఆ ప్రభావం జాషువా పై పడకుండా వుండదు. భర్త మరణించడంలో వీధులపాలైన ఒక బాలింత దీనగాథను'అనాధ " కావ్యంగా మలిచారు. థర్టీ హంగ్రీస్ ప్రభావం ఈ కావ్యం పై వుంది.
మహిళలకు నీరాజనాలు:
పురుషుడికున్న స్వేచ్ఛ స్త్రీకి లేదుమనదేశంలో. పురుషాహంకారం, పురుషాధిక్యత వలన
స్త్రీ అణచివేయబడుతోంది. స్త్రీని పురుషుడితో సమానంగా చూచిన నాడే స్త్రీకి సరైన న్యాయం,
గౌరవం కలుగుతుందని జాషువా భావించారు. ఈ భావాన్ని తన కవితలో చెపుతారు.
"స్త్రీ కన్నన్ పురుషుండు శ్రేష్టుడనుచున్ సిద్ధాంతముల్ చేసి తాటాకుల్ కంఠములెత్తి స్త్రీ
జగతి కన్యాయంబు గావించెనో ఏకాలంబున పుట్టి నింటయిన లేవే నాటి స్వాతంత్ర్యముల్
స్త్రీకి మారు సమాన గౌరవ విభూతిన్ గాంతకుంగూర్చున్" (కొత్త లోకం).
స్త్రీలు అబలలని నూరిపోసింది భారతీయ సమాజం. వారికున్న సహజ శక్తులను అణచివేసి
వారిని శృంగార మూర్తులుగా వర్ణించారు. దీన్ని గుర్తించిన జాషువా 'తెలిసికొన్నది నేటికలికి
ముద్దులగుమ్మ/యుబ్బించు గాదలందున్న కిటుకు" అంటూ మగవారి మాయమాటల నుంచి బయటపడి తమ వ్యక్తిత్వాన్ని సామర్థ్యాన్ని తెలుసుకొని మహిళలు బయటకు వస్తున్నారని 'నేటి నెలత"లో ప్రశంసించారు.
జాషువా చతురత:
జాషువా అనేక సామాజిక సమస్యలపై గళం విప్పడమేగాక అనేక సందర్భాలలో హస్య
పూర్వకంగా అవమానాలను తిప్పికొట్టడం, ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన నవ్వుపై
రాసిన పద్యం హాస్యం పట్ల ఆయనకున్న ఇష్టాన్ని తెలియజేస్తుంది.
ఒకసారి వేదిక పై విశ్వనాథ, జాషువా వున్నారు. గుర్రంగాడిదలను ఒకే చోటన కట్టితే ఎలా?
అని విశ్వనాథ అన్నారు. జాషువా వంతు రాగానే 'ఇప్పుడు గుర్రం మాట్లాడుతుంది' అన్నారంట
అంటే ఇందాక గాడిద మాట్లాడింది అని చతురంగా చెప్పినట్లు.
'నవ్వును జంతువుల్, నరుడు/నవ్వును నవ్వుచిత్తవృత్తి కిన్ దివ్వెలు కొన్ని నవ్వులెటు/ తేలవు కొన్ని విష ప్రయక్తముల్ పువ్వుల వోలె ప్రేమరస/ ముల్ వెలిగ్రక్క విశుద్ధమైన లే
నవ్వులు సర్వదు:ఖ శమ/ నంబులు, వ్యాధులకున్, మహౌషధుల్'
అని నవ్వుల్లోని రకాలను వివరిస్తూ, నవ్వు ప్రాధాన్యతను తెలియజేస్తారు జాషువా.
జాషువా ఫిరదౌసి, గబ్బిలం మొదలైన కావ్యాలు రాశారు. అనేక బిరుదులను, సన్మానాలను
పొందారు. నేటి సాహిత్యకారులను ఎదర్కొనటానికి పద్య రూపాన్ని తీసుకున్నా ఆయన కవితలు
సామాజిక అంశాల్ని స్పృశిస్తూ పాఠకుని హృదయాల్లోకి సూటిగా తీసుకెళ్తాయి.
"విశ్వనరుడనేను" అని సగర్వంగా ప్రకటించిన జాషువా నేటికీ ప్రజానీకంలో నిలిచిన ప్రజాకవి జాషువా. 'సుకవి జీవించే ప్రజల నాల్కలయందు' అన్న సుకవి జాషువా జులై 24, 1971న దివంగతుడైనాడు.
___పిళ్లా కుమారస్వామి,9490122229
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి