గాథాసప్తశతి - ఒక ఆనందహేల
*ఒకటి*
గాథాసప్తశతి ఏడువందల గాథల ప్రాకృత గాథారత్నకోశం.జర్మనీ సాహితీవేత్త ఆల్బ్రెక్ట్ వెబర్ ప్రకారం గాథాసప్తశతికి 6 పాఠాలున్నాయి.ప్రాచార్య శ్రీ హరివల్లభ భయాణీ పరిశీలనలో 7వ పాఠం కూడా ఉందని తేలింది. వందల యేండ్ల నుండి పరంపరంగా వ్రాకాండ్ర వలన లిపి పరిణామ కారణంగా పాఠాలు మారిపోయాయి.ఈ గాథలు మహరాష్ట్రిప్రాకృతంలో ఉన్నాయని పలువురి అభిప్రాయం.కాని ఇవి మహారాష్ట్రిప్రాకృతంలో వ్రాయబడలేదని కొందరి వాదన. ఏదేమైనా ఈ గాథలు ప్రాకృతంలోనే వ్రాయబడ్డాయని చాల మందిఒప్పుకుంటారు.
క్రీ.శ. 3-7 శతాబ్దాల మధ్యకాలంలో ఈ గాథలను సేకరించి హాలునిపేర వెలయించారని కొందరు అభిప్రాయ పడుతున్నారు.హాలుడు మహాదాత.ఎవరో రచించిన నాలుగు గాథలను నాలుగు కోట్ల బంగారు నాణాలకు కొని ఆ తర్వాత
ఏడు వందల గాథలను సంకలించి గాథాకోశం నిర్మింపజేసాడని
ఒక కథ ప్రచారంలో ఉంది.
ప్రాకృత భాషౌన్నత్యాన్ని వివరించే ఒక గాథ ఇలా చెబుతుంది. అమృతసన్నిభ ప్రాకృత మరయకుండ దాని జదివి యాకర్ణించలేనివారు
కుసుమసాయకతత్త్వము గోరనెంత్రు
చెప్పుకొనుటకు వారికి సిగ్గు లేదొ!
'అమృతోపమానమైన ప్రాకృతాన్ని తెలుసుకోలేనివారు,దాన్ని చదవటం,వినటం చేయలేనివారు కామశాస్త్ర తత్వాన్ని తెలుసుకోవాలనుకుంటారు.వారికి సిగ్గెందుకు లేదో!'
"Those who do not know how to read or hear nectar-like prakruth poetry,I know not why they do not feel ashamed to discuss the germ of love."
ప్రాకృత కావ్యం మధురతరము,సరసభరితము.కాని ప్రాకృత కావ్యాలు మూర్ఖులకు,స్త్రీలకు ఉపయోగపడతాయని, చదవడానికి వ్రాయడానికి ఉపయోగపడేదేదీ ఇందులో లేదనీ కొందరి శుష్కవాదన.ప్రాకృత కావ్య శ్రవణమూ, పఠనమూ
లేకుండా కామశాస్త్రతత్వజ్ఞానం నీరసంగా ఉంటుంది.
'పరుషా: సంస్కృత బంధా: ప్రాకృత బంధో౽పి భవతి సుకుమార:l
పురుష మహిలానాం యావదిహాస్తరం తావదేతేషామ్ll'
సంస్కృతకావ్యం పరుషంగా ఉంటుంది,ప్రాకృతకావ్యం
సుకుమారంగా ఉంటుంది అంటాడు రాజశేఖరుడు 'కర్పూరమంజరి'లో.
హాలుడు దక్షిణాపథంలో ప్రతిష్ఠానపురానికి(మహారాష్ట్ర లోని నేటి పైథాన్) రాజు.ఇతడు క్రీ.శ. 1వ శతాబ్దివాడు. గాథాసప్తశతి హాలుడే స్వయంగా రచించాడని పలువురు భ్రమపడుతుంటారు.ఈ కృతి ప్రతి శతకం చివర 'రసికజన హృదయ దయితే కవివత్సల ప్రముఖ సుకవి నిర్మితే'
అని స్పష్టంగా ఉంది.దొరికిన ఆధారాలను బట్టి హాలుడు 44 గాథలను మాత్రమే స్వయంగా రచించాడు.రెండువేల సంవత్సరాలకు ముందే ఆవిర్భవించిన గాథాసప్తశతి ప్రాశస్త్యం నేటికీ పచ్చిగా ఉన్నదంటే దీని ఘనత మనకు విదితమవు తున్నది.అంతేకాకుండా ఈ కావ్యం సర్వలక్షణ శోభితమై అలరారుతున్నది.గాథాసప్తశతిని అనుసరించే లక్షణగ్రంథాలన్నీ
పుట్టాయంటే ఈ కావ్య వైశిష్థ్యం తెలియవస్తున్నది.
గాథాసప్తశతి ఒక ముక్తక కావ్యం.గాథంటే ఉత్తమమై, ఉదాత్తమై రసానుకూలమైన ఒక సంఘటన అని అర్థం. అంతేకాకుండా 'అనుష్టుప్' మొదలైనవాని వలెనే ఒక విధమైన ఛందోబద్ధరచనకు(ఆర్యా పద్ధతిలో) గాథ అని పేరు.
ప్రథమ,తృతీయ పాదాల్లో పండ్రెండు మాత్రలు,ద్వితీయ పాదంలో పద్దెనిమిది మాత్రలు,చతుర్థ పాదంలో పదహైదు మాత్రలు ఉంటాయి.సప్తశతిలోని గాథలు రసనిష్యందాలకు మూలకందాలు,ధ్వనిచమత్కారాలకు,శ్లేష విశేషాలకు,ఉత్తమ
ప్రతిభకు నిధులు.అవి ప్రకృతిని ఎంతో మనోహరంగా, మధురంగా,ఉదాత్తంగా వర్ణించాయి.యువతీ యువకుల ప్రవృత్తులను,వారి విలాసచేష్టలను,సంఘ కట్టుబాట్లను, కుటుంబ విశేషాలను ఈ గాథలు ఉత్తమ అలంకారాలతో నిబంధించి ఆదర్శప్రాయాలు చేశాయి.ఇందు లోని జనపద వర్ణనలు అతిలోకంగా ఉంటాయి.సాహిత్య లక్షణ
గ్రంథావిర్భావానికి ఈ గాథలే మూలకందాలు.ధ్వన్యాలోకము, తదాలోకలోచనము,సరస్వతీకంఠాభరణము,కావ్యప్రకాశము మొదలైన అలంకార శాస్త్రాలకు తొలి భిక్ష. గాథాసప్తశతి శృంగారరసప్రధానమైన కృతి అంటారు. కానీ ఆ శృంగారం కల్పితం కాదు.ఈ గాథల్లో మెండుగా పినతల్లులు, మేనత్తల ప్రమేయం కనబడుతుంది.లోకానుభవం కలవారు కాబట్టి వారు తమ కూతురు,మేనకోడలు గృహకలహంతోగాని, ప్రణయభంగంతోగాని బాధపడినపుడు ఏమాత్రం ఓర్చుకోలేరు. ఆ నాయికలకుకూడ తమ ఆంతర్యాన్నితెలియజేయడానికి ఈ మాతులానికంటే మరొక ఆప్తులు, విశ్వాసపాత్రులు లేరు.ఈ విషయాన్ని ఈ గాథలు ఎన్నోసార్లు,ఎన్నోరీతుల్లో వర్ణించాయి.
గాథాసప్తశతిలో సముద్రాలు,పట్టణాలు,అశ్వాలు,అగ్ర వర్ణాలు,బ్రాహ్మణుల గురించిన ప్రస్తావన అంతగా కనిపించదు.
గ్రామీణ జీవితాలను,వారి వ్యవహారాలను,అద్భుతమైన ప్రకృతి
దృశ్యాలను సప్తశతి వర్ణించింది.ఆనాటి ఆచారాలు,ధర్మాలు, నోములు,వస్త్రధారణ,ఉత్సవ విశేషాలు మొదలైనవి ఈ గాథల్లో పొందుపరచబడ్డాయి.ఈ గాథల్లో గ్రామీణుల నిత్యజీవితం ప్రతిఫలించింది.పొలాల ప్రక్కన గుడిసెల్లో ఉండే బీదసాదల మనోహరమైన ప్రేమవ్యవహారాలు, గుట్టు దాచి నర్మగర్బంగా పలికే తీపి పలుకులు,చిరునవ్వుతో చేసే హాస్యాలు ఇందులో చిత్రించబడినాయి.గుడిసెలు,వాన నీళ్లు కారుతుండే ఇంటి పైకప్పులు,పిండి దంచే యువతులు పొలాల్లో కష్టించే రైతులు ఈ గాథల్లో ప్రముఖపాత్ర వహిస్తారు.
ఆకాలంలో అరణ్య ప్రాంతాలు మెండుగా ఉండేవి.అడవుల్లో కోయలు,భిల్లులు మొదలైనవారి వీరత్వం,జీవిత విశేషాలు, భిల్ల వనితల సౌందర్యాతిశయాలు,అరణ్యశోభ ఆ గాథల్లో ఎంతో మనోహరంగా వర్ణించబడినాయి.గోదావరి,నర్మద నదులు వర్ణించబడినాయి.ఈ గాథల్లో గోదావారీవర్ణనం అతిగా ఉండడం వలన ఈ గాథారచన గోదావరి ప్రాంతంలో-అంటే మధ్య దేశంలో-జరిగినట్లు ఊహించవచ్చు. -
ఈ గాథలు ఆమూలాగ్రం ధన్యర్థశోభితాలు కాబట్టి అవి
నిరూపించే ఉదాత్త విషయాలను గ్రహించాలంటే మంచి టీక అవసరం ఎంతైనా ఉంది.ప్రప్రథమంగా గాథాసప్తశతికి టీకను కులబాలదేవుడు/కులనాథదేవుడు సంతరించాడు.ఆ తర్వాత
గంగాధరభట్టు వ్రాసాడు.ఈ రెండింటిలో గంగాధరభట్టు టీకయే మెరుగ్గా ఉంటుంది.కానీ గంగాధరభట్టు టీక చాల సందర్భాల్లో
ధ్వన్యర్థవైభవాన్ని దిగమింగిందని జయపుర ఆస్థాన విద్వాంసుడు దేవర్షి మధురనాథశాస్త్రి మరొక మేలైన టీకను సంతరించాడు.
డా.కోడూరు ప్రభాకరరెడ్డి
(ఇంకావుంది)
*********
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి