తెలుగు సాహిత్యం_ యుగ విభజన



తెలుగు సాహిత్యాన్ని ఆరు యుగాలుగా వర్గీకరించారు.

క్రీ. శ. 1020 వరకు – నన్నయకు ముందు కాలం

       తెలుగు సాహిత్యరంగంలో నన్నెచోడుని కుమార సంభవం   క్రీ. శ. 925-40 మధ్యకాలంలో రాశారని చిలుకూరి వీరభద్రరావు రాశారు. ఆయన పద్యాన్నొకదాన్ని ఆధారం చేసుకుని నన్నయ్యకు  వందయేళ్ళ మునుపే ఆంధ్రకవిత వర్ధిల్లుతోందని వ్రాశారు.ఇది వివాదాస్పదమైంది.
      11 వ శతాబ్దం ప్రాంతంలో నన్నయ రచించిన మహాభారతం తెలుగు లోని మొట్టమొదటి సాహిత్య కావ్యమని సర్వత్రా చెబుతారు. ఒక్కసారిగా ఇంత బృహత్తరమైన, పరిపక్వత గల కావ్యం రూపుదిద్దుకోవడం ఊహించరానిది. కనుక అంతకు ముందు చెప్పుకోదగిన సాహిత్యం ఉండి ఉండాలి. కాని అది బహుశా గ్రంథస్తం కాలేదు. లేదా మనకు లభించడం లేదు. అంతకు ముందు సాహిత్యం ఎక్కువగా జానపద సాహిత్యం రూపంలో ఉండి ఉండే అవకాశం ఉంది. 
         క్రీ. శ. 575లో రేనాటి చోడుల శాసనం మొట్టమొదటి పూర్తి తెలుగు శాసనం. ఇది కడప జిల్లా కమలాపురం తాలూకా ఎర్రగుడిపాడులో లభించింది. అంతకు ముందు కాలానికి చెందిన అమరావతి శాసనంలో "నాగబు" అనే పదం కన్పిస్తుంది.

1020–1400 – పురాణ యుగం :

దీనిని నన్నయ్య యుగం అనవచ్చు. నన్నయ్య ఆది కవి. ఇతడు మహా భారతాన్ని తెలుగులో రాయడానికి ప్రారంభించి, అందులో మొదటి రెండు పర్వాలు పూర్తి చేశాడు. తరువాతి  అరణ్య పర్వం సగం రాసి కీర్తి శేషుడయ్యాడు. నన్నయకు నారాయణ భట్టు సహాయంగా నిలిచాడు. నారాయణ భట్టు వాఙ్మయదురంధరుడు. అష్టభాషాకవి శేఖరుడు. సహాధ్యాయులైన నారాయణ, నన్నయ భట్టులు భారత యుద్ధానికి సంసిద్ధులైన కృష్ణార్జునులవలె భారతాంధ్రీకరణకు పూనుకొని ఒక విజ్ఞాన సర్వస్వంగా దానిని రూపొందించే ప్రయత్నం ప్రారంభించారు; తెలుగు కావ్యభాషాస్వరూపానికి పూర్ణత్వం సాధించి, పండితులూ పామరులూ మెచ్చుకొనదగిన శైలిని రూపొందించి, తరువాతి కవులకు మార్గదర్శకులయ్యారు. ఆంధ్ర భాషా చరిత్రలో నన్నయ, నారాయణులు యుగపురుషులు. వీరు తెలుగు భాషకు ఒక మార్గాన్ని నిర్దేశించారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒక సారి అయినా నన్నయ్య అడుగు జాడలను అనుసరించిన వారే.

నన్నయ తరువాతికాలంలో ముఖ్యమైన సామాజిక, మత సంస్కరణలు చోటు చేసుకొన్నాయి. వీరశైవం, భక్తిమార్గం వచ్చాయి.ఇవి ఇన్నో కావ్యాల ఆవిష్కరణ కు కారణమైనాయి. తిక్కన (13వ శతాబ్ది), ఎర్రన (14వ శతాబ్దం) లు భారతాంధ్రీకరణను కొనసాగించారు. నన్నయ చూపిన మార్గంలో ఎందరో కవులు పద్యకావ్యాలను మనకు అందించారు. వీరు అధికంగా పురాణాలు ఆధారంగా రాశారు.ఒకరకంగా పురాణాలకు ప్రాణం పోశారు.సామాజిక కవిత్వం రాలేదు.

1400–1510 – మధ్య యుగం
 (శ్రీనాథుని యుగం) :

ఈ కాలంలో సంస్కృతకావ్యాల, నాటకాల అనువాదం కొనసాగింది. కథాపరమైన కావ్యాలు కూడా వెలువడ్డాయి. "ప్రబంధం" అనే కావ్య ప్రక్రియ ఈ కాలంలోనే రూపు దిద్దుకున్నది. ఈ కాలంలో శ్రీనాథుడు, పోతన, జక్కన, గౌరన పేరెన్నిక గన్న కవులు. ఛందస్సు మరింత పరిణతి చెందింది. శ్రీనాథుని శృంగార నైషధము, పోతన భాగవతం, జక్కన విక్రమార్క చరిత్ర, తాళ్ళపాక తిమ్మక్క సుభద్రా కళ్యాణం మొదలైనవి ఈ యుగంలో కొన్ని ముఖ్యమైన కావ్యాలు.

ఈ సందర్భంలో రామాయణ కవులగురించి కూడా చెప్పకోవచ్చును. గోన బుద్దారెడ్డి రచించిన రంగనాథ రామాయణం మనకు అందిన మొదటి రామాయణం.

1510–1600 – ప్రబంధ యుగము:

విజయనగర సామ్రాజ్య  చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆదరణలో 16 వ శతాబ్దం ప్రాంతంలో తెలుగు సాహిత్యపు స్వర్ణయుగం వికసించింది.స్వతహాగా కవియైన దేవరాయలు తన ఆముక్తమాల్యదతో "ప్రబంధం" అన్న కవిత్వరూపాన్ని ప్రవేశపెట్టాడు. ఆ కాలంలో అతి ప్రముఖ కవులైన అష్టదిగ్గజాలతో ఆయన ఆస్థానం శోభిల్లింది.ప్రబంధసాహిత్యమంతా ప్రణయం,శృంగారం,ప్రేయసి అంగాంగ వర్ణన లతో సాగింది.

1600–1820 – దాక్షిణాత్య యుగము:

కర్ణాటక సంగీతపు ప్రముఖులెంతో మంది వారి సాహిత్యాన్ని తెలుగులోనే రచించారు. అటువంటి ప్రసిద్దమైన వారి జాబితా లోనివే త్యాగరాజు, అన్నమాచార్య, క్షేత్రయ్య రామదాసు (కంచెర్ల గోపన్న) వంటి పేర్లు. మైసూర్ వాసుదేవాచార్ వంటి ఆధునిక రచయితలు కూడా వారి రచనలకు మాధ్యమంగా తెలుగు నే ఎంచుకొన్నారు. వీ

1820 తరువాత – ఆధునిక యుగము:

1796 లో మొదటి తెలుగు అచ్చు పుస్తకం విడుదలైనా, తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ 19వ శతాబ్దపు మొదట్లోనే సాధ్యమయింది. 19వ శతాబ్దపు మధ్యప్రాంతంలో, షెల్లీ, కీట్స్, వర్డుస్ వర్త్ వంటి కవుల కవిత్వంచే అమితంగా ప్రభావం చెందిన యువ కవులు "భావకవిత్వం" అన్న సరికొత్త ప్రణయ కవిత్వానికి జన్మనిచ్చారు.

గ్రాంథిక, వ్యావహారిక భాషా వాదాలు
నన్నయకు పూర్వమునుండి గ్రాంథిక భాష మరియు వ్యావహారిక భాష స్వతంత్రముగా పరిణామము చెందుతూ వచ్చాయి. కానీ 20 వ శతాబ్దము తొలి నాళ్లలో వీటి మధ్య ఉన్న వ్యత్యాసాలు తీవ్ర వాదోపవాదాలకు దారితీసాయి. గ్రాంథికము ప్రమాణ భాష అని, స్థిరమైన భాష అని, దాన్ని మార్చగూడదని గ్రాంథిక భాషా వర్గము, ప్రజల భాషనే గ్రంథ రచనలో ఉపయోగించాలని వ్యావహారిక భాషా వర్గము వాదించడముతో తెలుగు పండితలోకము రెండుగా చీలినది.

మొట్టమొదటి నవలగా పరిగణించబడుతున్న కందుకూరి వీరేశలింగం రచన రాజశేఖరచరిత్రముతో తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ సంపూర్ణమయ్యింది. గ్రాంథిక భాష వాడకాన్ని తీవ్రంగా నిరసిస్తూ గిడుగు రామ్మూర్తి ప్రకటించిన ఆంధ్ర పండిత భిషక్కుల భాషాభేషజం ప్రభావంతో గురజాడ అప్పారావు (ముత్యాల సరాలు), కట్టమంచి రామలింగారెడ్డి (ఆంధ్ర విశ్వవిద్యాలయపు వ్యవస్థాపకుడు) (ముసలమ్మ మరణం), రాయప్రోలు సుబ్బారావు (తృణకంకణం) మొదలైన తెలుగుసాహిత్యపు నవయుగ వైతాళికులు వ్యావహారిక భాషను వాడడం వ్యావహారిక భాషా వాదా నికి దారితీసింది.

19 వ శతాబ్దం వరకూ తెలుగు రచనలు గ్రాంథిక భాషలోనే సాగినాయి, కానీ తరువాత వాడుక భాషలో రచనలకు ప్రాముఖ్యత పెరిగింది. ప్రస్తుతం రచనలు, పత్రికలు, రేడియో, దూరదర్శిని, సినిమాలు మొదలైనవన్నీ కూడా వాడుక భాషనే వాడుతున్నాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు